సిటీకి ఓఆర్ఆర్
● సిద్ధమైన సుడా మాస్టర్ ప్లాన్ ● సరిహద్దులు నిర్ధారిస్తూ ఉత్తర్వులు ● 20 గ్రామాలను కలుపుతూ రింగురోడ్డు ● పారిశ్రామిక, వాణిజ్య కారిడార్ల ఏర్పాటు ● 90 రోజుల్లో అభ్యంతరాలు తెలపాలంటూ నోటిఫికేషన్
సాక్షి ప్రతినిధి,కరీంనగర్:
కరీం‘నగరం’ రూపురేఖలు మారనున్నాయి. ఐటీలో టైర్ టు సిటీగా.. స్మార్ట్సిటీలో రాష్ట్రంలో రెండో ముఖ్యనగరంగా పలు అవార్డులు సాధించిన కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ రూపంలో సరికొత్తగా రూపుదిద్దుకోనుంది. నగరంతోపాటు పరిసరాల్లో ఉన్న 62 గ్రామాల పరిధిలో ఒక ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేసేందుకు శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(సుడా) రూపొందించిన మాస్టర్ ప్లాన్–2041ను అధికారులు సిద్ధం చేశారు. అమృత్ స్కీమ్ గైడ్లైన్స్, అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్(యూడీపీఎఫ్ఐ) మార్గదర్శకాలను అనుసరించి ఈ మాస్టర్ ప్లాన్ను అభివృద్ధి చేశారు. ఇందుకు ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ కూడా మొదలుపెట్టారు. మాస్టర్ప్లాన్పై ఏవైనా అభ్యంతరాలుంటే 90 రోజుల్లో తెలియజేయవచ్చని ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో సుడా చైర్మ న్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి వెల్లడించారు. దీనిపై స్థానికంగా పలువురు తమ అభ్యంతరాలు, సలహా లు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.
సుడా మాస్టర్ప్లాన్ ఇదే..
ప్రస్తుతం అమలులో ఉన్న సుడా మాస్టర్ ప్లాన్–2019ను అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ప్రస్తుత మాస్టర్ ప్లాన్ ప్రకారం కొత్త సరిహద్దులు నిర్ణయించారు. దీని ప్రకారం సుడా పరిధి తూర్పున తాహెర్ కొండాపూర్, ఈశాన్య మూల నుంచి మొదలై చెర్లభూత్కూర్, ముగ్దుంపూర్, చేగుర్తి, లింగాపూర్, అన్నారం, ఈదులగట్టెపల్లి గ్రామ సరిహద్దుల వెంబడి చెంజర్ల సరిహద్దు వరకు ఉంటుంది. పడమర వైపు గునుకుల కొండాపూర్ సరిహద్దు నైరుతి మూల నుంచి మొదలై ఉత్తరం దిక్కువెళ్తూ జంగపల్లి, మాదాపూర్, కాశీంపేట, పారువెల్ల, కాజీపూర్, ఒద్యారం, నాగుల మాల్యాల, వెలిచాల, వెదిర, కిష్టాపూర్ సరిహద్దు వెంబడి వాయువ్య మూల వరకు మాస్టర్ బౌండరీగా నిర్ధారించారు. దక్షిణాన చెంజర్ల సరిహద్దు ఆగ్నేయ మూల నుంచి మొదలై పడమర వైపునకు వెళ్తూ మన్నెంపల్లి, నుస్తులాపూర్, కొత్తపల్లి (పీఎన్), రేణికుంట, గునుకుల కొండాపూర్, సరిహద్దు నైరుతి మూల వరకు హద్దులుగా నిర్ణయించారు. ఉత్తరాన కిష్టాపూర్ సరిహద్దు, దేశారాజ్పల్లి, కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట చాకుంట, చామనపల్లి తాహేర్కొండాపూర్ ఈశాన్యం మూల వరకు సరిహద్దుగా ఉంది.
