
జెనీవా: వచ్చే అయిదేళ్ల పాటు ప్రపంచ దేశాల్లో ఎండలు దంచికొడతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఒ) హెచ్చరించింది. పరిమితికి మించి గ్రీన్హౌస్ వాయువులు విడుదల, ఎల్నినో ప్రభావంతో అయిదేళ్ల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
2015లో జరిగిన పారిస్ ఒప్పందంలో ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్కు మించకుండా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, దానిని అధిగమించేలా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. 2015–2022 వరకు వరసగా ఎనిమిదేళ్లు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, వచ్చే ఐదేళ్లలో మరింత పెరిగిపోతాయని తెలిపింది.
‘‘వచ్చే అయిదేళ్లలో ఏదో ఒక ఏడాది లేదంటే అయిదేళ్ల సగటు ఉష్ణోగ్రతలు పారిస్ ఒప్పందాన్ని అధిగమించేలా 1.5 డిగ్రీలు పెరిగిపోతాయి. అలా పెరగడానికి 98% అవకాశాలున్నాయి’’ అని డబ్ల్యూఎంఒ చీఫ్ పెటరి టాలస్ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ పారిస్ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో పాటు ఎల్నినో పరిస్థితులతో ఈ ప్రమాదం ముంచుకొస్తోందని తెలిపారు. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల ఆరోగ్యం, ఆహారం, నీటి పర్యవేక్షణ, పర్యావరణంపై ప్రభావం కనిపిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment