
పదవీ విరమణ సమస్యలుంటే నేరుగా కలవండి
● రిటైర్డ్ పోలీసు అధికారులకు ఎస్పీ సూచన
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు బెనిఫిట్స్ (ప్రయోజనాలు) సంబంధించిన సమస్యలేవైనా ఉంటే నేరుగా తనను కలవాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. సుదీర్ఘకాలం పోలీసు శాఖలో పనిచేసి కర్నూలు పీసీఆర్ ఎస్ఐ పుల్లన్న నాయక్, ఏఆర్ఎస్ఐ ఎల్ఎల్ రంగారెడ్డి, ఏఆర్పీసీ కె.వెంకటరామిరెడ్డి మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా కర్నూలు నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో వారిని సన్మానించారు. వారిని శాలువ, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అందజేశారు. అనంతరం ఘనంగా వీడ్కోలు పలికారు. కుటుంబ సభ్యులతో కలసి శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని వారికి ఎస్పీ సూచించారు.
సమస్యలు ఉంటే తనను నేరుగా కలవొచ్చని తెలిపారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, డీపీఓ ఏఓ విజయ్కుమార్ నాయుడు, ఎస్బీ సీఐలు కేశవరెడ్డి, తేజమూర్తి, ఆర్ఐ నారాయణ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.