ఉద్యోగుల ఉద్యమబాట
● పీఆర్సీ, డీఏల పెండింగ్పై ఆగ్రహం ● జూన్ 9వరకు ఆందోళనలు
కరీంనగర్ అర్బన్: ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ ఇవ్వాలని ప్రభుత్వంపై ఉద్యోగులు పోరుబాటకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికే పలుమార్లు వినతిపత్రాలు ఇవ్వగా, ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత అక్టోబర్ 21తో ప్రభుత్వానికి ఎంప్లాయీస్ జేఏసీ ఇచ్చిన గడువు ముగియగా రాష్ట్ర జేఏసీ నిర్ణయాలకు అనుగుణంగా జిల్లా ఉద్యోగుల జేఏసీ అడుగులు వేస్తోంది. 57 డిమాండ్ల సాధనే లక్ష్యంగా భారీ కార్యక్రమాలు చేపడుతున్నారు.
57 డిమాండ్లతో ఆందోళనలు
ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ కమిటీ ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఇప్పటికీ ఇలా ఐదు డీఏలు పెండింగ్లోనే ఉండగా ఐదేళ్లకోసారి పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. కమిటీ వేసి ఏడాది దాటగా పీఆర్సీ ఊసే లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీం మాటే మాట్లాడటం లేదని, ఉద్యోగుల లీవ్ శాలరీ, జీపీఎఫ్ లోన్లు, హౌస్ బిల్డింగ్ లోన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండేళ్లుగా పెండింగ్లోనే ఉన్నాయంటున్నారు. సీపీఎస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఏడాదిగా జమ కావడం లేదని, ఈ కుబేర్ కాకుండా ట్రెజరీ ద్వారా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
సుడా చైర్మన్ను కలిసిన ఎంప్లాయీస్ జేఏసీ
ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం చూపడం లేదని ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా ఛైర్మన్ దారం శ్రీనివాస్రెడ్డి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డికి వివరించారు. శుక్రవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని సుడా ఆఫీసులో నరేందర్రెడ్డిని కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు. ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ మడిపల్లి కాళిచరణ్గౌడ్, కేంద్ర సంఘం నేతలు నాగుల నరసింహస్వామి, రాగి శ్రీనివాస్, గూడ ప్రభాకర్ రెడ్డి, సర్దార్ హర్మీందర్సింగ్, కిరణ్ కుమార్, రామస్వామి, మారుపాక రాజేశ్ భరద్వాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఎందుకీ మీనమేషాలు
ఉమ్మడి రాష్ట్రంలో పోరాటమే.. స్వరాష్ట్రంలోనూ పోరాటమేనా.? తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులకు బాసటగా ఉంటామన్నవారే ఇప్పుడు నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మాకు రావాల్సినవి ఇవ్వాలంటే ఎందుకింత నిర్లక్ష్యం. – దారం శ్రీనివాస్రెడ్డి,
జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్
తీరని అన్యాయం
ఎప్పుడో పీఆర్సీ ఇవ్వాల్సి ఉండగా కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగుల ఓపికను పరీక్షించడం ప్రభుత్వానికి తగదు. ఉద్యోగులను బిడ్డల్లా చూసుకోవాల్సిందిపోయి జాప్యం చేస్తున్నారు. డీఏల ప్రకారం మా వేతనాలు పెరగాలి కానీ డీఏలే ఇవ్వడం లేదు. – మడిపల్లి కాళీచరణ్గౌడ్, జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్
ఎంప్లాయీస్ జేఏసీ కార్యాచరణ ఇదే
ఈ నెల 30వరకు జిల్లాకేంద్రంలో సదస్సులు, ప్రజాప్రతినిధులకు
వినతిపత్రాల సమర్పణ
మే 4న రాష్ట్రస్థాయి ఉద్యోగ సద స్సుకు భారీగా ఉద్యోగుల తరలింపు
మే 15న జిల్లా కేంద్రంలో
నిరసన కార్యక్రమం
జూన్ 9న రాష్ట్రస్థాయి మహాధర్నా
ఉద్యోగుల ఉద్యమబాట
ఉద్యోగుల ఉద్యమబాట


