
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దానిలో భాగాంగా ఈసారి బడ్జెట్లో నూతన పాలసీని ప్రకటించారు. వాహనాలు పర్యావరణహితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. (చదవండి: బడ్జెట్ 2021: రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం)
వాయు కాలుష్య నివారణకుగాను రూ.2,217 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. కాలం చెల్లిన వాహనాల తుక్కు పాలసీ కింద వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మలా పేర్కొన్నారు. త్వరలో తుక్కు విధానం రాబోతున్న నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీల జోష్ పెరిగింది. ఆటో రంగంలో పాత వాహనాలు నిరుపయోగంగా మారనుండటంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment