
మన పనుల్లో ఉత్తరాది కార్మికులు
ఉమ్మడి జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు గణనీయంగా పెరిగారు. ప్రతి రంగంలో వారి ఉనికి కనిపిస్తోంది. సుమారు ఐదువేల మంది వరకు కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు అంచనా. హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం, ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా బిహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వారు పని చేస్తున్నారు. బొటిక్స్, డిజైనింగ్ వంటి మహిళల వస్త్రాల పనులు పశ్చిమబెంగాల్ కార్మికులే చేస్తున్నారు. బంగారం పనులను బెంగాలీలే చేస్తున్నారు.
అన్ని రంగాల్లో వారి ఉనికి
● నగరం నుంచి గ్రామం వరకు
విస్తరించిన వలస కార్మికులు
● సుమారు ఐదు వేల మంది ఉన్నట్లు అంచనా
● హోటళ్లు, నిర్మాణ రంగం, వ్యవసాయం,
అనుబంధ రంగాల్లో వారే..
● బంగారం పని, మహిళల వస్త్రాల
డిజైనింగ్ పనుల్లోనూ వారి మార్క్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికు లు రోజురోజుకూ పెరుగుతున్నారు. దీంతో ప్రతి రంగంలోనూ ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహా ర్, ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు, పనివాళ్లే కనిపిస్తున్నారు. గతంలో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ముంబయి, సూరత్, గల్ఫ్ దేశాలకు పనుల కోసం ఎక్కువగా వలసలు వెళ్లేవారు. ఇప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళుతున్నప్పటికీ గతంతో పోలిస్తే సంఖ్య తగ్గింది. వివిధ రంగాల అభివృద్ధితో జిల్లాలోనూ ఉపాధి అవకాశాలు పెరిగాయి. స్థానికంగానూ ఎకానమీ పెరిగింది. అయితే స్థానికుల కంటే ఉత్తరాది రాష్ట్రాల వారినే పనిలో పెట్టుకునేందుకు జిల్లాలోని రైతులు, వ్యాపారులు మొగ్గు చూపుతున్నారు. నిర్దేశించుకున్న సమయానికి, తక్కువ వేతనాలతోనే ఉత్తరాది రాష్ట్రాల కార్మికులు పనులు చేస్తున్నారని, పైగా నైపుణ్యం ఎక్కువగా చూపిస్తున్నారని పలువురు చెబుతున్నారు.
ఉత్తర భారతం నుంచి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు వివిధ పనుల నిమిత్తం సుమారు ఐదువేల మంది వరకు కార్మికులు వచ్చినట్లు అంచనా. ముఖ్యంగా హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది కార్మికులు ఉన్నారు. ఇటుక బట్టీలు మొదలు నిర్మాణరంగంలో బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 1,500 మంది కార్మికులు ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా పని చేస్తున్నారు. సెలూన్స్లో ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వాళ్లు పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగంలో బిహార్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల కార్మికులు సుమారు 1,000 మంది వరకు పనిచేస్తున్నారు. వరినాట్ల సీజన్లో బిహార్ కూలీలు పనిచేస్తున్నారు. డెయిరీ పనితోపాటు చేపలు పట్టే పనులు సైతం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో హమాలీలుగా చేస్తున్నారు. ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బేకరీలు, స్వీట్హోంలలో ఒడిశా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ వాళ్లు పనిచేస్తున్నారు. బొటిక్స్, డిజైనింగ్ వంటి మహిళల వస్త్రాల పనులు పశ్చిమబెంగాల్ కార్మికులే చేస్తున్నారు. బంగారం పనులను బెంగాల్ వాళ్లే చేస్తున్నారు. వీరు 1,000 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. బిహార్కు చెందిన కూలీలు ఇటుకబట్టీలో సుమారు 500 మంది వరకు పనిచేస్తున్నారు. బోర్ డ్రిల్లింగ్, పొక్లెయిన్ ఆపరేటింగ్ పనుల్లో ఉత్తరప్రదేశ్, బిహార్కు చెందిన వాళ్లు పనిచేస్తున్నారు. ఇందులో కొందరు సీజన్ను బట్టి పనుల కోసం వచ్చి వెళుతుండగా, ఎక్కువమంది పనిచేసుకుంటూ కూలీలుగా జీవిస్తూ ఇక్కడే స్థిరపడినవారు సు మారు 3వేల మంది వరకు ఉండడం గమనార్హం. రాజస్తాన్కు చెందిన కొందరు నిజామాబాద్తో పాటు వివిధ మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీ గ్రామాల్లో స్వీట్హోమ్లు నిర్వహిస్తూ స్థిరపడ్డారు. కొన్ని ప్రైవేట్ పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాల్లో సెక్యూరిటీ గార్డులుగా బిహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారు పనిచేస్తున్నారు. పెద్ద హోటళ్లలో వర్కర్లుగా అస్సాంకు చెందిన యువకులు పనిచేస్తున్నారు.

మన పనుల్లో ఉత్తరాది కార్మికులు

మన పనుల్లో ఉత్తరాది కార్మికులు

మన పనుల్లో ఉత్తరాది కార్మికులు