Automobile sector
-
ఆటోమొబైల్కు ఇంధనం కావాలి
అమ్మకాల వృద్ధి బలహీనతను, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగంలో జోష్ నింపేందుకు బడ్జెట్లో పలు రకాల ప్రోత్సాహక చర్యలకు చోటు కల్పించాలని పరిశ్రమ గట్టిగా డిమాండ్ చేస్తోంది. 2025 బడ్జెట్పై ఆటోమొబైల్ పరిశ్రమ ఎన్నో అంచనాలతో ఉంది. వినియోగదారుల చేతుల్లో ఆదాయం మిగులు దిశగా చర్యలు చేపట్టాలని, ఇది వాహన విక్రయాల వృద్ధికి ఊతం ఇస్తుందని భావిస్తున్నాయి.ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తుండడంతో చార్జింగ్ వసతులు సహా, ఈవీ ఎకోసిస్టమ్ బలోపేతానికి మరిన్ని చర్యలు అవసరమని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. అదే సమయంలో పర్యావరణ అనుకూల గ్రీన్ టెక్నాలజీలకు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు విధానపరమైన మద్దతు అవసరమని పేర్కొన్నాయి. ⇒ పాత వాహనాల తుక్కు విధానానికి బడ్జెట్లో మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. దీనివల్ల కొత్త తరం వాహనాల డిమాండ్ పెరుగుతుంది. ⇒ ఈవీల తయారీకి ప్రోత్సాహకాల పరంగా బలమైన మద్దతు అవసరం. కేవలం వినియోగదారులకే కాకుండా, పర్యావరణ అనుకూల పరిష్కారాలను అనుసరించే వ్యాపార సంస్థలకూ ప్రోత్సాహకాలు ప్రకటించాలి. ⇒ ఆవిష్కరణలకు, టెక్నాలజీకి ఊతమిచ్చేలా పీఎల్ఐ పథకాలను మరింతగా అందుబాటులోకి తీసుకురావాలి. ⇒ఈవీ కొనుగోలు, ఈవీ సదుపాయాలకు సంబంధించి రుణాలపై అధిక వడ్డీ రేట్లు సవాలుగా మారాయి. వీటిని అందుబాటులోకి తీసుకురావాలి. రుణ వితరణ పరిస్థితులను సులభతరంగా మార్చాలి. ⇒ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు, సురక్షిత రహదారుల కోసం బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయించాలి. – సాక్షి, బిజినెస్ డెస్క్పూర్తిస్థాయి గ్రీన్ టెక్నాలజీలకు, ప్రత్యామ్నాయ ఇంధనాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఫలితాన్నిచ్చే విధానాలను ప్రభుత్వం తీసుకురావాలి. దీనివల్ల ఒకటికి మించిన మొబిలిటీ పరిష్కారాలను పెద్ద ఎత్తున వినియోగంలోకి తీసుకురావచ్చు. – విక్రమ్ గులాటీ, టయోటా కిర్లోస్కర్ మోటార్ కంట్రీ హెడ్భిన్నమైన ఆటోమోటివ్ టెక్నాలజీలకు సానుకూలమైన పన్నుల విధానంపై దీర్ఘకాలిక దృష్టి అవసరం. వివిధ రకాల వాహనాలకు, విడి భాగాలకు సులభతర జీఎస్టీ రేట్లను ప్రకటించాలి. ఉత్పత్తుల అభివృద్ధికి సుదీర్ఘకాలం పడుతుంది. ఇందుకు గణనీయమైన పెట్టుబడులు అవసరం అవుతాయి. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – పియూష్ ఆరోరా, ఫోక్స్వ్యాగన్ ఇండియా సీఈవోవినియోగదారుల వ్యయాలను ప్రోత్సహించే దిశగా బడ్జెట్లో చర్యలు ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే, ఈవీల వినియోగాన్ని పెంచేందుకు తగిన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమ అవసరాలను తీర్చే దిశగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలపై పెట్టుబడులు పెట్టాలి. – జ్యోతి మల్హోత్రా, వోల్వో కార్ ఇండియా ఎండీ -
ఈ ఏడాది వారికే ఎక్కువ జీతాలు: సర్వేలో కీలక విషయాలు
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ.. జీతాలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఉద్యోగులకు సగటున 9.4 శాతం పెంపు (హైక్) ఉండే అవకాశం ఉంటుందని, HR కన్సల్టింగ్ సంస్థ మెర్సెర్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే వెల్లడించింది. గత ఐదేళ్లుగా ఉద్యోగుల జీతాలు పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంది.2020లో ఉద్యోగుల వేతనాలు 8 శాతం పెరిగాయి. ఈ ఏడాది 9.4 శాతం పెరగనున్నట్లు అంచనా. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, కన్స్యూమర్ గూడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమోటివ్, ఇంజినీరింగ్ వంటి విభిన్న పరిశ్రమలతో విస్తరించి ఉన్న భారతదేశంలోని 1,550 కంటే ఎక్కువ కంపెనీలను సర్వే చేసి.. జీతాల పెంపు గురించి మెర్సెర్ టోటల్ రెమ్యూనరేషన్ సర్వే ప్రస్తావించింది.ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుదల, ప్రభుత్వం నేతృత్వంలోని 'మేక్ ఇన్ ఇండియా' చొరవ కారణంగా ఆటోమోటివ్ రంగం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కాబట్టి ఈ రంగంలో జీతాలు 8.8 శాతం నుంచి 10 శాతం వరకు పెరగవచ్చు. ఆ తరువాత స్థానంలో మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ విభాగాలు ఉన్నాయి. ఈ రంగాల్లోని ఉద్యోగులకు జీతాలు జీతాలు 8 శాతం నుంచి 9.7 శాతం వరకు పెరగవచ్చు.జీతాలను మాత్రమే కాకుండా.. ఈ ఏడాది 37 శాతం సంస్థలు విభిన్న రంగాలలో.. ఉద్యోగులను కూడా పెంచుకోవడానికి చూస్తున్నట్లు సమాచారం. వివిధ అంశాలలో నైపుణ్యం కలిగిన వారికే ఎక్కువగా ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో సుమారు 11.9 శాతం ఉద్యోగులు స్వచ్చందంగా ఉద్యోగాల నుంచి వైదొలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఈ సంవత్సరం కొన్ని సంస్థలు ప్రతిభను ఆకర్షించడానికి, టర్నోవర్ను తగ్గించడానికి.. శ్రామికశక్తి డిమాండ్లను పరిష్కరించేందుకు కావలసిన ప్రయత్నాలను చేస్తున్నాయి. అదే సమయంలో కొన్ని సంస్థలు పనితీరు ఆధారంగా వేతనాలు చెల్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.కరోనా మహమ్మారి సమయంలో చాలామంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. అయితే ఆ తరువాత కొంతమంది ఉద్యాగాలను పొందినప్పటికీ.. ఇప్పుడు కూడా కొన్ని దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. ఈ జాబితాలో గూగుల్, మెటా వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. కాగా ఈ ఏడాది చాలా కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకోనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఈ ఏడాది చాలామంది ఫ్రెషర్స్ ఉద్యోగాలను పొందనున్నారు.టీసీఎస్లో 40వేల ఉద్యోగాలుటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) ఈ ఏడాది 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఐటీ దిగ్గజం చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) 'మిలింద్ లక్కడ్' తెలిపారు. టీసీఎస్ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఏకీకృతం చేస్తోంది. కాబట్టి ఏఐ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు E0 నుంచి E3.. అంతకంటే ఎక్కువ స్థాయిలలోని అన్ని స్థాయిల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. -
సీజన్ ముగిసినా.. సందడే సందడి
పండుగ సీజన్ ముగిసిపోయినా కార్ల విషయంలో మాత్రం ఆఫర్ల పర్వం కొనసాగుతూనే ఉంది. వివిధ కార్ల కంపెనీలు నగదు డిస్కౌంట్లు, ఇతరత్రా బహుమతులతో కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆటో డీలర్ల అసోసియేషన్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా వాహన రిటైలర్ల దగ్గర 75–80 రోజులకు సరిపోయే నిల్వలు పేరుకుపోయాయి. వీటి విలువ సుమారు రూ. 75,000 కోట్లుగా ఉంటుంది. వాహన విక్రయాల గణాంకాలకు సంబంధించిన వాహన్ పోర్టల్ ప్రకారం నవంబర్లో తొలి ఇరవై రోజుల్లో 1,77,362 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరోవైపు, కార్ల కంపెనీలన్నీ కలిసి నవంబర్లో సుమారు 3,25,000 నుంచి 3,30,000 వరకు వాహనాలను హోల్సేల్గా డీలర్లకు సరఫరా చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వాహన నిల్వలను తగ్గించుకోవడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఏడాది చివరన పాత స్టాక్ను క్లియర్ చేసుకునేందుకు కంపెనీలు సాధారణంగా ఆఫర్లు ఇస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీలర్ల దగ్గర ఏకంగా 65–70 రోజులకు సరిపడా నిల్వలు పేరుకుపోయాయి. దీంతో సంస్థలు భారీగా డిస్కౌంట్లకు తెరతీశాయి. ఇది ఒక రకంగా కార్ల కొనుగోలుదార్లకు అసాధారణ అవకాశంలాంటిదే’’ అని ఎస్అండ్పీ గ్లోబల్ మొబిలిటీ వర్గాలు తెలిపాయి.30% వరకు..కంపెనీలు అధికారికంగా రేట్ల తగ్గింపు లేదా డిస్కౌంట్లపై ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ డిసెంబర్ 31 వరకు డీలర్ల దగ్గర చాలామటుకు మోడల్స్ ధరలపై (ఎక్స్షోరూమ్) 20–30 శాతం డిస్కౌంటును కొనుగోలుదార్లు ఆశించవచ్చని ఎఫ్ఏడీఏ వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి డిస్కౌంట్లు ఉంటాయని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. అంతగా అమ్ముడు కాని మోడల్స్ పేరుకుపోయినా, లేక అమ్ముడవుతున్న స్థాయికి మించి ఉత్పత్తి చేసినా.. ఆ నిల్వలను వదిలించుకోవడానికి భారీ డిస్కౌంట్లు ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. మరోవైపు, పెళ్ళిళ్ల సీజన్, ప్రమోషనల్ ఆఫర్లు మొదలైనవి ప్యాసింజర్ కార్ల అమ్మకాలు పెరగడానికి దోహదపడగలవని ఆశిస్తున్నట్లు ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. గణనీయంగా నిల్వలు పేరుకుపోయి ఉన్నందున తయారీ కంపెనీలు సరఫరాలను క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. ఆఫర్ల వెల్లువ.. → ఎరీనా షోరూమ్లలో మారుతీ సుజుకీ ఇండియా తమ ఆల్టో కే10, వ్యాగన్ఆర్, సెలీరియో, ఎస్ప్రెసో కార్లపై రూ. 20,000–35,000 వరకు రిబేట్ ఇస్తోంది. వేరియంట్లను బట్టి స్విఫ్ట్పై రూ. 25,000–50,000 వరకు, బ్రెజాపై రూ. 10,000–20,000 వరకు డిస్కౌంట్ ఉంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ. 15,000 ఎక్సే్చంజ్ బోనస్, మోడల్ను బట్టి రూ. 2,100–2,300 వరకు కార్పొరేట్ డిస్కౌంట్లకు ఇది అదనమని పేర్కొన్నాయి. → హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ గ్రాండ్ ఐ10 నియోస్పై రూ. 35,000–45,000 వరకు, ఆరాపై రూ. 20,000 వరకు, ఐ20పై 20,000–45,000 వరకు, ఎక్స్టర్పై (నిర్దిష్ట వేరియంట్స్పై) రూ. 20,000–30,000 వరకు, వెన్యూపై 45,000–50,000 వరకు (వేరియంట్ను బట్టి), వెర్నాపై రూ. 70,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఇక టక్సన్పై రూ. 50,000, అయానిక్ 5 ఈ–ఎస్యూవీపై రూ. 2 లక్షల మేర డిస్కౌంట్లు ఇస్తోంది. → టాటా మోటార్స్ కూడా అ్రల్టోజ్పై రూ. 25,000, పంచ్పై (ఐసీఈ వెర్షన్) రూ. 20,000 నగదు డిస్కౌంట్ ఇస్తోంది. అటు టియాగో హ్యాచ్బ్యాక్, టిగోర్ సెడాన్, నెక్సాన్ ఎస్యూవీల ధరలు (ఐసీఈ మోడల్స్) వరుసగా రూ. 4.99 లక్షలు, రూ. 5.99 లక్షలు, రూ. 7.99 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. → మహీంద్రా అండ్ మహీంద్రా కూడా కొన్ని మోడల్స్లో నిర్దిష్ట వేరియంట్లపై, లభ్యతను బట్టి, పరిమిత కాలంపాటు ఆఫర్లు అందిస్తోంది. బొలెరో నియోపై రూ. 70,000 వరకు, స్కారి్పయో ఎన్పై రూ. 50,000, థార్ 4 ్ఠ4పై రూ. 1.25 లక్షలు క్యాష్ డిస్కౌంటు ఇస్తోంది. ఎక్స్యూవీ 400 ఎలక్ట్రిక్పై ఏకంగా రూ. 3 లక్షల నగదు డిస్కౌంట్ ఉంటోంది. → హోండా కార్స్ ఇండియా, జీప్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా, ఫోక్స్వ్యాగన్ ఇండియా తదితర కార్ల కంపెనీలు కూడా ఏడాది ఆఖరు నాటికి నిల్వలను తగ్గించుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నాయి.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
సన్రూఫ్.. సూపర్ క్రేజ్!
బీచ్ రోడ్డులోనో... ఫారెస్ట్ దారిలోనో కారులో అలా ఓ లాంగ్ డ్రైవ్కెళ్లాలని ఎవరికుండదు చెప్పండి? దీంతో పాటు కారులో సన్రూఫ్ కూడా ఉంటే... మజామజాగా ఉంటుంది కదూ! దేశంలో కారు ప్రియుల మది దోచేస్తున్న క్రేజీ ఫీచర్ ఇది. ఒకప్పుడు లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ అదిరిపోయే ఫీచర్ ఇప్పుడు చిన్న కార్లలోనూ వచ్చి చేరుతుండటం దానికున్న క్రేజ్కు నిదర్శనం!దేశీ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు సన్/మూన్ రూఫ్ మాంచి ట్రెండింగ్లో ఉంది. యువ కస్టమర్ల జోరుతో ఈ ఫీచర్ ‘టాప్’లేపుతోంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు ఎస్యూవీలు, సెడాన్లతో పాటు హ్యాచ్బ్యాక్స్లోనూ దీన్ని చేర్చేందుకు సై అంటున్నాయి. డిమాండ్ ‘రూఫ్’ను తాకుతుండటంతో ప్రపంచస్థాయి తయారీ సంస్థలు దీన్ని సొమ్ము చేసుకోవడానికి తహతహలాడుతున్నాయి. మార్కెట్లో అధిక వాటా కోసం భారీ పెట్టుబడులతో ఉత్పత్తి పెంచే పనిలో ఉన్నాయి. నెదర్లాండ్స్కు చెందిన ఇనాల్ఫా రూఫ్ సిస్టమ్స్ దాని భాగస్వామ్య సంస్థ గాబ్రియెల్ ఇండియాతో కలిసి తయారీని పరుగులు పెట్టిస్తోంది. వచ్చే ఏడాది కాలంలో సన్రూఫ్ల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనేది ఈ జాయింట్ వెంచర్ (ఐజీఎస్ఎస్) లక్ష్యం. ఈ ఏడాది ఆరంభంలో చెన్నైలో తొలి ప్లాంట్ను ఏర్పాటు చేసిన ఐజీఎస్ఎస్కు ఏటా 2 లక్షల సన్రూఫ్ల తయారీ సామర్థ్యం ఉంది. హ్యుందాయ్, కియా కంపెనీలకు ఇది సన్రూఫ్లను సరఫరా చేస్తోంది. ఇక జర్మనీకి చెందిన గ్లోబల్ సన్రూఫ్ తయారీ దిగ్గజం వెబాస్టో కూడా తయారీ గేరు మార్చింది. ప్రస్తుతం ఏటా 5 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుండగా... 2027 నాటికి రెట్టింపు స్థాయిలో 9.5 లక్షల యూనిట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. రూ.1,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తోంది. ట్రెండ్ రయ్ రయ్... దేశీ వాహన రంగంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువ కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా కొంగొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేందుకు కార్ల కంపెనీలు పోటీ పడుతున్నాయి. అత్యధికంగా కారు ప్రియులు కోరుకుంటున్న ఫీచర్లలో సన్రూఫ్ శరవేగంగా దూసుకుపోతోందని యూనో మిండా చైర్మన్, ఎండీ ఎన్కే మిండా చెబుతున్నారు. దేశంలోని దిగ్గజ వాహన విడిభాగాల సంస్థల్లో ఇది ఒకటి. సన్రూఫ్ల తయారీ కోసం తాజాగా జపాన్కు చెందిన ఐసిన్ కార్ప్తో సాంకేతిక లైసెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రపంచంలోని టాప్–10 వాహన విడిభాగాల ఉత్పత్తి కంపెనీల్లో ఐసిన్ కార్ప్ కూడా ఒకటి. కాగా, యూనో మిండా 80,000 యూనిట్ల వార్షిక సామర్థ్యంతో హరియాణాలో కొత్త ప్లాంట్ నెలకొల్పుతోంది. ‘ఈ మధ్య కాలంలో సన్రూఫ్ల వాడకం ఓ రేంజ్లో పెరుగుతోంది. గతంలో బడా ఎస్యూవీలు, లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ ట్రెండ్ మరింత జోరందుకోనుంది. ఇప్పుడు హ్యాచ్బ్యాక్ (చిన్న కార్లు) కస్టమర్లు సైతం ఈ ఫీచర్ కోసం ఎగబడుతుండటమే దీనికి కారణం’ అని మిండా వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరే ఇక్కడా వినూత్న ఫీచర్లు, కస్టమైజేషన్లకు ప్రాధాన్యమిచ్చే ట్రెండ్ కనిపిస్తోందన్నారు.స్టేటస్ సింబల్... ఇప్పుడు కారే కాదు అందులోని ప్రీమియం ఫీచర్లు కూడా స్టేటస్ సింబల్గా మారుతున్నాయి. ఇందులో సన్రూఫ్ కూడా ఒకటి. క్రూయిజ్ కంట్రోల్, కళ్లు చెదిరే డిస్ప్లేలు, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లాంటి ఫీచర్లకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. వీటి వాడకం అరుదుగానే ఉన్నప్పటికీ, భారతీయ రోడ్డు పరిస్థితులకు పెద్దగా ఉపయోగకరం కానప్పటికీ.. కస్టమర్లు మరిన్ని ప్రీమియం ఫీచర్లు కోరుకుంటుండటంతో కార్ల కంపెనీలు వాటిని తప్పనిసరిగా అందించాల్సిన పరిస్థితి నెలకొందని జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా పేర్కొన్నారు.ప్రతి నాలుగు కార్లలో ఒకటి... జాటో డైనమిక్స్ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు కార్లలో ఒక కారుకు (27.5%) ఈ లగ్జరీ ఫీచర్ ఉంది. ఐదేళ్ల క్రితం 12.7%తో పోలిస్తే కస్టమర్లు దీనికి ఎలా ఫిదా అవుతున్నారనేది ఈ జోరు చాటిచెబుతోంది. కాగా వచ్చే ఐదేళ్లలో (2029 నాటికి) ఈ విభాగంలో 17.6 శాతం వార్షిక వృద్ధి (సీఏజీఆర్) నమోదవుతుందనేది వాహన పరిశ్రమ అంచనా. ముఖ్యంగా ఎస్యూవీల్లో సన్రూఫ్ ఫీచర్కు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ ఏడాది జనవరి–ఆగస్ట్ మధ్య ఏకంగా 44.7% వృద్ధి ఈ విభాగంలో నమోదైంది. మరోపక్క, భారతీయ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తయారీ సంస్థలు అధునాతన గ్లాస్ టెక్నాలజీతో సన్రూఫ్లను ప్రవేశపెడుతున్నాయి. వేడిని బాగా తట్టుకోవడం, యూవీ కిరణాల నుంచి రక్షణతో పాటు సన్రూఫ్లను ‘స్మార్ట్రూఫ్’లుగా మార్చేస్తున్నాయి. పానోరమిక్ సన్రూఫ్లు కారు లోపల మరింత విశాలమైన స్పేస్ ఫీలింగ్ను కూడా అందిస్తాయని భాటియా చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
నిస్సాన్లో భారీగా ఉద్యోగాల కోత
టోక్యో: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ కార్ప్ అమ్మకాలు క్షీణించి, నష్టాలు పెరిగిపోవడంతో భారీ ఉద్యోగాలు, వేతనాల కోత దిశగా కఠిన చర్యలు ప్రకటించింది. సెపె్టంబర్ త్రైమాసికంలో 9.3 బిలియన్ యెన్ల నష్టాన్ని మూటగట్టుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో 191 బిలియన్ యెన్ల లాభం నుంచి, భారీ నష్టాల్లోకి వెళ్లడం గమనార్హం. అంతేకాదు త్రైమాసిక విక్రయాలు 3.1 ట్రిలియన్ యెన్ల నుంచి 2.9 ట్రిలియన్ యెన్లకు క్షీణించాయి. దీంతో అంతర్జాతీయంగా 9,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు నిస్సాన్ ప్రకటించింది. సంస్థకున్న 1,33,000 మంది ఉద్యోగుల్లో ఇది 6 శాతానికి సమానం. అంతేకాదు తయారీని 20 శాతం తగ్గించుకోనున్నట్టు తెలిపింది. తన వేతనంలో 50 శాతం కోత విధించుకుంటున్నట్టు కంపెనీ సీఈవో మకోటో ఉచ్చిద ప్రకటించారు. అయితే, ఏ ప్రాంతంలో సంస్థ పనితీరుపై ప్రభావం పడిందన్నది ఉచ్చిద వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి కంపెనీ లాభం 19.2 బిలియన్ యెన్లకు తగ్గిపోయింది. -
మారుతీ సుజుకీ కార్ల ఉత్పత్తి 16% డౌన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్లో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తిని 16 శాతం తగ్గించింది. అయితే, యుటిలిటీ వాహనాల ఉత్పత్తిని 33 శాతం పెంచింది. అక్టోబర్లో ప్యాసింజర్ కార్ల ఉత్పత్తి 1,06,190 యూనిట్ల నుంచి 89,174 యూనిట్లకు తగ్గినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు కంపెనీ తెలిపింది. మరోవైపు, బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, జిమ్నీ, ఎక్స్ఎల్6 వంటి యుటిలిటీ వాహనాలతో పాటు టయోటా కిర్లోస్కర్ మోటర్స్కి సఫరా చేసే వాహనాల ఉత్పత్తిని 54,316 యూనిట్ల నుంచి 72,339 యూనిట్లకు పెంచినట్లు పేర్కొంది. మినీ కార్లు అయిన ఆల్టో, ఎస్–ప్రెసో మొదలైన వాటి ఉత్పత్తి 14,073 యూనిట్ల నుంచి 12,787 యూనిట్లకు తగ్గింది. అటు బాలెనో, సెలీరియో, డిజైర్, ఇగి్నస్, స్విఫ్ట్, వ్యాగన్ఆర్తో పాటు టయోటా కిర్లోస్కర్ మోటర్స్కి కూడా సరఫరా చేసే కాంపాక్ట్ కార్ల ఉత్పత్తి 90,783 నుంచి 75,007 యూనిట్లకు తగ్గింది. -
కాంపాక్ట్ ఎస్యూవీలు.. టాప్గేర్లో అమ్మకాలు..
