
జంటకు అటవీశాఖ వడ్డన
మైసూరు: ఇది ఫోటోషూట్ల కాలమైంది. పెళ్లికి ముందు, ఆ తరువాత, తల్లీ తండ్రి కాబోతుంటే మరోసారి ఇలా అనేక సందర్భాలలో ఫోటోషూట్లు ఉండాల్సిందే. కొన్నిసార్లు ఇవి వెర్రిగా మారుతుంటాయి కూడా. ఇదే మాదిరిగా మైసూరులోని చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకాలోని బండీపుర వన్యప్రాణుల అభయారణ్యంలోకి చొరబడి ఫోటోలు తీసుకున్న జంటకు అటవీశాఖ రూ. 25 వేల జరిమానా వడ్డించింది.
బెంగళూరుకు చెందిన పల్లవి, ఘోష్ అనే వ్యక్తులు విహారానికి వచ్చారు. బండీపుర మంగళ రోడ్డు సమీపంలో అడవిలోకి వెళ్లి ఫోటో షూట్ చేస్తున్నారు. ఇక్కడ ఫోటోలు తీయడం నిషిద్ధం. అటవీ అధికారి నవీన్కుమార్కు పర్యాటకులకు సమాచారం అందించారు. వెంటనే ఆ జంటను పట్టుకుని హెచ్చరిక లేఖ ఇచ్చి రూ. 25 వేలు జరిమానా విధించారు.