100 శాతం శానిటేషన్ పాటిస్తాం..
ములుగు: జిల్లాలోని వేసవిలో ప్రతీ ఇంటికి తాగునీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) ఒంటేరు దేవరాజ్ అన్నారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో బుధవారం సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో స్థానికులు తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రెయినేజీలు, దోమల బెడద వంటి సమస్యలను విన్నవించుకున్నారు. స్పందించిన డీపీఓ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు.
ప్రశ్న: మిషన్ భగీరథ నీటిలో మురుగు వస్తోంది. అధికారులు పట్టించుకోవడం లేదు.
– గొంది సీత, వాజేడు
జవాబు: ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకును బ్లీచింగ్తో శుభ్రం చేయిస్తాం. ప్రజలు రోజు అవసరాలు తీర్చుకోవడంతో పాటు తాగడానికి వీలుగా శుభ్రమైన నీటిని అందిస్తాం. పంచాయతీ సెక్రటరీతో మాట్లాడి మరో సారి ఇలాంటి సమస్య ఎదురుకాకుండా చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న: డ్రెయినేజీ నీళ్లు రోడ్లపైకి పారుతున్నాయి. వ ర్షాకాలం వస్తే మురుగునీరంతా ఇళ్లలోకి వస్తుంది.
– మహేష్, మల్లంపల్లి
జవాబు: నూతనంగా చేపట్టనున్న పనుల ప్రతిపాదనలో డ్రెయినేజీ పనులకు ఎస్టిమేషన్ వేయిస్తాం. మోడల్ కాలనీలో సీసీ రోడ్డుపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ తొలగించి పక్కన ఏర్పాటు చేసేలా విద్యుత్ అధికారులతో మాట్లాడతాను. మురుగునీరు ఇంట్లోకి రాకుండా అక్కడక్కడా ఇంకుడుగుంతలు నిర్మిస్తాం. ఉన్న కాల్వలను శుభ్రం చేయిస్తాం.
ప్రశ్న: సినిమా టాకీస్ ఎదురుగా డ్రెయినేజీ లేక మురుగునీరు రోడ్లపైకి పారుతుంది. పన్ను వసూలు చేసేటప్పుడు ఆన్లైన్ రశీదులు ఇవ్వడం లేదు.
– శంకర్భవాని, ఏటూరునాగారం
జవాబు: ఏటూరునాగారం గ్రామపంచాయతీ పరిధిలో అవసరం ఉన్న చోట డ్రెయినేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తాం. వచ్చే బడ్జెట్తో నిర్మాణాలు చేపట్టి మురుగునీటితో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూస్తాం. పన్ను వసూలు విషయంలో ఆన్లైన్ రశీదులు ఇవ్వడం లేదనే విషయంపై కార్యదర్శితో మాట్లాడి ఎంకై ్వరీ చేయిస్తాను.
ప్రశ్న: చెత్తాచెదారం తొలగించడానికి ట్రాక్టర్ రావడం లేదు. డ్రెయినేజీలు పూడుకుపోయాయి.
– సత్యనారాయణ, మల్లూరు
జవాబు: గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్తను తొలగించే ప్రయత్నం చేస్తాం. పూడుకుపోయిన డ్రెయినేజీలను శుభ్రం చేయిస్తాం. ప్రస్తుతం ఉన్న ఇన్చార్జ్ సెక్రటరీ స్థానంలో రానున్న రోజుల్లో పూర్తి స్థాయి సెక్రటరీని నియమిస్తాం.
ప్రశ్న: శానిటేషన్ పనులు చేపట్టడం లేదు.
చెత్తాచెదారం తీయడం లేదు.
– లక్ష్మణ్రావు, బర్లగూడెం
జవాబు: బర్లగూడెంలో సమస్య ఉందని నా దృష్టికి వచ్చింది. స్థానిక పంచాయతీ కార్యదర్శిని అప్రమత్తం చేస్తాం. స్పందించని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటాం. శానిటేషన్ పనులు, డ్రెయినేజీలు శుభ్రం చేయడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.
ప్రశ్న: ట్రాక్టర్ రిపేర్ ఉందని చెత్త తీయడం లేదు. రోడ్ల వెంబడి చెత్తాచెదారం పేరుకుపోయింది.
– మల్లేశ్, బాలాజీనగర్
జవాబు: ట్రాక్టర్ను వెంటనే రిపేర్ చేయిస్తాం. కూలీలను ఏర్పాటు చేసి గ్రామంలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తాం. ప్రజలు అధైర్య పడొద్దు. స్థానికంగా సమస్యలు పరిష్కారం కాకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం అవుతాయి.
ప్రశ్న: డ్రెయినేజీలు శుభ్రం చేయించండి. దోమలు పెరిగిపోతున్నాయి.
– రాహుల్, ములుగు
జవాబు: జిల్లాకేంద్రంలో రోజువారీగా ఈఓతో పాటు సిబ్బంది శానిటేషన్ పనులను దగ్గరుండి చూస్తున్నారు. అయినా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరిస్తాం. దోమలు బాగా ఉన్న ప్రాంతంలో రె గ్యులర్గా ఫాగింగ్ చేపడుతాం. పంచాయతీ సి బ్బందితో మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తాం.
ప్రశ్న: గ్రామంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. డ్రెయినేజీలో మురుగునీరు పేరుకుపోయింది. పంచాయతీ కార్యదర్శి పట్టించుకోవడం లేదు.
– చేలా నవీన్, బర్లగూడెం
జవాబు: అసౌకర్యానికి చింతిస్తున్నాను. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శితో మాట్లాడుతాను. వారం రోజుల్లో గ్రామంలోని సమస్యలన్నీ పరిష్కరించకపోతే అక్కడి నుంచి కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేసి వేరే వారిని నియమిస్తాం. సమస్య ఏది ఉన్నా నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు.
దోమల నివారణకు క్రమం తప్పకుండా ఫాగింగ్
జిల్లా పంచాయతీ అధికారి ఒంటేరు దేవరాజ్
సాక్షి ఫోన్ఇన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన
ఇంటింటికీ తాగునీరు