ఒకపక్క కార్ల కంపెనీలు బంపీ రైడ్తో సతమతమవుతున్నప్పటికీ... స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీలు) తగ్గేదేలే అంటున్నాయి. భారతీయులకు తొలి చాయిస్గా మారుతున్నాయి. నిన్నమొన్నటిదాకా అమ్మకాల్లో పైచేయి సాధించిన హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్ ఆధిపత్యానికి తెరపడింది. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల విభాగంగా కాంప్టాక్ట్ ఎస్యూవీలు కేక పుట్టిస్తున్నాయి!! దేశంలో కారు ప్రియుల కొనుగోలు ట్రెండ్ శరవేగంగా మారిపోతోంది. 4 మీటర్ల లోపు పొడవైన హ్యాచ్బ్యాక్స్, సెడాన్ల (కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లు) హవాకు బ్రేక్లు పడుతున్నాయి. ఎస్యూవీలు రాజ్యమేలుతున్న కాలంలో కూడా అమ్మకాల్లో టాప్లేపిన ఈ సెగ్మెంట్ను తొలిసారిగా కాంపాక్ట్ ఎస్యూవీలు ఓవర్టేక్ చేశాయి. భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సొసైటీ (సియామ్) తాజా లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం (2024–25, ఏప్రిల్–సెప్టెంబర్)లో 4 మీటర్ల లోపు కాంపాక్ట్ ఎస్యూవీలు దుమ్మురేపాయి. ఈ సెగ్మెంట్లో 6,71,674 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇదే తరుణంలో కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల సేల్స్ 5,58,173 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే ఈ రెండు విభాగాల అమ్మకాలు రివర్స్ కావడం విశేషం. రివర్స్ గేర్...గతేడాది వరకు దేశంలో కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల జోరుకు తిరుగేలేదు. అమ్మకాల్లో ఈ విభాగానికిదే టాప్ ర్యాంక్. నాలుగేళ్ల క్రితమైతే కాంపాక్ట్ ఎస్యూవీలతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో సేల్స్ నమోదయ్యాయి. ఐదేళ్లకు ముందు చూస్తే, కాంపాక్ట్ ఎస్యూవీ 1 అమ్ముడైతే కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లు 3 హాట్ కేకుల్లా రోడ్డెక్కేవి. ఇదంతా గతం. దేశంలో నవతరం దూకుడు... ఆటోమొబైల్ రంగం ముఖచిత్రాన్ని మలుపుతిప్పుతోంది. మరోపక్క, ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్యూవీలు అందుబాటుల ధరల్లో లభిస్తుండటంతో గ్రామీణ కార్ లవర్స్ సైతం వీటికే సై అంటున్నారు. దీంతో చిన్న ఎస్యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంటోందనేది నిపుణుల మాట. టాటా పంచ్, నెక్సాన్, మారుతీ ఫ్రాంక్స్, మహీంద్రా ఎక్స్యూవీ 3ఎక్స్ఓ, హ్యుందాయ్ వెన్యూ, ఎక్స్టర్, కియా సోనెట్, మారుతీ బ్రెజా, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, సిట్రాన్ సీ3, ఎయిర్క్రాస్ వంటివి కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో బాగా అమ్ముడవుతున్న మోడల్స్. వీటిలో కొన్ని కార్లు నెలకు 10,000 అమ్మకాల మార్కును కూడా అధిగమిస్తుండటం విశేషం! ఇక కాంపాక్ట్ ప్యాసింజర్ కార్ల విషయానికొస్తే, మారుతీదే పూర్తి ఆధిపత్యం. స్విఫ్ట్, వ్యాగన్ ఆర్, బాలెనో, డిజైర్ మార్కెట్ను శాసిస్తున్నాయి. ఇతర కార్లలో టాటా టిగోర్, ఆ్రల్టోజ్, టియాగో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10, ఐ20 వంటివి అంతంతమాత్రంగానే అమ్ముడవుతుండటం గమనార్హం. హ్యాచ్బ్యాక్, సెడాన్ మోడల్స్ డౌన్... కారణాలేవైనప్పటికీ గత కొంతకాలంగా కాంపాక్ట్ పాసింజర్ కారు మోడల్స్ కనుమరుగవుతున్నాయి. ఫోర్డ్ మోటార్స్ 2022లో ఇండియా నుండి దుకాణం సర్దేయడంతో ఫిగో, ఫిగో యాస్పైర్, ఫ్రీస్టయిల్, ఫియస్టా వంటి బాగా పాపులర్ మోడల్స్ అందుబాటులో లేకుండా పోయాయి. ఫోర్డ్ నిర్ణయంతో హాట్ ఫేవరెట్ ఎకోస్పోర్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ సైతం మార్కెట్కు దూరం కావడం గమనార్హం. హోండా సైతం జాజ్, బ్రియో వంటి హ్యాచ్బ్యాక్ల అమ్మకాలను అపేసింది. హోండా సిటీ సేల్స్ కూడా నేలచూపులు చూస్తున్నాయి. మరోపక్క, డాట్సన్ కూడా 2022లో గుడ్బై చెప్పడంతో గో, రెడీగో వెళ్లిపోయాయి. టయోటా లివా, ఫోక్స్వ్యాగన్ అమియో, పోలో సైతం సెలవు తీసుకున్నాయి. ఐదేళ్ల క్రితం దాదాపు 30 వరకు ప్యాసింజర్ కారు మోడల్స్ కస్టమర్లకు విభిన్న ఆప్షన్లతో కనువిందు చేయగా.. ఇప్పుడీ సంఖ్య 15కు పడిపోవడం విశేషం. ఒకపక్క మోడల్స్ తగ్గిపోవడంతో పాటు కస్టమర్ల కొనుగోలు ధోరణి మారుతుండం కూడా కాంపాక్ట్ ప్యాసింజర్ కార్లకు గండికొడుతోంది!!ఆకట్టుకుంటున్న ఫీచర్లు... కాస్త ధరెక్కువున్నప్పటికీ, మరిన్ని ఫీచర్లు లభిస్తుండటంతో చాలా మంది కస్టమర్లు కాంపాక్ట్ ఎస్యూవీలకు అప్గ్రేడ్ అవుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే విశాలమైన స్పేస్, బలిష్టమైన రూపంతో పాటు మెరుగైన డ్రైవింగ్ అనుభవం వల్ల కూడా కస్టమర్లు వీటికి జై కొడుతున్నారని మారుతీ మాజీ సేల్స్, మార్కెటింగ్ హెడ్ అభిప్రాయపడ్డారు. ‘ఎస్యూవీల సీటింగ్ పొజిషన్ ఎత్తు గా ఉండటం వల్ల కేబిన్ నుండి రోడ్డు వ్యూ బాగుంటుంది. అంతేకాకుండా, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ వల్ల మన దగ్గరు న్న గతుకుల రోడ్లపై డ్రైవింగ్కు చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే వీటికి మంచి ఆదరణ లభిస్తోంది’ అని చెప్పారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
హ్యుందాయ్ మెగా ఐపీవో రెడీ
దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ దేశీ అనుబంధ యూనిట్ మెగా పబ్లిక్ ఇష్యూకి రంగం సిద్ధమైంది. 2003లో జపనీస్ అగ్రగామి మారుతీ సుజుకీ ఐపీవో తర్వాత మరో టాప్ ఆటోమొబైల్ సంస్థ లిస్ట్ కానుంది. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీవోగా హ్యుందాయ్ సరికొత్త రికార్డ్ సృష్టించనుంది. న్యూఢిల్లీ: రెండు దశాబ్దాల తదుపరి మరో ఆటో రంగ దిగ్గజం నిధుల సమీకరణకు వస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్(హెచ్ఎంఐఎల్) పబ్లిక్ ఇష్యూ ఈ నెల15న ప్రారంభంకానుంది. 17న ముగియనున్న ఇష్యూకి ఒక్కో షేరుకి రూ. 1,865–1,960 చొప్పున ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ 14,21,94,700 షేర్లను విక్రయానికి ఉంచనుంది. తద్వారా 3.3 బిలియన్ డాలర్లు(రూ. 27,870 కోట్లు) సమీకరించాలని భావిస్తోంది. దీంతో ఇంతక్రితం 2022 మే నెలలో బీమా దిగ్గజం ఎల్ఐసీ రూ. 21,000 కోట్లు సమీకరించిన ఇష్యూని అధిగమించనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు నెలకొల్పనుంది. లిస్టింగ్ తదుపరి కంపెనీ మార్కెట్ విలువ 19 బిలియన్ డాలర్ల (రూ.1.6 లక్షల కోట్లు)కు చేరనుంది.క్రెటా ఈవీ వస్తోంది.. దేశీయంగా కార్ల తయారీ, అమ్మకాలలో మారుతీ సుజుకీ తదుపరి హ్యుందాయ్ మోటార్ ఇండియా రెండో ర్యాంకులో నిలుస్తున్న సంగతి తెలిసిందే. 2025 జనవరి–మార్చి కాలంలో క్రెటా ఈవీని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు హెచ్ఎంఐఎల్ పేర్కొంది. రానున్న కొన్నేళ్లలో మరో 4 ఈవీలను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. 1996లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ వివిధ విభాగాలలో 13 మోడళ్లను విక్రయిస్తోంది. ప్రపంచంలోనే ఇండియా అత్యంత ఆసక్తికరమైన మార్కెట్గా కంపెనీ ఎండీ, సీఈవో అన్సూ కిమ్ ఐపీవో రోడ్షో సందర్భంగా పేర్కొన్నారు. ఐపీవో ద్వారా కంపెనీ బ్రాండ్ మరింత మందికి చేరువవు తుందన్నారు. -
Lok sabha elections 2024: ఎన్నికల ఎఫెక్ట్... టూ వీలర్లు, ఫ్రిజ్ సేల్స్ రయ్!
సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆటోమొబైల్, గృహోపకరణాల మార్కెట్లో సందడి నెలకొంది. ముఖ్యంగా ఎంట్రీ లెవెల్ టూ వీలర్లు, గృహోపకరణాలకు ఒక్కసారిగా డిమాండ్ పుంజుకుంది. ఇదంతా ఎన్నికల చలవేనంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిజానికి వీటి కొనుగోళ్లు కొద్ది నెలలుగా తీవ్రంగా మందగించాయి. ఎన్నికల హడావుడి మొదలయ్యాక ఏప్రిల్, మే నెలల్లో వీటి అమ్మకాలు భారీగా పెరిగాయి. 125 సీసీ వరకు ఇంజిన్ సామర్థ్యం, రూ.లక్ష వరకు ధర ఉన్న చిన్న టూ వీలర్ల విక్రయాల్లో 33 శాతం వృద్ధి నమోదైందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా వెల్లడించారు. కరోనా విలయం తర్వాత ప్రీమియం టూ వీలర్లకు డిమాండ్ పుంజుకుంటున్నా ఎంట్రీ లెవెల్ విభాగంలో మాత్రం అమ్మకాలు నత్తనడకన వచ్చాయి. ‘‘కానీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వాలిచ్చే ప్రోత్సాహకాలకు తోడు పారీ్టలు సైతం భారీగా ఖర్చుకు తెరతీయడంతో అల్పాదాయ కుటుంబాల చేతిలో డబ్బులు ఆడుతున్నాయి. దాంతో చిన్న టూ వీలర్లు, ఫ్రిజ్ల వంటివాటిని భారీగా కొంటున్నారు’ అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మండుటెండల దెబ్బకు రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు పెరిగాయి. ఎంట్రీ లెవెల్ సింగిల్ డోర్ ఫ్రిజ్లు శరవేగంగా అమ్ముడవుతున్నాయని గోద్రెజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ‘‘చాలాకాలంగా ఈ విభాగంలో అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇప్పుడు మాత్రం ప్రీమియం సెగ్మెంట్తో సమానంగా వీటి సేల్స్ నమోదవుతున్నాయి’’ అని వివరించారు. ఎన్నికల ఖర్చు రికార్డ్... రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం 2024లో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వ్యయం గత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టనుంది. ఈ ఏడాది ఎన్నికల సీజన్లో పార్టీలు, అభ్యర్థుల ఖర్చు రూ.1.35 లక్షల కోట్లు దాటొచ్చని స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)కు చెందిన ఎన్. భాస్కరరావు అంచనా వేశారు. -
నిస్సాన్ మోటార్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటర్ ఇండియా ఎండీగా సౌరభ్ వత్స నియమితులయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న రాకేశ్ శ్రీవాస్తవ మార్చి 31తో రిటైరవుతున్నారు. ఇటీవల జనవరి 15నే కంపెనీలో ఆయన డిప్యుటీ ఎండీగా నియమితులయ్యారు. అనుభవజు్ఞడైన వత్స సారథ్యం .. కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడగలదని నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ విభాగం ప్రెసిడెంట్ ఫ్రాంక్ టోరెస్ తెలిపారు. -
భారత్లో ‘రిఫరెన్స్’ ఇంధనం ఉత్పత్తి షురూ..
న్యూఢిల్లీ: దేశీయంగా ‘రిఫరెన్స్’ పెట్రోల్, డీజిల్ ఇంధనాల తయారీ ప్రారంభమైంది. తద్వారా ఆటోమొబైల్స్ టెస్టింగ్ కోసం ఉపయోగించే ప్రత్యేక ఇంధనాలను తయారు చేసే దేశాల సరసన భారత్ కూడా చేరింది. చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఈ ఇంధనాలను ఆవిష్కరించారు. దిగుమతులను తగ్గించుకుని భారత్ స్వావలంబన సాధించే దిశగా రిఫరెన్స్ ఇంధనాల ఉత్పత్తి మరో కీలక అడుగని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మూడు సంస్థలే ఈ ఇంధనాలను తయారు చేస్తున్నాయని, ఇకపై దేశీయంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా వీటిని ఉత్పత్తి చేస్తుందని మంత్రి చెప్పారు. ఐవోసీ తమ పారదీప్ రిఫైనరీలో రిఫరెన్స్ గ్రేడ్ పెట్రోల్ను, హర్యానాలోని పానిపట్ యూనిట్లో డీజిల్ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమొబైల్ కంపెనీలు తాము తయారు చేసే వాహనాలను పరీక్షించేందుకు ప్రత్యేక గ్రేడ్ ఇంధనాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్నే రిఫరెన్స్ ఫ్యూయల్గా వ్యవహరిస్తారు. ఇలాంటి అవసరాల కోసం సాధారణ గ్రేడ్ ఇంధనాలు పనికిరావు. సాధారణంగా వీటి అమ్మకాలు పెద్దగా లేనందున దేశీయంగా రిఫైనరీలు ఇప్పటివరకు ఈ ఇంధనాలను ఉత్పత్తి చేయడం లేదు. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే, తాజాగా ఐవోసీ వీటిని తయారు చేయడం వల్ల రిఫరెన్స్ ఫ్యూయల్ రేట్లు తగ్గగలవు. సాధారణ పెట్రోల్, డీజిల్ రేట్లు లీటరుకు రూ. 90–96 (ఢిల్లీలో) స్థాయిలో ఉండగా.. దిగుమతైన రిఫరెన్స్ ఇంధనం రేటు రూ. 800–850 శ్రేణిలో ఉంటుంది. దేశీయంగానే దీన్ని ఉత్పత్తి చేస్తే లీటరు ధర సుమారు రూ. 450కి తగ్గుతుంది. దేశీయంగా డిమాండ్ను తీర్చిన తర్వాత ఐవోసీ ఎగుమతులపైనా దృష్టి పెట్టనుంది. -
క్యూ1లో ఆటోమొబైల్ ఎగుమతులు డౌన్
ముంబై: భారత ఆటోమొబైల్ ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలం(క్యూ1)లో 28 శాతం తగ్గిపోయాయి. ఆఫ్రికాతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న (వర్థమాన)దేశాల్లో ద్రవ్య సంక్షోభ పరిస్థితులు ఇందుకు కారణమయ్యాయి. వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించాయి. తొలి త్రైమాసికంలో మొత్తం 10.32 లక్షల యూనిట్లు ఎగుమతయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్ ఎగుమతులు 14.25 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 28% తక్కువగా ఉంది. ► ఈ జూన్ త్రైమాసికంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతులు అయిదు శాతం తగ్గి 1,52,156 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా 2022 ఏప్రిల్–జూన్ కాలంలో 1,60,116 యూనిట్లగా ఉన్నాయి. ► వార్షిక ప్రాతిపదిక ప్యాసింజర్ కార్ల ఎగుమతులు 1,04,400 యూనిట్ల నుంచి 94,793 యూనిట్లకు పడిపోయాయి. ► యుటిలిటీ వెహికల్స్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 55,419 యూనిట్లకు స్వల్పంగా తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 55,547 యూనిట్లు ఉన్నాయి. ► ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 11,48,594 యూనిట్ల నుంచి 31 శాతం క్షీణించి 7,91,316 యూనిట్లకు చేరుకున్నాయి. ► వాణిజ్య వాహనాల ఎగుమతులు మొదటి త్రైమాసికంలో 14,625 యూనిట్లకు పడిపోయాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో 19,624 యూనిట్ల నుండి 25 శాతం తగ్గాయి. ► త్రీవీలర్ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 97,237 యూనిట్ల నుంచి సమీక్షా కాలంలో 25 శాతం క్షీణించి 73,360 యూనిట్లకు చేరుకున్నాయి. ► ‘‘ఆఫ్రికా, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో కరెన్సీల విలువ తగ్గింపు ప్రభావంతో తొలి త్రైమాసికంలో అన్ని వాహన విభాగ ఎగుమతులు తగ్గిపోయాయి. ఈ దేశాలు విదేశీ మారకద్రవ్య లభ్యత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశం వాహనాల అమ్మకాలను పరిమితం చేస్తోంది. అయినప్పటికీ ఈ మార్కెట్లలో కస్టమర్ల నుంచి వాహనాలకు డిమాండ్ ఉంది’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
మెకానిక్లు సాధికారత సాధించాలి
న్యూఢిల్లీ: మన దేశ అటోమొబైల్ రంగాన్ని బలోపేతం చేయడానికి మెకానిక్లు మరింత కృషి చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పరిశ్రమ అభివృద్ధి కోసం వారు సాధికారత సాధించాలని సూచించారు. ఆయన ఇటీవల ఢిల్లీ కరోల్ బాగ్లోని బైకర్స్ మార్కెట్లో మోటార్సైకిల్ మెకానిక్లతో సమావేశమై, వారి సమస్యలను అడిగి తెలుసుకున్న విషయం విదితమే. మెకానిక్లతో కలిసి ఓ బైక్ను ఆయన సరీ్వసు కూడా చేశారు. సంబంధిత వీడియోను రాహుల్ ఆదివారం ట్విట్టర్లో షేర్ చేశారు. తనకు కేటీఎం 390 మోటార్ సైకిల్ ఉందని, దాన్ని ఉపయోగించడం లేదని, ఇంట్లోనే పార్క్ చేసి ఉంచానని ఈ వీడియోలో రాహుల్ చెప్పారు. మోటార్సైకిల్పై బయటకు వెళ్లేందుకు తన భద్రతా సిబ్బంది అనుమతించడం లేదని, అందుకే కేటీఎం 390ని ఇంటికే పరిమితం చేశానని వివరించారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ఓ మెకానిక్ ప్రశ్నించగా.. చూద్దాం అంటూ రాహుల్ బదులిచ్చారు. అటోమొబైల్ పురోగతి కోసం మెకానిక్లు వారి ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడుతున్నారని, మెరుగైన వసతులు, ఉత్తమ అవకాశాలు పొందడానికి వారు అన్నివిధాలా అర్హులని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. భారతదేశ అసలైన అభివృద్ధి కారి్మకుల అభివృద్ధిపై ఆధారపడి ఉందని తెలిపారు. -
2,21,50,222 వాహనాలు రోడ్డెక్కాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా 2022–23లో రిటైల్లో అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు 2,21,50,222 యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ద్విచక్ర వాహనాలు 19 శాతం వృద్ధితో 1,59,95,968 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. అయితే పరిమాణం పరంగా ఈ విభాగం ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. వాణిజ్య వాహనాలు 33 శాతం, త్రిచక్ర వాహనాలు 84 శాతం దూసుకెళ్లాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 8 శాతం ఎగశాయి. అత్యధిక స్థాయిలో.. ప్యాసింజర్ వాహనాలు రికార్డు స్థాయిలో 23 శాతం అధికమై 36,20,039 యూనిట్లు రోడ్డెక్కడం విశేషం. 2021–22లో 29,42,273 యూనిట్లు అమ్ముడయ్యాయి. ప్యాసింజర్ వాహన రంగంలో ఇప్పటి వరకు దేశంలో 2018–19లో నమోదైన 32 లక్షల యూనిట్లే అత్యధికం. సెమీకండక్టర్ లభ్యత కాస్త మెరుగు పడడంతో అనేక కొత్త మోడళ్లు రంగ ప్రవేశం చేయడం, వాహనాల లభ్యత కారణంగా ఈ విభాగం ప్రయోజనం పొందింది. హై–ఎండ్ వేరియంట్లకు డిమాండ్ ఉండడం అమ్మకాలను కొనసాగించడంలో సహాయపడింది. అయితే ఎంట్రీ లెవెల్ విభాగంలోని కస్టమర్లు ఇప్పటికీ అధిక ద్రవ్యోల్బణంతో ప్రభావితం అవుతున్నందున ఈ సెగ్మెంట్ ఒత్తిడిలో ఉందని ఫెడరేషన్ తెలిపింది. వృద్ధి సింగిల్ డిజిట్లో.. ఇప్పుడు అధిక–వృద్ధి కాలం గడిచినందున అధిక బేస్, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, సాధారణ ధరల పెంపుదల, ప్రభుత్వ నియంత్రణ పరంగా మార్పుల కారణంగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాహన పరిశ్రమ 9 శాతం లోపే వృద్ధిరేటును చూసే అవకాశం ఉందని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు. ఈ ఏడాది కన్సాలిడేషన్కు అవకాశం ఉందన్నారు. ఆటోమొబైల్ రంగంపై కోవిడ్–19 మహమ్మారి 2020–21, 2021–22లో తీవ్ర ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఎటువంటి ప్రభావం లేదు. -
భారత్లో రెనో–నిస్సాన్ రూ. 5,300 కోట్ల పెట్టుబడులు
చెన్నై: ఆటోమొబైల్ దిగ్గజాలు రెనో–నిస్సాన్ భారత్లో సుమారు 600 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 5,300 కోట్లు) ఇన్వెస్ట్ చేయను న్నాయి. రెండు చిన్న ఎలక్ట్రిక్ కార్లతో పాటు ఆరు కొత్త వాహనాలను ఆవిష్కరించనున్నాయి. అలాగే చెన్నైలోని తమ ప్లాంటును కూడా అప్గ్రేడ్ చేయనున్నాయి. నిస్సాన్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అశ్వనీ గుప్తా ఈ విషయాలు తెలిపారు. రెనో ఇండియా కంట్రీ సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పంద పత్రాలను రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని నోడల్ ఏజెన్సీ గైడెన్స్ బ్యూరో ఎండీ విష్ణు వేణుగోపాల్, గుప్తా ఇచ్చిపుచ్చుకున్నారు. రెనో–నిస్సాన్ అనేది ఫ్రాన్స్కి చెందిన రెనో, జపాన్కి చెందిన నిస్సాన్ కంపెనీల జాయింట్ వెంచర్. కొత్తగా వచ్చే వాహనాల్లో నాలుగు ఎస్యూవీలు ఉంటాయి. వీటిలో మొదటిది 2025 నాటికి మార్కెట్లోకి రానుందని గుప్తా చెప్పారు. దేశీయంగా ప్రవేశపెట్టే ఆరు వాహనాల్లో నిస్సాన్, రెనోవి చెరో మూడు వాహనాలు ఉంటాయి. తాజా పెట్టుబడులతో కొత్తగా 2,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని గుప్తా ఈ సందర్భంగా వివరించారు. పునర్వ్యవస్థీకరణ.. జాయింట్ వెంచర్లో సమాన వాటాదార్లుగా ఉండేలా రెండు సంస్థలు భారత్లో తమ తయారీ, ఆర్అండ్డీ విభాగాల్లో పెట్టుబడుల స్వరూపంలో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. దీని ప్రకారం జేవీలో నిస్సాన్ వాటా 70 శాతం నుంచి 51 శాతానికి తగ్గనుండగా రెనో వాటా 30 శాతం నుంచి 49 శాతానికి పెరుగుతుంది. తమ చెన్నై తయారీ కేంద్రాన్ని 2045 నాటికల్లా పూర్తిగా పునరుత్పాదక విద్యుత్తో నడిచేలా తీర్చిదిద్దనున్నట్లు గుప్తా వివరించారు. భారత మార్కెట్కు రెనో, నిస్సాన్ కట్టుబడి ఉన్నాయని నిస్సాన్ రీజియన్ చైర్పర్సన్ (ఆఫ్రికా తదితర ప్రాంతాలు) గిలోమ్ తెలిపారు. -
ఈ ఏడాదీ వాహనాల జోరు
గ్రేటర్ నోయిడా: దేశవ్యాప్తంగా ఈ ఏడాది సైతం వాహనాల జోరు ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. 2022లో 5 లక్షల యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్.. 2023లో ఉత్తమ పనితీరు ఉంటుందని ఆశాభావంతో ఉంది. కొత్తగా వచ్చిన మోడళ్లు ఇందుకు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఎండీ శైలేష్ చంద్ర తెలిపారు. రెండంకెల వృద్ధి ఆశిస్తున్నట్టు చెప్పారు. గతేడాది 43,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించామని, కొత్త మోడళ్ల చేరికతో ఈ ఏడాది ఇంకా పెరుగుతాయని చెప్పారు. పరిశ్రమ కంటే మెరుగ్గా ఈ ఏడాది కూడా రెండంకెల వృద్ధితో అమ్మకాలు ఉంటాయని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్, సేల్స్, మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ వెల్లడించారు. 2022లో పరిశ్రమ 23 శాతం వృద్ధి సాధిస్తే, కంపెనీ 40 శాతం నమోదు చేసిందని వివరించారు. కియా మార్కెట్ వాటా 5.9 నుంచి 6.7 శాతానికి ఎగసిందని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల కారణంగా 2023లో పరిశ్రమకు ఎదురుగాలులు ఉంటాయని అన్నారు. తయారీ సామర్థ్యం పెంపు.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా ఉంటుందని హ్యుండై మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) ఎండీ, సీఈవో ఉన్సూ కిమ్ తెలిపారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని అన్నారు. వాహన పరిశ్రమ తొలిసారిగా అత్యధిక విక్రయాలను గతేడాది నమోదు చేసిందని హెచ్ఎంఐఎల్ సీవోవో తరుణ్ గర్గ్ వివరించారు. అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ మెరుగ్గా పనితీరు కనబరుస్తుందని అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి 8.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యానికి చేర్చాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం సామర్థ్యం 7.6 లక్షల యూనిట్లు ఉంది. సెమికండక్టర్ సరఫరా మెరుగవడంతో పేరుకుపోయిన ఆర్డర్లను తగ్గించుకోవాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం 1.15 లక్షల పెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం క్రెటా, వెన్యూ మోడళ్లు. లోకలైజేషన్ 85 శాతం ఉంది. ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, దక్షిణ కొరియా, యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. క్యూ3లో కార్ల విక్రయాలు 23 శాతం అప్ పండుగ సీజన్ డిమాండ్ ఊతంతో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో 9,34,955 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన 7,61,124 యూనిట్లతో పోలిస్తే 23 శాతం పెరిగాయి. దేశీ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ఈ గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీల నుంచి డీలర్లకు 9,34,955 వాహనాలు వచ్చాయి. ఇక, డిసెంబర్లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,19,421 యూనిట్ల నుంచి 7 శాతం పెరిగి 2,3,309 యూనిట్లకు చేరాయి. కమర్షియల్ వాహనాలు, త్రిచక్ర వాహనాలు, ద్విచక్ర వాహనాల్లాంటి విభాగాలన్నింటిలోనూ టోకు విక్రయాలు పెరిగాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మీనన్ చెప్పారు. అమ్మకాలు పెరగడానికి పండుగ సీజన్ తోడ్పడినట్లు తెలిపారు. అయితే రుణాలపై వడ్డీ రేట్లు, ఆహార ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండటంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్పై ప్రతికూల ప్రభావం కొనసాగుతోందని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో మొత్తం వాహన విక్రయాలు 46,68,562 యూనిట్ల నుంచి 51,59,758 యూనిట్లకు పెరిగాయి. క్యూ3లో మొత్తం వాణిజ్య వాహనాల వికయ్రాలు 17 శాతం పెరిగి 2,27,111 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాలు 6 శాతం పెరిగి 38,59,030కు చేరాయి. పూర్తి ఏడాదికి.. 2022 పూర్తి ఏడాదికి గాను (క్యాలండర్ ఇయర్) గణాంకాలు చూస్తే ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధికంగా 38 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 రికార్డుతో పోలిస్తే నాలుగు లక్షల యూనిట్లు అధికంగా అమ్ముడయ్యాయి. అటు కమర్షియల్ వాహనాల అమ్మకాలు 9.3 లక్షల యూనిట్లకు చేరాయి. 2018లో నమోదైన గరిష్ట స్థాయికి కేవలం 72,000 యూనిట్ల దూరంలో నిల్చాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు 82,547 యూనిట్ల నుంచి 1,38,511 యూనిట్లకు చేరాయి. అయినప్పటికీ 2010తో పోలిస్తే ఇంకా తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ఎక్స్యూవీ400... 20,000 యూనిట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఏడాది 20,000 యూనిట్ల ఎక్స్యూవీ400 ఎలక్ట్రిక్ ఎస్యూవీలను సరఫరా చేయాలని లక్ష్యంగా చేసుకుంది. పరిచయ ఆఫర్లో ధర రూ.15.99 లక్షల నుంచి ప్రారంభం. 2022 సెప్టెంబర్లో కంపెనీ ఈ మోడల్ను ఆవిష్కరించింది. జనవరి 26 నుంచి బుకింగ్స్ మొదలు కానున్నాయి. మార్చి నుంచి ఈఎల్ వేరియంట్, దీపావళి సమయంలో ఈసీ వేరియంట్ డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ సోమవారం ప్రకటించింది. 34.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ కలిగిన ఈసీ వేరియంట్ కారు ఒకసారి చార్జింగ్తో 375 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 39.4 కిలోవాట్ అవర్ బ్యాటరీతో రూపొందిన ఈఎల్ ట్రిమ్ ఒకసారి చార్జింగ్తో 456 కిలోమీటర్లు పరుగెడుతుంది. ప్రతి వేరియంట్లో 5,000 యూనిట్లు మాత్రమే పరిచయ ఆఫర్ ధరలో విక్రయిస్తారు. -
