
షెడ్యూల్లో చేరిస్తేనే రిజర్వేషన్లు సాధ్యం
మొగుళ్లపల్లి: తమిళనాడు తరహాలో తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేరిస్తేనే సాధ్యమవుతుందని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు జీఓల ద్వారా నిలువవన్నారు. 1962 నుంచి ఇప్పటివరకు రిజర్వేషన్ల పెంపుపై ఎన్ని జీఓలు, చట్టాలు వచ్చినా అమలు కాలేదన్నారు.
బదిలీలు నిలిపేయాలని
మంత్రికి వినతి
కాటారం: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలు కొనసాగుతున్న నేపథ్యంలో కాటారం సబ్ డివిజన్లో బదిలీల ప్రక్రియ నిలిపేయాలని కోరుతూ ఆదివారం మంత్రి శ్రీధర్బాబుకు పంచాయతీ కార్యదర్శులు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాటారం సబ్డివిజన్ పరిధిలో కొనసాగుతున్న పంచాయతీ కార్యదర్శులు అధిక సంఖ్యలో మంథని నియోజకవర్గానికి చెందిన వారే ఉన్నారని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు సొంత డబ్బు పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేశారన్నారు. రెండేళ్లుగా నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కొరత ఉందని వారు మంత్రికి విన్నవించారు. బదిలీల కారణంగా కార్యదర్శులకు అందాల్సిన బకాయిలపై పలు అంశాలు ప్రభావితం చేస్తాయని తమ సమస్యలను అర్థం చేసుకొని బదిలీలు నిలిపివేయాలని మంత్రిని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సబ్ డివిజన్ పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
బీజేపీ ఆవిర్భావ వేడుకలు
భూపాలపల్లి రూరల్: పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మోదీ విజన్తో రానున్న రోజుల్లో రాష్ట్రంలో అధికారంలోకి రానున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా నాయకులు బట్టు రవి, పార్లమెంట్ కో– కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు, నాయకులు దొంగల రాజేందర్, దాసరి తిరుపతిరెడ్డి, పెండ్యాల రాజు, వేణు, రఘునాథరెడ్డి, మునీందర్, కుమార్, విప్లవ రెడ్డి, దేవేందర్ పాల్గొన్నారు.
రూ.లక్ష విరాళం
చిట్యాల: మండలంలోని నవాబుపేట గ్రామంలో నిర్మిస్తున్న శివాలయానికి అదే గ్రామానికి చెందిన కాల్వ రఘోత్తంరెడ్డి కుమారుడు కాల్వ రాంరెడ్డి రూ.లక్ష వెయ్యి నూట పదహారు ఆలయ కమిటీ అధ్యక్షుడు కసిరెడ్డి రత్నాకర్రెడ్డికి అదివారం అందజేశారు. ఈ సందర్భంగా రత్నాకర్రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మందల రాఘవారెడ్డి, మోతుకూరి నరేష్, చెక్క నర్సయ్య, బిళ్ల సత్యనారాయణరెడ్డి, బొమ్మ శంకర్, కొక్కుల సారంగం, కాల్వ సమ్మిరెడ్డి, సర్వ శరత్, తీగల నాగరాజు, ప్రధాన అర్చకులు రఘునందన్ పాల్గొన్నారు.
లీకేజీలను గుర్తించిన
ఇంజనీర్లు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్లోని రిజర్వాయర్ సమీపాన ఇటీవల జరిగిన టన్నెల్ లీకేజీలను ఎట్టకేలకు ఇంజనీర్లు గుర్తించారు. దేవాదుల పథకంలో భాగంగా 3వ ప్యాకేజీ కింద దేవన్నపేట పంపుహౌస్ నుంచి రిజర్వాయర్ సమీపం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి సుమారు 200 మీటర్లు రిజర్వాయర్ వరకు టన్నెల్ నిర్మించారు. ఈ క్రమంలో గత నెల 27న రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేయగా వారం రోజుల క్రితం టన్నెల్ లీకేజీ అయింది. దీనితో పంపులు ఆపివేసి టన్నెల్ నుంచి నీటిని డీ వాటరింగ్ చేశారు. ఈ క్రమంలో ఆదివారం పైపు నుంచి టన్నెల్లోకి దిగిన మెగా ఇంజనీర్లు, సిబ్బంది లీకేజీలను కనుక్కుని మరమ్మతులు ఎలా చేయాలో పరిశీలించారు.

షెడ్యూల్లో చేరిస్తేనే రిజర్వేషన్లు సాధ్యం