గుడిసెల పోరు ఉధృతం | - | Sakshi
Sakshi News home page

గుడిసెల పోరు ఉధృతం

Published Sat, Feb 8 2025 12:30 AM | Last Updated on Sat, Feb 8 2025 12:30 AM

గుడిస

గుడిసెల పోరు ఉధృతం

అమరచింత: పట్టణంలోని నిరుపేదలు ఇంటి స్థలాల హద్దులు చూపాలంటూ రెండున్నరేళ్లుగా గుడిసెలు వేసుకుని ఆందోళన చేస్తున్న పాలకులు పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమయ్యారు. మండల కేంద్రంలోని బస్టాండ్‌ రహదారి పక్కన శనివారం నుంచి రిలేదీక్షలు చేపట్టి తమ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. సర్వేనంబర్‌ 567లోని దుంపాయికుంటలో గల 14 ఎకరాల పొలంలో ఇంటి స్థలాల కోసం కొనుగోలు చేసి 25 ఏళ్ల క్రితం అర్హులైన 400 నిరుపేదలకు ఇంటి పట్టాలను అందించారు. ఇంటి నిర్మాణం చేపట్టేందుకు లబ్ధిదారులు ముందుకు వచ్చినా.. స్థలాలు చూపకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన ఇంటి స్థలాలకు స్వరాష్ట్రం సిద్ధించినప్పటికీ ప్రభుత్వం సమస్యను పరిష్కరించలేకపోయింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పదేళ్లుగా తమకు ఇంటి స్థలాల విషయంలో డబుల్‌ ఇళ్లు అంటూ ఆశ చూపి నట్టేట ముంచిందని వాపోతున్నారు. దీంతో తమకు ఇంటి స్థలం చూపాలనే డిమాండ్‌తో సీపీఎం మద్దతులో 2022 సంవత్సరం నుంచి దుంపాయికుంటో గుడిసెలు వేసుకుని తమ పోరాటం కొనసాగిస్తున్నారు.

కొత్త ప్రభుత్వం కొలువుదీరినా..

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా తమ సమస్య పరిష్కరించడం లేదని గుడిసెల పోరు బాధితులు రిలేదీక్షలకు సిద్ధమయ్యారు. స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి పలుమార్లు తమ గోడు విన్నవించినా.. ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెండు రోజుల రిలే దీక్షలు

గుడిసెల పోరు లబ్ధిదారులకు న్యాయం జరగాలని కోరుతూ వారికి మద్దతుగా శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు రిలేదీక్షలు నిర్వహిస్తున్నాం. సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ముట్టడి నిర్వహించి సమస్య పరిష్కారం అయ్యేవరకు కదలకుండా ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

– జీఎస్‌ గోపి, సీపీఎం మండల కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
గుడిసెల పోరు ఉధృతం 1
1/1

గుడిసెల పోరు ఉధృతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement