
హీరో శింబు సినిమాలు జయాపజయాలకు అతీతంగా మినిమమ్ వసూళ్లు సాధిస్తాయి. అందుకే నిర్మాతలు ఈయనతో చిత్రాలు చేయడానికి క్యూ కడతారు. ఆ మధ్య మానాడు చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న శింబు, ఆ తరువాత వెందు నిందదు కాడు చిత్రంతోనూ హిట్ కొట్టారు. ఆ తరువాత నటించిన పాత్తు తల చిత్రం నిరాశపరచింది. కాగా త్వరలో కమల్ హాసన్ బ్యానర్లో దేశింగు పెరియసామి దర్శకత్వంలో నిర్మించనున్న భారీ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.
థగ్లైఫ్ మూవీలో
ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న థగ్లైఫ్ చిత్రంలో శింబు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే పోస్టర్ కూడా రిలీజైంది. ప్రస్తుతం ఇతడు ఆ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. ఇలాంటి సమయంలో థగ్లైఫ్ చిత్రంలో శింబు నటించరాదని నిర్మాత ఐసరి గణేశ్ తమిళ నిర్మాతల మండలికి ఫిర్మాదు చేశారు.
రూ.4 కోట్లు అడ్వాన్స్
అందులో ఆయన తాను వెందు తనిందదు కాడు చిత్రం తరువాత శింబు హీరోగా కరోనా కుమార్ అనే చిత్రాన్ని గోకుల్ దర్శకత్వంలో నిర్మించాలనుకున్నానని తెలిపారు. అందుకు గానూ ఆయనకు రూ.9 కోట్లు పారితోషికం ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకుని, రూ.4 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ఒప్పందం ప్రకారం శింబు తన చిత్రంలో నటించడం లేదని, ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు.
అప్పటివరకు ఎక్కడా నటించొద్దు
సెప్టెంబరు 19వ తేదీలోగా రూ.1 కోటితో కూడిన అనుమతి పత్రాన్ని కోర్టుకు సమర్పించాలని, లేని పక్షంలో ఇతర చిత్రాల్లో నటించడానికి నిషేధం విధించనున్నట్లు న్యాయస్థానం తీర్పు ఇచ్చిందన్నారు. కాబట్టి తన చిత్రాన్ని పూర్తి చేసే వరకూ శింబు థగ్లైఫ్ చిత్రంలో నటించరాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే థగ్లైఫ్ చిత్రంలో నటిస్తున్న శింబు ఆ చిత్రాన్ని పూర్తి చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment