
హైదరాబాద్: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్పై పోలీసు కేసు నమోదైంది. తనను నమ్మించి మోసం చేశాడని ప్రియురాలు లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తనను వదిలేయడానికి హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణమంటూ ఆమెతో పాటు ఆమె సోదరుడిపైనా ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్, తాను 11 ఏళ్లుగా రిలేషన్లో ఉన్నామని , గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని తెలిపింది.

మూడు నెలల క్రితమే..
హీరోయిన్ మాల్వీ మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది. మూడు నెలల క్రితమే ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడంది. ఫోన్ లిఫ్ట్ చేయకుండా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడని ఫిర్యాదులో తెలిపింది. దీనికంతటికీ మాల్వీ మల్హోత్రా కారణమంది. రాజ్ తరుణ్ను వదిలేయకపోతే తనను చంపేసి బాడీ కూడా మాయం చేస్తానని బెదిరిస్తున్నారని ఆరోపించింది.
డ్రగ్స్ కేసులో
అంతేకాకుండా గతంలో డ్రగ్స్ కేసులో ఇరికించడంతో మూడు నెలలపాటు జైల్లో ఉన్నట్లు తెలిపింది. అప్పుడు కూడా రాజ్ ఎలాంటి సాయం చేయలేదని వాపోయింది. రాజ్ తరుణే తన ప్రపంచమని, అతడు తిరిగి తన దగ్గరకు వచ్చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ.. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా తిరగబడరా సామీ సినిమాలో జంటగా నటించారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.

చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ..
Comments
Please login to add a commentAdd a comment