
ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడింగ్
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏవోసీ కార్ప్స్ డేను పురస్కరించుకుని సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఎక్స్పెడిషన్– 2025 యాత్ర చేపట్టారు. ఢిల్లీ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, సాగర్, జబల్పూర్, పుల్గాం మీదుగా సోమవారం సాయంత్రం నిజామాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్మీ కంటోన్మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అమత్ నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడింగ్ విన్యాసాలు అలరించాయి. ఎన్సీసీ కెడెట్లు, యువతీయువకులకు పారా గ్లైడింగ్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి, పోలీసు, ఎన్సీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడింగ్