
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం దరిమిలా మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు డీఎన్ఏ పరీక్షలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకూ 31 మృతదేహాలను ధృవీకరించారు. జూన్ 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్ వెళ్తున్న ఏI171 విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఒక మెడికల్ కాలేజీ కాంప్లెక్స్పై కూలిపోయింది.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతిచెందిన వారిలో 31 మృతదేహాలను డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తించారని ఒక అధికారి తెలిపారు. వీటిలో 12 మృతదేహాలను తీసుకువెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు వచ్చారని తెలిపారు. మృతదేహాలను గుర్తించేందుకు, సంబంధీకులకు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బాధితులను సంప్రదించేందుకు 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. సివిల్ హాస్పిటల్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజనీష్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ 31 మంది మృతదేహాలు సంబంధీకుల డీఎన్ఏతో సరిపోలాయని, వీటిలో 12 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ డీఎన్ఏ సరిపోలిక ప్రక్రియ జరుగుతోందన్నారు. ఆయన మృతదేహాన్ని గుర్తించిన వెంటనే మీడియాకు తెలియజేస్తామని డాక్టర్ పటేల్ పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్ది క్షణాలకే విమానం కూలిపోయింది. అధికారులు తెలిపిన ప్రకారం ఆ రోజు విమానంలో ప్రయాణించినవారి చెక్-ఇన్ లగేజీ సురక్షితంగా ఉందని, గుజరాత్ పోలీసులు ఈ లగేజినంతటినీ ఎయిర్ ఇండియాకు అప్పగించనున్నారు. ఆ తరువాత బ్యాగేజ్ స్టిక్కర్ల ఆధారంగా మృతుల కుటుంబాలకు లగేజీని అందజేయనున్నారు.
ఇది కూడా చదవండి: ఎయిర్ ఇండియా డ్రీమ్లైనర్తో సంబంధాన్ని ఖండించిన టర్కీ