సన్న బియ్యం.. క్యూ కట్టిన జనం!
చెప్పలేని సంతోషం ఉంది
ప్రభుత్వం రేషన్ దుకా ణాల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను నా భర్త వయస్సు మీదపడటంతో ఏపనీ చేయలేక ఇంటి దగ్గరే ఉండి రేషన్కార్డు ద్వారా వచ్చే బియ్యం తీసుకెళ్లి తినేవాళ్లం. ఎప్పుడైనా పండుగ రోజు సన్న బియ్యం బయట దుకాణంలో కిలో రూ.70 పెట్టి కొని తినేవాళ్లాం. కానీ ఇప్పుడు ఆ బాధలేదు. రేషన్ దుకాణంలోనే ఉచితంగా సన్నబియ్యం ఇస్తుండటంతో నెల రోజుల పాటు కడుపునిండా తింటాం. ఇలానే ప్రతి నెలా ఇస్తే ఎంతో ఆనందపడతాం.
– రేవెల్లి లక్ష్మమ్మ, లబ్ధిదారు మునుగోడు
ఇకనుంచి సన్నబియ్యం తింటాం
ఇంట్లో మేము ఇద్దరమే. మాకు రేషన్షాపుల ద్వారా 12 కిలోలు వస్తాయి. మొన్నటి వరకు దొడ్డు బియ్యం తినలేకపోయాం. మార్కెట్లో సన్న బియ్యాన్ని కొనలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇప్పటి నుంచి రేషన్షాపుల నుంచి వచ్చే సన్న బియ్యం తింటాం.
– వెంకటేశ్వర్లు, ముత్తిరెడ్డికుంట, మిర్యాలగూడ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం కోసం జనం ఎగబడుతున్నారు. చాలాషాపుల్లో సరిపడా బియ్యం రాకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కోటా ప్రకారం పౌర సరఫరాల శాఖ బియ్యం అలాట్ చేసింది. అయితే.. బియ్యం రేషన్ షాపు వద్దకు రావడంలో కొంత ఆలస్యం అవుతోంది. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ప్రతి నెల ఒకటో తేదీన నుంచి పదో తేదీలోగా ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్లి తెచ్చుకునే వారు. అప్పట్లో ఒక్కో రేషన్షాపులో రోజుకు ఐదారు క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేయగా.. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండటంతో లబ్ధిదారులు రేషన్షాపుల వద్ద బారులు దీరుతున్నారు. దీంతో ఒక్కో షాపులో రోజూ 30 నుంచి 40 క్వింటాళ్ల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి వస్తోంది.
రేషన్ కేటాయింపులు ఇలా..
● నల్లగొండ జిల్లాలో 4,66,522 రేషన్ కార్డులు.. 13,85,506 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికి 88,77,999 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రేషన్ షాపులకు 67,50,011 కిలోల బియ్యం ప్రభుత్వం కేటాయించింది.
● సూర్యాపేట జిల్లాలో 3,25,235 కార్డులు ఉండగా, 9,30,259 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికోసం 59,39,941 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, రేషన్ షాపులకు 47,31,478 కిలోలు కేటాయించింది.
● యాదాద్రి జిల్లాలో 2,17,072 కార్డులు ఉండగా, 6,64,043 మంది లబ్ధిదారులు ఉన్నారు. వారికోసం 42,40,348 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా, 34,92,799 కిలోల బియ్యాన్ని కేటాయించింది.
● ప్రస్తుతం సన్న బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ రేషన్ షాపులకు సరఫరా చేస్తోంది. ఇప్పటివరకు కేటాయింపులో 80 శాతం బియ్యం రేషన్ షాపులకు చేరగా, అందులో దాదాపు సగానికిపైగా బియ్యం ప్రజలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఫ రేషన్ షాపులకు భారీగా వస్తున్న లబ్ధిదారులు
ఫ ఐదురోజుల్లోనే చాలాషాపుల్లో రేషన్ కోటా కంప్లీట్
ఫ పోర్టబిలిటీ ఆప్షన్తో పెరిగిన డిమాండ్
ఫ డీలర్ల వద్ద మిగులు బియ్యం నిల్వలకు కాలం చెల్లినట్టే..
సన్న బియ్యం.. క్యూ కట్టిన జనం!
సన్న బియ్యం.. క్యూ కట్టిన జనం!