వాహన విక్రయాలు జూమ్
ముంబై: అంతర్జాతీయంగా సెమీ కండెక్టర్ల కొరత ప్రభావం తగ్గడంతో.., దేశీయంగా జూలైలో వాహన విక్రయాలు వృద్ధి బాటపట్టాయి. వార్షిక ప్రాతిపదికన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రాఅండ్మహీంద్రా, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, స్కోడా ఆటో అమ్మకాలు పురోగతిని సాధించాయి. ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ ఊపందుకోవడంతో ఈ ఏడాదిలోకెల్లా జూలైలో అత్యధికంగా అమ్ముడయ్యాయి. ఆర్థిక రికవరీలో భాగంగా మౌలిక, నిర్మాణ రంగం ఊపందుకుంది. ఫలితంగా సరుకు రవాణా అవసరాలు పెరగడంతో వాణిజ్య వాహన విక్రయాల్లో వృద్ధి నమోదైంది. -
ఆటోమొబైల్ రంగంలో సత్తా చాటుతున్న వనితలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీలో సహజంగా పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట మహిళలూ రాణిస్తున్నారు. క్రమంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లింగ సమానత్వం/లింగవైవిధ్యం (పనివారిలో స్త్రీ, పురుషలకు సమ ప్రాధాన్యం) కోసం ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్, ఎంజీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. టాటా మోటార్స్కు చెందిన ఆరు తయారీ ప్లాంట్లలోని షాప్ ఫ్లోర్లలో సుమారు 3,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చిన్న కార్ల నుంచి వాణిజ్య వాహనాల తయారీ వరకు వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను నియమించుకునే ప్రణాళికలతో టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ పుణె ప్యాసింజర్ వాహన ప్లాంట్లో గత రెండేళ్లలోనే మహిళా కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. 2020లో 178 మంది ఉంటే, వారి సంఖ్య 1,600కు చేరింది. ‘‘పుణెలో పూర్తిగా మహిళలతో కూడిన తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయడాన్ని సవాలుగా తీసుకున్నాం. ఇప్పటికే 1,100 మంది మహిళలను నియమించుకున్నాం. వచ్చే రెండేళ్లలో వీరి సంఖ్యను 1,500కు చేర్చే దిశగా పనిచేస్తున్నాం’’అని టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఎంజీ మోటార్ ఆదర్శనీయం.. ఎంజీ మోటార్ ఇండియా అయితే స్త్రీ, పురుషులు సమానమేనని చాటే విధంగా 2023 డిసెంబర్ నాటికి తన మొత్తం ఫ్యాక్టరీ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన గుజరాత్లోని హలోల్ ప్లాంట్లో మొత్తం 2,000 మంది పనిచేస్తుండగా.. మహిళల వాటా 34 శాతంగా ఉంది. తయారీలో కీలకమైన పెయింట్ నాణ్యత, సర్ఫెస్ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అసెంబ్లీ తదితర బాధ్యతల్లోకి మహిళలను తీసుకుంటోంది. జనరల్ మోటార్స్ నుంచి 2017లో హలోల్ ప్లాంట్ను సొంతం చేసుకోగా, ఇక్కడి సిబ్బందిలో స్త్రీ, పురుషులను సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్లే మహిళా సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిశ్రమలో అధిక లింగ వైవిధ్యాన్ని ఇప్పటికే ఎంజీమోటార్స్ సాధించినప్పటికీ.. 50:50 నిష్పత్తికి చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ (హెచ్ఆర్) యశ్వింద్ పాటియాల్ తెలిపారు. హీరో మోటోలో 9.3 శాతం ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్లో ప్రస్తుతం 1,500 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింగ సమానత్వ రేషియో 2021–22 నాటికి 9.3 శాతంగా ఉంది. సమీప కాలంలో దీన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఉంది. బజాజ్ ఆటో చకాన్ ప్లాంట్లో డోమినార్ 400, ఆర్ఎస్ 200 తయారీకి ప్రత్యేకంగా మహిళలనే వినియోగిస్తోంది. 2012-14 నాటికి 148 మందిగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2021-22 నాటికి 667కు పెరిగింది. హీరో మోటో కార్ప్ ‘తేజశ్విని’ పేరుతో మహిళా సిబ్బందిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. దీనిద్వారా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే మహిళల సంఖ్యను పెంచుకున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. రిక్రూట్మెంట్లు, విద్య, శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. సవాళ్లు.. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను తీసుకునే విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ వివరించారు. ‘‘ఆటోమొబైల్ రంగం మొదటి నుంచీ పురుషుల ఆధిపత్యంతో కొనసాగుతోంది. టెక్నీషియన్లు, విక్రేతలు, ఇంజనీర్లుగా మహిళలు రావడం అన్నది ఓ కల. కానీ ఇందులో క్రమంగా మార్పు వచ్చింది. ఐటీఐ, 12వ తరగతి చదివిన మహిళలకు రెండు, మూడేళ్ల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చేందుకు కౌశల్య కార్యక్రమాన్ని చేపట్టాం. దీని తర్వాత వారు బీఈ/బీటెక్ను ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ ఉద్యోగిగా కొనసాగొచ్చు’’అని వివరించారు. -
‘బాష్’కు భారతీయత
సాక్షి, బెంగళూరు: భారత్కు బాష్ కంపెనీ ఎప్పుడో జర్మనీ నుంచి వచ్చినా ఇప్పుడు అది పూర్తిగా భారతీయతను సంతరించుకుందని ప్రధాని మోదీ కొనియాడారు. ఆటోమొబైల్ విడిభాగాలు మొదలుకొని సెక్యూరిటీ, గృహోపకరణాలు తయారు చేసే బాష్ కంపెనీ దేశంలో కార్యకలాపాలు ప్రారంభించి వందేళ్లయింది. ఈ సందర్భంగా గురువారం బాష్ బెంగళూరులో ‘స్పార్క్ నెక్ట్స్‘ పేరుతో నిర్మించిన భవనాన్ని ప్రధాని ఆవిష్కరించారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ ఆవిష్కరణలో ప్రధాని మాట్లాడుతూ భారతీయ శక్తి, జర్మన్ ఇంజినీరింగ్ల సమర్థ మేళవింపునకు బాష్ కంపెనీ మంచి ఉదాహరణ అని ప్రశంసించారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుగుతున్న సమయంలో బాష్ వందేళ్లు పూర్తి చేసుకోవడం ఈ ఉత్సవాలకు ఒక ప్రత్యేకతను కల్పిస్తోందని చెప్పారు. దేశంలోని ప్రతి గ్రామానికీ హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. భారత్లో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ డిజిటల్, టెక్నాలజీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కృత్రిమ మేథతోపాటు అనేక అత్యాధునిక టెక్నాలజీలు కలిగిన ‘స్పార్క్ నెక్ట్స్’వంటి భవనాలు దేశంలో రేపటితరం ఉత్పత్తుల తయారీని వేగవంతం చేస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశానికి అవసరమైన మరిన్ని ఉత్పత్తులు, టెక్నాలజీలను బాష్ తయారు చేయాలని, రానున్న25 ఏళ్ల కు లక్ష్యాలు నిర్దేశించుకోవాలన్నారు. బెంగళూరు ప్రతిష్ట బాష్ ‘స్పార్క్ నెక్ట్స్’తో మరింత పెరిగిందని కర్ణాటక సీఎం బొమ్మై కొనియాడారు. సుస్థిరత... మా తారకమంత్రం: ఫెలీజ్ అల్చెర్ట్ ‘స్పార్క్ నెక్ట్స్‘ నిర్మాణానికి ఐదేళ్లలో రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు బాష్ కంపెనీ బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యురాలు ఫెలీజ్ ఆల్చెర్ట్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశామన్నారు. 76 ఎకరాల్లో మొత్తం 10 వేల మంది పని చేయగల ‘స్పార్క్ నెక్ట్స్‘లో ఏటా 5.8 కోట్ల లీటర్ల వాననీటి సంరక్షణ జరుగుతుందని చెప్పారు. వినియోగం తగ్గిందని వివరించారు. భారత్లో బాష్ పెట్టుబడులు మరిన్ని పెరగనున్నాయని, త్వరలో 25 కోట్ల యూరోలు ఖర్చు చేయనున్నామని తెలిపారు. బాష్ కంపెనీ దశాబ్దాలుగా ఆత్మ నిర్భర్ భారత్ కోసం కృషి చేస్తోందని ఉత్పత్తుల డిజైనింగ్ మొదలు తయారీ వరకూ అన్నీ చేపట్టడం ద్వారా మేకిన్ ఇండియాకూ ఊతమిస్తున్నామని బాష్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌమిత్ర భట్టాచార్య తెలిపారు. -
ఆటో విడిభాగాల సంస్థలకు డిమాండ్ ఊతం
ముంబై: డిమాండ్ స్థిరంగా ఉండటం, సరఫరా వ్యవస్థపరమైన అడ్డంకులు తొలగిపోతుండటం తదితర అంశాలు ఆటో విడిభాగాల సంస్థలకు ఊరటనివ్వనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి ఆదాయాలు 8–10 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక ప్రకటనలో ఈ అంచనాలు వెల్లడించింది. దీని ప్రకారం 31 ఆటో విడిభాగాల కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద రూ. 1,75,000 కోట్ల పైగా ఆదాయాలు ఆర్జించాయి. వార్షికంగా 23 శాతం వృద్ధి నమోదు చేశాయి. దేశీ ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు (ఓఈఎం), రిప్లేస్మెంట్, ఎగుమతులు, కమోడిటీల ధరల పెరుగుదలను బదలాయించగలగడం తదితర అంశాలు ఇందుకు తోడ్పడ్డాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లో బేస్తో పోలిస్తే వృద్ధి అధిక స్థాయిలో నమోదైందని, అయినప్పటికీ పరిశ్రమ ఆదాయాలు తమ అంచనాలు మించాయని ఇక్రా పేర్కొంది. ఊహించిన దాని కన్నా ఎగుమతులు మెరుగ్గా ఉండటం, కమోడిటీల ధరలు.. రవాణా వ్యయాల పెరుగుదల భారాన్ని వినియోగదారులకు బదలాయించడం కంపెనీలకు కలిసొచ్చిందని వివరించింది. తగ్గిన మార్జిన్లు.. గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు పెరిగినప్పటికీ ముడి వస్తువుల ఖర్చులు, రవాణా వ్యయాల భారాన్ని ద్వితీయార్థంలో (అక్టోబర్–మార్చ్) కంపెనీలు పూర్తి స్థాయిలో, సకాలంలో బదలాయించలేకపోయాయని ఇక్రా తెలిపింది. దీనితో లాభాల మార్జిన్లపై ప్రభావం పడినట్లు పేర్కొంది. 31 ఆటో విడిభాగాల కంపెనీల నిర్వహణ మార్జిన్లు గత ఆర్థిక సంవత్సరంలో అయిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయని ఇక్రా తెలిపింది. సెమీకండక్టర్ కొరత సమస్యలు, ద్విచక్ర వాహనాలు .. ట్రాక్టర్లకు డిమాండ్ అంతంతమాత్రంగానే ఉండటం, అంతర్జాతీయ వ్యాపారాలపై భౌగోళికరాజకీయ పరిణామాల వంటి అంశాలు ఆదాయాల వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపినట్లు పేర్కొంది. ‘30 కంపెనీల (ఒక పెద్ద ఆటో విడిభాగాల సరఫరా సంస్థ కాకుండా) నిర్వహణ మార్జిన్లు 10.6 శాతంగా నమోదయ్యాయి. వార్షికంగా చూస్తే ఇది 10 బేసిస్ పాయింట్లు, మా అంచనాలతో పోలిస్తే 40 బేసిస్ పాయింట్లు తక్కువ‘ అని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుతా ఎస్ తెలిపారు. సరఫరా వ్యవస్థపరమైన అనిశ్చితులు, ధరల పెరుగుదల భయాల కారణంగా ఆటో యాన్సిలరీలు గత ఆర్థిక సంవత్సరంలో తమ నిల్వలను భారీగా పెంచుకున్నాయని పేర్కొన్నారు. అంతక్రితం నాలుగేళ్లలో ఇదే అత్యధికమని వివరించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి సంస్థల దగ్గర లిక్విడిటీ (నగదు లభ్యత) మెరుగ్గా ఉండటం సానుకూలాంశమని వినుత తెలిపారు. పీఎల్ఐ స్కీముతో దన్ను.. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముతో మధ్యకాలికంగా ఆటో యాన్సిలరీల విభాగంలో పెట్టుబడులకు ఊతం లభించగలదని ఇక్రా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లో కొత్తగా మరిన్ని పెట్టుబడులు రాగలవని వివరించింది. ఇక పరిశ్రమకు రుణ అవసరాలు కూడా ఎక్కువగా ఉండకపోవచ్చని పేర్కొంది. ఆటో యాన్సిలరీల రుణాల భారం పరిస్థితి మెరుగ్గా ఉందనేందుకు సూచనగా చాలా మటుకు సంస్థలకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు ఇక్రా తెలిపింది. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం .. ఆటో యాన్సిలరీలకు సానుకూలంగా ఉండగలదని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. -
అన్ని రుణాలూ భారమే
న్యూఢిల్లీ: వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా (బీవోబీ), పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ), బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుతోపాటు హెచ్డీఎఫ్సీ ఇప్పటికే రేట్ల పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే స్వల్పకాల రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువగా రెపో ఆధారిత రేట్ల విధానాన్నే రుణాలు, డిపాజిట్లకు అనుసరిస్తున్నాయి. జూన్ 8నాటి సమీక్షలో ఆర్బీఐ అర శాతం మేర రెపో రేటును పెంచింది. దీనికి నెల ముందు 0.40 శాతం పెంచడంతో నెలన్నర వ్యవధిలోనే 0.90 శాతం రేటు పెంపు అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధంతో కమోడిటీల ధరలు అదుపు తప్పాయి. అంతర్జాతీయంగా ఆహార సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధి దాటిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ రేట్ల పెంపు బాట పట్టింది. ఒక్కో బ్యాంకు.. ► ఐసీఐసీఐ బ్యాంకు రెపో అనుసంధానిత ‘ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటు’ (ఈబీఎల్ఆర్)ను 8.10 శాతం నుంచి 8.60 శాతం చేస్తున్నట్టు ప్రకటించింది. జూన్ 8 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ► పీఎన్బీ రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్)ను 6.90% నుంచి 7.40% చేసింది. ► బ్యాంకు ఆఫ్ బరోడా సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.40 శాతానికి సవరించింది. ► ఎస్బీఐ ఈబీఎల్ఆర్ రేటును 7.05 శాతానికి సవరిస్తూ ఆర్బీఐ జూన్ పాలసీకి ముందే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి క్రెడిట్ రిస్క్ ప్రీమియం కూడా కలిపి రుణాలపై వడ్డీ రేటును అమలు చేయనుంది. ► హెచ్డీఎఫ్సీ.. రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేటు (ఆర్పీఎల్ఆర్)ను గృహ రుణాలపై అర శాతం పెంచింది. ఇది జూన్ 10 నుంచి అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల కాల గృహ రుణాలపై ప్రతీ రూ.లక్షకు రూ.31 పెరిగినట్టయింది. ► ఇండియన్ బ్యాంకు ఆర్ఎల్ఎల్ఆర్ను 7.70 శాతానికి, బ్యాంకు ఆఫ్ ఇండియా 7.75 శాతానికి పెంచాయి. ► ఐఓబీ ఆర్ఎల్ఎల్ఆర్ను జూన్ 10 నుంచి 7.75%కి సవరించినట్టు తెలిపింది. ► బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర సైతం ఆర్ఎల్ఎల్ఆర్ను 7.20 శాతం నుంచి 7.70 శాతానికి సవరించినట్టు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్) రుణాలపైనా 0.30% మేర రేటును పెంచింది. ► కెనరా బ్యాంకు ఏడాది ఎంసీఎల్ఆర్ను 7.35 శాతం నుంచి 7.40 శాతం చేస్తూ, జూన్ 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ► 2019 అక్టోబర్ 1 నుంచి రెపో, ట్రెజరీ బిల్లు ఈల్డ్ ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ లెండింగ్ రేటును బ్యాంకులు అమలు చేస్తున్నాయి. అంతక్రితం ఎంసీఎల్ఆర్ విధానం ఉంది. -
ఆటుపోట్లలో ఆటో పరిశ్రమ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ సరఫరా వైపు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆటోమొబైల్ ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు వాహనాల సరఫరా 4 శాతం తక్కువగా ఏప్రిల్లో నమోదైంది. పరిశ్రమకు సరఫరా వైపు సవాళ్లు నెలకొని ఉన్నట్టు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తెలిపింది. ఏప్రిల్లో దేశీయ హోల్సేల్ ప్యాసింజర్ హోల్సేల్ వాహన విక్రయాలు 2,51,581 యూనిట్లుగా ఉంటే, అంతక్రితం ఏడాది ఇదే నెలలో 2,61,633 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ కార్ల విక్రయాలు గత నెలలో 1,12,857 యూనిట్లుగా ఉన్నాయి. 2021 ఏప్రిల్లో ప్యాసింజర్ కార్ల విక్రయాలు 1,41,194 యూనిట్లుగా ఉండడం గమనించాలి. యుటిలిటీ వాహన హోల్సేల్ విక్రయాలు 1,27,213 యూనిట్లు, వ్యాన్ డిస్పాచ్లు 11,568 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల్లో వృద్ధి ప్యాసింజర్ వాహనాలకు భిన్నంగా ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏప్రిల్లో పెరిగాయి. 15 శాతం అధికంగా 11,48,696 వాహనాలు ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు సరఫరా అయ్యాయి. 2021 ఏప్రిల్లో ఇవి 9,95,115 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ఇందులో మోటారుసైకిళ్ల అమ్మకాలు 6,67,859 యూనిట్ల నుంచి 7,35,360 యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ల డిస్పాచ్లు 3,01,279 యూనిట్ల నుంచి 3,74,556 యూనిట్లకు పెరిగాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు ఏప్రిల్లో 20,938 యూనిట్లుగా ఉన్నాయి. 2021 ఏప్రిల్లో తిచక్ర వాహన అమ్మకాలు 13,856 యూనిట్లుగా ఉన్నాయి. 2017 కంటే తక్కువే.. ‘‘ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఇప్పటికీ 2017 ఏప్రిల్ నెల గణాంకాల కంటే తక్కువగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 2012 ఏప్రిల్ నెల కంటే తక్కువగా ఉన్నాయి’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. తిచక్ర వాహనాల విక్రయాలు సాధారణ స్థాయికి చేరుకోవాల్సి ఉందని, 2016 ఏప్రిల్లో నమోదైన గణాంకాల కంటే ఇంకా 50 శాతం తక్కువగా ఉన్నట్టు చెప్పారు. సరఫరా వైపు సమస్యలు ఉన్నా.. అధిగమించేందుకు శ్రమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల రెపో రేటు పెంపుతో రుణ రేట్లు పెరగనున్నాయని, డిమాండ్పై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉందని రాజేష్ మీనన్ తెలిపారు. చదవండి: జొమాటో సీఈవో దీపిందర్ గోయల్కు భారీ షాక్, బెడిసి కొట్టిన మాస్టర్ ప్లాన్! -
ఒకపక్క దిగ్గజాల ఏడుపు.. మరోపక్క ఎన్నడూ లేనంతగా కాసుల వర్షం!
Chip Shortage Still Record Level Business In 2021: చిప్ కొరత.. ఇది ఒక్క కంపెనీ సమస్య కాదు. మొత్తం గ్లోబల్ ఎదుర్కొంటున్న సమస్య. ఈ సమస్య వల్లే ప్రొడక్టివిటీ బాగా తగ్గింది. పైగా టెస్లా లాంటి తోపు కంపెనీలు తాము కొత్త మోడల్స్ను తేలేకపోతున్నామంటూ ప్రకటనలు సైతం ఇచ్చుకుంటోంది. మరి అంత పెద్ద సమస్య.. ఊహకందని రేంజ్లో బిజినెస్ చేసిందంటే నమ్ముతారా?.. చిప్ కొరత(సెమీ కండక్లర్ల కొరత).. గత ఏడాది కాలంగా సెల్ఫోన్, ఆటోమొబైల్స్ రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పదం. దీనిని వంకగా చూపిస్తూనే వాహనాలు, మొబైల్స్ రేట్లు నేలకు దిగడం లేదు. పైగా పోను పోనూ మరింత పెంచుకుంటూ పోతున్నాయి కంపెనీలు. ఈ తరుణంలో కిందటి ఏడాది సెమీకండక్టర్ సెక్టార్ చేసిన బిజినెస్ ఎంతో తెలుసా? అక్షరాల 583.5 బిలియన్ డాలర్లు. అవును.. సెమీకండక్టర్ సెక్టార్లో ఒక ఏడాదిలో ఇన్నేళ్లలో ఈ రేంజ్లో భారీ బిజినెస్.. అదీ 500 బిలియన్ డాలర్ల మార్క్ను దాటడం ఇదే ఫస్ట్టైం. ఈ మేరకు సోమవారం వెలువడిన గార్ట్నర్ నివేదిక సెమీకండక్టర్ బిజినెస్కు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ► 2018 నుంచి శాంసంగ్-ఇంటెల్ మధ్య చిప్ బిజినెస్లో పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో.. మూడేళ్ల తర్వాత శాంసంగ్ ఇంటెల్కు రాజేసి మొదటి పొజిషన్ను ఆక్రమించుకుంది. ఓవరాల్ మార్కెట్లో ఒక్కసారిగా 34.2 శాతం రెవెన్యూను శాంసంగ్ పెంచుకోవడం గమనార్హం. ► ఇంటెల్కు కేవలం 0.5 శాతం పెంచుకుని.. టాప్ 25 కంపెనీల్లో అతితక్కువ గ్రోత్ రేట్ సాధించిన కంపెనీగా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. ► 2021లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నప్పటికీ.. సెమీకండక్టర్ సప్లయ్ చెయిన్ కొరత.. ప్రత్యేకించి ఆటోమోటివ్ పరిశ్రమలో వీటి కొరత స్పష్టంగా కనిపించింది. ► ఫలితంగా బలమైన డిమాండ్, లాజిస్టిక్స్, ముడిసరుకు ధరల కలయిక సెమీకండక్టర్ల సగటు అమ్మకపు ధరను (ASP) ఒక్కసారిగా పెంచేసిందని, చిప్ కొరత-స్ట్రాంగ్ డిమాండ్ 2021లో మొత్తం ఆదాయ వృద్ధికి దోహదపడిందని గార్ట్నర్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ నార్వుడ్ చెప్తున్నారు. ► రిమోట్ వర్కింగ్, లెర్నింగ్, ఎంటర్టైన్మెంట్ అవసరాలను తీర్చడానికి హైపర్స్కేల్ క్లౌడ్ ప్రొవైడర్ల ద్వారా పెరిగిన సర్వర్ డిప్లాయ్మెంట్ల కారణంగా, అలాగే PCలు, అల్ట్రా మొబైల్స్ కోసం ఎండ్-మార్కెట్ డిమాండ్ పెరగడం వల్ల ‘మెమరీ’ మళ్లీ అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది. ► 2020లో ఆదాయం కంటే 42.1 బిలియన్లు డాలర్లు పెరగ్గా.., ఇది 2021లో మొత్తం సెమీకండక్టర్ మొత్తం ఆదాయ వృద్ధిలో 33.8 శాతం కావడం కొసమెరుపు. ► మెమరీతో పాటు డ్రామ్(DRAM) కూడా 2021 ఆదాయం పెరగడంతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. 40.4 శాతం రాబడి వృద్ధితో.. 2021లో 92.5 బిలియన్ డాలర్ల ఆదాయం తీసుకొచ్చింది. సర్వర్స్, పీసీల నుంచి బలమైన డిమాండ్ కారణంగా డ్రామ్ డబుల్ డిజిట్కు చేరుకోగలిగింది. ► 2021లో 555 మిలియన్ల యూనిట్ల 5జీ స్మార్ట్ఫోన్లు ఉత్పత్తి అయ్యాయి. 2020లో ఇది కేవలం 250 మిలియన్ యూనిట్లుగా మాత్రమే ఉంది. ఈ లెక్కన 5జీ స్మార్ట్ఫోన్ మార్కెట్ కూడా సెమీకండక్టర్ రెవెన్యూ గణనీయంగా పెరగడానికి కారణమైంది. ► హవాయ్ మీద అమెరికా విధించిన ఆంక్షలు కూడా ఒక కారణమైంది. చైనా యేతర కంపెనీలకు కాసుల పంట పండించింది. హువాయ్ చిప్ సబ్సిడరీ.. 2020లో 8.2 బిలియన్ డాలర్ల బిజినెస్ చేయగా.. 2021లో కేవలం ఒక బిలియన్డాలర్ల బిజినెస్ చేయడం గమనార్హం. చదవండి: లాభాల్లో కింగూ.. అయినా ఇలాంటి నిర్ణయమా? రీజన్ ఏంటంటే.. -
ఉత్పత్తి మొదలెట్టండి.. మినహాయింపులు తర్వాత చూద్దాం!
న్యూఢిల్లీ: భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం పన్ను మినహాయింపులు కోరుతున్న అమెరికన్ కార్ల దిగ్గజం టెస్లాకు కేంద్రం కీలక సూచన చేసింది. ముందుగా భారత్లో తయారీ మొదలుపెట్టాలని, ఆ తర్వాత మినహాయింపుల గురించి పరిశీలించవచ్చని టెస్లాకు భారీ పరిశ్రమల శాఖ సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఏ ఆటోమొబైల్ సంస్థకూ సుంకాలపరమైన మినహాయింపులు ఇవ్వడం లేదని, ఇప్పుడు టెస్లాకు గానీ ఇచ్చిన పక్షంలో భారత్లో బిలియన్ల డాలర్ల కొద్దీ ఇన్వెస్ట్ చేసిన ఇతర కంపెనీలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లవుతుందని కేంద్రం భావిస్తున్నట్లు వివరించాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాలను తగ్గించాలని టెస్లా కోరుతోంది. ప్రస్తుతం పూర్తిగా తయారై దిగుమతయ్యే వాహనాలపై (సీబీయూ) కస్టమ్స్ సుంకాలు 60 శాతం నుంచి 100 శాతం దాకా ఉంటున్నాయి. దీనికి 40,000 డాలర్ల విలువను (వాహన ధర) ప్రామాణికంగా తీసుకుంటున్నారు. 40,000 డాలర్ల పైగా ఖరీదు చేసే వాహనాలపై 110 శాతం దిగుమతి సుంకాలను విధించడమనేది .. పర్యావరణ హిత ఎలక్ట్రిక్ వాహనాలకు వర్తింపచేయొద్దంటూ కేంద్రాన్ని టెస్లా కోరుతోంది. కస్టమ్స్ విలువతో సంబంధం లేకుండా టారిఫ్ను 40 శాతానికి పరిమితం చేయాలని, 10 శాతం సామాజిక సంక్షేమ సుంకం నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. -
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు, అదనంగా ఎంత ప్రీమియం చెల్లించాలి?
