Armur Area Youth Excelling In Tollywood, Winning Awards By Proving Their Talent On Silver Screen - Sakshi
Sakshi News home page

ఆర్మూర్‌ టు టాలీవుడ్‌.. ఇండస్ట్రీలో రాణిస్తున్న యువకులు

Published Sun, Jul 16 2023 1:47 PM | Last Updated on Mon, Jul 17 2023 2:11 AM

Armur Area Youth excelling in Tollywood - Sakshi

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలతోనే సెటిల్‌మెంట్‌ అని నమ్ముతున్న తల్లిదండ్రులను ఒప్పించి తమకు నచ్చిన సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అహర్నిషలు కష్టపడుతున్నారు నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన పలువురు యువకులు. రంగుల ప్రపంచమైన సినిమా రంగంలో బ్యాక్‌ సపోర్ట్‌ లేకున్నా తమ సొంత టాలెంట్‌నే నమ్ముకొని నిలదొక్కుకుంటున్నారు. అటు సినిమాల్లో నటులుగా, దర్శకులుగా, నిర్మాతగా తాము ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా నిలబడి తమలోని ప్రత్యేకతను వెండి తెరపై నిరూపించకుని అవార్డులను సైతం సొంతం చేసుకుంటున్నారు.  – ఆర్మూర్‌

మిస్టర్‌ హ్యాండ్‌సమ్‌ ధనుష్‌ శెట్టి 
ఆర్మూర్‌లోని గీతా భవన్‌ హోటల్‌ యజమాని లింగం శెట్టి కుమారుడైన ధనుష్‌ శెట్టి ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. బెంగళూరులోని ఓ కంపెనీలో రెండేళ్లు ఉద్యోగం చేశాడు. 2016లో సౌత్‌ ఇండియా మిస్టర్‌ హాండ్‌సమ్‌గా ఎంపికయ్యాడు. నటుడిని కావాలనుకుని తండ్రి ప్రోత్సాహంతో సినీపరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తండ్రిపై ఆర్థిక భారాన్ని మో పకుండా బిజినెస్‌ చేస్తూ మరోవైపు అందివచ్చిన అవకాశాలను వినియోగించుకొని ఇప్పటి వరకు మూడు సినిమాల్లో నటించాడు. ‘కే’ సినిమాలో హీరోగా తెరంగేట్రం చేశాడు. రెండో సినిమా తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ‘కాలేజ్‌ కుమార్‌’లో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి ప్రధాన పాత్రలో నటించాడు. మూ డో సినిమా ‘బాంబే కాలనీ’ ఆహా లో విడుదలకు సిద్ధంగా ఉంది. 

మంచి నటుడిగా గుర్తింపు కోసం..
సినీ పరిశ్రమలో మంచి నటుడిగా రాణించాలనే లక్ష్యంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. నా నటనను గుర్తించిన దర్శకులు మంచి మంచి బ్యానర్లలో నటించడానికి అవకా శాలు ఇస్తున్నారు. నేను ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా నిలబడేందుకు కష్టపడుతున్నా.

– ధనుష్‌ శెట్టి, సినీ నటుడు, ఆర్మూర్‌ పట్టణం 

మొదటి సినిమాతోనే అవార్డు..
మామిడిపల్లికి చెందిన అజయ్‌ వేద్‌ హీరోగా నటించిన మొదటి సినిమా మట్టి కథలో ఉత్తమ నటనకు గాను ఇండో ఫ్రెంచ్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ యాక్టర్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఆర్మూర్‌కు చెందిన మానస హైస్కూల్‌ కరస్పాండెంట్‌ గణేశ్, పద్మ కుమారుడైన అజయ్‌ వేద్‌ బీటెక్, ఎంబీఏ పూర్తి చేసి 2019లో రామానాయుడు స్టూడియోలో డిప్లొమా ఇన్‌ యాక్టింగ్‌ పూర్తి చేశాడు. సినీ పరిశ్రమలో అతనికి ఉన్న ఆసక్తితో పవన్‌ కడియాల దర్శకత్వంలో తెరకెక్కిన మట్టి కథ సినిమాలో హీరోగా అవకాశం దక్కించుకున్నాడు. 

హీరో కావడమే లక్ష్యం..
డ్యాన్స్‌పై నాకున్న మక్కు వతో సినీ పరిశ్రమలో హీరోగా నా ప్రత్యేకతను చాటుకోవాలనే ప్రయ త్నం మొదలు పెట్టాను. షార్ట్‌ ఫిల్మ్‌లతో పాటు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించడానికి అవకాశాలు వచ్చినా హీరోగా నటించడమే లక్ష్యంగా కష్టపడి సాధించాను. తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకున్నా నా సొంత టాలెంట్‌తో రాణించడానికి ప్రయత్నం చేస్తున్నాను. 

