నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందంటూ మాల్వీ మల్హోత్రా | Malvi Malhotra Feeling Now Relieved After Producer Yogesh Singh Imprisonment | Sakshi
Sakshi News home page

నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష.. న్యాయం గెలిచిందంటూ మాల్వీ మల్హోత్రా

Oct 8 2024 1:57 PM | Updated on Oct 8 2024 3:02 PM

Malvi Malhotra Feeling Now Relieved After Producer Yogesh Singh Imprisonment

న్యాయం గెలిచిందంటూ హీరోయిన్‌  మాల్వీ మల్హోత్రా చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. హీరో రాజ్‌తరుణ్‌ నటించిన 'తిరగబడర సామీ' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వ్యక్తిగత జీవితం వివాదంలో చిక్కుకోవడంతో ఇక్కడ బాగా పాపులర్‌ అయింది. అయితే, సుమారు నాలుగేళ్ల క్రితం తనపై జరిగిన ఒక దాడి కేసులో తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. మాల్వీ మల్హోత్రాకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

2020లో పెళ్లికి నిరాకరించిందని  నటి మాల్వీ మల్హోత్రపై నిర్మాత యోగేష్ సింగ్‌ కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఫేస్‌బుక్‌ ద్వారా మాల్వీకి పరిచయమైనట్లు అప్పటి నివేదికలు చెబుతున్నాయి.  ఒకరోజు రాత్రి ముంబైలో మాల్వీని  కేఫ్‌ సమీపంలో యోగేష్ సింగ్‌ అడ్డగించాడు. తనను  దూరం పెట్టడమే కాకుండా.. ఎందుకు మాట్లాడటం లేదంటూ ఆమె పొట్ట భాగంలో కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆపై అతన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ రోజు నుంచి మాల్వీ మల్హోత్రా న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఎట్టకేలకు ఆమె న్యాయం జరిగింది.

మాల్వీ మల్హోత్రా అందించిన ఆధారాలను పరిశీలించిన ముంబై న్యాయస్థానం  దాడి చేసిన యోగేష్ సింగ్‌ను దోషిగా నిర్ధారించింది. ఆపై అతనికి   మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు కోర్టు తీర్పు వెళ్లడించింది. ఈ తీర్పుతో తాను ఎంతగానో ఉపశమనం పొందానని మీడియాతో ఆమె తెలిపారు. నటి మాట్లాడుతూ, 'చివరికి నాకు ఉపశమనం కలిగింది. నేను గత నాలుగు సంవత్సరాలుగా పోరాడుతున్నాను. చాలా ఒత్తిడితో పాటు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. కానీ, ఎట్టకేలకు నిజం బయటపడింది.' అని ఆమె పేర్కొంది.

కేసు తీర్పు వచ్చిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆమె ఒక పోస్ట్‌ కూడా చేశారు. " నవరాత్రులు అనేవి న్యాయం, సత్యం తాలూక విజయానికి ప్రతీక.  జీవితంలో ఎల్లప్పుడూ సరైన మార్గంలో ఉంటే తప్పకుండా న్యాయం జరుగుతుంది. నాకు న్యాయం అందేవరకు పోరాడే శక్తిని ఇచ్చిన ఆమ్మవారికి ధన్యవాదాలు.' అని షేర్‌ చేసింది.

'నాపై దాడి జరిగిన నాటి నుంచి భయంతో బతుకుతున్నాను. నేను చాలా మానసిక గాయాలు అనుభవించాను. శారీరక మచ్చల కంటే మానసిక వేదన నాపై ఎక్కువ ప్రభావం చూపింది. ఆ దాడి జరిగిన సమయం నుంచి ఇప్పటికీ  ఎవరో నన్ను వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే, నా తండ్రి నిరంతరం నాకు ధైర్యాన్ని నింపారు. ఆయన మద్దతు కారణంగా ఎలాంటి థెరపీ తీసుకోకుండానే మళ్లీ కోలుకున్నాను. అని పేర్కొంది.

తనను ప్రేమించి, మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి రాజ్‌ తరుణ్‌పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘తిరగబడర సామీ’ సినిమా షూటింగ్‌ సమయం నుంచి రాజ్‌ తరుణ్‌తో మాల్వీ ప్రేమలో ఉన్నట్లు ఆమె ఆరోపించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement