
నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ నారాయణ్ దాస్ కె నారంగ్ (76) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఏషియన్ మల్టీప్లెక్స్ , ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న ఆయన.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు.
ఇటీవల నాగచైతన్య ‘లవ్స్టోరీ’,నాగశౌర్యతో ‘లక్ష్య’ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం నాగార్జునతో ‘ఘోస్ట్’, అలాగే ధనుష్తో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ కూడా నిర్మాతలే. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మూవీ ఫైనాన్షియర్ గా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలను అందించిన నారాయణ దా కె నారంగ్ మృతిపట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
నారాయణ దాస్ నారంగ్ 1946 జులై 27న జన్మించారు. ఆయన డిస్ట్రిబూటర్గా పలు విజయవంతమైన చిత్రాలను విడుదల చేశారు. నిర్మాతగా మంచిపేరు సంపాదించుకున్నారు. ఏషియర్ గ్రూప్ అధినేత గ్లోబల్ సినిమా స్థాపకుడు, ఫైనాన్సియర్కూడా ఆయిన ఆయన చలనచిత్రరంగంలో అజాతశత్రువుగా పేరుగాంచారు. తెలంగాణలో పంపిణీదారునిగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. ఆయన మృతి పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్యమండలి, తెలంగాణ వాణిజ్యమండలి తమ ప్రగాఢసానుభూతి తెలియజేసింది. ఈరోజు సాయంత్రం 4గంటలకు జూబ్లీహిల్స్లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు జరగనున్నాయని కుటుంబసభ్యులు తెలియజేశారు.