
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా కె. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా చివరి షెడ్యూల్ శుక్రవారం మొదలైంది. ఈ సినిమా షూటింగ్ పది రోజులు జరిపితే పూర్తవుతుందని పూజా హెగ్డే తెలిపారు. తన పాత్ర గురించి పూజా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో ప్రేరణగా కనిపిస్తాను. ప్రస్తుతం ప్రేరణ గురించి ఎక్కువగా చెప్పలేను. ‘రాధేశ్యామ్’ రిలీజ్ సమయంలో ప్రేరణ గురించి ఎక్కువగా మాట్లాడతాను. ఇటీవలి కాలంలో నేను చేస్తున్న పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రం ఇది. అలాగే కొన్ని యాక్షన్ సినిమాల తర్వాత ప్రభాస్ ఈ రొమాంటిక్ మూవీ చేస్తున్నారు. అందుకే నాకీ సినిమా స్పెషల్’’ అన్నారు.
ఈ సినిమాతోపాటు చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘ఆచార్య’లో కీలక పాత్రలో నటిస్తుంది ఈ బుట్టబొమ్మ. ఇందులో రామ్ చరణ్ సరసన కనిపించనుంది. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘కబీ ఈద్ కబీ దీవాలీ’, రణ్వీర్ సింగ్ ‘సర్కస్’ చిత్రాల్లో నటిస్తుంది. తమిళంలో విజయ్ సరసన ‘బీస్ట్’లో సందడి చేయనుంది.