పరిహార భారం ఎయిర్‌ ఇండియాదే | Air India may have to pay Rs 1. 8 crore to kin of each of the crash victims | Sakshi
Sakshi News home page

పరిహార భారం ఎయిర్‌ ఇండియాదే

Jun 14 2025 6:37 AM | Updated on Jun 14 2025 6:37 AM

Air India may have to pay Rs 1. 8 crore to kin of each of the crash victims

ఒక్కో బాధిత కుటుంబానికి రూ.2.80 కోట్లు 

బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానానికి బీమా సదుపాయం 

న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌ దుర్ఘటనలో ఖరీదైన బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ విమానం నామరూపాల్లేకుండా ధ్వంసమైపోయింది. విమానం ఖరీదు, బాధిత కుటుంబాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. విమానానికి బీమా సదుపాయం ఎలాగూ ఉంటుంది. బీమా సంస్థ నుంచి నష్టాన్ని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద ఏవియేషన్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ కాబోతోందని నిపుణులు చెబుతున్నారు. 

ఇక బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత సంబంధిత విమానయాన సంస్థదే. అంటే ఇక్కడ ఎయిర్‌ ఇండియాదే. ఈ విషయంలో స్పష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయి. 1999 నాటి మాంట్రియల్‌ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం.. విమానం ప్రమాదానికి గురై ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగితే, ఎవరైనా క్షతగాత్రులుగా మారితే సంబంధిత విమానయాన సంస్థే ఆ నష్టాన్ని భరించాలి. విమానంలో ప్రయాణికుల వస్తువులు, సామగ్రి ధ్వంసమైనా, అవి వారికి అందడంలో ఆలస్యం జరిగినా పరిహారం ఇవ్వాల్సిందే. 

అహ్మదాబాద్‌ ప్రమాదంలో ఎయిర్‌ ఇండియా సంస్థ ఒక్కో బాధిత కుటుంబానికి 1,51,880 స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌(ఎస్‌డీఆర్‌) ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్‌డీఆర్‌ విలువ దాదాపు రూ.120. ఈ లెక్కన ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఎస్‌డీఆర్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) గతంలోనే ఖరారు చేసింది.  అహ్మదాబాద్‌ ప్రమాదంలో 265 మంది మృతిచెందారు. మాంట్రియల్‌ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం వీరందరికీ కలిపి ఎయిర్‌ ఇండియా యాజమాన్యం రూ.435 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రయాణికులు కాకుండా విమానంలో పనిచేసే సిబ్బందికి చట్టప్రకారం అదనపు పరిహారం ఇవ్వక తప్పదు. 

మాంట్రియల్‌ అంతర్జాతీయ తీర్మానం ప్రకారం విమాన ప్రమాదంపై దర్యాప్తు పూర్తికాక ముందే బాధిత కుటుంబాలకు 16,000 ఎస్‌డీఆర్‌లు(రూ.18 లక్షలు) అడ్వాన్స్‌గా చెల్లించాలి. మాంట్రియల్‌ తీర్మానం కింద ఇచ్చే పరిహారంతో పాటు ఒక్కో కుటుంబానికి అదనంగా రూ.కోటి చొప్పున ఇస్తామని టాటా గ్రూప్‌ ఇప్పటికే ప్రకటించింది. అంటే ఒక్కో కుటుంబానికి రూ.2.80 కోట్ల పరిహారం దక్కబోతోంది. ఎయిర్‌ ఇండియా టాటా గ్రూప్‌ యాజమాన్యంలో ఉన్న సంగతి తెలిసిందే. బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ విమానాన్ని దాదాపు రూ.960 కోట్లకు ఇన్సూరెన్స్‌ చేయించినట్లు తెలిసింది. విమానానికి బీమా, బాధితులకు ఇచ్చే పరిహారం మొత్తంగా చూస్తే ఈ విలువ రూ.1,000 కోట్ల నుంచి రూ.1,250 కోట్ల వరకు ఉంటుంది.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement