డీఎస్సీ ఫలితాల వెల్లడి.. ఒక్కో పోస్టుకు ముగ్గురికి పిలుపు
డీఎస్సీ ఫలితాల వెల్లడి.. ఒక్కో పోస్టుకు ముగ్గురికి పిలుపు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,519 టీచర్ పోస్టులు
అత్యధికంగా మహబూబాబాద్లో 381
అత్యల్పంగా హనుమకొండ జిల్లాలో 187
నేటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలుపు మొత్తం పోస్టులు
కఠోర తపస్సు.. పట్టు సడలని ఏకాగ్రత.. నిద్రలేని రాత్రులు.. పొద్దు తెలియని రోజులు.. ఎన్నో కష్టనష్టాలు.. మరెన్నో ఇబ్బందులు అన్నింటినీ దాటుకొని చివరి మెట్టుకు చేరుకున్నారు డీఎస్సీ అభ్యర్థులు. సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాలతో ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నేడు(మంగళవారం) నిర్వహించనున్న సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు ఒక్కో పోస్టుకు ముగ్గురిని పిలిచారు. ఆ ముగ్గురిలో నెగ్గేదెవరో.. కొలువు కొట్టేదెవరో వేచి చూడాల్సిందే..
విద్యారణ్యపురి : సుదీర్ఘకాలంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థుల కల సాకా రం కానుంది. సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా అభ్యర్థులు ఆనందంలో మునిగిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 11,062 పోస్టుల భర్తీకి ఈఏడాది మార్చి ఒకటిన డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,519 టీచర్ పోస్టులకు వేలాది మంది పోటీపడ్డారు. ఈనెల 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియమాక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం. డీఎస్సీ మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం ఎంపిక జాబి తాలను మంగళవారం రాత్రి డీఈఓలకు విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి పంపనున్నారు. ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలుస్తున్నారు.
నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని డీఈఓలు నేటి నుంచి 5వ తేదీ వరకు డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. హనుమకొండ జిల్లాలోని అభ్యర్థులకు డీఈఓ కార్యాలయం పక్కన సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నారు. ఆయా జిల్లాల్లోని మెరిట్ జాబితాను సంబంధిత డీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను గెజిటెడ్ సైన్ చేయించుకుని, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు రెండు తీసుకుని రావాల్సి ఉంటుంది. కాగా.. ఎంపికై న అభ్యర్థి సుముఖత లేకపోతే వేరే అభ్యర్థిని ఎంపిక చేసే వీలుంటుందని ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థులను పిలుస్తున్నారు.
వరంగల్ 301 903
జనగామ 221 663
హనుమకొండ 187 561
భూపాలపల్లి 237 711
మహబూబాబాద్ 381 1,143
ములుగు 192 576
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎస్ఏ 41, ఎల్పీ 20, పీఈటీ 7, ఎస్జీటీ 152, ఎస్ఏ స్పెషల్ 4, ఎస్జీటీ స్పెషల్ 13, మొత్తం 237 పోస్టుల్లో ఎంపిక చేస్తారు.
జనగామ జిల్లాలో ఎస్ఏ 50, ఎల్పీ 21, పీఈటీ 7, ఎస్జీటీ 118, ఎస్ఏ స్పెషల్ 5, ఎస్జీటీ స్పెషల్ 20 మొత్తం 221 పోస్టుల్లో ఎంపిక చేస్తారు.
హనుమకొండ జిల్లాలో ఎస్ఏ 73, ఎల్పీ 5, పీఈటీ 7, ఎస్జీటీలు 81, ఎస్ఏ స్పెషల్ 4, ఎస్జీటీ స్పెషల్ 17, మొత్తం 187 పోస్టులకు ఎంపిక చేస్తారు.
మహబూబాబాద్ జిల్లాలో ఎస్ఏ 71, ఎల్పీ 19, పీఈటీ 2, ఎస్జీటీ 264, ఎస్ఏ స్పెషల్ 5, ఎస్జీటీ స్పెషల్ 20 మొత్తం 381 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ములుగు జిల్లాలో ఎస్ఏ 33, ఎల్పీ 16, పీఈటీ 1, ఎస్జీటీ 125, ఎస్ఏ స్పెషల్ 3, ఎస్జీటీ స్పెషల్ 14 మొత్తం 192 పోస్టుల్లో ఎంపిక చేస్తారు.
వరంగల్ జిల్లాలో ఎస్ఏ 66, ఎల్సీ 21, పీఈటీ 6, ఎస్జీటీ 182, ఎస్ఏ స్పెషల్ 5, ఎస్జీటీ స్పెషల్ 21 మొత్తం 301 పోస్టుల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.


