
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
భూపాలపల్లి రూరల్: యాసంగి ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు రాకుండా కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాలులో రెవెన్యూ, పౌర సరఫరాలు, పౌర సరఫరాల సంస్థ, సహకార, వ్యవసాయ, డీఆర్డీఏ, తూనికలు కొలతలు, కార్మిక శాఖల అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఏసీఎస్, ఐకేపీకి కేటాయించిన అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించాలని సూచించారు. ఏ గ్రేడ్ రకం క్వింటాల్కు రూ.2,320, బీ గ్రేడ్ రకానికి రూ.2,300 మద్దతు ధర ప్రకటించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 50శాతం కొనుగోలు కేంద్రాలు మహిళా సమాఖ్యలకు కేటాయించాలన్నారు. ఎంపిక చేసిన గ్రామ సమాఖ్యలకు ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పనకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం విక్రయాల్లో పాటించాల్సిన నియమ, నిబంధనల బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతులకు నగదు చెల్లింపు కోసం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు ట్యాబ్లలో నమోదు చేయాలని కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో నీడ కోసం షామియానా, తాగునీరు, ప్యాడీక్లీనర్, మాయిశ్చర్స్, తూకపు యంత్రాలు, టార్పాలిన్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారిని ఆదేశించారు. సన్నరకం, దొడ్డు రకం విడివిడిగా కొనుగోలు చేయాలని, గుర్తించడానికి వీలుగా మార్కింగ్ చేయాలని సూచించారు. సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లింపు ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాములు, డీఆర్డీఓ నరేష్, వ్యవసాయ అధికారి వీరునాయక్, జిల్లా సహకార అధికారి వాలియా నాయక్, మార్కెటింగ్ ఏడీ కనకశేఖర్, తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీలత, సహాయ కార్మిక శాఖ అధికారి వినోద పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