
ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించేందుకు నాడు జరిగిన ఉద్యమంలో ఎందరో మహనీయులు ప్రాణం త్యాగం చేశారు. వారిలో రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్లు కూడా ఉన్నారు. వీరు ఆంగ్లేయుల దురాగతానికి బలయ్యారు. ఈ ఘటన జరిగింది ఈరోజే(డిసెంబరు 19). అందుకే వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం.
అది 1927, డిసెంబర్ 19.. భారతదేశానికి చెందిన ముగ్గురు విప్లవ వీరులు ఉరికంబాన్ని ముద్దాడారు. ఆంగ్లేయులు వీరిని ఉరితీశారు. దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్లను ఎప్పటికీ మరువలేం. వీరిని గుర్తుచేసుకుంటూ దేశంలో డిసెంబర్ 19ని బలిదాన్ దివస్గా జరుపుకుంటారు.
రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్లు కాకోరి ఘటనకు కారకులుగా పేర్కొంటూ నాటి బ్రిటీష్ ప్రభుత్వం వారికి ఉరిశిక్ష విధించింది. 1925, ఆగస్టు 9న ఉత్తరప్రదేశ్లోని కాకోరి- అలంనగర్ మధ్య చంద్రశేఖర్ ఆజాద్, రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, సింగ్ తదితర విప్లవవీరులు రైలులో ప్రయాణించారు. ఈ సమయంలో వీరు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ ఘటన అనంతరం చంద్రశేఖర్ ఆజాద్ పోలీసుల నుండి తప్పించుకున్నారు. అష్ఫాక్ ఉల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, రోషన్ సింగ్లు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో బ్రిటీషర్లు వారికి ఉరిశిక్ష విధించారు. ఈ సంఘటనను చరిత్రలో కాకోరి సంఘటనగా పిలుస్తారు. ఈ ఉదంతంలో పాల్గొన్న మరికొంతమంది విప్లవవీరులను బ్రిటీషర్లు జైలులో బంధించారు. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్, ఠాకూర్ రోషన్ సింగ్లు స్వాతంత్యోద్యమంలో బ్రిటీషర్లను ఎదురించిన తీరు విషయానికొస్తే..
ఠాకూర్ రోషన్ సింగ్
ఈయన 1894, జనవరి 22న యూపీలోని షాజహాన్పూర్లోని నెవాడా గ్రామంలో జన్మించారు. అతని తండ్రి పేరు జగదీష్ సింగ్ అలియాస్ జంగీ సింగ్. ఠాకూర్ రోషన్ సింగ్ చదువు పూర్తిచేశాక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. అలాగే గురితప్పని షూటర్గానూ పేరొందారు. కాకోరి ఘటనలో భాగస్వామి అయిన అతనిని తొలుత ఆంగ్లేయులు విచారించారు. న్యాయమూర్తి హామిల్టన్ అతనికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. తరువాత దానిని మరణశిక్షగా మార్చారు. ఈ నేపధ్యంలో రోషన్ సింగ్ నవ్వుతూ ఉరికంబం ఎక్కారు.
రామ్ ప్రసాద్ బిస్మిల్
ఈయన భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ పోరాట యోధునిగా పేరుగాంచారు. ఈయన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో జన్మించారు. కాకోరి సంఘటనలో ప్రధాన పాత్ర పోషించారు. 1918లో జరిగిన మెయిన్పురి ఘటనలో కూడా రామ్ ప్రసాద్ బిస్మిల్ కీలకంగా వ్యవహరించారు. ఈయన గేయ రచయితగానూ పేరొందారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ తన 30 ఏళ్ల వయసులో దేశం కోసం ప్రాణత్యాగం చేశారు.
అష్ఫాఖుల్లా ఖాన్
అష్ఫాఖుల్లా ఖాన్ కూడా షాహన్జహాన్పూర్లో జన్మించారు. కాకోరి ఘటనలో కీలక పాత్ర పోషించారు. అష్ఫాక్ ఉల్లా ఖాన్ ఉర్దూ భాషలో ఉత్తమ కవిగా పేరొందారు. ఈయన పండిట్ రాంప్రసాద్ బిస్మిల్కు అత్యత సన్నిహితుడు.
ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు
Comments
Please login to add a commentAdd a comment