వాహనదారుల సంక్షేమాన్ని కోరుతూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు తప్పనిసరి చేస్తూ మద్రాసు హై కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసేప్పుడు ఎంత ఆర్థిక భారం పడుతుంది. అమలు విధానం ఎలా ఉండవచచ్చు, కోర్టు తీర్పుపై ఇటు వాహన తయారీ సంస్థలు, అటు ఇన్సురెన్సు కంపెనీలు ఏమనుకుంటున్నాయి ? బంపర్ టూ బంపర్ లక్షలు ఖర్చు పెట్టి వాహనం కొనుగోలు చేసే సందర్భంలో ఇన్సెరెన్సు ప్రీమియం కట్డడంలో చాలా మంది వెనుకాముందు ఆలోచిస్తారు. ప్రీమియం తగ్గించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తారు. దీనికి తగ్గట్టే ఇన్సెరెన్సు సంస్థలు, వాటి ఏజెంట్లు అతి తక్కువ ప్రీమియం ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సు ప్లాన్లనే చెబుతుంటారు. ఇప్పటి వరకు ఈ తరహా పద్దతే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరి చేసింది మద్రాసు హై కోర్టు. అంటే వాహనానికి ఏదైనా ప్రమాదం వాటిలినప్పుడు ఆ వాహనంతో పాటు దాని యజమాని లేదా డ్రైవరు, అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. ప్రీమియం ఎంత పెరుగుతుంది? కొత్త వాహనాలకు కొనుగోలు చేసేప్పుడు నూటికి తొంభైశాతం మంది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సునే చేయిస్తున్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించేప్పుడే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాహన నెట్ప్రైస్లో 3 శాతం మొత్తాన్ని ఒక ఏడాది పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలని కోర్టు సూచించింది. ఆ లెక్కన వాహనం ధరలో 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచితే మార్కెట్వాల్యూ, తరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సురెన్సు ప్రీమియం దాదాపు మూడింతలు పెరిగిపోతుంది. ఆర్థిక భారం ఎంతంటే ? ఐదేళ్ల కాలానికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును లెక్కించందుకు హ్యుందాయ్ కంపెనీకి చెంది వెన్యూ కారును పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు ఒక ఏడాది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్కి రూ. 38,900 ప్రీమియంగా ఉంది. ఇదే ఇన్సురెన్సును ఐదేళ్ల కాలానికి తీసుకుంటే ప్రీమియం మొత్తం ఒకేసారి రూ. 1,26,690కి చేరుతుంది. అంటే వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తుదానికి అదనంగా రూ. 87,790లు చెల్లించాల్సి వస్తుంది. వివిధ మోడళ్లను బట్టి ఈ ప్రీమియం మారుతుంది. వాహన తయారీ సంస్థలు ఏమంటున్నాయి ? కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో మొబైల్ పరిశ్రమ కొలుకుంటోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ధరల తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకసారి ఐదేళ్లకు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ని కోర్టు తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనాల ధరలు పెరిగిపోతాయని, ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందని వాహన తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకి హ్యుందాయ్ వెన్యూ వాహనానికి సంబంధించి ఒక ఏడాది బంపర్ టూ బంపర్ రెండేళ్లు థర్డ్ పార్టీ ఇన్సురెన్సుతో కలిసి నెట్ప్రైస్ రూ. 9,96,310 ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల ఇన్సునెన్సు ప్రీమియం చెల్లించాలంటే రూ.10,84,295 చెల్లించాల్సి వస్తుంది. అదే మారుతి బ్రెజా విషయానికి వస్తే ఈ మొత్తం రూ.9,86,199 నుంచి రూ. 10,76,180కి చేరుకుంటుంది. ఇన్సురెన్సు కంపెనీ స్పందన ఏంటీ ? ఏ తరహా పాలసీ తీసుకోవాలి, ప్రీమియం ఎంత చెల్లించాలనే అంశంపై వాహన కొనుగోలుదారులను తాము ఒత్తిడి చేసేది ఏమీ ఉండదని ఇన్సురెన్సు కంపెనీలు చెబుతున్నాయి. మోటారు వాహన చట్టాలను లోబడి వాహన కొనుగోలుదారుడి ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే పాలసీలు చేయిస్తామని చెబుతున్నాయి. వాహనం కొనుగోలు చేసేప్పుడు చాలా మంది మొదటి ఏడాదికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ చేయిస్తారని, ఆ తర్వాత వాహనం వాడే విధానం, రిస్క్ ఆధారంగా థర్డ్పార్టీ లేదా బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సులు తీసుకుంటారని ఇన్సురెన్సు కంపెనీ ఏజెంట్లు వెల్లడిస్తున్నారు. చదవండి : బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
స్క్రాపేజ్ పాలసీతో కొత్త వాహనాలకు డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు వాహన స్క్రాపేజ్ పాలసీ కలిసొస్తుందని.. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2021–22 కేంద్ర బడ్జెట్లో స్వచ్ఛంధ వాహన స్క్రాపింగ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీలో వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, కమర్షియల్ వెహికిల్స్కు 15 ఏళ్ల ఫిట్నెస్ టెస్ట్లను నిర్వహిస్తారు. భారీ వాణిజ్య వాహనాలకు 2023 ఏప్రిల్ నుంచి, ఇతర వాహనాలకు 2024 జూన్ నుంచి పరీక్షలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అనర్హమైన వాహనాలు తొలగిపోతాయని.. దీంతో కొత్త వాహనాలకు డిమాండ్ పెరగడంతో పాటు వాహన పరిశ్రమ స్థిరపడుతుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ శంషేర్ దేవాన్ తెలిపారు. దీంతో పాటు కాలుష్యం, చమురు ఉత్పత్తుల దిగుమతులను తగ్గించడం, మెటల్ రీసైక్లింగ్, ముడి పదార్థాల వ్యయాలను తగ్గించడం వంటి ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే స్క్రాపింగ్ పాలసీ విజయవంతం కావాలంటే మౌలిక వసతుల ఏర్పాటు, స్క్రాప్ విలువల మదింపుపై మరింత స్పష్టత, స్క్రాప్ సర్టిఫికెట్ సామర్థ్యం వంటివి కీలకమని అభిప్రాయపడ్డారు. 2024 ఆర్ధిక సంవత్సరం నాటికి 15 ఏళ్ల కంటే పాత వాహనాలు 1.1 మిలియన్ యూనిట్లు ఉంటాయని ఇక్రా అంచనా వేసింది. అయితే ఆయా వాహనాల వినియోగం, స్వభావాలను బట్టి వాస్తవిక స్క్రాపేజీ సంభావ్యత కొంత మేర తగ్గొచ్చని తెలిపింది. -
ఆటోమొబైల్ రంగానికి బడ్జెట్ జోష్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా మూడో కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. కాలుష్య నివారణకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దానిలో భాగాంగా ఈసారి బడ్జెట్లో నూతన పాలసీని ప్రకటించారు. వాహనాలు పర్యావరణహితంగా ఉండాలన్నది తమ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి.. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కిందకు మార్చే పథకాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. (చదవండి: బడ్జెట్ 2021: రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం) వాయు కాలుష్య నివారణకుగాను రూ.2,217 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. కాలం చెల్లిన వాహనాల తుక్కు పాలసీ కింద వ్యక్తిగత వాహనాల జీవిత కాలం 20 ఏళ్లు, వాణిజ్య వాహనాల జీవితకాలాన్ని 15 ఏళ్లుగా నిర్ణయించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మలా పేర్కొన్నారు. త్వరలో తుక్కు విధానం రాబోతున్న నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీల జోష్ పెరిగింది. ఆటో రంగంలో పాత వాహనాలు నిరుపయోగంగా మారనుండటంతో కొత్త వాటికి గిరాకీ పెరిగి క్రమంగా ఉత్పత్తి పుంజుకునే అవకాశం ఉంది. -
ఆటో కంపెనీలకు దసరా పండగ..
న్యూఢిల్లీ: దసరా పండగ సందర్భంగా అక్టోబర్లో వాహనాల విక్రయాలు జోరుగా సాగాయి. కొత్త వస్తువుల కొనుగోళ్లకు శుభకరంగా పరిగణించే నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయని ఆటోమొబైల్ వర్గాలు వెల్లడించాయి. దిగ్గజ సంస్థలు మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ రెండంకెల స్థాయిలో వృద్ధి సాధించాయి. మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) విక్రయాలు సుమారు 20 శాతం వృద్ధితో 1,72,862 యూనిట్లుగా నమోదయ్యాయి. మినీ కార్ల అమ్మకాలు తగ్గినప్పటికీ స్విఫ్ట్, సెలీరియో వంటి కాంపాక్ట్ కార్లు, ఎస్–క్రాస్ వంటి యుటిలిటీ వాహనాల అమ్మకాలు పెరిగాయి. అటు హ్యుందాయ్ మోటార్ ఇండియా నెలవారీగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసింది. అక్టోబర్లో విక్రయాలు 13 శాతం పెరిగి 56,605 యూనిట్లకు చేరాయి. చివరిసారిగా 2018 అక్టోబర్లో హ్యుందాయ్ అత్యధికంగా 52,001 యూనిట్లు విక్రయించింది. ‘అక్టోబర్ గణాంకాలు వ్యాపార పరిస్థితులపరంగా సానుకూల ధోరణులకు శ్రీకారం చుట్టాయి. మరింత మెరుగైన పనితీరు కనపర్చగలమని ధీమాగా ఉన్నాం‘ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా డైరెక్టర్ తరుణ్ గర్గ్ తెలిపారు. ఇక హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 8 శాతం పెరిగి 10,836 యూనిట్లకు చేరాయి. మార్కెట్ సెంటిమెంట్కి తగ్గట్టుగా, తమ అంచనాలకు అనుగుణంగా అక్టోబర్లో సానుకూల ఫలితాలు సాధించగలిగామని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ చెప్పారు. నవరాత్రుల్లో అమ్మకాలు.. అక్టోబర్ మధ్యలో నవరాత్రులు మొదలైనప్పట్నుంచి వాహనాల విక్రయాలు పుంజుకున్నాయి. నవరాత్రుల్లో మారుతీ సుజుకీ అమ్మకాలు 27 శాతం పెరిగి 96,700 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే వ్యవధిలో మారుతీ సుమారు 76,000 వాహనాలు విక్రయించింది. ఇక హ్యుందాయ్ మోటార్ ఇండియా అమ్మకాలు కూడా 28 శాతం పెరిగి 26,068 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటార్స్ విక్రయాలు ఏకంగా 90 శాతం వృద్ధితో 5,725 యూనిట్ల నుంచి 10,887 యూనిట్లకు పెరిగాయి. సమీప భవిష్యత్తుపై పరిశ్రమ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. -
భారత్కు ‘హార్లే’ గుడ్బై!
న్యూఢిల్లీ: భారత ఆటోమొబైల్ మార్కెట్ విషయమై అమెరికన్ కంపెనీ హార్లే డేవిడ్సన్ అంచనాలు తలకిందులయ్యాయి. ప్రీమియం బైక్ల విభాగంలో మంచి వాటాను సొంతం చేసుకోవాలన్న ఆకాంక్షలతో భారత్లోకి అడుగు పెట్టిన ఈ సంస్థ.. నష్టాల కారణంగా దశాబ్ద కాలం తర్వాత ప్రస్తుత వ్యాపార నమూనా నుంచి వైదొలగాలని అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హరియాణాలోని బావల్లో ఉన్న తయారీ కేంద్రాన్ని మూసివేయనుంది. దీనివల్ల 70 మంది ఉపాధి కోల్పోనున్నారు. అమెరికా వెలుపల కంపెనీకి ఉన్న ఏకైక తయారీ కేంద్రం ఇది కావడం గమనార్హం. అదే విధంగా గురుగ్రామ్లో ఉన్న విక్రయాల కార్యాలయం పరిమాణాన్ని కూడా తగ్గించనున్నట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. భారత్లోని తన కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేయడంతోపాటు, భవిష్యత్తులోనూ ఉత్పత్తి పరంగా సహకారం అందుతుందని ఈ సంస్థ భరోసా ఇచ్చింది. కాంట్రాక్టు కాలం వరకు ప్రస్తుత డీలర్ల నెట్వర్క్ కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. అంటే పరిమిత కాలం వరకు కంపెనీ వాహన విక్రయాలు, విక్రయానంతర సేవలు కొనసాగనున్నాయి. ప్రస్తుత వ్యాపార విధానాన్ని మార్చుకోవడంతోపాటు.. భారత్లోని కస్టమర్లకు ఇక ముందూ సేవలు అందించే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్టు హార్లే డేవిడ్సన్ వివరణ ఇచ్చింది. అయితే, భారత్లో తన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లే భాగస్వామి కోసం హార్లే డేవిడ్సన్ చూస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా కంపెనీ వ్యాపార పునర్నిర్మాణ ప్రణాళికల్లో భాగమే ఈ నిర్ణయాలు. పునర్ నిర్మాణంలో భాగమే ‘‘2020 చివరి నాటికి అమలు చేయాలనుకున్న ‘రీవైర్’ ప్రణాళికలో భాగమే ఈ చర్యలు. అదే విధంగా హార్లే డేవిడ్సన్ బ్రాండ్, ఉత్పత్తుల ఆదరణ కోసం 2021–25 కాలానికి రూపొందించిన ‘హార్డ్వైర్’కు మారడంలో భాగమే’’ అంటూ హార్లే డేవిడ్సన్ తన ప్రకటనలో వివరించింది. భారత్ లో విక్రయాలు, తయారీ కార్యకలాపాలు నిలిపివేయనున్నట్టు అమెరికా స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థకు కం పెనీ తెలిపింది. ట్రంప్ ఒత్తిడి.. హార్లే డేవిడ్సన్ బైకులపై భారత్ భారీ పన్నులు వడ్డిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నోసార్లు నిరసన స్వరం వినిపించారు. పన్నులు తగ్గించకపోతే తాము కూడా అదే విధమైన చర్యను తీసుకోవాల్సి వస్తుందంటూ పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారు. దాంతో అప్పటి వరకు 100 శాతంగా ఉన్న పన్నును భారత్ సగానికి తగ్గించింది. అయినా ట్రంప్ శాంతించలేదు. భారత వాహనాలపై అమెరికాలో సున్నా పన్ను విధానాన్ని అమలు చేస్తున్నామని గుర్తు చేస్తూ మరింత తగ్గించాలని పలు పర్యాయాలు డిమాండ్ కూడా చేశారు. ఎంట్రీ.. ఎగ్జిట్ ► 2007 ఏప్రిల్లో కాలుష్య ఉద్గార, పరీక్షా నియమాల్లో భారత ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. దీంతో హార్లే డేవిడ్సన్ బైక్లు భారత మార్కెట్కు ఎగుమతి చేయడానికి మార్గం సుగమం అయింది. ► 2009 ఆగస్ట్లో హార్లే డేవిడ్సన్ ఇండియా కార్యకలాపాలు మొదలు ► 2010 జూలైలో మొదటి డీలర్షిప్ నియామకం, విక్రయాలు మొదలు ► 2011లో హరియాణాలోని ప్లాంట్లో బైక్ల అసెంబ్లింగ్ మొదలు ► విక్రయిస్తున్న మోడళ్లు: 11 ► ప్లాట్ఫామ్లు: 6 (స్పోర్ట్స్టర్, డైనా, సాఫ్టెయిల్, వీ రాడ్, టూరింగ్, స్ట్రీట్) ► 2020 సెప్టెంబర్లో వైదొలగాలని నిర్ణయం -
కియా సోనెట్ ఆగయా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ కియా మోటార్స్ ‘సోనెట్’ కాంపాక్ట్ ఎస్యూవీని శుక్రవారం భారత్లో ప్రవేశపెట్టింది. పెట్రోల్ 1.0 టి–జీడీఐ, స్మార్ట్స్ట్రీమ్ పెట్రోల్ 1.2 లీటర్, డీజిల్ 1.5 లీటర్ సీఆర్డీఐ డబ్ల్యూజీటీ, డీజిల్ 1.5 లీటర్ సీఆర్డీఐ వీజీటీ ఇంజన్ ఆప్షన్స్తో మొత్తం 17 వేరియంట్లలో ఈ కారును రూపొందించింది. అయిదు ట్రాన్స్మిషన్ రకాలు ఉన్నాయి. ధర వేరియంట్నుబట్టి ఎక్స్షోరూంలో రూ.6.71 లక్షలు మొదలుకుని రూ.11.99 లక్షల వరకు ఉంది. నాలుగు మీటర్ల లోపు ఉండే సోనెట్.. హ్యూందాయ్ వెన్యూ, మారుతి సుజుకి వితారా బ్రెజ్జా, టాటా మోటార్స్, నెక్సన్, హోండా డబ్ల్యూఆర్–వి, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కార్లకు పోటీ ఇవ్వనుంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్లో ఉన్న కియా అత్యాధునిక ప్లాంటులో సోనెట్ తయారు కావడం విశేషం. 70 దేశాలకు ఈ కారును ఎగుమతి చేయనున్నారు. ఇవీ సోనెట్ విశిష్టతలు.. ఫైవ్, సిక్స్ స్పీడ్ మాన్యువల్స్, సెవెన్ స్పీడ్ డీసీటీ, సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్, సిక్స్ స్పీడ్ స్మార్ట్స్ట్రీమ్ ఇంటెల్లిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రకాల్లో ఇది లభిస్తుంది. తొలిసారిగా సెగ్మెంట్లో 30కి పైగా కొత్త ఫీచర్లను జోడించినట్టు కంపెనీ ప్రకటించింది. నావిగేషన్, లైవ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్తో 10.25 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్, వైరస్, బ్యాక్టీరియా నుంచి రక్షణకు స్మార్ట్ ప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్, సబ్ వూఫర్స్తో బోస్ ప్రీమియం సెవెన్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, యువో కనెక్ట్, స్మార్ట్ కీతో రిమోట్ ఇంజన్ స్టార్ట్, ఆటోమేటిక్ మోడళ్లకు మల్టీ డ్రైవ్, ట్రాక్షన్ మోడ్స్, కూలింగ్ ఫంక్షన్తో వైర్లెస్ స్మార్ట్ఫోన్ చార్జర్ ఏర్పాటు ఉంది. ఎనమిది మోనోటోన్, మూడు డ్యూయల్ టోన్ రంగుల్లో సోనెట్ లభిస్తుంది. ఆరు ఎయిర్బ్యాగ్స్, ఏబీఎస్, పార్కింగ్ సెన్సార్స్ వంటివి పొందుపరిచారు. సెగ్మెంట్లో తొలిసారిగా డీజిల్ సిక్స్–స్పీడ్ ఆటోమేటిక్, ఇంటెల్లిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రవేశపెట్టారు. మైలేజీ వేరియంట్నుబట్టి 18.4 నుంచి 24.1 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. తొలి ఏడాది 1,50,000 యూనిట్లు.. కాంపాక్ట్ స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్ విభాగంలో సోనెట్ సంచలనం సృష్టిస్తుందని కియా మోటార్స్ ఇండియా ఎండీ, సీఈవో కూఖ్యున్ షిమ్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ మార్కెట్ కోసం తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా కారు సోనెట్కు ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోందని, 25,000 పైచిలుకు బుకింగ్స్ వచ్చాయని అన్నారు. తొలి రోజే 6,500 బుకింగ్స్ నమోదయ్యాయని, ప్రస్తుతం రోజుకు 1,000 వస్తున్నాయని గుర్తు చేశారు. సరఫరా సమస్యలేవీ ఉత్పన్నం కాలేదని, ఆంధ్రప్రదేశ్ ప్లాంటులో రెండవ షిప్ట్ ఇప్పటికే ప్రారంభించామని వెల్లడించారు. కరోనా ఉన్నప్పటికీ ఈ కారు ప్రవేశపెట్టడం వెనుక ఉద్యోగుల కఠోర శ్రమ ఉందన్నారు. ప్లాంటు వార్షిక తయారీ సామర్థ్యం 3 లక్షల యూనిట్లు అని గుర్తుచేశారు. భారత్ను తయారీ హబ్గా చేసుకున్నామన్నారు. దేశీయం గా తొలి ఏడాది ఒక లక్ష యూనిట్ల సోనెట్ కార్లు విక్రయించాలని లక్ష్యంగా చేసుకున్నట్టు కంపెనీ ఈడీ టే జిన్ పార్క్ పేర్కొన్నారు. అలాగే 50,000 యూనిట్లు ఎగుమతి చేయనున్నట్టు చెప్పారు. భారత్లో కనెక్టెడ్ కార్స్ విభాగంలో 60,000 పైచిలుకు యూనిట్ల మైలురాయిని అధిగమించిన తొలి కంపెనీగా నిలిచినట్టు కియా తెలిపింది. -
కొత్త పెట్టుబడులు కష్టమే..
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగం అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటోందని, కొత్తగా అమల్లోకి రాబోయే నిబంధనలకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితిలో లేదని వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా వ్యాఖ్యానించారు. భారత్ అమలు చేస్తున్న ఉద్గార ప్రమాణాలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాటికి సరిసమాన స్థాయిలోనే ఉంటున్నాయని.. నిబంధనల డోసేజీని అతిగా పెంచేయరాదని సియామ్ 60వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా వధేరా చెప్పారు. ఈ నేపథ్యంలో 2022 నుంచి అమల్లోకి వచ్చే కార్పొరేట్ సగటు ఇంధన సామర్థ్యం (సీఏఎఫ్ఈ) మొదలైన నిబంధనలకు అనుగుణంగా తయారీ చేసేందుకు కావాల్సిన పెట్టుబడులు పెట్టే స్తోమత పరిశ్రమకు లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తోడ్పాటునివ్వాలి.. ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2026 (ఏఎంపీ)లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమని వధేరా చెప్పారు. ఆటోమోటివ్, ఆటో పరికరాల పరిశ్రమ 2026 నాటికి ఏ స్థాయిలో ఉండాలి, దేశ ఆర్థిక వృద్ధిలో ఏ స్థాయిలో తమ వంతు పాత్ర పోషించాలి తదితర అంశాలపై ప్రభుత్వం, పరిశ్రమ కలిసి రూపొందించుకున్న ప్రణాళిక ఏఎంపీ 2026. దీని ప్రకారం ప్రస్తుతం జీడీపీ 7%గా ఉన్న ఆటో పరిశ్రమ వాటాను 12%కి పెంచుకోవాలని, ఇప్పటికే ఉన్న 3.7 కోట్ల ఉద్యోగాలకు అదనంగా 6.5 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని నిర్దేశించుకున్నారు. అలాగే, 2026 నాటికి వాహన ఉత్పత్తిని 6.6 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జీఎస్టీ రేట్ల కోత సంకేతాలు: సియామ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా వాహనాలపై జీఎస్టీ రేటును తగ్గించే అవకాశాలు ఉన్నట్లుగా భారీ పరిశ్రమల మంత్రి ప్రకాశ్ జవదేకర్ సంకేత మిచ్చారు. ఆటోమోటివ్ పరిశ్రమ త్వరలోనే ’శుభ వార్త’ వింటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుతం ద్విచక్ర వాహనాలపై 28 శాతం జీఎస్టీ అమలవుతోంది. మరోవైపు ఆటోమొబైల్ పరిశ్రమకు కావల్సిన పూర్తి మద్దతు ఇస్తామని కేంద్ర మంత్రి నితిని గడ్కరీ చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే విధంగా ఫ్లెక్స్–ఫ్యూయల్ ఇంజిన్లను భారత్లో తయారు చేయడంపై కంపెనీలు దృష్టి సారించాలని ఆయన సూచించారు. కాగా, భారత ఆటో పరిశ్రమ చరిత్రలోనే అత్యంత కష్టకాలం ఎదుర్కొంటోందని మారుతీ ఎండీ కెనిచి అయుకవ పేర్నొన్నారు. జీఎస్టీని తగ్గించడం, ప్రోత్సాహకాల ఆధారిత స్క్రాపేజీ విధానం తదితర మార్గాల్లో ప్రభుత్వం తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. సియామ్ కొత్త అధ్యక్షుడిగా మారుతీ సీఈఓ మారుతీ సుజుకీ కంపెనీ సీఈవో కెనిచి ఆయుకవ సియామ్ కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ఈయన 2 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా అశోక్ లేలాండ్ ఎండీ, సీవోఓ విపిన్ సోంధి ఎన్నికయ్యారని, ట్రెజరర్గా ఐషర్ మోటర్ ఎండీ వినోద్ అగర్వాల్ కొనసాగుతారని సియామ్ పేర్కొంది. -
మారుతీ చరిత్రలో తొలిసారి నష్టాలు
న్యూఢిల్లీ: దేశీయ కార్ల మార్కెట్లలో రారాజు అయిన మారుతి సుజుకీ కరోనా దెబ్బకు నష్టాల పాలైంది. జూన్తో అంతమైన మూడు నెలల కాలంలో రూ.268 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టం వచ్చింది. 2003 జూలైలో కంపెనీ స్టాక్ ఎక్ఛ్సేంజ్లలో లిస్ట్ అయిన తర్వాత నష్టాలు ఎదుర్కోవడం మొదటిసారి. సరిగ్గా ఏడాది క్రితం ఇదే జూన్ త్రైమాసికంలో మారుతి రూ.1,377 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాలను కళ్ల చూడగా, కరోనా మహమ్మారి కారణంగా కార్యకలాపాలపై గట్టి ప్రభావమే పడినట్టు తెలుస్తోంది. ఇక జూన్తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.18,739 కోట్ల నుంచి రూ.3,679 కోట్లకు పరిమితమైంది. వాహన విక్రయాలు 76,599 యూనిట్లుగా ఉన్నాయి. వీటిల్లో దేశీయంగా 67,027 వాహనాలను విక్రయించగా, 9,572 యూనిట్లను ఎగుమతి చేసింది. కానీ సరిగ్గా ఏడాది క్రితం ఈ కాలంలో కంపెనీ విక్రయాలు 4,02,594 యూనిట్లుగా ఉండడం గమనార్హం. ‘‘కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ చరిత్రలోనే ఇదొక అసాధారణ త్రైమాసికం. ఈ కాలంలో ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా అధిక సమయం ఎటువంటి ఉత్పత్తి, విక్రయాలకు అవకాశం లభించలేదు. మా మొదటి ప్రాధాన్యత ఉద్యోగులు, భాగస్వాములు, కస్టమర్ల ఆరోగ్యం, భద్రతకే. దీంతో జూన్ త్రైమాసికంలో చేసిన మొత్తం ఉత్పత్తి సాధారణ రోజుల్లో అయితే రెండు వారాల ఉత్పత్తికి సమానం’’ అని మారుతి సుజుకీ తన ప్రకటనలో వివరించింది. కరోనా ముందస్తు కార్యకలాపాల స్థాయికి చేరువ అవుతున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో మారుతి సుజుకీ స్టాక్ బీఎస్ఈలో 1.6 శాతం నష్టపోయి రూ.6,186 వద్ద ముగిసింది. -
చైనాకు కళ్లెం ఎలా?
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను అన్నిరకాలుగా నిలువరించేందుకు భారత్ గట్టి చర్యలే తీసుకుంటోంది. ఇందులో భాగంగా 59 చైనా యాప్స్ను నిషేధించింది. తద్వారా చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో ఇది కీలక పరిణామమే. ఇప్పటికే చైనాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకునే ప్రణాళికలను భారత్ అమలు చేస్తోంది. దేశీయంగా హ్యాండ్సెట్స్ తయారీ మొదలైన వాటిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం మొదలైంది. అయితే, చైనాకు చెక్ పెట్టేందుకు ఇవి సరిపోతాయా అంటే ఇంకా చర్యలు అవసరమనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశీ కంపెనీలు ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి వస్తున్న టెలికం, ఆటోమొబైల్ పరికరాల విషయంలోనూ దేశీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా డ్రాగన్కు చెక్ చెప్పవచ్చని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. టెలికం రంగం.. వార్షికంగా చూస్తే చైనా నుంచి భారత్ గతేడాది దిగుమతి చేసుకున్న సెల్ఫోన్ల సంఖ్య 33 శాతం తగ్గింది. దేశీ సంస్థలు క్రమంగా పుంజుకోవడానికి ఇది శుభసూచనే. ప్రస్తుతం భారత స్మార్ట్ఫోన్స్ మార్కెట్ పరిమాణం రూ. 2 లక్షల కోట్ల పైగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందనుంది. అయితే, ఈ మార్కెట్ను 70–80 శాతం శాసిస్తున్నది చైనా కంపెనీలే. భారీ అమ్మకాలతో చైనా కంపెనీలు గట్టిగా పాతుకుపోయాయి. కానీ దేశీయంగా తయారీకి ఊతం లభిస్తున్నందున భారతీయ సంస్థలు క్రమంగా ఈ మార్కెట్లో చొచ్చుకుపోయేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. ఈ విభాగంలో చైనా బ్రాండ్లను, పరికరాల దిగుమతులను నిషేధించిన పక్షంలో టెలికం రంగం రూపురేఖలే మారిపోతాయని పేర్కొన్నారు. చైనా ప్రమేయం లేకుండా చూసే దిశగా టెండర్లపై మరోసారి కసరత్తు చేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. 4జీ, 5జీ సర్వీసుల్లోకి బీఎస్ఎన్ఎల్ విస్తరిస్తున్న నేపథ్యంలో చైనా పరికరాలను ఉపయోగించవద్దంటూ బీఎస్ఎన్ఎల్కు స్పష్టమైన సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు భవిష్యత్ విస్తరణ ప్రణాళికల్లో చైనా టెలికం పరికరాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలంటూ ప్రైవేట్ రంగ భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు కూడా టెలికం శాఖ (డాట్) అధికారికంగా ఆదేశాలు కూడా ఇ చ్చే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆటోమోటివ్ రంగం.. ఇక దేశీ ఆటోమొబైల్ మార్కెట్లో కూడా భారత్ గట్టిగా నిలదొక్కుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం భారత స్థూల దేశీయోత్పత్తిలో ఆటో పరికరాలు, డిజైన్, అభివృద్ధి, ఈ–బస్సులు, విద్యుత్ వాహనాలు మొదలైన వాటి వాటా 7.5 శాతం స్థాయిలో మాత్రమే ఉంది. ప్రత్యామ్నాయ మార్కెట్లు ఉన్నప్పటికీ దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతులు చేసుకుంటున్నాయి. కార్మికులు అత్యధికంగా అవసరమయ్యే ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించగలదు. ఆటోమోటివ్ విభాగంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు రాబోయే రోజుల్లో గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే అయిదేళ్లలో వాహనాలు, పరికరాల ఎగుమతులను భారీగా ప్రోత్సహించే దిశగా ఇటీవలే భారీ పరిశ్రమల శాఖ పలు చర్యలు తీసుకుంది. ఇక ఇప్పటికే చైనా కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్లను కూడా కంపెనీలు, రాష్ట్రాల ప్రభుత్వాలు పునఃసమీక్షిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితమే 2000 పైచిలుకు ఈ–బస్సుల కోసం మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఒక చైనా కంపెనీకి భారీ ఆర్డర్లు దక్కాయి. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటిని రద్దు చేయాలంటూ అన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటనలు రావాల్సి ఉంది. దేశీయంగా గట్టి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నందున ఈ ఆర్డర్లను భారతీయ కంపెనీలకే ఇచ్చి, దిగుమతులను నిషేధించడం వల్ల ఈ రంగంపై సానుకూల ప్రభావం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దేశీ మార్కెట్ను పటిష్టం చేయడంతో పాటు ఇది ఎకానమీ వృద్ధికి, స్థానికంగా ఉపాధి కల్పనకు ఊతమివ్వగలదని చెబుతున్నాయి. పోర్టుల వద్ద నిలిచిన ఫార్మా ఉత్పత్తులు హైదరాబాద్: దేశంలో పలు పోర్టుల వద్ద ఫార్మా ముడిసరుకులు నిలిచిపోయాయి. కస్టమ్స్ క్లియరెన్సు కోసం ఇవి ఎదురుచూస్తున్నాయి. ముడి సరుకు సమయానికి చేరకపోవడంతో దేశీయంగా తయారీ విషయంలో ఇక్కడి కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా తమకు సభ్య కంపెనీల నుంచి కాల్స్ వస్తున్నాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మెక్సిల్) తెలిపింది. క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఉత్పత్తుల్లో అత్యధికం చైనా నుంచి దిగుమతి అయినవేనని కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. కీలక ముడి పదార్థాలు, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ ఏ కారణంగా పోర్టుల వద్ద నిలిచిపోయాయో పరిశ్రమకు తెలియదంటూ ఫార్మెక్సిల్ చైర్మన్ దినేశ్ దువా కేంద్ర ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీకి లేఖ రాశారు. కీలక ఉత్పత్తులు సైతం.. మెడికల్ డివైసెస్, గ్లూకోమీటర్స్, స్ట్రిప్స్ సైతం పోర్టుల వద్ద నిలిచిపోయాయి. అలాగే కోవిడ్–19 విస్తృతి నేపథ్యంలో కీలకంగా మారిన ఇన్ఫ్రారెడ్ థెర్మామీటర్స్, పల్స్ ఆక్సీమీటర్స్ వంటి డయాగ్నోస్టిక్స్ క్రిటికల్ డివైసెస్ సైతం వీటిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా లేఖలో దినేశ్ దువా కోరారు. -
వాహన అమ్మకాలు రివర్స్గేర్లోనే..
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం రివర్స్గేర్లోనే పయనిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఈ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏకంగా 89% తగ్గుదల నమోదైంది. గతేడాది మే నెల్లో 1,25,552 యూనిట్లను విక్రయించిన ఈ సంస్థ గతనెల్లో 13,888 యూనిట్లను మాత్రమే అమ్మగలిగింది. ఇదే విధంగా మిగిలిన కార్ల తయారీ కంపెనీలు కూడా విక్రయాల్లో భారీ తగ్గుదలను ప్రకటించాయి. మరోవైపు ద్విచక్ర వాహన రంగ దిగ్గజం హీరో మోటోకార్ప్ మే నెల అమ్మకాలు 83% శాతం తగ్గిపోగా.. వాణిజ్య వాహన రంగానికి చెందిన అశోక్ లేలాండ్ సైతం 90% క్షీణతను నమోదుచేసింది. వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం ఏప్రిల్లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగిన కారణంగా ఆ నెల్లో దాదాపు అన్ని సంస్థలు సున్నా సేల్స్ను ప్రకటించడం తెలిసిందే. -
చల్ వాహన రంగ!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ సహా పలు కారణాలతో కుదేలైన ఆటోమొబైల్ రంగం మళ్లీ పుంజుకునే ప్రయత్నాల్లో పడింది. వేసవి సీజన్ అమ్మకాలకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా క్రమంగా ఆంక్షలు సడలిస్తుండటంతో ఇప్పటిదాకా మూతబడిన షోరూమ్లను, నిల్చిపోయిన ఉత్పత్తిని కంపెనీలు పునఃప్రారంభిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 600 డీలర్షిప్లను తిరిగి ప్రారంభించినట్లు కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) బుధవారం వెల్లడించింది. వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే, వాహన కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేలా అవుట్లెట్స్ కొత్త ప్రమాణాలు అమలు చేస్తున్నట్లు, డిజిటల్ సౌలభ్యాన్ని సైతం అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ ఈడీ (మార్కెటింగ్, సేల్స్ విభాగం) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సుమారు 600 డీలర్షిప్లను తెరవగలిగాం. మిగతా ప్రాంతాల్లోనూ అవసరమైన అనుమతుల కోసం డీలర్లు దరఖాస్తు చేసుకున్నారు‘ అని వివరించారు. ఇప్పటికే 55 వాహనాలు డెలివరీ కూడా చేసినట్లు చెప్పారు. కంపెనీకి దేశవ్యాప్తంగా 1,960 నగరాలు, పట్టణాల్లో 3,080 డీలర్షిప్లు ఉన్నాయి. తాజాగా తెరిచిన వాటిల్లో 474 ఏరీనా అవుట్లెట్స్, 80 నెక్సా డీలర్షిప్లు, 45 వాణిజ్య వాహనాల అవుట్లెట్స్ ఉన్నాయని శ్రీవాస్తవ చెప్పారు. కార్లకు డోర్ స్టెప్ డెలివరీ సేవలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఉత్పత్తి మొదలు.. దేశవ్యాప్తంగా తమ ఫ్యాక్టరీలన్నింటిలోనూ కార్యకలాపాలు ప్రారంభించినట్లు ద్విచక్ర, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ వెల్లడించింది. హోసూరు, మైసూరు, నాలాగఢ్లోని ఫ్యాక్టరీల్లో కార్యకలాపాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో వివరించింది. అటు, మారుతీ సుజుకీ తమ మానెసర్ ప్లాంటులో ఉత్పత్తిని మే 12 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇక లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్–బెంజ్ సైతం పుణేలోని చకన్ ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించినట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు పరిమిత సంఖ్యలో సిబ్బందితో మొదలుపెట్టినట్లు వివరించింది. కొన్ని ప్రాంతాల్లో డీలర్షిప్లు కూడా కార్యకలాపాలు పునఃప్రారంభించినట్లు పేర్కొంది. ఇక యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ ఇసుజు మోటార్స్ ఇండియా సైతం ఆంధ్రప్రదేశ్లోని శ్రీసిటీ ప్లాంటులో కార్యకలాపాల పునఃప్రారంభానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు వెల్లడించింది. తయారీకి సంబంధించిన సన్నాహాలు మొదలుపెట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఫీల్డ్ ప్లాంట్ ప్రారంభం చెన్నై: ఐచర్ మోటార్స్కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ.. తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఉన్న ఒరగాడమ్ తయారీ యూనిట్లో కార్యకలాపాలను బుధవారం ప్రారంభించింది. ఈ సంస్థకు చెన్నైలోని ఒరగాడమ్తోపాటు, తిరువొత్తియార్, వల్లమ్ వడగల్ వద్ద కూడా ప్లాంట్లు ఉన్నాయి. తొలుత ఒరగాడమ్ ప్లాంట్లో కొద్ది మంది సిబ్బందితో ఒకే షిఫ్ట్గా పనులు ప్రారంభించినట్టు సంస్థ ప్రకటించింది. తిరువొత్తియార్, వడగల్ ప్లాంట్లలో క్రమంగా కార్యకలాపాలను ప్రారంభిస్తామని తెలిపింది. షోరూ ములు పాక్షికంగా కార్యకలా పాలు మొదలయ్యా యని, 10 రోజుల్లో దాదాపు 300 షోరూమ్లు షురూ అవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అదే బాటలో హ్యుందాయ్.. వివిధ రాష్ట్రాల్లో 250 దాకా కంపెనీ డీలర్షిప్లు కార్యకలాపాలు పునఃప్రారంభించినట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలు, కేరళ, కర్ణాటక, ఉత్తరాఖండ్ తదితర ప్రాంతాల్లో ఇవి ఉన్నాయని పేర్కొంది. కంపెనీకి దేశవ్యాప్తంగా సుమారు 500 పైచిలుకు డీలర్షిప్లు ఉన్నాయి. ‘రెండు రోజులుగా వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టాం. పెండింగ్ బుకింగ్స్ చాలా ఉన్నాయి. డీలర్ల దగ్గరున్న నిల్వలు వీటికి సరిపోతాయి‘ అని సంస్థ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్) తరుణ్ గర్గ్ తెలిపారు. మిగతా ప్రాంతాల్లోని డీలర్లు కూడా అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నారని, రాగానే కార్యకలాపాలు ప్రారంభిస్తారని వివరించారు. కరోనా కష్టకాలంలో కొనుగోలుదారులు ఈఎంఐల గురించి ఆందోళన చెందకుండా కొన్ని కార్ల మోడల్స్పై ఈఎంఐ అష్యూరెన్స్ పేరిట ప్రత్యేక ఆఫర్ ఇస్తున్నామని గర్గ్ చెప్పారు. హోండాకు సిబ్బంది సమస్యలు.. తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిబ్బంది కొరత సమస్యగా మారిందని హోండా కార్స్ ఇండియా (హెచ్సీఐఎల్) తెలిపింది. రాజస్థాన్లోని తపుకరా ప్లాంట్కి అనుమతులు గతవారమే వచ్చినా ప్రయాణాలపై ఆంక్షలతో కార్మికులు రావడానికి ఇబ్బందులు ఉన్నాయని వివరించింది. వచ్చే వారం కార్యకలాపాలు మొదలుపెట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొంది. అలాగే అనుమతులు, సిబ్బంది కొరత సమస్యలను అధిగమించాకా గ్రేటర్ నోయిడా ప్లాంటులోనూ ఉత్పత్తి ప్రారంభించగలమని హెచ్సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేశ్ గోయల్ తెలిపారు. అటు, డీలర్షిప్ల్లో కొన్ని తిరిగి తెరుచుకున్నట్లు వివరించారు. -
వాహన విక్రయాలు లాక్‘డౌన్’
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి నిర్దేశించిన లాక్డౌన్ మార్చి వాహన విక్రయాలపై తీవ్రంగానే ప్రభావం చూపించింది. దీనికితోడు బీఎస్6 పర్యావరణ నిబంధనలు అమల్లోకి రానుండటంతో వాహన అమ్మకాలు భారీగానే తగ్గాయి.మారుతీ సుజుకీ, హ్యుందాయ్ అమ్మకాలు దాదాపు సగం వరకూ తగ్గగా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కిర్లోస్కర్ (టీకేఎమ్) కంపెనీల అమ్మకాలు 40–90% రేంజ్లో క్షీణించాయి. -
ప్లాంట్లు మూసేయండి – ఉత్పత్తి ఆపేయండి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నియంత్రణ చర్యల్లో భాగంగా వాహనాలు, విడిభాగాల తయారీ సంస్థలు కొంత కాలం పాటు ఉత్పత్తి నిలిపివేయాలని, ప్లాంట్లను తాత్కాలికంగా మూసివేసే అంశాలను పరిశీలించాలని పరిశ్రమల సమాఖ్యలు సూచించాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ (సియామ్), ఆటో కాంపోనెంట్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ).. కంపెనీలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. ఇలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే.. సిబ్బంది వైరస్ బారిన పడకుండా చూసేందుకు కొంతైనా తోడ్పడగలవని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. బాధ్యతాయుతంగా జాతి నిర్మాణంలో భాగం కావాలన్న సియామ్ నినాదానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్లాంట్ల మూసివేత బాటలో మరిన్ని సంస్థలు.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరికొన్ని కంపెనీలు తమ ప్లాంట్లలో తయారీ కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. హ్యుందాయ్ మోటార్, టయోటా కిర్లోస్కర్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. మార్చి 23 నుంచే (సోమవారం) చెన్నై ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు హ్యుందాయ్ ప్రకటించగా, టయోటా కిర్లోస్కర్ .. కర్ణాటకలోని బిడది ప్లాంటులో తయారీ ఆపివేస్తున్నట్లు తెలిపింది. టీవీఎస్ మోటార్ తమ ప్లాంట్లన్నింటిలోనూ మార్చి 23 నుంచి రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. పరిస్థితిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు బజాజ్ ఆటో కూడా తమ ఫ్యాక్టరీల్లో తయారీ కార్యకలాపాలు ఆపేసినట్లు సోమవారం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మహారాష్ట్రలోని చకన్తో పాటు మిగతా ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లో కూడా ఉత్పత్తి నిలిపివేసినట్లు బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సర్వీసుల కోసం స్వల్ప సంఖ్యలో మాత్రమే సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ఉద్యోగుల విదేశీ ప్రయాణాలను, సమావేశాలను రద్దు చేశామని.. పలువురికి వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలు చేస్తున్నామని శర్మ చెప్పారు. కాంట్రాక్టు ప్రాతిపదికన తమకు వాహనాలు తయారు చేసి అందించే సుజుకీ మోటార్ గుజరాత్ (ఎస్ఎంజీ) ఉత్పత్తి నిలిపివేసినట్లు మారుతీ సుజుకీ తెలిపింది. కార్ల తయారీ సంస్థలు కియా మోటార్స్, బీఎండబ్ల్యూ, రెనో కూడా ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ప్లాంటు, కంపెనీ కార్యాలయం కార్యకలాపాలు కొన్నాళ్లు ఆపివేస్తున్నట్లు కియా మోటార్స్ వెల్లడించింది. సిబ్బంది, వినియోగదారులు, భాగస్వాములు మొదలైన వారందరి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు, మార్చి నెలాఖరు దాకా తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం ఇండియా యమహా మోటార్ (ఐవైఎం) తెలిపింది. హర్యానా, ఉత్తర్ప్రదేశ్ ప్లాంట్లలో మార్చి 23 నుంచి 31 దాకా, తమిళనాడు ప్లాంటులో మార్చి 24 నుంచి 31 దాకా తయారీ కార్యకలాపాలు ఉండవని వివరించింది. మారుతీ సుజుకీ, హోండా కార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫియట్, హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్, సుజుకీ మోటార్సైకిల్ వంటి సంస్థలు తయారీని నిలిపివేస్తున్నట్లు ఆదివారమే ప్రకటించిన సంగతి తెలిసిందే. -
వాహనాల తయారీకి వైరస్ బ్రేక్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యల్లో భాగంగా ఆటోమొబైల్ దిగ్గజాలు ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) గురుగ్రామ్, మానెసర్లోని (హరియాణా) తమ ప్లాంట్లలో తక్షణం ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. ఈ రెండు ప్లాంట్లలో ఏటా 15.5 లక్షల వాహనాలు ఉత్పత్తవుతాయి. అటు రోహ్తక్లోని పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని కూడా మూసివేస్తున్నట్లు పేర్కొంది. షట్డౌన్ ఎన్నాళ్ల పాటు ఉంటుందనేది ప్రభుత్వ విధానంపై ఆధారపడి ఉంటుందని వివరించింది. అటు హోండా కార్స్ ఈ నెలాఖరు దాకా తమ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తప్పనిసరి సర్వీసుల విభాగాల సిబ్బంది మినహా మిగతా ఉద్యోగులంతా ఇళ్ల నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని హెచ్సీఐఎల్ ప్రెసిడెంట్ గకు నకానిషి తెలిపారు. మరోవైపు, మహీంద్రా అండ్ మహీంద్రా కూడా మహారాష్ట్రలోని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. నాగ్పూర్ ప్లాంట్లో ఇప్పటికే ఆపివేశామని, చకన్ (పుణే), కాండివిలి (ముంబై) ప్లాంట్లలో సోమవారం నుంచి నిలిపివేస్తామని పేర్కొంది. అటు ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ సైతం తమ ప్లాంట్లో ఈ నెలాఖరుదాకా ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఎంజీ మోటార్ ఇండియా సంస్థ గుజరాత్లోని హలోల్ ప్లాంటును మార్చి 25 దాకా మూసివేస్తున్నట్లు తెలిపింది. ఇతర దేశాల్లోనూ..: హీరో మోటోకార్ప్ ఉద్యోగుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్తో పాటు కొలంబియా, బంగ్లాదేశ్ తదితర విదేశీ ప్లాంట్లలో కూడా కార్యకలాపాలు తక్షణమే నిలిపివేస్తున్నట్లు ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ వెల్లడించింది. మార్చి 31 దాకా ఇది అమలవుతుందని పేర్కొంది. జైపూర్లోని సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సహా ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులు నివాసాల నుంచే విధులు నిర్వర్తిస్తారని వివరించింది. అత్యవసర సర్వీసుల సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు హాజరవుతారని పేర్కొంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) భారత్లోని మొత్తం నాలుగు ప్లాంట్లలోనూ కార్యకలాపాలు తక్షణమే నిలిపివేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా ఫండ్... మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కొద్ది వారాల పాటు లాక్డౌన్ చేయాలంటూ ప్రతిపాదించారు. పెద్ద ఎత్తున తాత్కాలిక ఆస్పత్రుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ఆర్మీకి తమ గ్రూప్ ప్రాజెక్ట్ టీమ్ పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సిద్దమని చెప్పారు. ‘మా మహీంద్రా హాలిడేస్ సంస్థ తరఫున రిసార్ట్లను తాత్కాలిక వైద్య కేంద్రాలుగా మార్చి, సేవలు అందించేందుకు కూడా సిద్ధం‘ అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉన్నందున.. తమ ప్లాంట్లలో వాటి తయారీపై తక్షణం కసరత్తు ప్రారంభించామని తెలిపారు. అత్యంత ప్రతికూల ప్రభావాలెదుర్కొనే చిన్న వ్యాపార సంస్థలు, స్వయం ఉపాధి పొందేవారికి తోడ్పాటు అందించేందుకు మహీంద్రా ఫౌండేషన్ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తుందని మహీంద్రా చెప్పారు. తన పూర్తి వేతనాన్ని ఫండ్కు విరాళమిస్తున్నట్లు.. ఇతర ఉద్యోగులు స్వచ్ఛందంగా విరాళమివ్వొచ్చన్నారు. -
ఆటో రంగానికి వైరస్ కాటు...!
న్యూఢిల్లీ: దేశీ ఆటో పరిశ్రమకు కోవిడ్–19 (కరోనా) వైరస్ కుంగదీసింది. గతేడాదిలో భారీ పతనాన్ని నమోదుచేసి.. ఈ ఏడాది ప్రారంభంలో కాస్త పర్వాలేదు అనిపించిన ఈ రంగాన్ని తాజాగా కరోనా వైరస్ మళ్లీ పడేసింది. దిగ్గజ ఆటో సంస్థ మారుతి సుజుకీ దేశీయ వాహన విక్రయాలు ఫిబ్రవరి నెలలో 1.6 శాతం పడిపోయాయి. గత నెల్లో 1,36,849 యూనిట్లకు పరిమితమయ్యాయి. మహీంద్ర అండ్ మహీంద్ర (ఎం అండ్ ఎం) అమ్మకాలు ఏకంగా 42 శాతం క్షీణించాయి. కరోనా వైరస్ కారణంగా చైనా నుంచి సప్లై తగ్గడం వల్ల ఈ స్థాయి పతనం నమోదైందని సంస్థ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ (ఆటోమోటివ్ డివిజన్) వీజయ్ రామ్ నక్రా వెల్లడించారు. వైరస్ కారణంగానే తమ కంపెనీ ఫిబ్రవరి విక్రయాలు తగ్గాయని టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్స్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. -
చైనాలో వాహన విక్రయాలు డౌన్
బీజింగ్: చైనాలో వాహన విక్రయాలకు కరోనా వైరస్ సెగ తగులుతోంది. జనవరిలో ఆటో అమ్మకాలు .. గతేడాది జనవరితో పోలిస్తే ఏకంగా 20.2 % పడిపోయాయి. 16 లక్షలకు పరిమితమైనట్లు చైనా వాహన తయారీ సంస్థల సమాఖ్య సీఏఏఎం ప్రకటించింది. అమ్మకాలు పడిపోవడంతో కంపెనీలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయని పేర్కొంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం, వృద్ధి మందగమనం, ఉద్యోగాల కోత వంటి సమస్యలతో చైనా సతమతమవుతుండగా.. తాజాగా మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. కరోనా వైరస్ మరింత విస్తరించకుండా కట్టడి చేసేందుకు నూతన సంవత్సర సెలవులను మరింతగా పొడిగించడం.. ఫలితంగా ఫ్యాక్టరీలు, డీలర్షిప్లు మూతబడటం మొదలైన పరిణామాలు ఆటోమొబైల్ పరిశ్రమను మరింతగా కుదేలు చేస్తున్నాయి. సాధారణంగా జనవరిలో సెలవుల సీజన్ తర్వాత ఫిబ్రవరిలో అమ్మకాలు భారీగా నమోదవుతాయి. అయితే, ప్రస్తుతం ఫిబ్రవరి సగం గడిచిపోయినా.. కంపెనీలు ఇంకా తయారీ కార్యకలాపాలు ప్రారంభించలేదు. స్వల్పకాలికంగా వాహనాల ఉత్పత్తి, అమ్మకాలపై గణనీయంగా ప్రతికూల ప్రభావం పడుతోందని, పరికరాల సరఫరా వ్యవస్థకు సమస్యలు తప్పవని సీఏఏఎం తెలిపింది. -
వాహన అమ్మకాలు.. బే‘కార్’!
గ్రేటర్ నోయిడా: దేశీయంగా వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగుతోంది. కొత్త ఏడాదిలోనూ అమ్మకాలు పుంజుకోలేదు. జనవరిలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 6.2 శాతం క్షీణించాయి. వాహనాల కొనుగోలు భారం పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మందగించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త బీఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉండే వాహనాల రేట్లు అధిక స్థాయిలో ఉండటం, ముడివస్తువుల ధరల పెరగడంతో జనవరిలో కొన్ని ఆటోమొబైల్ కంపెనీలు వాహనాల రేట్లను పెంచడం కూడా అమ్మకాలపై ప్రతికూల ప్రభావాలు చూపాయి. ‘జీడీపీ వృద్ధి మందగమనం, వాహన కొనుగోలు వ్యయాలు పెరగడం వంటి అంశాల ప్రతికూల ప్రభావాలు వాహన విక్రయాలపై కొనసాగుతున్నాయి‘ అని అని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా తెలిపారు. ‘ఇన్ఫ్రా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ఇటీవలచేసిన ప్రకటనలతో వాహనాల అమ్మకాలు మళ్లీ పుంజుకోగలవని ఆశిస్తున్నాం. ముఖ్యంగా వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాల సెగ్మెంట్ మెరుగుపడగలదని భావిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. త్రిచక్ర వాహనాలు కాస్త ఊరట.. జనవరి గణాంకాలను ప్రస్తావిస్తూ.. త్రిచక్ర వాహనాలు మినహా అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు పడిపోయాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ చెప్పారు. పరిశ్రమ ఇంకా నెగటివ్లోనే ఉన్నప్పటికీ.. పండుగల సీజన్ తర్వాత విక్రయాల క్షీణత తీవ్రత కాస్త తగ్గిందని ఆయన తెలిపారు. ‘ప్రస్తుతం కొనసాగుతున్న ఆటో ఎక్స్పోలో సందర్శకుల స్పందనను బట్టి చూస్తే.. వినియోగదారుల సెంటిమెంటు మరింత మెరుగుపడగలదని ఆశిస్తున్నాం. ఇందులో ఇప్పటిదాకా దాదాపు 70 వాహనాలను ఆవిష్కరించారు‘ అని ఆయన చెప్పారు. విక్రయాల తీరిదీ.. ► గతేడాది జనవరిలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,80,091 యూనిట్లు. ఈ ఏడాది జనవరిలో 2,62,714 యూనిట్లకు తగ్గాయి. ► కార్ల అమ్మకాలు 8.1% క్షీణించి 1,79,324 యూ నిట్ల నుంచి 1,64,793కి పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16 శాతం పడిపోయాయి. 15,97,528 యూనిట్ల నుంచి 13,41,005 యూనిట్లకు తగ్గాయి. మోటార్ సైకిళ్ల అమ్మకాలు 15 శాతం తగ్గి 10,27,766 నుంచి 8,71,886కి క్షీణించాయి. స్కూటర్లు 16 శాతం క్షీణించి 4,97,169 యూనిట్ల నుంచి 4,16,594కి పరిమితమయ్యాయి. ► వాణిజ్య వాహనాల అమ్మకాలు 14 శాతం పడిపోయాయి. 87,591 యూనిట్ల నుంచి 75,289 యూనిట్లకు తగ్గాయి. ► వివిధ కేటగిరీల్లో అన్ని వాహనాల విక్రయాలు 13.83 శాతం తగ్గి.. 20,19,253 యూనిట్ల నుంచి 17,39,975 యూనిట్లకు క్షీణించాయి. ► కంపెనీలవారీగా చూస్తే కార్ల విభాగంలో మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు మాత్రం 0.29% పెరిగి 1,39,844 యూనిట్లుగా నమోదయ్యాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా విక్రయాలు 8% క్షీణించి 42,002 యూనిట్లకు పరిమితమయ్యాయి. ► ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ విక్రయాలు 14 శాతం పడిపోయాయి. -
వాహన రంగానికి ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: దేశీయ వాహన రంగ పరిశ్రమ గతేడాదిలో భారీ క్షీణతను నమోదుచేసింది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2019లో మొత్తం ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు 2,30,73,438 యూనిట్లు కాగా, అంతక్రితం ఏడాది (2018)లో అమ్ముడైన 2,67,58,787 యూనిట్లతో పోల్చితే ఏకంగా 13.77 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. ఈ సంఘం వద్ద 1997 నుంచి ప్రతీ ఏడాదికి సంబంధించిన అమ్మకాల సమాచారం ఉండగా.. మునుపెన్నడూ లేని విధంగా గతేడాది విక్రయాలు భారీ క్షీణతను నమోదుచేశాయి. ఇక ప్యాసింజర్ వాహన విక్రయాలు 29,62,052 యూనిట్లుగా నిలిచాయి. ఈ విభాగంలో 12.75 శాతం తగ్గుదల చోటుచేసుకుంది. 2013 తరువాత అత్యంత కనిష్టస్థాయి ఇది. ద్విచక్ర వాహన విభాగంలో 14.19 శాతం తగ్గుదల (1,85,68,280 యూనిట్ల విక్రయాలు) నమోదు కాగా, వాణిజ్య వాహన విభాగంలో 14.99 శాతం క్షీణత నమోదైంది. గతేడాది అమ్మకాలు ఈ స్థాయిలో పడిపోవడానికి.. భారత్ స్టేజ్–సిక్స్(బీఎస్–6) నిబంధనల అమలు వంటి ప్రభుత్వ నిర్ణయాలు, రుణ లభ్యత గణనీయంగా తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయని సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వడేరా వ్యాఖ్యానించారు. ఇక ఈ ఏడాదిలోనైనా ప్రభుత్వం జీఎస్టీ రేటును 18 శాతానికి తగ్గించి, స్క్రాపేజ్ విధానాన్ని అమలుచేస్తే పరిశ్రమ కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. -
నాపై కుట్ర చేస్తున్నారు..
బీరుట్: ఆర్థిక అవకతవకల ఆరోపణలతో జపాన్ నుంచి నాటకీయంగా తప్పించుకున్న ఆటోమొబైల్ సంస్థ రెనో–నిస్సాన్ మాజీ చీఫ్ కార్లోస్ ఘోన్ .. తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని స్పష్టం చేశారు. నిస్సాన్, జపాన్ ప్రాసిక్యూటర్లు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జపాన్ నుంచి లెబనాన్కు పరారైన తర్వాత తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. తనపై మోపిన ఆర్థిక అవకతవకల ఆరోపణలు నిరాధారమైనవని ఆయన చెప్పారు. ‘నేను 17 ఏళ్లుగా సేవలందించిన దేశమే నన్ను బందీగా చేసింది అనిపించింది. న్యాయం సంగతి పక్కనపెడితే అక్కడ కనీసం నా మాట పట్టించుకునే పరిస్థితే లేదు. నా మిత్రులు, కుటుం బంతో ఎలాంటి సంబంధాలు లేకుండా తెంచేశారు. నేను ఏ తప్పూ చేయనప్పటికీ.. తుది తీర్పు కోసం అయిదేళ్లు నిరీక్షించాల్సి ఉంటుం దని లాయర్లు చెప్పారు. దీంతో గత్యంతరం లేక బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాల్సి వచ్చింది‘ అని ఘోన్ పేర్కొన్నారు. -
మారుతీ ఉత్పత్తి అప్
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ.. గతేడాది డిసెంబర్లో వాహనాల ఉత్పత్తిని పెంచింది. గత నెలలో మొత్తం వాహనాల ఉత్పత్తి 1,15,949 యూనిట్లుగా నమోదైనట్లు పేర్కొం ది. 2018 డిసెంబర్ నెలలో 1,07,478 యూనిట్ల ఉత్పత్తితో పోల్చితే ఈసారి 7.88 శాతం వృద్ధి చెందినట్లు వివరించింది. గతేడాదిలో డిమాండ్ తగ్గిపోయిన కారణంగా వరుసగా తొమ్మిది నెలల పాటు ఉత్పత్తిలో కోత విధించిన ఎంఎస్ఐ.. నవంబర్లో 4.33 శాతం ఉత్పత్తి పెంపును ప్రకటించింది. -
సినిమా సూపర్ హిట్ కలెక్షన్లు ఫట్
జనం పెట్టే ఖర్చులు తగ్గాయంటే... ఓలా, ఉబెర్ బుకింగులు పెరిగాయంటారు ఆర్థిక మంత్రి!!. మరి అదే నిజమైతే కార్ల విక్రయాలు కూడా పెరగాలి కదా? అనేది సామాన్యుడి సందేహం. వీటి మధ్య సంబంధం ఉందనుకుంటే ఉంది!. లేదనుకుంటే లేదు!!. 2019లో మన ఆర్థిక వ్యవస్థ తీరు చూసినా ఇలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎకానమీ మందగమనంతో నత్తనడకన నడుస్తోంది. విక్రయాలు తగ్గిపోయాయని ఆటోమొబైల్, వినియోగ వస్తువుల కంపెనీలు మొత్తుకుంటున్నాయి. స్టాక్ మార్కెట్లు మాత్రం రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అటు సంస్కరణల ఊతంతో సులభతర వ్యాపార నిర్వహణ ర్యాంకుల్లో భారత్ భారీగా ఎగబాకినా.. ఇటు పారిశ్రామిక దిగ్గజాలు మాత్రం వ్యాపార వర్గాల నోరు నొక్కేస్తోందంటూ ప్రభుత్వంపై బాహాటంగానే విరుచుకుపడుతున్నారు. మందగమనం సమస్యకు చికిత్స చేసేందుకు ప్రభుత్వం కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో 2019 సింహావలోకనంతో పాటు కొత్త సంవత్సరంపై నెలకొన్న అంచనాల సమాహారమిది... స్టాక్ మార్కెట్లు.. ‘రికార్డ్’ల పరుగు ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా.. స్టాక్ మార్కెట్లు మాత్రం రయ్మని ఎగిశాయి. నిఫ్టీ సుమారు 13 శాతం, సెన్సెక్స్ దాదాపు 15 శాతం పెరిగాయి. 2017 తర్వాత దేశీ సూచీలకు 2019 బాగా కలిసొచ్చింది. ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.10.2 లక్షల కోట్లు ఎగిసింది. ఈ ఏడాది జనవరి 1న 36,162 పాయింట్లుగా ఉన్న సెన్సెక్స్ 5,000 పాయింట్లు పైగా పెరిగి తాజాగా 41,000 పైకి చేరింది. ఎకానమీతో సంబంధం లేనట్లుగా స్టాక్ మార్కెట్లు అలా పెరుగుతూ పోవడంపై ఆర్థికవేత్తలు కూడా అయోమయంలో పడ్డారు. స్టాక్ మార్కెట్ల ర్యాలీ కొన్ని షేర్లకే పరిమితం కావడం గమనార్హం. 2018 జనవరిలోని ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలతో పోలిస్తే మిడ్ క్యాప్ సూచీ 19 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 33 శాతం పడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన తొలి దేశీ కంపెనీగా రికార్డు సృష్టించింది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం, ఆఖరు దశలో నిల్చిపోయిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఊతమిచ్చేందుకు రూ. 25,000 కోట్ల నిధి ఏర్పాటు చేయడం, విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను ప్రతిపాదనలను ఉపసంహరించడం వంటి అంశాలు మార్కెట్ల పరుగుకు దోహదపడ్డాయి. 2019లో రూ.లక్ష కోట్లకు పైగా విదేశీ నిధులు వచ్చాయి. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే 7.5 శాతం అధికం. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందని స్టాక్ ఇన్వెస్టర్లతో పాటు వ్యూహాత్మక ఇన్వెస్టర్లు కూడా బుల్లిష్గా ఉన్నారనడానికి ఇది నిదర్శనంగా పరిశీలకులు భావిస్తున్నారు. టెల్కోలకు షాక్ ట్రీట్మెంట్.. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కింపు విషయంలో కేంద్రం ఫార్ములానే సమర్ధి స్తూ సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో పాత ప్రైవేట్ టెల్కోల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ దెబ్బతో టెల్కోలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. వీటికి కేటాయింపులు జరపడంతో వొడాఫోన్ ఐడియా సంస్థ దేశ కార్పొరేట్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. 50,921 కోట్ల పైచిలుకు నష్టాలను సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రకటించింది. ఎయిర్టెల్ కూడా రూ. 23,045 కోట్ల నష్టాలు నమోదు చేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే కంపెనీని మూసేయక తప్పదని వొడాఫోన్ ఐడియా ఆందోళన వ్యక్తం చేసింది. మొత్తానికి రంగంలోకి దిగిన కేంద్రం.. టెల్కోలకు ఊరటనిచ్చేలా స్పెక్ట్రం బాకీల చెల్లింపుపై రెండేళ్ల మారటోరియం ప్రకటించింది. ఇంటర్కనెక్ట్ యూసేజ్ చార్జీల వివాదం కూడా తెరపైకి వచ్చింది. ఈ చార్జీలను కొనసాగించాలంటూ పాత టెల్కోలు, ఎత్తివేయాలని కొత్త టెలికం సంస్థ జియో వాదించాయి. చివరికి 2021 దాకా దీని గడువును ట్రాయ్ పొడిగించింది. ఈలోగా టెల్కోలన్నీ కలిసికట్టుగా చార్జీలను పెంచేశాయి. రేటు పెరిగినా డేటా వినియోగానికి డిమాండ్ తగ్గదని, ఆదాయాలు గణనీయంగా మెరుగుపడతాయని కంపెనీలు ఆశిస్తున్నాయి. కనీస చార్జీల ప్రతిపాదనను ట్రాయ్ పరిశీలిస్తోంది. అటు ప్రభుత్వ రంగ టెల్కోలకు కాస్త ఊరట లభించింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను విలీనం చేయాలని కేంద్రం నిర్ణయించింది. రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించింది. ఇరు సంస్థల్లో 92,000 మంది ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ఎంచుకున్నారు. మ్యూచువల్ ఫండ్స్ కొనసాగిన జోష్.. 2019లో మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ భారీగా పెరిగాయి. 2019 నవంబర్ నాటికే ఏయూఎం 18 శాతం (సుమారు రూ. 4.2 లక్షల కోట్లు) ఎగిసి రూ.27 లక్షల కోట్లకు చేరింది. ఇన్వెస్టర్ల ధీమాను పెంచేందుకు సెబీ తీసుకుంటున్న చర్యలు, డెట్ స్కీముల్లోకి భారీగా పెట్టుబడుల రాకతో.. కొత్త ఏడాది కూడా ఇదే ధోరణి కొనసాగవచ్చని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. 2020లో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ 17–18 శాతం మేర వృద్ధి నమోదు చేయొచ్చని, ఎకానమీ పుంజుకుంటే ఈక్విటీ ఫండ్స్లోకి కూడా భారీగా పెట్టుబడులు రావొచ్చని ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ అంచనా వేస్తోంది. బీమా రంగం... ధీమాగా వృద్ధి బీమా పరిశ్రమ వృద్ధి స్థిరంగా కొనసాగింది. నవంబర్ దాకా చూస్తే కొత్త ప్రీమియం వసూళ్లు వార్షికంగా సుమారు 37 శాతం వృద్ధితో రూ. 1.7 లక్షల కోట్లుగా నమోదైనట్లు కోటక్ లైఫ్ ఇన్సూరెన్స్ వెల్లడించింది. రాబోయే రోజుల్లో పరిశ్రమ 15% వృద్ధి రేటు సాధించవచ్చని అంచనా వేసింది. కుటుంబాలు చేసే పొదుపు మొత్తాలు.. బంగారం వంటి వాటి వైపు కాకుండా ఇతరత్రా ఆర్థిక అసెట్స్వైపు మళ్లుతుండటం, ప్రభుత్వ విధానాలు, బీమా విస్తృతికి సంస్థల ప్రయత్నాలు ఇందుకు దోహదపడగలవని పరిశ్రమవర్గాలు పేర్కొ న్నాయి. ఎకానమీ అస్తవ్యస్తం.. అంతర్గత, అంతర్జాతీయ సవాళ్లతో ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థకు కష్టంగానే గడిచింది. వినియోగం, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు.. అన్నీ మందగించాయి. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అగ్రగామి దేశం హోదాను భారత్ కోల్పోయింది. సెప్టెంబర్ క్వార్టర్లో జీడీపీ వృద్ధి.. ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయింది. 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా దూసుకెళ్లాల్సిన ఎకానమీ... మందగమనం దెబ్బతో కుంటినడకలు నడుస్తోంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థలు దేశ వృద్ధి రేటు అంచనాలకు భారీగా కోతలు పెట్టాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్రం పలు సంస్కరణలు ప్రవేశపెడుతోంది. కార్పొరేట్ ట్యాక్స్ రేటును పాతిక శాతానికి తగ్గించడం, ఆర్థిక రంగ పునర్వ్యవస్థీకరణ, వడ్డీ రేట్ల కోత వంటివి వీటిలో కీలకం. కార్పొరేట్ ట్యాక్స్ కోత వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీలు కాస్త మెరుగైన ఫలితాలు ప్రకటించగలిగాయి. సులభతరంగా వ్యాపారాలు నిర్వహించడానికి అనువైన దేశాల జాబితాలో భారత్ 77వ స్థానం నుంచి 63వ స్థానానికి వచ్చింది. మరోవైపు, ఆర్బీఐ కీలక పాలసీ రేట్లను తగ్గించినా.. ఆ ప్రయోజనాలను ఖాతాదారులకు బ్యాంకులు పూర్తిగా బదలాయించకపోతుండటంతో దేశీయంగా వినియోగానికి ఊతం లభించడం లేదు. దీంతో వచ్చే సంవత్సరం కూడా పరిస్థితి పెద్దగా మెరుగుపడేలా కనిపించడం లేదనేది పరిశీలకుల మాట. అయితే, ఇన్ఫ్రాపై వచ్చే అయిదేళ్లలో రూ.100 లక్షల కోట్లు వెచ్చించాలన్న ప్రభుత్వ ప్రణాళికతో ఎకానమీకి కొంత ఊతం లభించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. రియల్టీ అంతంతమాత్రం... రియల్టీ రంగంపైనా ఆర్థిక మందగమన ప్రభావం గణనీయంగా పడింది. టాప్ 7 నగరాల్లో రిటైల్ లీజింగ్ కార్యకలాపాలు క్రితం ఏడాదితో పోలిస్తే 35 శాతం తగ్గాయి. 2018లో 5.5 మిలియన్ చ.అ. లీజింగ్ నమోదు కాగా 2019లో ఇది 3.6 మి.చ.అ.లకు పరిమితమైందని రియల్టీ సేవల సంస్థ అనరాక్ నివేదికలో వెల్లడైంది. ఆటోమొబైల్, జ్యుయలరీ, ఎలక్ట్రానిక్స్, హైపర్మార్కెట్లు మొదలైన విభాగాల్లో లీజింగ్ తగ్గగా.. ఫుడ్ అండ్ బెవరేజెస్, సినిమా, సౌందర్య సంరక్షణ సేవల విభాగాల్లో పెరిగింది. అయితే, వచ్చే ఏడాది రిటైల్ లీజింగ్ మళ్లీ పుంజుకోవచ్చని అంచనాలున్నాయి. పసిడి.. జిగేల్ జిగేల్ పసిడి మెరుపులు ఈ ఏడాది మరింత కాంతివంతమయ్యాయి. అంతర్జాతీయంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 1,400 డాలర్ల శ్రేణిని ఛేదించింది. 2013 తర్వాత మళ్లీ తొలిసారి ఈ ఏడాది ఆగస్టులో 1,500 డాలర్ల మార్కును అధిగమించింది. దేశీయంగా రేటు ఏకంగా 25 శాతం పెరిగింది. సంవత్సరం తొలినాళ్లలో రూ.31,500 స్థాయిలో ఉన్న పది గ్రాముల బంగారం ధర దాదాపు రూ.8,000 పెరిగి ఒక దశలో రూ. 40,000 స్థాయిని కూడా తాకింది. సాధారణంగా.. అనిశ్చితి, ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. ఈ కారణాలే ఈ ఏడాది పసిడి పరుగుకు దోహదపడ్డాయి. అంతర్జాతీయంగా భౌగోళిక.. రాజకీయ... వాణిజ్య అనిశ్చితి, అమెరికా – చైనా మధ్య సుదీర్ఘంగా కొనసాగిన టారిఫ్ల యుద్ధం వంటివన్నీ ఇన్వెస్టర్లను పసిడివైపు మొగ్గేలా చేశాయి. ప్రపంచ ఎకానమీపై కమ్ముకున్న నీలినీడలతో.. షేర్ల వంటి రిస్కీ సాధనాల కన్నా బంగారం, ఇతరత్రా సురక్షిత సాధనాలే ఆకర్షణీయంగా ఉంటాయని 2019 రెండో త్రైమాసిక నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. సాధారణ ఇన్వెస్టర్ల తరహాలోనే సెంట్రల్ బ్యాంకులు కూడా పసిడిని భారీగా కొని నిల్వలు పెంచుకుంటున్నాయి. వచ్చే ఏడాది కూడా భౌగోళిక, రాజకీయ అనిశ్చితి, కనిష్ట స్థాయిల్లో వడ్డీ రేట్లు, డాలరు బలహీనపడే అవకాశాల నేపథ్యంలో బంగారం పరుగు కొనసాగుతుందని భావిస్తున్నారు. కీలకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికలతో మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో 2020లో ఔన్సు బంగారం ధర 1,620 డాలర్ల స్థాయిని తాకవచ్చని అంచనాలున్నాయి. అయితే, ఇప్పటికే పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిపేసిన స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్లు.. 2020లో అమ్మకాలకు దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫలితంగా పసిడి రేటు తగ్గే చాన్సు కూడా ఉందనేది నిపుణుల అంచనా. ఆటోమొబైల్ రివర్స్ గేర్లోనే... డిమాండ్ లేక అమ్మకాలు తగ్గడం మొదలుకుని ప్లాంట్ల మూసివేతలు, ఉద్యోగాల కోతలు, వందల మంది డీలర్ల దివాలా.. కొత్త కాలుష్య ప్రమాణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విధానాలు.. ఇలా వివిధ కారణాలు ఆటోమొబైల్ పరిశ్రమను తెరిపిన పడనివ్వకుండా చేశాయి. ఎకానమీలో మందగమనం, ధరల పెంపుతో ప్యాసింజర్ వాహన విక్రయాలు క్షీణించగా, అధిక నిల్వలు పేరుకుపోయి.. ఫైనాన్స్ అవకాశాలు తగ్గిపోయి వాణిజ్య వాహన అమ్మకాలు పడిపోయాయి. ఉద్యోగ కల్పన, డిమాండ్ అంతంత మాత్రంగానే ఉండటంతో ద్విచక్ర వాహన విక్రయాలు భారీగా తగ్గాయి. అయితే, వాహనాల కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తుండటం, రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటూ ఉండటం తదితర చర్యలు రాబోయే రోజుల్లో ప్యాసింజర్ వాహనాలకు సానుకూలంగా ఉండగలవన్న అంచనాలు నెలకొన్నాయి. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంటు మెరుగుపడుతుండటం .. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల అమ్మకాలకూ సానుకూలంగా ఉండవచ్చని అంచనా. డీల్ స్ట్రీట్ .. కార్పొరేట్లు డీలా కార్పొరేట్లు రుణ సంక్షోభాల్లో కూరుకుపోవడంతో 2019లో విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ ఒక మోస్తరు స్థాయికే పరిమితమయ్యాయి. లిక్విడిటీ కొరత, విదేశీ ఇన్వెస్టర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపకపోవడం, అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధం వంటి అంశాలతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అవలంబించారు. న్యాయసేవల సంస్థ బేకర్ మెకెంజీ నివేదిక ప్రకారం 2019లో మొత్తం మీద సుమారు రూ. 52.1 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ జరిగాయి. 2019లో సగటు ఎంఅండ్ఏ డీల్ పరిమాణం 81 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఇదే అత్యల్పం. తయారీ, ఇంధనం, స్టార్టప్, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ, ఇన్ఫ్రా, రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో గణనీయంగా ఒప్పందాలు కుదిరాయి. వ్యాపారాలకు అనువైన సంస్కరణలు, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు తిరిగొస్తుండటం వంటి అంశాల ఊతంతో 2020, 2021 సంవత్సరాల్లో డీల్స్ పరిస్థితి మళ్లీ పుంజుకోగలదని బేకర్ మెకెంజీ ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకింగ్... ఫైనాన్స్ సవాళ్లమయం ఐఎల్అండ్ ఎఫ్ఎస్ దివాలా ప్రభావాలతో 2019 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం కష్టాలు కొనసాగాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్, అల్టికో క్యాపిటల్ వంటి సంస్థలు దివాలా తీశాయి. ఎన్బీఎఫ్సీల సంక్షోభంతో రుణ లభ్యత కొరవడి ఆటోమొబైల్ వంటి ఇతర రంగాలపైనా ప్రభావం పడింది. మొండిబాకీలతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో విలీనాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసింది. యూనియన్ బ్యాంకులో విలీనంతో తెలుగువారి ఆంధ్రా బ్యాంకు కనుమరుగు కానుంది. నెఫ్ట్ సేవలు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి వచ్చాయి. ఎట్టకేలకు దివాలా కోడ్ ప్రయోజనాలు కనిపించడం ప్రారంభమైంది. ఎస్సార్ స్టీల్ వంటి కేసులు పరిష్కారం కావడంతో బ్యాంకులకు వేల కోట్ల మేర మొండిబాకీల రికవరీ సాధ్యపడింది. అయితే, ఇంకా చాలా కేసుల పరిష్కారానికి సుదీర్ఘ సమయం పట్టేస్తుండటం ఆందోళనకర విషయం. మొండిబాకీల (ఎన్పీఏ) భారం ఈసారి కాస్త తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ ఆఖరు నాటికి స్థూల ఎన్పీఏలు రూ. 8.94 లక్షల కోట్లకు తగ్గాయి. క్రితం ఏడాది ఇదే వ్యవధిలో స్థూల మొండిబాకీలు రూ. 10.18 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇక, సుదీర్ఘ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతూ బిమల్ జలాన్ సిఫార్సుల మేరకు రిజర్వ్ బ్యాంక్ .. 2018–19 కేంద్రానికి గాను తన వద్ద ఉన్న మిగులు నిధుల్లో రూ. 1.76 లక్షల కోట్లు కేంద్రానికి బదలాయించేందుకు అంగీకరించింది. మందగమనంతో కొట్టుమిట్టాడుతున్న ఎకానమీకి ఊతమిచ్చేలా కీలక వడ్డీ రేట్లను 135 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో రెపో రేటు .. దశాబ్ద కనిష్ట స్థాయి 5.15 శాతానికి దిగివచ్చింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగియడంతో డిసెంబర్లో రేట్ల కోతకు కాస్త విరామమిచ్చింది. -
పోర్షే కయన్ కూపే @ 1.32 కోట్లు
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. ‘కయన్ కూపే’ మోడల్ను శుక్రవారం భారత మార్కెట్లోకి విడుదలచేసింది. కేవలం 6 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగిన ఈ మోడల్లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో కయన్ కూపే ధర రూ. 1.32 కోట్లు కాగా, కయన్ టర్బో కూపే ధర రూ. 1.98 కోట్లు. ఈ నూతన మోడల్లో మూడు లీటర్ల వీ6 టర్బో ఇంజిన్ అమర్చగా, అవుట్పుట్ 340 హెచ్పీగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. సన్రూఫ్, ఎలక్ట్రికల్గా సర్దుబాటు చేయగలిన సీట్లు, 7–అంగుళాల డిస్ప్లే, 12.3–అంగుళాల హెచ్డీ టచ్స్క్రీన్, 22 ఇంచ్ జీటీ డిజైన్ వీల్స్ నూతన మోడల్లో స్పెసిఫికేషన్లుగా వివరించింది. -
వోల్వో ‘ఎక్స్సీ40 టీ4’ ఎస్యూవీ
న్యూఢిల్లీ: స్వీడన్కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘వోల్వో’ తాజాగా తన కొత్త ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ ‘ఎక్స్సీ40 టీ4 ఆర్–డిజైన్’ని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఈ కారు ధర రూ. 39.9 లక్షలు. కంపెనీకి చెందిన కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సీఎంఏ) ఆధారంగా రూపొందిన ఈ ఎస్యూవీలో 2–లీటర్ ఇంజిన్ అమర్చింది. ఈ సందర్భంగా కంపెనీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ చార్లెస్ ఫ్రంప్ మాట్లాడుతూ.. ‘ఎంట్రీ లెవెల్ ఎస్యూవీలో విడుదలైన తొలి పెట్రోల్ ఇంజిన్ కారు ఇది’ అని చెప్పారు. 8–స్పీడ్ గేర్బాక్స్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ పవర్ట్రైన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లేతో పనిచేసే 9–అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నట్లు కంపెనీ వివరించింది -
మళ్లీ మారుతీ సుజుకీ ఉత్పత్తిలో కోత
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. అక్టోబర్ నెల కార్ల ఉత్పత్తిలో 20.7 శాతం కోతను విధించింది. గతనెల్లో 1,19,337 యూనిట్లకే పరిమితమైంది. అంతక్రితం ఏడాది అక్టోబర్లో 1,50,497 యూనిట్లను సంస్థ ఉత్పత్తి చేసింది. ఏడాది ప్రాతిపదికన భారీ ఉత్పత్తి కోతను విధించి వరుసగా 9వ నెల్లోనూ అవుట్పుట్ను తగ్గించినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. ప్యాసింజర్ వాహన ఉత్పత్తి 20.85 శాతం తగ్గింది. -
ప్యాసింజర్ వాహన విక్రయాలు డౌన్
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహనాల (పీవీ) హాల్సేల్ విక్రయాలు వరుసగా 11వ నెల్లోనూ గణనీయంగా తగ్గినట్లు ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (ఎఫ్ఏడీఏ) శుక్రవారం ప్రకటించింది. పండుగల సీజన్ వినియోగదారుల సెంట్మెంట్ను బలపరచలేకపోయిన కారణంగా సెప్టెంబర్ పీవీ 2,23,317 యూనిట్లుగా నమోదైనట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది ఇదే నెల్లో నమోదైన 2,92,660 యూనిట్ల విక్రయాలతో పోల్చితే ఏకంగా 23.69 శాతం క్షీణత ఉన్నట్లు తెలియజేసింది. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో 23.56% తగ్గుదల నమోదైంది. దేశీయంగా గత నెల కార్ల విక్రయాలు 1,31,281 యూనిట్లు(33.4% క్షీణత). -
టాటా ‘పులి’ స్వారీ ముగుస్తుందా?
కష్టకాలంలో టాటాలను కామధేనువుగా ఆదుకున్న జాగ్వార్ ల్యాండ్రోవర్(జేఎల్ఆర్)... ఇప్పుడు నష్టాలతో ఎదురీదుతోంది. బ్రెగ్జిట్ గండానికి తోడు ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ మందగమనం... జేఎల్ఆర్ అమ్మకాలకు గండికొడుతోంది. దీంతో మాతృసంస్థ టాటా మోటార్స్కు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఒకపక్క దేశీయంగా డిమాండ్ పడిపోయి.. విక్రయాలు కుదేలవుతున్న తరుణంలో అక్కరకొస్తుందనుకున్న జేఎల్ఆర్ కూడా చతికిలపడటంతో టాటా మోటార్స్ను కష్టాల ఊబిలోకి నెడుతోంది. జేఎల్ఆర్లో పెట్టుబడుల విలువ తరిగిపోయే పరిస్థితికి దారితీస్తోంది. టాటా మోటార్స్ షేరు పతనం రూపంలో ఇన్వెస్టర్లకు ఇది కనిపిస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో జేఎల్ఆర్ను టాటాలు వదిలించుకోవడం మంచిదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బెర్న్స్టీన్ ఈ అంశాన్ని పేర్కొంది. జేఎల్ఆర్ విక్రయం టాటా మోటార్స్కు కనకవర్షం కురిపిస్తుందని లెక్కలేస్తోంది. మరి ఎవరికి విక్రయించాలంటారా? జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూకు అమ్మేస్తే ఇరు సంస్థలకు మేలు అనేది బెర్న్స్టీన్ వాదన. అంతేకాదు జేఎల్ఆర్కు 9 బిలియన్ పౌండ్ల (దాదాపు రూ.82 వేల కోట్లు)భారీ విలువను కూడా కట్టింది. బీఎండబ్ల్యూకు జేఎల్ఆర్ మంచి వ్యాపార అవకాశం అవుతుందని ఈ సంస్థ అభిప్రాయపడింది. తన క్లయింట్లకు బెర్న్స్టీన్ పంపిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి. బీఎండబ్ల్యూకు కలిసొస్తుంది... బీఎండబ్ల్యూ దగ్గర నిధులు దండిగా ఉన్నాయని, అదే సమయంలో తన బ్రాండ్, ఉత్పత్తుల వృద్ధికి అవకాశాలు పరిమితంగానే ఉన్నట్టు బెర్న్స్టీన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో విస్తరణపై నిధులు ఖర్చు చేసినా, రాబడులు ప్రశ్నార్థకమేనని అభిప్రాయపడింది. సొంతంగా విలువను సృష్టించే అవకాశం ఈ స్థాయి నుంచి పరిమితమేనని పేర్కొంది. జేఎల్ఆర్ను దాని పుస్తక విలువ కంటే తక్కువకే సొంతం చేసుకోవాలని, బీఎండబ్ల్యూ సహకారంతో లాభదాయకంగా జేఎల్ఆర్ అవతరించగలదని ఈ నివేదికలో వివరించింది. గణనీయమైన విలువను సృష్టించుకోవచ్చని, బీఎండబ్ల్యూ ఎర్నింగ్స్ (ఆదాయాలు) 20 శాతం వరకు పెంచుకోవచ్చని సూచించింది. టాటాలకూ మేలు చేస్తుంది... జేఎల్ఆర్ వ్యాపారపరంగా ఉన్న సమస్యలు టాటా గ్రూపును ఇబ్బంది పెడుతున్నట్టు బెర్న్స్టీన్ పేర్కొంది. జేఎల్ఆర్కు వ్యూహాత్మక పరిష్కారాన్ని టాటా గ్రూపు గుర్తించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. జేఎల్ఆర్ అమ్మకం రూపంలో వచ్చే 9 బిలియన్ పౌండ్ల(11.23 బిలియన్ డాలర్లు)తో, షేరు ధర మళ్లీ పైకి వెళ్లగలదని అంచనా వేసింది. అయితే, ఈ నిధులను కంపెనీ తిరిగి ఏ విధంగా వినియోగంలోకి తీసుకొస్తుందన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని పేర్కొంది. 2008లో జేఎల్ఆర్ను టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అంటే 1.84 బిలియన్ పౌండ్లు (ప్రస్తుత మారకం విలువ ప్రకారం సుమారు రూ.16,376 కోట్లు). బెర్న్స్టీన్ లెక్కగట్టిన అంచనా ప్రకారం కొనుగోలు విలువకు ఐదు రెట్ల విలువ దక్కినట్లు లెక్క. అంటే ఇది ఒకరకంగా టాటా మోటార్స్ రుణ భారాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తుందని పరిశీలకులు పేర్కొంటున్నారు. జూన్ క్వార్టర్ నాటికి టాటా మోటార్స్ మొత్తం రుణ భారం రూ.46,500 కోట్లకు పేరుకుపోయింది. ఇదే తరుణంలో జూన్ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్(జేఎల్ఆర్ ఇతరత్రా అనుబంధ సంస్థలన్నింటినీ కలిపితే) నికర నష్టం రెట్టింపై రూ.3,679 కోట్లకు చేరడం కూడా కంపెనీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భాగస్వామ్యంతో ఊహాగానాలు... ఈ ఏడాది జూలైలో బీఎండబ్ల్యూతో టాటా మోటార్స్ చేతులు కలిపింది. ఎలక్ట్రిక్ వాహన వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు జట్టుకట్టింది. దీంతో నాటి నుంచి జేఎల్ఆర్ను బీఎండబ్ల్యూ కొనుగోలు చేయవచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ దిశగా అడుగులు.. ఇరు కంపెనీలకు ప్రయోజనకరమని బెర్న్స్టీన్ నివేదిక విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. బీఎండబ్ల్యూ ఇప్పటికే ఎలక్ట్రిక్ డ్రైవ్ యూనిట్లు, ఇంజిన్లను జేఎల్ఆర్కు సరఫరా చేసేందుకు అంగీకరించిన విషయాన్ని నివేదికలో ప్రస్తావించింది. అయితే, జేఎల్ఆర్లో వాటాల విక్రయమై బీఎండబ్ల్యూతో చర్చల వార్తలను టాటా మోటార్స్ ఖండించింది. పాత యజమాని చెంతకే! జాగ్వార్, ల్యాండ్రోవర్ బ్రాండ్లు.. బ్రిటన్లోనే పురుడుపోసుకున్నాయి. ఇవి రెండూ 1968 వరకూ స్వతంత్ర కంపెనీలుగానే కొనసాగాయి. అయితే, 1968లో జాగ్వార్, ల్యాండ్రోవర్లు విలీనమాయ్యయి. వీటిని కొనుగోలు చేసిన బ్రిటిష్ లేలాండ్ 1984 వరకూ కొనసాగించింది. ఆ తర్వాత మళ్లీ రెండు కంపెనీలూ బ్రిటిష్ లేలాండ్ నుంచి విడిపోయాయి. జర్మనీ కార్ల దిగ్గజం బీఎండబ్ల్యూకి అనుబంధ సంస్థలుగా మారాయి. అమెరికా కార్ల దిగ్గజం ఫోర్డ్... 1989లో జాగ్వార్ కార్స్ను, 2000లో ల్యాండ్రోవర్ను చేజిక్కించుకుంది. దీంతో మళ్లీ ఫోర్డ్ నేతృత్వంలో జాగ్వార్ల్యాండ్రోవర్(జేఎల్ఆర్) ఒకే సంస్థగా ఆవిర్భవించాయి. అయితే, 2008లో ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడిన ఫోర్డ్ మోటార్స్... జేఎల్ఆర్ను అమ్మకానికి పెట్టింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న టాటా మోటార్స్ 2008లో 2.3 బిలియన్ డాలర్లకు దక్కించుకుంది. ఇప్పుడు మళ్లీ జేఎల్ఆర్ను పాత యజమాని బీఎండబ్ల్యూ కొనొచ్చన్న వార్తలు జోరందుకున్నాయి. -
ఆతిథ్య, వాహన రంగాలకు ఊతం
పణజి: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శుక్రవారం గోవాలోని పణజిలో సమావేశమైన వస్తుసేవల పన్ను(జీఎస్టీ) కౌన్సిల్.. దేశంలోని వాహన, ఆతిథ్య పరిశ్రమలకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వాహనాల అమ్మకాలు తగ్గినవేళ.. 1200 సీసీ ఇంజన్ సామర్థ్యమున్న పెట్రోల్ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 1 శాతానికి తగ్గించాలని కౌన్సిల్ నిర్ణయించింది. జీఎస్టీ సమావేశం ముగిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన సీతారామన్ ఈ వివరాలను ప్రకటించారు. 1500 సీసీ ఇంజిన్ సామర్థ్యమున్న డీజిల్ వాహనాలపై విధిస్తున్న 28 శాతం జీఎస్టీని 3 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లు సీతారామన్ తెలిపారు. అలాగే వజ్రాల పరిశ్రమకు సంబంధించిన పనులపై జీఎస్టీని 5 నుంచి 1.5 శాతానికి తగ్గిస్తున్నామనీ, విలువైన రాళ్ల కటింగ్, పాలిషింగ్పై జీఎస్టీని 3 నుంచి 0.25 శాతానికి తగ్గిస్తున్నామని వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ లింక్.. వెట్ గ్రైండర్లపై వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్లు సీతారామన్ తెలిపారు. ఎండబెట్టిన చింతపండుతో పాటు చెట్ల బెరడు, ఆకులు, పూలతో చేసిన ప్లేట్లు, కప్పులపై జీఎస్టీని 5 శాతం నుంచి సున్నాకు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్యాకింగ్ కోసం వాడే పాలీప్రొపైలిన్, ఊలుతో కూడిన పాలీప్రొపైలిన్, ఊలులేని బ్యాగులపై జీఎస్టీ రేట్లను ఏకీకృతం చేసి 12 శాతంగా నిర్ధారించినట్లు పేర్కొన్నారు. జీఎస్టీ రిజస్ట్రేషన్ సందర్భంగా ఆధార్ను అనుసంధానం చేయాలన్న నిర్ణయానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సీతారామన్ చెప్పారు. జీఎస్టీ నుంచి పూర్తి మినహాయింపు వీటికే.. భారత్లో తయారుకాని ప్రత్యేకమైన రక్షణ ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా మినహాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. అండర్–17 మహిళల ప్రపంచకప్కు కోసం వినియోగించే వస్తుసేవలపై జీఎస్టీ ఉండదన్నారు. ఆహారం, వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) చేపట్టే కొన్ని ప్రాజెక్టులపై జీఎస్టీని విధించబోమని స్పష్టం చేశారు. అలాగే ఆభరణాల తయారీకి విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్లాటినంను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని వెల్లడించారు. చేపల ఆహారంతో పాటు గిలకలు, ఇతర వ్యవసాయ పరికరాలను కొంత కాలం వరకూ జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నామని చెప్పారు. మొత్తం 20 వస్తువులు, 12 రకాల సేవలపై జీఎస్టీని సవరించామన్నారు. కెఫిన్ పానీయాలపై కొరడా.. కెఫిన్ ఉన్న పానీయాలపై జీఎస్టీ కౌన్సిల్ పన్నును పెంచింది. ప్రస్తుతం కెఫిన్ ఆధారిత పానీయాలపై 18 జీఎస్టీ విధిస్తుండగా, దాన్ని 28 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై అదనంగా 12 శాతం సెస్ విధిస్తామని తెలిపింది. దుస్తులు, బ్యాగులు సహా పలు వస్తువులకు వాడే జిప్లపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించింది. అలాగే బాదంపాలపై 18 శాతం జీఎస్టీ విధించాలని నిర్ణయించింది. మెరైన్ ఫ్యూయెల్పై జీఎస్టీని 5 శాతానికి తగ్గించింది. అదే సమయంలో రైల్వే వ్యాగన్లు, బోగీలు, కదిలే ఇతర రైల్వే వాహనాలపై జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచుతూ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. చమురు–గ్యాస్ అన్వేషణ కోసం వాడే కొన్ని వస్తువులపై 5 శాతం పన్నును విధించనున్నారు. ఆతిథ్య పరిశ్రమకు ప్రోత్సాహం అతిథ్య పరిశ్రమకు ఊరట కల్పించేలా జీఎస్టీ కౌన్సిల్ పలు నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా ఒక రాత్రికి రూ.1,000లోపు వసూలు చేస్తున్న హోటళ్లను జీఎస్టీని నుంచి మినహాయించారు. ఒక రాత్రికి రూ.1,001 నుంచి రూ.7,500 వరకూ వసూలు చేస్తున్న హోటళ్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. అలాగే రూ.7,500 కంటే అధికంగా వసూలుచేసే హోటళ్లపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించారు. ఇక ఔట్డోర్ కేటరింగ్పై విధిస్తున్న పన్నును 18 శాతం(ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో కలిపి) నుంచి 5 శాతానికి తగ్గించినట్లు సీతారామన్ తెలిపారు. దీనివల్ల హోటళ్లలో ధరలు తగ్గుతాయనీ, తద్వారా ఆతిథ్య పరిశ్రమకు ఊతం లభిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. -
బీఎస్–6 ఇంధనం రెడీ..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్–6 (బీఎస్) ప్రమాణాలు దేశంలో 2020 ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో గడువులోగా బీఎస్–6 ఇంధనం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందా లేదా అన్న ఆందోళన వాహన తయారీ కంపెనీలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ విషయంలో ధీమాగా ఉన్నాయి. డెడ్లైన్ లోగానే బీఎస్–6 ఫ్యూయెల్ దేశవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందన్నది ఈ కంపెనీల మాట. అందుకు అనుగుణంగా ఈ దిగ్గజాలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి కూడా. ప్రస్తుతం ఢిల్లీలో బీఎస్–6 ఫ్యూయెల్ అందుబాటులో ఉంది. ముందు వరుసలో బీపీసీఎల్.. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) చకచకా తన ప్రణాళిక అమలును ముమ్మరం చేసింది. 2019 అక్టోబరు – 2020 జనవరి మధ్య రిటైల్ స్టేషన్లలో బీఎస్–4 స్థానంలో బీఎస్–6 ఇంధనం సిద్ధం చేయనుంది. జనవరికల్లా నూతన ప్రమాణాలతో ఫ్యూయెల్ రెడీ ఉంటుందని సంస్థ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. బీఎస్–3 నుంచి బీఎస్–4కు మళ్లిన దానికంటే ప్రస్తుతం మరింత వేగంగా పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రభుత్వ రంగంలోని ఇతర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో పోలిస్తే బీపీసీఎల్ కాస్త ముందుగా బీఎస్–6 ఫ్యూయెల్ విషయంలో పావులు కదుపుతోంది. మార్చికల్లా రెడీ.. మరో సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్) సైతం పనులను వేగిరం చేసింది. ఈ ఏడాది డిసెంబరులో మొదలై మార్చికల్లా కొత్త ఇంధనంతో రిటైల్ ఔట్లెట్లు సిద్ధమవుతాయని సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్ వెల్లడించారు. డెడ్లైన్ కంటే నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత ఇంధనం స్థానంలో కొత్త ఇంధనం మార్పిడికి రెండు మూడు నెలలు పడుతుందని వివరించారు. ఇదే సమయంలో ఫ్యూయెల్ నాణ్యతనూ పరీక్షిస్తామన్నారు. 2020 జనవరి రెండో వారం తర్వాతి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ స్టోర్లకు ఫ్యూయెల్ సరఫరా ప్రారంభిస్తామని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) చైర్మన్ ముకేష్ సురానా ఇటీవల వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా తెలిపారు. వ్యయం రూ.30,000 కోట్లు.. బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6 ప్రమాణాలకు అప్గ్రేడ్ అయ్యేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే రిఫైనరీల అభివృద్ధికి సుమారు రూ.30,000 కోట్లు ఖర్చు చేసినట్టు పరిశ్రమ వర్గాల సమాచారం. అటు వాహన తయారీ సంస్థలు ఏకంగా రూ.70,000–80,000 కోట్లు వ్యయం చేసినట్టు తెలుస్తోంది. బీఎస్–4 నుంచి బీఎస్–5 ప్రమాణాలకు బదులుగా బీఎస్–6కు మళ్లాలని 2016లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్–6 వెహికిల్స్ విక్రయం, రిజిస్ట్రేషన్ మాత్రమే చేపడతారు. ఇప్పటికే కొత్త ప్రమాణాలకు తగ్గ వాహనాలను కంపెనీలు విడుదల చేయడం ప్రారంభించాయి. -
అధిక వాహన ఉత్పత్తే అసలు సమస్య: రాహుల్ బజాజ్
ముంబై: దేశీయ ఆటో రంగంలో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ‘‘అధిక ఉత్పత్తి అలాగే అధికంగా స్టాకులు పేరుకుపోవడం’’ అని బజాజ్ ఆటో ఎండీ రాహుల్ బజాజ్ అభిప్రాయపడ్డారు. సంక్షోభానికి ఆర్థిక మందగమన ప్రభావం చాలా స్వల్పమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్టీ కోతలు అవసరం లేదన్నారు. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోత విషయమై నిర్ణయం ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆటో ఇండస్ట్రీ భారత్ 6 నిబంధనలకు అనుగుణంగా మార్పు చెందుతోందని, నవంబర్ నాటికి పరిస్థితులు చక్కబడవచ్చని అంచనా వేశారు. కరెక్షన్ లేకుండా ముందుకే సాగిపోయే పరిశ్రమ ఏదీ ఉండదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీలన్నీ దాదాపు అంతర్జాతీయ స్థాయిలో విక్రయాలు జరుపుతున్నందున, ఏదో ఒక దేశంలో మందగమనం మొత్తం కంపెనీపై ప్రభావం చూపే స్థితిలేదన్నారు. ఆటో విక్రయాల క్షీణతతో కేవలం 5– 7 శాతం మాత్రమే మందగమన ప్రభావంతో తగ్గి ఉంటాయన్నారు. ప్రతి పరిశ్రమకు ఉత్థానపతనాలు ఉంటాయని, సైకిల్స్ మారేందుకు సమయం పడుతుంటుందని వివరించారు. ఇప్పటి సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరని, కానీ ఇప్పటికైతే జీఎస్టీ కోతల అవసరం లేదని అభిప్రాయపడ్డారు. స్వీయతప్పిదమే: నిజానికి ఆటో రంగంలో ఈ పరిస్థితికి కంపెనీలే ప్రధానకారణమని రాహుల్ విమర్శించారు. కంపెనీలు వృద్ధి అంచనాలు విపరీతంగా వేసుకొని అధిక ఉత్పత్తులు చేశాయన్నారు. లాజిక్ లేకుండా కంపెనీలు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఈ సంక్షోభమని దుయ్యబట్టారు. -
‘యువత ఓలా, ఉబర్లనే ఎంచుకుంటున్నారు’
చెన్నై : ఆధునిక యువత కొత్త కార్లను కొనుగోలు చేసి ఈఎంఐల భారం మోసేందుకు ఇష్టపడటం లేదని, ఓలా..ఉబర్ క్యాబ్స్ను ఆశ్రయిస్తున్నారని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మిలీనియల్స్ క్యాబ్లకే మొగ్గుచూపడంతో ఆటోమొబైల్ పరిశ్రమ ఒడిదుడుకులకు లోనవుతోందని చెప్పారు.కార్లు, ద్విచక్రవాహన విక్రయాలు ఇటీవల గణనీయంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలసిందే. ఆటోమొబైల్ రంగంలో సంక్షోభాన్ని సమర్ధంగా చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. భారత్ 6 ప్రమాణాలు, రిజిస్ట్రేషన్ రుసుము అంశాలతో పాటు యువత ఎక్కువగా క్యాబ్లు, మెట్రో రైళ్లపై ఆధారపడటంతో కూడా ఆటోమొబైల్ రంగంలో సమస్యలు ఎదురవుతున్నాయని వీటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి వంద రోజులైన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆటో సంక్షోభం సమసిపోయేందుకు ప్రభుత్వం అన్ని రంగాల నిపుణులతో సంప్రదింపులు జరుపుతోందని, ఢిల్లీయే కాకుండా దేశవ్యాప్తంగా సమాచారం క్రోడీకరిస్తోందని తెలిపారు. -
వాహన విక్రయాలు.. క్రాష్!
న్యూఢిల్లీ: ఆటో రంగంలో మాంద్యం ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. గతనెల్లో దేశీ వాహన అమ్మకాలు చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలకు పడిపోయాయి. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సియామ్ 1997–98 నుంచి ఆటో అమ్మకాల డేటాను రికార్డు చేస్తుండగా.. అప్పటి నుంచి ఇప్పటివరకు ఈ స్థాయి పతనం నమోదుకాలేదు. ఆగస్టులో ప్యాసింజర్ వాహనాలు (పీవీ), వాణిజ్య వాహనాలు (సీవీ), ద్విచక్ర వాహనాల మొత్తం అమ్మకాలు 23.55% తగ్గాయి. గతనెల విక్రయాలు 18,21,490 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన మొత్తం వాహనాలు 23,82,436 యూనిట్లు. 10వ నెల్లోనూ పీవీ సేల్స్ డౌన్..: ఆగస్టులో ప్యాసింజర్ వాహన విక్రయాలు ఏకంగా 31.57 శాతం క్షీణతను నమోదుచేశాయి. గతనెల అమ్మకాలు 1,96,524 యూనిట్లు కాగా, 2018 ఆగస్టు విక్రయాలు 2,87,198 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. వరుసగా 10 నెలల నుంచి పీవీ అమ్మకాలు దిగజారుతూనే ఉన్నాయి. మారుతి అమ్మకాల్లో 36.14 శాతం క్షీణత పీవీ విక్రయాల్లో మార్కెట్ లీడర్గా ఉన్న మారుతి సుజుకీ ఆగస్టు నెల అమ్మకాల్లో 36.14 శాతం క్షీణతను నమోదుచేసింది. గతనెల విక్రయాలు 93,173 యూనిట్లుగా సియామ్ వెల్లడించింది. ఇక మహీంద్ర అండ్ మహీంద్ర అమ్మకాలు 31.58 శాతం, హ్యుందాయ్ సేల్స్ 16.58 శాతం తగ్గాయి. ద్విచక్ర వాహనాల సేల్స్ 22 శాతం డౌన్ ఆగస్టులో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 22.24% తగ్గాయి. గతనెల విక్రయాలు 15,14,196 యూనిట్లు కాగా, అంతక్రితం ఇదే ఏడాదిలో అమ్ముడైన వాహనాలు 19,47,304. -
సెన్సెక్స్ 337 పాయింట్లు అప్
వాహన రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనున్నదనే అంచనాలతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం ఒప్పందం కుదరగలదన్న అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు చైనా, ఇతర దేశాల కేంద్ర బ్యాంక్లు ప్యాకేజీలను ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు లాభపడటం సానుకూల ప్రభావం చూపించింది. డాలర్తో రూపాయి మారకం విలువ 16 పైసలు పుంజుకొని 71.68 వద్ద ముగియడం... రూపాయి వరుసగా మూడో రోజూ బలపడటం కలసివచ్చింది. ...బీఎస్ఈ సెన్సెక్స్ 337 పాయింట్లు పెరిగి 36,982 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 10,946 పాయింట్ల వద్ద ముగిశాయి. గణేశ్ చవితి సందర్భంగా సోమవారం సెలవు కావడంతో నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయాయి. సెన్సెక్స్ 351 పాయింట్లు, నిఫ్టీ 77 పాయింట్లు చొప్పున తగ్గాయి. అమ్మకాల్లేక కుదేలైన వాహన రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ గురువారం అభయం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వాహన షేర్ల లాభాలు శుక్రవారం కూడా కొనసాగాయి. మారుతీ సుజుకీ 3.6 శాతం, బజాజ్ ఆటో 2.9 శాతం, టాటా మోటార్స్ 2.5 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 2.3 శాతం, హీరో మోటొకార్ప్ 2.1 శాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.09 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.09 లక్షల కోట్లు పెరిగి రూ.1,40,28,104కు పెరిగింది. ► ప్రభాత్ డైరీ షేర్ 20 శాతం అప్పర్ సర్క్యూట్తో రూ.78 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ నుంచి ఈ షేర్ను డీలిస్ట్ చేయడం కోసం ప్రమోటర్లు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు దీనికి కారణం. 70కి పైగా ఏడాది కనిష్టం... స్టాక్ మార్కెట్ భారీగా లాభపడినా, దాదాపు 70కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. కాక్స్ అండ్ కింగ్స్, అలోక్ ఇండస్ట్రీస్, ఎడ్యుకాంప్ సొల్యూషన్స్, ఆర్కామ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు అబాట్ ఇండియా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ వంటి పదికి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి. -
రివర్స్గేర్లోనే కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు మళ్లీ భారీ తగ్గుదలను నమోదుచేశాయి. ఆగస్టులో రెండంకెల క్షీణత నమోదైంది. టాటా మోటార్స్, హోండా కార్స్ అమ్మకాలు గతనెల్లో ఏకంగా సగానికి పైగా తగ్గిపోయాయి. మారుతీ విక్రయాలు 33 శాతం తగ్గాయి. అధిక బీమా, ద్రవ్యలభ్యత కొరత, వడ్డీ వ్యయం పెరగడం, బీఎస్–6 ఉద్గార నిబంధనల అమలు, రిజిస్ట్రేషన్ వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో వినియోగదారుల సెంటిమెంట్ బలహీనంగా ఉందని హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (హెచ్సిఐఎల్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ డైరెక్టర్ (సేల్స్) రాజేష్ గోయెల్ అన్నారు. ఆగస్టులోనూ ఇవే ప్రతికూలతలు కొనసాగినందున ఈ స్థాయి క్షీణత నమోదైందని టీకేఎం డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా వ్యాఖ్యానించారు. ఆటోమొబైల్ రంగంలో మందగమనం కొనసాగుతున్నప్పటికీ తమ కంపెనీ రిటైల్ అమ్మకాలపై దృష్టిసారిస్తుందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ అన్నారు. -
ఆర్థిక రంగాన్ని సరిదిద్దుతాం...