వాణిజ్యం, మిశ్రమ, పరిశ్రమల జోన్లు
కరీంనగర్లోని ప్రధాన రహదారుల వెంబడి ఉన్న ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకే వినియోగిస్తున్నప్పటికీ అవి రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉన్నాయి. అందుకే నగరంలోని ప్రధాన రహదారులను వాణిజ్య జోన్ల పరిధిలోకి తీసుకొచ్చారు. నివాసప్రాంతాలు, వాణిజ్య కేంద్రాలు కలిసి ఉన్న ఏరియాలను మిశ్రమజోన్లుగా ప్రతిపాదించారు. కరీంనగర్ భవిష్యత్ ఆర్థిక అభివృద్ధి కోసం స్పెషల్ ఇండస్ట్రీయల్ జోన్లను మాస్టర్ ప్లాన్ లో ప్రతిపాదించారు. 2,289 హెక్టార్లలో ఇండస్ట్రీయల్ జోన్గా నిర్ధారించారు. ఈ జోన్ పరిధిలోకి ఆసిఫ్నగర్, ఒద్యారం, నాగులమల్యాల(కొంతభాగం), చెంజర్ల(కొంత భాగం), ఎలగందల్(కొంత భాగం), బద్దిపల్లి(కొంత భాగం) రానున్నాయి.
20 ఊళ్లను కలుపుతూ రింగ్
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, వరంగల్ తరహాలో కరీంనగర్కు రింగు రోడ్డును ప్రతిపాదించారు. ఇది సుమారు 20 గ్రామాల సరిహద్దుల మీదుగా పోనుంది. 200 ఫీట్ల వెడల్పుతో 138 కిలో మీటర్ల పొడవైన ఔటర్ రింగ్ను నిర్మిస్తారు. కరీంనగర్–హైదరాబాద్ రాజీవ్ రహదారిని కలుపుతూ ఓఆర్ఆర్లోని ఒక భాగం గనుకుల కొండాపూర్, జంగపల్లి, మాదాపూర్, ఖాసింపేట, పారువెల్ల, ఒద్యారం, నాగుల మల్యాల, కొక్కెరకుంట, వెలిచాల శివారు మీదుగా వెళ్లి కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిని కలుస్తుంది. కొత్తపల్లి పట్టణం దాటిన తర్వాత కరీంనగర్–జగిత్యాల రహదారి నుంచి కొక్కెరకుంట, జూబ్లీనగర్, ఎలబోతారం, ఇరుకుల్ల, దుర్శేడు, బొమ్మకల్ గ్రామ శివారు నుంచి మానేరు నది మీదుగా మానకొండూరు, ముంజంపల్లి, పోరండ్ల, ను స్తులాపూర్ వద్ద రాజీవ్ రహదారితో కలుస్తుంది. హైదరాబాద్ను కలిపే కొత్తపల్లి– మనో హరాబాద్ రైల్వేలైన్ పూర్తయితే నగరం కనెక్టివిటీ మరింత విస్తారంగా మారుతుంది.
సమగ్రాభివృద్ధి కోసమే
కరీంనగర్కు సుమారు 30ఏళ్ల క్రితం నాటి మాస్టర్ ప్లాన్ అమలవుతోంది. నగరం చాలా విస్తరించింది. ఇంకా చాలా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉంది. పాత సుడా పరిధి యూనిట్గా కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. దీంతో ఒక ప్రణాళిక బద్ధమైన అభివృద్ధి జరుగుతుంది. ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ జోన్, రెసిడెన్షియల్ జోన్, సెమీ కమర్షియల్, సెమీ రెసిన్షియల్గా గుర్తించి వాటిని మాస్టర్ ప్లాన్లో పొందుపరిచాం. సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించాం.
– కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, సుడా చైర్మన్
సిటీకి ఓఆర్ఆర్
సిటీకి ఓఆర్ఆర్
సిటీకి ఓఆర్ఆర్


