Allu Arjun At Nandyal: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌ | Allu Arjun Meet YSRCP Silpa Ravichandra Kishore Reddy In Nandyal, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Allu Arjun At Nandyal: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్‌

Published Sat, May 11 2024 12:10 PM | Last Updated on Sat, May 11 2024 3:47 PM

Allu Arjun Meet YSRCP Silpa Ravichandra Kishore Reddy

ఇద్దరు వ్యక్తుల మధ్య చెదరని మమతకు శ్రీకారం స్నేహం.. చెలిమి బంధానికి మరేదీ సాటిరాదని ఎన్నెన్నో పురాణ కథలు ప్రబోధిస్తున్నాయి. అందుకే ఈ ప్రపంచంలో స్నేహానికి అత్యంత విలువ ఉంది. ఎన్నికల సమయంలో తన మిత్రుడి విజయం కోసం ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్నేహ బంధాన్ని పాటించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి నంద్యాల నియోజికవర్గంలో ఎన్నికల బరిలో నిల్చున్న శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయం సాధించాలని అల్లు అర్జున్‌ కోరుకున్నారు.

తాజాగా అల్లు అర్జున్‌ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి నంద్యాల చేరుకున్నారు. వారికి పూలమాలలతో శిల్పా రవిచంద్రారెడ్డి దంపతులు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను చూసేందుకు ఆయన అభిమానులు శిల్పా రవి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో  తొలిసారి నంద్యాల నుంచే శిల్పా రవిచంద్రారెడ్డి పోటీచేశారు. ఆ సమయంలో కూడా బన్ని తన మిత్రుడు విజయం సాధించాలని మద్ధతు తెలిపారు.

శిల్పా రవిని ప్రజాసేవలో చూడటం తనకు చాలా గర్వంగా ఉందని బన్ని అప్పట్లో తెలిపారు. ఆ  ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డిపై 35 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. మళ్లీ ఇప్పుడు కూడా శిల్పా రవి నంద్యాల నుంచే ఎన్నికల బరిలో ఉన్నారు.  ఈ ‍క్రమంలో తన మిత్రుడిని గెలిపించాలని అల్లు అర్జున్‌ తన మద్ధతు తెలిపారు. శిల్పా రవిచంద్రారెడ్డి చేతిని పట్టుకుని తన అభిమానులకు చూపించారు.

శిల్పా రవిచంద్రారెడ్డి సతీమణి నాగిని రెడ్డి, అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. వారిద్దరూ క్లాస్‌మెట్స్‌ కూడా.. అనంతరం రవిచంద్రారెడ్డి, అల్లు అర్జున్‌ మంచి స్నేహితులు అయ్యారు. ఇరు కుటుంబాల్లో జరుగుతున్న శుభకార్యాల్లో కూడా వారు పాల్గొంటారు. స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి అల్లు అర్జున్‌ అని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వార రవిచంద్రారెడ్డి తెలిపారు.

అల్లు అర్జున్‌ ఏమన్నారంటే..
'శిల్పా రవిచంద్రారెడ్డి నాకు గత 15 ఏళ్లుగా మంచి మిత్రుడు. రాజకీయాలకు ముందు ఇద్దరం రెగ్యులర్‌గా కలిసేవాళ్లం. ఎప్పుడైతే రవి పాలిటిక్స్‌లోకి వచ్చారో ఆ సమయం నుంచి మేము తక్కువగా కలిసే వాళ్లం. 2019లో రవిచంద్రారెడ్డి గెలుపు కోసం ఒక ట్వీట్‌ చేశాను. కానీ, నాకు అది చాలా తక్కువే అనిపించింది. రవి ఈ ఐదేళ్లలో చాలా కష్టపడ్డాడు. అందుకే నేనే నంద్యాలకు వచ్చాను.  ఈ ఎన్నికల్లో రవి విజయం సాధించి ఇక్కడి ప్రజలకు మరిన్ని మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను.' అని బన్ని అన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement