
‘‘సినిమా టిక్కెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే.. ఈ నిర్ణయం వల్ల ప్రేక్షకులకు, చిన్న సినిమాలకు, చిన్న నిర్మాతలకు ఎంతో మేలు కలుగుతుంది’’ అని ‘తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్’ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి ఓ ప్రకటనలో అన్నారు. టిక్కెట్ల ధర పెంచితే ప్రధానంగా హీరోలకే లాభం. టిక్కెట్ రేటు పెరిగేకొద్దీ హీరోల రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది. మరికొందరు లాభాల్లో వాటాలు అడుగుతారు.
బెనిఫిట్ షోలు, సినిమా విడుదల రోజు ఎక్కువగా సినిమాకు క్యూ కట్టేది మధ్యతరగతి ప్రజలే. టిక్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో చిన్న సినిమాలకే నష్టం. చిన్న సినిమాలకు ఫేస్ వ్యాల్యూ ఉండదు కనుక రూ.150, రూ. 200 టిక్కెట్ కొనుక్కుని చూసేందుకు ముందుకు రారు. పెద్ద సినిమా టిక్కెట్ ధర 100 రూపాయలున్నా నష్టమేమీ లేదు. పెద్ద హీరోల రెమ్యునరేషన్ తగ్గితే నిర్మాతలు బాగుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం కూడా తీసుకోగలిగితే చిన్న, పెద్ద సినిమాలకు మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు.