
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
విద్యారణ్యపురి : పదోతరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం నేటినుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండలోని కాజీపేట ఫాతిమా హైస్కూల్లో జవాబుపత్రాల మూల్యాంకనం చేసేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడికి తీసుకొచ్చిన పదోతరగతి జవాబు పత్రాల కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం పూర్తయింది.
ఉమ్మడి జిల్లా నుంచి జవాబు పత్రాల రాక
ఉమ్మడి వరంగల్లోని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల టెన్త్ స్పాట్ కేంద్రాన్ని హనుమకొండలో ఏర్పాటు చేశారు. టెన్త్ సబ్జెక్టు పరీక్షల జవాబు పత్రాలన్నీ కలిపి 2,27,864 ఈ కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ స్పాట్ కేంద్రానికి క్యాంప్ ఆఫీసర్గా హనుమకొండ జిల్లా డీఈఓ డి.వాసంతి వ్యవహరిస్తున్నారు.
సీఈలు, ఏఈలు
741, స్పెషల్ అసిస్టెంట్లు 216 మంది..
పదో తరగతి మూల్యాంకనానికి ఆరు జిల్లాలోని ఆయా సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్లకు, సీఈలుగా, ఏఈలు గాను టీచర్లకు సీనియారిటీ ప్రకారం నియామక ఉత్తర్వులు పంపారు. జవాబు పత్రాలు వాల్యుయేషన్ చేసే టీచర్లు కనీసం మూడేళ్లు ఆయా సబ్జెక్టులో విద్యాబోధన చేసి ఉండాల్సిందే. రోజుకు చీఫ్ ఎగ్జామినర్లుగా (సీఈ)లుగా 108 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా (ఏఈ)లుగా 633 మంది మొత్తం 741 మంది స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. స్పెషల్ అసిస్టెంట్లుగా సెకండరీ గ్రేడ్ టీచర్లను (ఎస్జీటీ) 216 మందిని నియమించారు. మొత్తం 957మంది టీచర్లు స్పాట్ విధులు నిర్వహించనున్నారు.
నేడు ఉదయం రిపోర్టు చేయాలి..
కాజీపేటలోని టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఆయా టీచ ర్లు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రోజుకు ఒక్కొ టీ చర్ 40 జవాబు పత్రాలు వాల్యుయేషన్ చేయాలి. రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వ రకు విధుల్లో ఉంటారు. స్పాట్ విధుల ఉత్తర్వులు అందుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా విధుల్లో పాల్గొనాలని, గైర్హాజర్ టీచర్లపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఫాతిమా హైస్కూల్లో స్పాట్ కేంద్రం
2,27,864 జవాబు పత్రాల రాక
స్పాట్ విధులకు 957 మంది టీచర్లు
సీనియారిటీ ప్రకారం
6 జిల్లాల వారికి విధులు
గతేడాది రెమ్యునరేషన్ విడుదల
గతేడాది రెమ్యునరేషన్ విడుదల!
గతేడాది ఏప్రిల్లో టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ విధులు నిర్వర్తించిన టీచర్లకు ఇతర సిబ్బందికి రెమ్యునరేషన్ రూ.59 లక్షలకు పైగా ఇటీవలే జిల్లా విద్యాశాఖకు విడుదల అయ్యాయి. అయితే గతేడాది టెన్త్ స్పాట్ విధుల్లో పాల్గొన్న టీచర్లు, ఇతర సిబ్బంది మొత్తం 1.072 మందికి కూడా మూడ్రోజుల క్రితం వారి అకౌంట్లలోనికి రెమ్యూనరేషన్ను విడుదల చేశారని సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు.