
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది జనవరి చివరి వారంలో జరగనున్నాయి. ఈ మేరకు పాక్ ఎలక్షన్ కమిషన్(ఈసీపీ) గురువారం ప్రకటించింది. నియోజకవర్గాల పునర్విజనపై ఈసీపీ ఇప్పటికే కసరత్తు చేసింది. ఈ నెల 27న మొదటి లిస్టును విడుదల చేయనుంది.
డీలిమిటేషన్ మొదటి లిస్టుపై అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత నవంబర్ 30న తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత దాదాపు 54 రోజులపాటు ఎన్నికల ప్రచారానికి సమయం కేటాయించారు. 2024 జనవరి చివరి వారంలో పోలీంగ్ జరగనున్నట్లు ఈసీపీ స్పష్టం చేసింది.
పాకిస్థాన్లో జాతీయ సభ ఆగష్టు 9న గడువుకు ముందే రద్దు చేయబడింది. డీలిమిటేషన్, జనగణన ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని షహబాజ్ నేతృత్వంలోని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. ప్రభుత్వం రద్దు అయిన 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ సమయం దాటిపోతున్నందున డీలిమిటేషన్ ప్రక్రియకు గడువు కుదించాలని రాజకీయ పార్టీలు ఈసీపీపై ఒత్తిడి పెంచాయి. కానీ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం నాలుగు నెలలు పడుతుంది.
ఇదీ చదవండి: ఐరాసలో కశ్మీర్ అంశంపై తుర్కియే వివాదాస్పద వ్యాఖ్యలు