
చెన్నై: అసురక్షిత పద్దతిలో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రైట్ బీరూట్లో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో రెండు రోజుల క్రితం ప్రత్యక్షంగా చూశాం. ఈ ఘటనలో దాదాపు 135 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు. ఇళ్లు, వీధులు సర్వనాశనం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇకనైనా అప్రమత్తం కాకపోతే.. చెన్నై కూడా మరో బీరూట్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. విషయం ఏంటంటే.. తమిళనాడు రాజధాని చెన్నైలో ఏళ్ల తరబడి సుమారు 700 టన్నుల అమ్మోనియం నైట్రేట్ని నిల్వ ఉంచారు. బీరూట్ సంఘటనతో స్థానికులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు దీనిపై స్పందించారు. చెన్నై నగరం బయట సుమారు 700 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందని.. అది కస్టమ్స్ శాఖ కంట్రోల్లో ఉందని అధికారులు తెలిపారు. (బీరూట్ పేలుళ్లు: వైరల్ వీడియోలు)
బాణాసంచా, ఎరువుల తయారీలో వినియోగించే ఈ పేలుడు పదార్థాన్ని ఫైర్వర్క్ను ..పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే శివకాశిలోని ఓ గ్రూపు కోసం ఉద్దేశించినదన్నారు. 2015లో ఈ అమోనియం నైట్రేట్ని చెన్నై పోర్టులో స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మొత్తం 36 కంటెయినర్లు ఉన్నాయని వారు వెల్లడించారు. ఒక్కో కంటెయినర్ లో దాదాపు 20 టన్నుల అమోనియం నైట్రేట్ ఉందన్నారు. దీన్ని శ్రీ అమ్మాన్ కెమికల్స్ అనే సంస్థ అక్రమంగా దిగుమతి చేసుకుందని కస్టమ్స్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై తాము కోర్టుకెక్కామని.. గత ఏడాది నవంబరులోనే కోర్టు రూలింగ్ ఇచ్చిందన్నారు. త్వరలోనే వేలం వేస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment