
తీగలాగితే కదిలిన డొంక
మత్తు దందాపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నా అక్రమార్కులు ఆగడం లేదు. గతంలో క్లోరోహైడ్రేట్ అక్రమ వ్యాపారం నిర్వహించగా.. ఇప్పుడు అల్ప్రాజోలంతో దందా నడిపిస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆరాటంతో కొందరు కేసులకూ భయపడడం లేదు. దీంతో జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట పడడం లేదు.
● గతంలో క్లోరోహైడ్రేట్..
ఇప్పుడు
అల్ప్రాజోలం
● కేసులకూ జడవని అక్రమార్కులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతంలో కల్లు తయారీలో క్లోరోహైడ్రేట్ వినియోగించేవారు. దీనిని ఇతర రాష్ట్రాలనుంచి తీసుకుని వచ్చేవారు. అయితే ఎక్కవ మొత్తంలో క్లోరోహైడ్రేట్ కలపాల్సి వచ్చేది. దీంతో క్వింటాళ్ల కొద్దీ ఈ మత్తు పదార్థం అవసరం అయ్యేది. దానిని రవాణా చేయడం రిస్క్తో కూడుకున్న పని. రవాణా కోసం ప్రత్యేక వాహనాలను వాడేవారు. పోలీసుల తనిఖీలనుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు తీసుకునేవారు. మరోవైపు కల్తీ కల్లు తయారీలో అల్ప్రాజోలం కూడా వినియోగిస్తారు. క్లోరోహైడ్రేట్తో పోల్చితే ఇది చాలా తక్కువ పరిమాణంలో అవసరం ఉంటుంది. దీనిని రవాణా చేయడం కూడా సులువే.. ఈ నేపథ్యంలో వ్యాపారులు, కల్తీ కల్లు తయారీదారులు క్లోరోహైడ్రేట్ను కాకుండా అల్ప్రాజోలం వినియోగానికే మొగ్గుచూపుతున్నారు.
సులువుగా డబ్బులు
సంపాదించడమే లక్ష్యంగా..
మత్తు దందాలో చిక్కితే జైలుపాలవుతామని తెలిసినప్పటికీ, సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతో కొందరు అల్ప్రాజోలం దందాలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కొందరు మత్తు పదార్థాల దందాలో పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు కూడబెట్టుకున్నారు. వాళ్లను చూసి మరికొందరు ఈ దందాలోకి దిగారు. దొరకనంత వరకు డబ్బులు సంపాదించవచ్చని, ఒకవేళ దొరికినా నాలుగు రోజులు జైల్లో ఉండి వస్తామన్న ధోరణితో ఈ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది.
కఠిన చర్యలు తప్పవు
నిషేధిత మత్తు పదార్థాలు క లిగి ఉన్నా, సరఫరా చేసినా, అమ్మినా, తయారు చేసినా చట్టప్రకారం శిక్షార్హులవుతా రు. అలాంటివారిపై కఠిన చర్యలుంటాయి. మత్తు దందాతో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే జైలుపాలుకాక తప్పదు. ఎంతటివారైనా ఉపేక్షించేది లే దు. యువత మాదకద్రవ్యాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలి. – రాజేశ్ చంద్ర, ఎస్పీ
పోలీసులకు చిక్కుతున్నా..
జిల్లాలో మత్తు దందాపై ఐదారు నెలల కాలంలో పోలీసులు, ఎకై ్సజ్ శాఖలు నిర్వహించిన దాడుల్లో పదిమందికిపైగా చిక్కారు. వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఈ యాక్ట్ కింద కేసులు పెడితే శిక్షలు కఠినంగా ఉంటాయి. కనీసం రెండుమూడు నెలల వరకు బెయిల్ కూడా దొరకదు. నేరం నిరూపితమైతే కనీసం ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ సులువుగా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడినవారిలో మార్పు రావడం లేదు. పైపెచ్చు ఈ మత్తు దందా చేసేవారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో ఇటీవల అక్రమ ఫైనాన్స్ దందాపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మద్నూర్ మండల కేంద్రంలో అప్పులు ఇచ్చే ఓ వ్యక్తి ఇంటికి పోలీసులు వెళ్లినపుడు.. సదరు వ్యాపారి పోలీసుల రాకను గమనించి అల్ప్రాజోలంను దాచిపెట్టడానికి యత్నించాడు. దీనిని గమనించిన పోలీసులు.. అతడిని పట్టుకుని విచారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తీగలాగితే డొంక కదిలినట్టుగా హైదరాబాద్లో అమ్మిన వ్యక్తితో పాటు, తయారు చేయిస్తున్న వ్యక్తీ పోలీసులకు చిక్కాడు. మద్నూర్కు చెందిన మరో వ్యక్తికి సైతం అల్ప్రాజోలం సరఫరా చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో నలుగురిపై కేసు నమోదైంది. ముగ్గురు వ్యక్తులను పోలీసులు రిమాండ్కు పంపారు. మద్నూర్కు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.

తీగలాగితే కదిలిన డొంక