గెలుపెవరిదో..?
● ‘ప్రాధాన్యత’ దక్కేదెవరికో.. ● నేడు ‘ఎమ్మెల్సీ’ ఓట్ల లెక్కింపు ● కరీంనగర్లో కౌంటింగ్ ● ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ ● విజయంపై ప్రధాన పార్టీల ధీమా
కై లాస్నగర్: శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరికాసేపట్లో షురూ కానుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ కౌంటింగ్కు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గెలుపెవరిదో అనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ అభ్యర్థుల మధ్యనే ఉంటుందని తెలుస్తోంది. టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితం తొలుత వెల్లడి కానుండగా పట్టభద్రుల కౌంటింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
ఆ ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56 మంది పోటీ పడ్డారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ నుంచి వూట్కూరి నరేందర్రెడ్డి, బీజేపీ నుంచి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ నుంచి బరిలో నిలిచిన ప్రసన్న హరికృష్ణ మధ్యే ప్రధాన పోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. స్వతంత్రుల్లో గట్టి పోటీనిచ్చే వారు లేకపోవడంతో పట్టభద్రులు ప్రధాన పార్టీల అభ్యర్థులకే మద్దతునిచ్చినట్లుగా పోలింగ్ సరళి స్పష్టం చేస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తమదే ఆధిక్యత ఉంటుందని బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు ఆయా పార్టీల నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో బరిలో లేకున్నా బీఎస్పీ నుంచి పోటీ చేసిన హరికృష్ణకు అంతర్గతంగా మద్దతునిచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో తొలి ప్రాధాన్యత ఎవరికి దక్కనుందో అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయా పార్టీలతో పాటు ఓటర్లు సైతం తమ మద్దతుదారుల గెలుపునకున్న అవకాశాలు బేరీజు వేసుకుంటున్నారు. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలుతుందా లేక రెండో ప్రాధాన్యత అవసరం ఉంటుందా అనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
తొలి ఫలితం టీచర్స్ ఎమ్మెల్సీదే
టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో బీజేపీ తరఫున మల్క కొమురయ్య బరిలో నిలువగా, ఉపాధ్యాయ సంఘాల్లో ప్రధానమైన పీఆర్టీయూ టీఎస్ నుంచి వంగ మహేందర్రెడ్డి, టీపీటీఎఫ్, టీఎస్యూటీఎఫ్ పక్షాన అశోక్కుమార్ బరిలో నిలిచారు. ఇతర అభ్యర్థులు వివిధ సంఘాల మద్దతుతో బరిలో నిలిచినా ప్రధాన పోటీ మాత్రం ఈ ముగ్గురి మధ్యనే ఉండనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలను పరిశీలిస్తే పీఆర్టీయూ మద్దతుదారులే విజయం సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లోనూ అదే ఫలితం పునరావృతం అవుతుందా.. లేక రాజకీయంగా ఉత్సాహంగా ఉన్న బీజేపీ అభ్యర్థి విజయం సాధిస్తాడా.. లేదంటే అశోక్ కుమార్ గెలుస్తాడా అనే దానిపైనా ప్రధాన చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల కంటే ఈ ఎన్నికను ఆయా ఉపాధ్యాయ సంఘాలే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విస్తృతంగా ప్రచారం చేపట్టాయి. ఉపాధ్యాయ ఓటర్లను కలుస్తూ మద్దతు కోరడంతో పాటు విందులు సైతం ఏర్పాటు చేశాయి. పోలింగ్ సరళి సాగిన తీరుపై ఆయా సంఘాలు తమ అభ్యర్థి గెలుపుపై పక్కా లెక్కలు వేసుకుంటున్నాయి. పట్టభద్రులతో పోల్చితే ఓటర్లు తక్కువగా ఉన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితమే ముందుగా వచ్చే అవకాశముంది. అయితే తొలి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెల్లడవుతుందా లేక రెండో ప్రాధాన్యత ఓట్లు అనివార్యం కానున్నాయా అనేది మరికాసేపట్లో తేలనుంది. మొత్తానికి అటు పట్టభద్రులు, ఇటు టీచర్స్ ఫలితంపై అన్నివర్గాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుండటం ఆసక్తి రేపుతోంది.
మొత్తం టేబుళ్లు: 35
పట్టభద్రుల టేబుళ్లు : 21
టీచర్ల టేబుళ్లు : 14
లెక్కింపు సిబ్బంది: 800
రిజర్వ్ స్టాఫ్: 20 శాతం
లెక్కింపు గణాంకాలు
వేదిక: అంబేడ్కర్ స్టేడియం, కరీంనగర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ – మెదక్ – నిజామాబాద్– ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం మొదలు కానుంది. కరీంనగర్లోని అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఉదయం 8 గంటలకు గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాలకు లెక్కింపు జరగనుంది. ఇందుకోసం మొత్తం 35 టేబుళ్లు వినియోగించనున్నారు. ఇందులో 21 పట్టభద్రుల ఓట్ల కోసం, 14 టేబుళ్లు ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద నలుగురు సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. వీరిలో ఒక మైక్రోఅబ్జర్వర్, ఒక సూపర్వైజర్, ఇద్దరు లెక్కింపు అసిస్టెంట్లు ఉంటారు. వీరందరికీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చారు. లెక్కింపు కోసం మొత్తం 800 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. ఇందులో 20 శాతం రిజర్వ్ సిబ్బందిని నియమించారు. ఆదివారం మాక్ కౌంటింగ్ను ఎన్నికల అధికారులు చేపట్టారు. ఈ ప్రక్రియను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment