ముడుపులు చెల్లిస్తేనే..!
భూపాలపల్లి అర్బన్: జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఓ అధికారి ఉద్యోగుల నుంచి ప్రతి నెల అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు జిల్లావ్యాప్తంగా బహిరంగంగానే చర్చ జరుగుతోంది. కార్యాలయంలో పైసలు తడపనిదే ఫైళ్లు కదలడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. నమ్మకం ఉన్న ఉద్యోగుల నుంచి తానే డబ్బులు తీసుకోవడంతో పాటు కొంతమంది నుంచి తనకు దగ్గరి మిత్రులకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్, నగదు చెల్లింపులు జరిగేలా చూసుకుంటున్నాడు.
కొర్రీలతో ఇబ్బందులు..
జిల్లా సమగ్ర శిక్ష అభియాన్లో కేజీబీవీ బిల్లులు, సమగ్ర శిక్ష ఉద్యోగుల వేతనాలు, పాఠశాల అభివృద్ధి పనుల బిల్లులు, ఇతర అలవెన్స్లకు సంబంధించిన ఫైలు మొత్తం సంబంధిత అధికారి వద్దకు వెళ్తున్నాయి. సంబంధిత అధికారి ఆమోదం పొందిన తరువాత డబ్బుల మంజూరు నిమిత్తం రాష్ట్ర ఫైనాన్స్ అధికారి వద్దకు వెళ్తుంది. అక్కడి నుంచి బిల్లు పాసవుతుంది. అన్ని రకాల బిల్లులు, ఇతర పత్రాలు జతపరిచినప్పటికీ ఇంకా కొన్ని తక్కువగా ఉన్నాయని ఇబ్బందులు పెడుతున్నట్లు సమాచారం. జిల్లాలో ముడుపులు చెల్లించని ఫైళ్లను రాష్ట్ర ఫైనాన్స్ అధికారి కార్యాలయంలో మాట్లాడి బిల్లులు ఆపిస్తున్నట్లు సమాచారం. కొంతమందికి రావాల్సిన అలవెన్స్లను మూడు నాలుగు నెలలు పెండింగ్లో పెట్టినట్లు తెలిసింది.
సాయంత్రం 5 తర్వాతే పనులు
జిల్లాకు ఇన్చార్జ్ అఽధికారిగా పనిచేస్తున్న సదరు అధికారి వరంగల్లో భూపాలపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా కార్యాలయానికి వారానికి రెండు రోజులు మాత్రమే హాజరవుతున్నారు. జిల్లాలో కేజీబీవీల నుంచి ఎస్ఓ, అకౌంటెంట్లో ఇతర అధికారులు సంబంధిత బిల్లులు అందించేందుకు డీఈఓ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. సదరు అధికారి వచ్చిన రోజు మాత్రమే బిల్లులు తీసుకురావాల్సి ఉంటుంది. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, ఇతర అధికారులు ఇంటికి వెళ్లిన తరువాతే తన పనులను ప్రారంభిస్తాడు. సాయంత్రం 4, 5 గంటల తరువాత కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. రాత్రి 8 నుంచి 9గంటల వరకు ఉద్యోగినులు సైతం పనుల కోసం వేచిఉంటున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు.
ఏసీబీ అధికారుల నిఘా..
సంబంధిత అధికారి మామూళ్ల వేధింపులను తట్టుకోలేక పలువురు బాధితులు నెల రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డీఈఓ కార్యాలయంలో అధికారులపై ఏసీబీ నిఘా పెట్టినట్లు తెలిసింది. ముందస్తు సమాచారం తెలుసుకున్న అధికారి తృటిలో తప్పించుకున్నట్లు బాధితులు తెలిపారు.
లంచం ఇవ్వొద్దు..
డీఈఓ కార్యాలయంలో బిల్లులు, ఇతర పనుల నిమి త్తం ఎవరికి కూడా లంచం ఇవ్వొద్దు. ఎవరైనా డబ్బులు అడిగితే సమాచారం ఇవ్వా లి. కార్యాలయ అధికారులు, సిబ్బందిని ఇప్పటికే పలుమారు ఆదేశించాం. సరైన పత్రాలు అందించి అధికారులకు సహకరించాలి. మామూళ్లు వసూలు చేస్తే సహించేంది లేదు.
– రాజేందర్, ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి
డీఈఓ కార్యాలయంలో ఓ అధికారి వసూళ్ల పర్వం
కేజీబీవీల నుంచి నెలవారీ మామూళ్లు..
ఇబ్బంది పడుతున్న ఉద్యోగులు
బిల్లులను బట్టి పర్సంటేజీ..
ఉద్యోగుల బిల్లుల చెల్లింపు కోసం సంబంధిత అధికారికి ప్రతి నెలా మామూళ్లు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులను బట్టి పర్సంటేజీలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో పాఠశాలల అభివృద్ధి సివిల్ పనులకు సంబంఽధించిన బిల్లుల చెల్లింపులకు ఇటీవల డబ్బులు డిమాండ్ చేయడంతో పలువురు కాంట్రాక్టర్లు, నాయకులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ముడుపులు చెల్లిస్తేనే..!
Comments
Please login to add a commentAdd a comment