– అజయ్‌ వేద్, సినీ నటుడు, ఆర్మూర్‌ పట్టణం 

అన్‌స్టాపబుల్‌ నిర్మాతగా రజిత్‌రావు
బాల్కొండ మండలం చిట్టాపూర్‌కు చెందిన రజిత్‌రావు వ్యాపార రీత్యా ఆర్మూర్‌లో స్థిరపడ్డాడు. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా నిర్మించాలనే లక్ష్యంతో నిర్మాతగా మారి ఏ టు బీ ప్రొడక్షన్స్‌పై అన్‌స్టాపబుల్‌(అన్‌ లిమిటెడ్‌ ఫన్‌) సినిమాను నిర్మించాడు. నటుడు సప్తగిరి, బి గ్‌బాస్‌ ఫేమ్‌ సన్నీ ప్రధాన పాత్రలతో స్టోరీ, స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్, డైరెక్టర్‌గా డైమండ్‌ రత్నబాబు వ్యవహరించి నిర్మించిన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 500 థియేటర్లలో జూన్‌ 9న విడుదల చేశారు.

కుటుంబ సమేతంగా చూసి హాయిగా నవ్వుకొనే సినిమా తీయాలనే సంకల్పంతో అన్‌ స్టాపబుల్‌ సినిమా నిర్మించాను. మంచి ప్రజాదరణ లభించింది. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు నిర్మించే దిశగా ప్రయత్నిస్తాం. 

రజిత్‌రావు, సినీ నిర్మాత, ఆర్మూర్‌ పట్టణం

జానపద నృత్య కళాకారుడి నుంచి.. 
పెర్కిట్‌కు చెందిన జీవన్‌ గౌడ్‌ జానపద నృత్య కళాకారుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ సినిమాల్లో నటించే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు. పెర్కిట్‌లో దేశీ కోడి ఆర్డర్‌ మెస్‌ నడుపుకునే వాడు. పత్రికలు, పుస్తకాలు చదివి నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. 2020లో యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తున్న ఘన్‌శ్యాం పరిచయం కావడంతో ఆ ర్మూర్‌ ఫోక్‌ సాంగ్స్‌ పేరిట సొంతంగా యూ ట్యూబ్‌ చానల్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. దీంతో సినిమాల్లో అవకాశాలు రావడం ప్రారంభమైంది. ఇటీవల దర్శకుడు సంజయ్‌ తెరకెక్కిస్తున్న ఎర్రగుడి సినిమాలో సినీనటి మంచు లక్ష్మి పక్కన విలన్‌గా నటించాడు. 

నటుడిగా రాణించి మన్ననలు పొందాలి 
మంచి నటుడిగా రాణించా లనే లక్ష్యంతో వ్యయ, ప్రయాసలకోర్చి సినీపరిశ్రమ లో అవకాశాలు దక్కించుకుంటున్నాను. జానపద నృత్య కళాకారుడిగా నాకు వచ్చిన గుర్తింపుతో సినీపరిశ్రమలో అవకాశాలు వచ్చాయి.

– జీవన్‌ గౌడ్, సినీ నటుడు, పెర్కిట్‌

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా రాణిస్తూ..
ఆర్మూర్‌కు చెందిన దురిశెట్టి నర్సింహాచారి, శ్రీదేవిల కొడుకైన దురిశెట్టి సచిన్‌(బబ్లూ) ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ఉద్యోగం ఇష్టం లేక షార్ట్‌ఫిల్మ్‌లు తీయడం ప్రారంభించాడు. ఆయన తీసిన ప్రేయసి అనే షార్ట్‌ ఫిల్మ్‌కు ఐఎఫ్‌ఎల్‌ నేషనల్‌ లెవల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ కాంటెస్ట్‌లో ఉత్తమ డైలాగ్‌ రైటర్‌గా బెంగళూరు వేదికపై అవార్డును కైవసం చేసుకున్నాడు. సినిమా డైరెక్టర్‌ కావాలన్న పట్టుదలతో పీపుల్స్‌ మీడి యా గ్రూప్‌ వారు నిర్మిస్తున్న సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. 

నేనేంటో నిరూపించుకోవాలని.. 
నెలవారి జీతం కోసం పని చేయకుండా సిని మా డైరెక్టర్‌ కావాలను కున్నాను. ప్రస్తుతం పెద్ద ఫిల్మ్‌ మేకర్స్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. రానున్న రోజుల్లో మంచి సినిమా తీయడానికి స్క్రిప్‌్టను సైతం సిద్ధం చేసుకున్నాను.

 – దురిశెట్టి సచిన్, ఆర్మూర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement