ప్రభుత్వ ఆస్పత్రి కార్మికుల మెరుపు సమ్మె
కరీంనగర్టౌన్: మూడు నెలల పెండింగ్ వేతనాల కోసం ప్రభుత్వ ప్రధానాసుపత్రి కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం మెరుపు సమ్మెకు దిగారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి స్పందించి ఈనెల 8వ తేదీ లోపు వేతనాలు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్ మాట్లాడుతూ హామీ ప్రకారం మూడు నెలల జీతాలు ఇవ్వకుంటే ఈ నెల 9వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు. యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.అరుణ్, టి.కళావతి, ఉపాధ్యక్షురాలు శారద, రాజు, మహేశ్, మౌనిక, రాజయ్య పాల్గొన్నారు.
సాధారణ కాన్పులను ప్రోత్సహించాలి
కరీంనగర్టౌన్: ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు మొదటి కాన్పుకు వచ్చే గర్భిణులను సాధారణ కాన్పులకు ప్రోత్సహించాలని డీఎంహెచ్వో వెంకటరమణ సూచించారు. శుక్రవారం ఆశా వర్కర్లతో సాధారణ కాన్పులపై సమీక్ష నిర్వహించారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ సిజేరియన్ డెలివరీల పర్సంటేజీ తగ్గించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్ డెలివరీలు పెంచాలన్నారు. గర్భిణిగా ఉన్న సమయంలో వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే, పూర్తిగా చికిత్స అందించాలన్నారు. అనంతరం అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ సుధ, పీవోడీటీటీ డాక్టర్ ఉమాశ్రీ, డీఐవో డాక్టర్ సాజిదా, డెమో రాజగోపాల్, డీపీహెచ్ఎన్వో విమల, డీసీఎం రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
రేషన్ దుకాణాలకు
చేరిన సన్నబియ్యం
కరీంనగర్ అర్బన్: సన్నబియ్యం రేషన్ దుకాణాలకు చేరింది. అరకొర బియ్యం సరఫరా చేయడం, మూవ్మెంట్ ఆలస్యంపై శుక్రవారం సాక్షి మినీలో ‘సన్నబియ్యం.. నో స్టాక్’ శీర్షికన కథనం ప్రచురితం కాగా అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ ప్రత్యేక దృష్టిసారించారు. రేషన్ దుకాణాలకు చేరిన బియ్యమెంత, ఎంఎల్ఎస్ పాయింట్లలో ఉన్న బియ్యమెంత అని ఆరా తీసినట్లు సమాచారం. విధులను విస్మరిస్తే చర్యలు తప్పవని, ఎప్పటికప్పుడు రేషన్ బియ్యం డీలర్లకు చేరేలా చర్యలుండాలని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జీలను హెచ్చరించారు. కాగా శుక్రవారం ఉదయం నుంచే రేషన్ బియ్యం మూవ్మెంట్ను స్పీడప్ చేయగా రేషన్ దుకాణాలకు బియ్యం చేరాయి.
చేయూత అందింది
కరీంనగర్ అర్బన్: చేయూత పింఛన్లు ఎట్టకేలకు లబ్ధిదారుల ఖాతాల్లో చేరాయి. గురువారం నుంచి పింఛన్దారుల ఖాతాలకు చేరుతుండగా వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెల 2న ‘సాక్షి’లో ‘అయ్యా.. చేయూత ఏదయా’ శీర్షికన కథనం ప్రచురితమైన విష యం విదితమే. ఈ క్రమంలో పింఛన్ ఆలస్యంపై కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధి కారులను తీవ్రంగా మందలించినట్లు సమాచారం. దీంతో రెండ్రోజులుగా పింఛన్లు వస్తుండగా లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
నగరంలో నేడు పవర్కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల తొలగింపు పనులతో పాటు విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు నగరంలోని 11 కేవీ టవర్ సర్కిల్ పరిధిలోని రాజీవ్చౌక్, రూరల్ పోలీస్స్టేషన్, భారత్టాకీస్, టవర్ సర్కిల్, బ్రాహ్మణవీధి, అహ్మద్పుర, ద్వారకానగర్, వాల్మీకినగర్ ప్రాంతాలు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 కేవీ వావిలాలపల్లి, శ్రీచైతన్య ఫీడర్ల పరిధిలోని వావిలాలపల్లి, జెండాగద్దె, కెమిస్ట్ భవన్, శివథియేటర్, వేంకటేశ్వర దేవాలయం ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–1 ఏడీఈ పి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అదే విధంగా ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు 11 కేవీ కలెక్టరేట్ ఫీడర్ పరిధిలోని కలెక్టర్ ఆఫీసు, బస్టాండ్, ముకరంపుర, ఎల్ఐసీ ఆఫీస్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్–2 ఏడీఈ ఎం.లావణ్య పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి కార్మికుల మెరుపు సమ్మె


