
స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
● బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఓట్లు అడిగే అర్హత లేదు ● కేంద్ర నిధులతోనే గ్రామపంచాయతీల అభివృద్ధి ● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
కరీంనగర్టౌన్: రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో బీజేపీ గ్రామపంచాయతీ వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్పష్టం చేశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. స్థానికసంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక మొదలైందన్నారు. ముందు జెడ్పీటీసీ అభ్యర్థులను డిక్లేర్ చేయడంతోపాటు ఏకగ్రీవంగా ఉన్న స్థానంలో బీ ఫామ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి కేంద్ర నిధులను దారి మళ్లించిందన్నారు. నాడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారని మండిపడ్డారు. తాజామాజీ సర్పంచులు పడిన యాతన అంతా.. ఇంతా కాదన్నారు. పంచాయతీలకు కరెంట్ బిల్లులు కూడా కట్టలేని దుస్థితి తెచ్చారని విమర్శించారు. అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ రైతుభరోసా ఇయ్యడం లేదని ఆరోపించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో నిధులు జమచేస్తోందని తెలిపారు. గ్రామాల్లో కేంద్ర నిధులతోనే అభివృద్ధి జరుగుతుందన్నారు. గ్రామాలు బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేకనే రెండేళ్లు జాప్యం చేసిందన్నారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నాయకులు గౌతంరావు, ఎన్వీ సుభాష్, బొడిగె శోభ, యాదగిరి సునీల్రావు, రెడ్డవేన మధు, బాస సత్యనారాయణరావు, గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.