న్యూఢిల్లీ: మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎంఎస్ఎంఈ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ/హెచ్ఎఫ్సీ ఇలా ఎన్నో రంగాలను లక్ష్యంగా చేసుకుని ఇవి ఉన్నాయి. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్చార్జీని భారీగా పెంచుతూ గత బడ్జెట్లో చేసిన ప్రకటన దేశ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా నష్టపరిచింది. దీంతో సర్చార్జీ పెంపును తొలగించాలన్న ఎఫ్పీఐల డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గింది. దేశ, విదేశీ ఇన్వెస్టర్లపై ఆదాయపన్ను సర్చార్జీ అదనపు పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. పరిశ్రమలకు చౌకగా మూలధన నిధుల రుణాలు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల(హెచ్ఎఫ్సీ)కు నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్హెచ్బీ) నుంచి అదనంగా రూ.20,000 కోట్ల నిధుల మద్దతు (మొత్తం రూ.30,000 కోట్లు అవుతుంది), సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు నిధుల కొరత సమస్య తీర్చేందుకు గాను వారికి జీఎస్టీ రిఫండ్లను 30 రోజుల్లోనే చేసేయడం, ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్ల మూలధన నిధుల సాయం, ఇన్ఫ్రా, హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల లభ్యత పెంచేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు సవరణను 2020 జూన్ వరకు వాయిదా వేయడం, రిజిస్టర్డ్ స్టార్టప్లపై ఏంజెల్ట్యాక్స్ రద్దు, సహా ఎన్నో నిర్ణయాలు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వాటిల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లపై సర్చార్జీ భారం తొలగింపు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) నుంచి వచ్చిన వినతులను ప్రభుత్వం మన్నించింది. రూ.2–5 కోట్ల మధ్య ఆదాయంపై సర్చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, రూ.5 కోట్ల పైన ఆదాయం కలిగిన వారిపై సర్చార్జీని 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతున్నట్టు బడ్జెట్ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనికి అదనంగా ఆర్థిక రంగ పునరుత్తేజానికి ఎటువంటి చర్యల్లేకపోవడంతో... నాటి నుంచి ఎఫ్పీఐలు మన మార్కెట్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.25,000 కోట్ల వరకు నిధులను వెనక్కి తీసుకున్నారు. సర్చార్జీ పెంపును ఉపసంహరించుకోవాలని వారు గట్టిగా కేంద్రాన్ని డిమాండ్ కూడా చేశారు. ‘‘క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఫైనాన్స్ యాక్ట్ 2019 ద్వారా స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలపై విధించిన సర్చార్జీ పెంపును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,400 కోట్ల మేర ఆశించిన ఆదాయం రాకుండా పోతుంది. సర్చార్జీ ఉపసంహరణ దేశ, విదేశీ ఇన్వెస్టర్లు అందరికీ వర్తిస్తుంది. స్టార్టప్లకు ఊరట రిజిస్టర్డ్ స్టార్టప్లకు ఏంజెల్ ట్యాక్స్ నుంచి ఉపశమనం కల్పించడం ప్రభు త్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. ‘‘స్టార్టప్లు, వాటిల్లో ఇన్వెస్ట్ చేసే వారు ఎదుర్కొంటున్న నిజమైన ఇబ్బందులను తొలగించేందుకు గాను, డీపీఐఐటీ వద్ద నమోదైన స్టార్టప్లకు ఆదాయపన్ను చట్టంలోని 56(2)(7బీ)ను అమలు చేయరాదని నిర్ణయించడం జరిగింది’’ అని మంత్రి వెల్లడించారు. ఆదాయపన్ను సర్చార్జీ పెంపు, ఏంజెల్ ట్యాక్స్ రద్దును నిపుణులు స్వాగతించారు. క్యాపిటల్ మార్కెట్లకు ఇవి జోష్నిస్తాయని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ రాజేష్ గాంధీ అభిప్రాయపడ్డారు. రుణాలు ఇక చౌక! గృహ, వాహన, వినియోగ రుణాలు చౌకగా మా రనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్బీఐ రేట్ల కోతను బ్యాంకులు ఎంసీఎల్ఆర్ విధానంలో రుణ గ్రహీతలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. రెపో రేటు, ఎక్స్టర్నల్ బెంచ్మార్క్తో అనుసంధానమైన రుణ ఉత్పత్తులను బ్యాంకులు ప్రారంభిస్తాయని, ఫలితంగా గృహ, వాహన, ఇతర రిటైల్ రుణాల ఈఎంఐలు తగ్గుతాయని పేర్కొన్నారు. అలాగే, వ్యవస్థలో రుణ వితరణను పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రభుత్వం రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు చెప్పారు. తద్వారా ఆర్థిక వ్యవస్థలో రూ.5 లక్షల కోట్ల వరకు అదనపు లిక్విడిటీ, రుణ వితరణ సాధ్యపడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇక రుణాల వితరణ ప్రక్రియను మరింత సులభంగా మార్చేందుకు పీఎంఎల్ఏ, ఆధార్ నిబంధనలను ప్రభుత్వం సులభతరం చేయనుంది. రుణాలను తీర్చేసిన 15 రోజుల్లోపు వాటి డాక్యుమెంట్లను రుణ గ్రహీతలకు ప్రభుత్వరంగ బ్యాంకులు తిరిగి ఇచ్చేయడం ఇకపై తప్పనిసరి. దీనివల్ల కస్టమర్లు బ్యాంకుల చుట్టూ తిరిగే ఇబ్బందులు తప్పిపోతాయి. ఎన్బీఎఫ్సీలకు నిధుల మద్దతు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (హెచ్ఎఫ్సీలు) అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్హెచ్బీ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎఫ్సీలకు లోగడ ఎన్హెచ్బీ ప్రకటించిన రూ.10,000 కోట్లకు ఇది అదనపు సాయం. దీనివల్ల హౌసింగ్ రంగానికి నిధుల వితరణ పెరగనుంది. ఆధార్ ఆధారిత కేవైసీని వినియోగించేందుకు ఎన్బీఎఫ్సీలను అనుమతించనున్నట్టు మంత్రి తెలిపారు. ఎన్బీఎఫ్సీలు, హెచ్ఎఫ్సీల నుంచి రూ.లక్ష కోట్ల వరకు ఆస్తులను బ్యాంకులు కొనుగోలు చేసేందుకు పాక్షిక క్రెడిట్ స్కీమ్ను ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించగా, ప్రతీ బ్యాంకు స్థాయిలో దీనిపై అత్యున్నత స్థాయిలో సమీక్ష చేయనున్నట్టు మంత్రి తెలిపారు. మన దగ్గరే వృద్ధి వేగం... అంతర్జాతీయంగా మరే ఇతర ఆర్థిక వ్యవస్థతో పోల్చి చూసినా భారత జీడీపీయే వేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అంతర్జాతీయ జీడీపీ వృద్ధి అంచనాలను 3.2 శాతానికి సవరించే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ సగటు కంటే భారత ఆర్థిక రంగం వృద్ధి వేగంగా ఉందన్నారు. ఆటో రంగానికి ఉద్దీపనలు దేశంలో వాహన విక్రయాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన తరుణంలో ఈ రంగానికి ఉద్దీపనం కల్పించే నిర్ణయాలను మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వన్టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజును వాయిదా వేసింది. ప్రభుత్వ విభాగాలు పెట్రోల్, డీజిల్ వాహనాలు కొనుగోలు చేయకుండా ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే, అన్ని రకాల వాహనాలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలన్న డిమాండ్ను మాత్రం పట్టించుకున్నట్టు లేదు. 2020 ఏప్రిల్ నుంచి బీఎస్–6 వాహనాలనే కంపెనీలు విక్రయించాల్సి ఉంటుంది. అయితే, ప్రతికూల పరిస్థితుల కారణంగా బీఎస్–4 వాహనాల నిల్వలు పెరిగిపోతుండడం, ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహంపై ఆసక్తిగా ఉందన్న వార్తల నేపథ్యంలో... 2020 మార్చి 31 వరకు కొనుగోలు చేసే వాహనాలను వాటి రిజిస్ట్రేషన్ గడువు వరకు రోడ్లపై తిరిగేందుకు అనుమతించనున్నట్టు మంత్రి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంటర్నల్ కంబస్టన్ వాహనాలకూ రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఆటో రంగంలో ఇప్పటికే 2 లక్షల ఉద్యోగాలకు గండి పడినట్టు నివేదికలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. మార్చి వరకు కొనుగోలు చేసే వాహనాలపై తరుగుదలను 15 శాతానికి బదులు 30 శాతానికి పెంచుతున్నట్టు మంత్రి చెప్పారు. వాహనాలను తుక్కుగా మార్చడం సహా పలు చర్యలను పరిశీలించనున్నట్టు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు వేగంగా రిఫండ్లు ఎంఎస్ఎంఈలకు జీఎస్టీ రిఫండ్లను ప్రభుత్వం ఇకపై 30 రోజుల్లోపు చెల్లించనున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. జీఎస్టీ సంబంధిత బకాయిలు అన్ని వేళలా సగటున రూ.7,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. జీఎస్టీ బకాయిలను 30రోజుల్లోపు పూర్తి చేయడం అన్నది ఎంఎస్ఎంఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని, అంతిమంగా ఉపాధి అవకాశాల పెంపునకు దారితీస్తుందని ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ఎంఎస్ఎంఈలకు ఒకటే నిర్వచనం ఇచ్చే దిశగా చట్ట సవరణను పరిశీలించనున్నట్టు చెప్పారు. మరిన్ని ముఖ్యాంశాలు... ► రూ.100 లక్షల కోట్లను మౌలిక సదుపాయాల రంగంపై వెచ్చించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా... ఇన్ఫ్రా ప్రాజెక్టులను షార్ట్లిస్ట్ చేసేందుకు అంతర్గత మంత్రిత్వ శాఖ టాస్క్ ఫోర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ► అలాగే, మౌలికరంగ, హౌసింగ్ ప్రాజెక్టులకు రుణాల వితరణ పెంచేందుకు ఓ సంస్థను ఏర్పాటు చేయనుంది. ► కార్పొరేట్ సామాజిక బాధ్యత నిబంధనలను ఉల్లంఘించడాన్ని నేరపూరిత చర్యగా పరిగణించబోమని, సివిల్ లయబులిటీగానే చూస్తామని మంత్రి స్పష్టం చేశారు. సంపద సృష్టికర్తలను ప్రభుత్వం గౌరవిస్తుందన్నారు. ► ఆదాయపన్ను శాఖ నుంచి ఆదేశాలు, నోటీసుల జారీకి కేంద్రీకృత వ్యవస్థ. ► స్టార్టప్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా సీబీడీటీలో సెల్ ఏర్పాటు. భారతీయ కంపెనీలను కాపాడాలి కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు కాంపిటిషన్ కమీషన్ సన్నద్ధం కావాలని మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. మారిన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లో విదేశీ సంస్థల నుంచి పోటీ పరంగా భారత కంపెనీలకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ శాఖ వ్యవహరాలనూ కూడా మంత్రి నిర్మలా సీతారామనే చూస్తున్నారు. సీసీఐ పదో వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడుతూ... పోటీ పరంగా దేశీయ మార్కెట్పై అంతర్జాతీయ సంస్థల ప్రభావాన్ని తెలుసుకునేందుకు సీసీఐ స్వచ్చందంగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. భారతీయ వినియోగదారులను, భారత కంపెనీలను పరిరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ఊతమిస్తాయి... ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలు విశ్వాసాన్ని పెంచి, ఆర్థిక రంగంలో సహజ స్ఫూర్తి ఫరిడవిల్లేలా చేస్తాయని దేశీయ పరిశ్రమలు అభిప్రాయపడ్డాయి. ఆటో రంగం టర్న్ అరౌండ్ అయ్యేందుకు తోడ్పడుతుందని పరిశ్రమ పేర్కొంది. ఎఫ్పీఐలు, దేశీయ ఇన్వెస్టర్ల లాభాలపై సర్చార్జీని తొలగించడం కీలకమైన ప్రకటన. ఇది తిరిగి ఉత్సాహాన్ని పాదుకొల్పుతుంది. – ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూపు చైర్మన్ అద్బుతమైన ప్యాకేజీ. ఆర్థిక రంగాన్ని తదుపరి దశకు తీసుకెళుతుంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్ మందగమనం సంకేతాలను ఇస్తున్న ఆర్థిక రంగ పునరుత్తేజానికి ప్రభుత్వ చర్యలు ఎంతో మేలు చేస్తాయి. వ్యాపారాలు, ఇన్వెస్టర్ల నమ్మకాన్ని ఈ చర్యలు తప్పకుండా నిలబెడతాయి. – సందీప్ సోమానీ, ఫిక్కీ ప్రెసిడెంట్. ప్రభుత్వ ప్యాకేజీ మొత్తం మీద ఆర్థిక రంగానికి భారీగా మేలు చేస్తుంది. ఎందుకం టే ఇది వాస్తవంగా నిర్వహణ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టింది. రాష్ట్రాలు సైతం తమవంతుగా రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను తగ్గించేందుకు ముందుకు రావాలి. – భార్గవ, మారుతి సుజుకీ ఇండియా చైర్మన్ ప్రభుత్వ చర్యలు ఆటో పరిశ్రమకు తక్షణ ఉపశమనాన్నిస్తాయి. – వేణు శ్రీనివాసన్, టీవీఎస్ మోటార్ చైర్మన్ ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ఆటో రంగానికి తోడ్పాటునివ్వడంతోపాటు స్పష్టమైన రోడ్ మ్యాప్నకు వీలు కల్పిస్తాయి. ఈ నిర్ణయాలు అమలైతే వృద్ధికి, ఆటో రంగంలో డిమాండ్కు దారితీస్తాయి. – మార్టిన్ ష్యూవెంక్, మెర్సెడెస్ బెంజ్ ఇండియా సీఈవో మార్కెట్లకు ఉద్దీపనల ప్యాకేజీ మేలు చేస్తుంది. ఎఫ్ఫీఐలపై సర్చార్జీని తొలగించడం తిరిగి విదేశీ నిధులు మన మార్కెట్ల వైపు వచ్చేలా చేస్తుంది. పండుగల సీజన్కు ముందు ఈ ఉద్దీపనల ప్యాకేజీ ఆర్థిక రంగానికి మేలు చేస్తుంది. – గౌతం ష్రాఫ్, ఎడెల్వీజ్ సెక్యూరిటీస్ కోహెడ్ -
రంగాలవారీగానే తోడ్పాటు..
న్యూఢిల్లీ: డిమాండ్ మందగించి, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వివిధ రంగాలు ఉద్దీపన ప్యాకేజీలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలన్నీ పరిశీలిస్తోంది. ఖజానాకొచ్చే ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలాంటిది కాకుండా.. సంక్షోభంలో ఉన్న విభాగాలకు మాత్రమే పరిమితమయ్యేలా రంగాలవారీగానే రాయితీలు, తోడ్పాటు అందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రంగాలవారీ విధానపరమైన ప్యాకేజీలను సాధ్యమైనంత త్వరగా ప్రకటించేందుకు ప్రధాని కార్యాలయం, రిజర్వ్ బ్యాంక్లతో ఆర్థిక శాఖ ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. సంక్షోభంలో ఉన్న ఆటోమొబైల్ తదితర రంగాలు కోరుతున్నట్లుగా రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ప్రత్యేక రీఫైనాన్స్ విండో ప్రారంభించడం వంటి విధానపరమైన చర్యల గురించి చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆటోమొబైల్ రంగం కోరుతున్నట్లు ద్విచక్రవాహనాలపై జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించే అవకాశాలు లేనట్లేనని తెలుస్తోంది. ఒకవేళ తగ్గించిన పక్షంలో ప్రభుత్వానికి ఏటా రూ. 6,000 కోట్ల మేర ఆదాయం తగ్గనుండటంతో ప్రభుత్వం దీనివైపు మొగ్గు చూపడం లేదని సమాచారం. గరిష్ట శ్లాబు 28 శాతం పరిధిలో గతంలో 235 ఉత్పత్తులు ఉండగా.. ప్రస్తుతం 30 ఉత్పత్తుల స్థాయికి సంఖ్య తగ్గింది. అయితే ఆటోమొబైల్, అనుబంధ రంగాలకు రుణ సౌలభ్యాన్ని మెరుగుపర్చేలా ప్రభుత్వ బ్యాంకులతో ఆర్బీఐ, కేంద్రం కూడా చర్చలు జరుపుతున్నాయి. మొండిబాకీల పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకుంటూ.. ఈ రంగాల సంస్థల అవసరాలకు అనుగుణంగా కస్టమైజ్డ్ రుణాలను అందించే అంశాన్ని పరిశీలించాలంటూ బ్యాంకులకు ప్రభుత్వం సూచించనున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల సమస్యలు పరిష్కరించి.. ఆటోమొబైల్ రంగానికి రుణ లభ్యత మెరుగుపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్వదేశీ జాగరణ్ మంచ్ కన్వీనర్ అశ్విన్ మహాజన్ చెప్పారు. ఒకవేళ ప్యాకేజీలు ఇచ్చేలా ఆర్థిక పరిస్థితి సహకరించకపోతే.. విధానపరమైన తోడ్పాటు చర్యలైనా తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్బీఎఫ్సీల సమస్యలకు పరిష్కార మార్గాలు నిధులు దొరక్క నానా తంటాలు పడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కూడా ఊరటనిచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఆర్థిక రంగం అభివృద్ధి మండలి (ఎఫ్ఐడీసీ) ఇందుకోసం కేంద్రం ముందు ఒక ప్రతిపాదన పెట్టింది. ఎన్ బీఎఫ్సీలకు కూడా ముద్రా స్కీమ్ కింద రీఫైనా¯Œ ్స సదుపాయం లభించేలా చూడటంతో పాటు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్హెచ్బీ)లాగా ఆర్బీఐలో శాశ్వత ప్రాతిపదికన రీఫైనా¯Œ ్స విండో కూడా ఏర్పాటు చేయొచ్చని పేర్కొంది. దీంతో ఎన్ బీఎఫ్సీల అవసరాలకు అనుగుణంగా నిధుల లభ్యత మెరుగుపడగలదని వివరించింది. అలాగే, బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే కాకుండా ఇతరత్రా ప్రత్యామ్నాయ మార్గాల నుంచి కూడా ఎన్ బీఎఫ్సీలు నిధులు సమీకరించుకునే వెసులుబాటు ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని ఇటీవలే ఆర్థిక శాఖకు ఎఫ్ఐడీసీ తెలిపింది. మందగమన ప్రభావాలను అత్యధికంగా ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగంలోని చిన్న సంస్థలకు (ఎంఎస్ఎంఈ) కూడా ఇది తోడ్పాటునివ్వగలదని పేర్కొంది. ఎఫ్పీఐలకు ఊరట.. అధికాదాయ వర్గాలపై అదనపు పన్ను (సూపర్ రిచ్ ట్యాక్స్) పరిధి నుంచి విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్పీఐ) పూర్తి మినహాయింపు ఇచ్చే అవకాశం లేకపోయినప్పటికీ.. ప్రత్యామ్నాయంగా ఇతరత్రా మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. సూపర్ రిచ్ ట్యాక్స్ నోటిఫై చేయడాన్ని కొన్నాళ్ల పాటు వాయిదా వేయడం లేదా దీన్ని వర్తింపచేసే గడువును మరికొన్నాళ్ల పాటు పొడిగించడం వంటి అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. సూపర్ రిచ్ ట్యాక్స్ను పూర్తిగా ఎత్తివేయకుండా... ప్రత్యామ్నాయంగా ఏయే చర్యలు తీసుకోవచ్చన్న దానిపై ప్రధాని కార్యాలయం, ఆర్థిక శాఖ మధ్య చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. సూపర్ రిచ్ ట్యాక్స్ భయాలతో ఎఫ్పీఐలు అమ్మకాలకు తెగబడుతుండటంతో దేశీ స్టాక్ మార్కెట్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే. చిన్న స్థాయి వారికి రుణమాఫీ.. సంక్షోభంలో చిక్కుకున్న చిన్న స్థాయి రుణగ్రహీతలకు దివాలా స్మృతి (ఐబీసీ) పరిధిలో రుణ మాఫీని అమలు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) చెందిన ఈ తరహా రుణగ్రహీతలకు రుణమాఫీ ప్రతిపాదనపై సూక్ష్మ రుణ పరిశ్రమ వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లు ఆయన వివరించారు. ఐబీసీలో ’ఫ్రెష్ స్టార్ట్’ నిబంధన కింద ఈ మాఫీని ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని కింద ఒకసారి రుణ మాఫీని గానీ వినియోగించుకున్న పక్షంలో మరో అయిదేళ్ల పాటు మరోసారి ఉపయోగించుకోవడానికి ఉండదని, మైక్రోఫైనాన్స్ పరిశ్రమ ప్రయోజనాలన్నీ పరిరక్షించే విధంగా తగు జాగ్రత్త చర్యలన్నీ తీసుకుని ఈ నిబంధనలు రూపొందించడం జరిగిందని శ్రీనివాస్ తెలిపారు. సొంత ఇల్లు లేకుండా ఆస్తుల విలువ కేవలం రూ. 20,000 లోపే ఉండి, మొత్తం రుణాలు రూ. 35,000 దాటని వారు మాత్రమే ఫ్రెష్ స్టార్ట్ కింద రుణ మాఫీకి అర్హులయ్యే అవకాశం ఉంది. -
‘ఆటో’లో మరిన్ని మూసి‘వెతలు’
న్యూఢిల్లీ: వాహన విక్రయాలు పడిపోయి, సంక్షోభ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న ఆటోమొబైల్ కంపెనీలు ఉత్పత్తిని మరింతగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పలు కంపెనీల ప్లాంట్ల మూసివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్, సుందరం–క్లేటన్ (ఎస్సీఎల్) సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి. హీరో మోటోకార్ప్ ఆగస్టు 15–18 దాకా (నాలుగు రోజుల పాటు) ప్లాంట్లను మూసివేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత మార్కెట్ డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటు చేసుకునేందుకు, వార్షిక మెయింటెనెన్స్లో భాగంగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్, వారాంత సెలవులు వంటి అంశాల కారణంగా ప్లాంట్ల మూసివేత నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత మార్కెట్ డిమాండ్ పరిస్థితులు ఇందుకు కొంత కారణం‘ అని హీరో మోటోకార్ప్ ఈ సందర్భంగా వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో హీరో మోటోకార్ప్ వాహనాల ఉత్పత్తిని 12 శాతం తగ్గించుకుని 24,66,802 యూనిట్లకు పరిమితం చేసుకుంది. మరోవైపు, దేశ, విదేశ ఆటోమోటివ్స్ తయారీ సంస్థలకు అల్యూమినియం ఉత్పత్తులు సరఫరా చేసే ఎస్సీఎల్ కూడా ’పాడి’లోని ప్లాంటులో ఆగస్టు 16, 17న (రెండు రోజులు) కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు వివరించింది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆటో పరికరాల తయారీ దిగ్గజం బాష్ తదితర సంస్థలు డిమాండ్కి అనుగుణంగా సర్దుబాటు చేసుకునేందుకు ఉత్పత్తిని తగ్గించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మారుతీలో 3 వేల ఉద్యోగాలు కట్.. ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ మందగించిన నేపథ్యంలో దేశీ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాలో (ఎంఎస్ఐ) సుమారు 3,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరంతా తాత్కాలిక ఉద్యోగులు. మందగమనంతో తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులను రెన్యువల్ చేయలేదని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ‘మారుతీలో సుమారు 3,000 మంది సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారంలో ఇది సర్వసాధారణమే. డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు మరింత మంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుంది‘ అని చెప్పారు. అయితే, పర్మనెంట్ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే ఆటోమొబైల్ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు. -
ఆర్థిక వ్యవస్థకు మోదీ టానిక్!
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన తర్వాత ప్రధాని నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మందగమన పరిస్థితులు ఒకదాని తర్వాత మరో రంగానికి వేగంగా విస్తరిస్తుండడం, ఉద్యోగాలు, సంపదకు విఘాతం కలుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఈ సమీక్ష నిర్వహించడం గమనార్హం. ఆర్థిక మందగమనానికి సహజ కారణాలు, దీర్ఘకాలిక ప్రభావాన్ని అంచనా వేయడానికే ఈ భేటీ జరిగినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రంగాలవారీగా ఉద్దీపన చర్యలను ప్రభుత్వం ప్రకటించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దేశ జీడీపీ వృద్ధి 2018–19లో 6.8%కి తగ్గిపోగా, 2014–15 తర్వాత ఇదే అత్యంత కనిష్ట స్థాయి. వినియోగ విశ్వాసం క్షీణిస్తుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కుంగుదల వంటి అంశాలు ప్రభుత్వాన్ని సైతం ఆందోళనకరం. అంతర్జాతీయంగా అమెరికా–చైనా మధ్య ముదిరిన వాణిజ్య, కరెన్సీ యుద్ధం పరిస్థితులను మరింత ప్రతికూలంగా మారుస్తోంది. అయితే, ప్రభుత్వం నుంచి ఇతమిద్ధంగా ఈ చర్యలు ఉంటాయన్న స్పష్టత అయితే ఆర్థిక శాఖ ఇంత వరకు వ్యక్తపరచలేదు. గత 2 వారాల వ్యవధిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకర్లు, వివిధ రంగాల పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు ఆర్థిక రంగ వృద్ధికి అవరోధంగా ఉన్న అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం నుంచి త్వరలోనే చర్యలు ఉంటాయని ఆ సందర్భంగా పారిశ్రామిక వేత్తలకు హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రభుత్వం ప్రకటించే చర్యల కోసం మార్కెట్లు, పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఆర్బీఐ సైతం తనవంతుగా రెపో రేట్లను కూడా మరోమారు తగ్గించింది. ఆందోళన కలిగిస్తున్న పరిస్థితులు ► వాహన రంగం అయితే గత రెండు దశాబ్దాల కాలంగా అత్యంత దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. వాహనాల అమ్మకాలు ప్రతీ నెలా భారీగా తగ్గిపోతున్నాయి. ► కార్లు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 19 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇప్పటి వరకు 300 డీలర్షిప్లు మూతపడ్డాయని, 2.30 లక్షల వరకు ఉద్యోగాలు పోయాయని అంచనా. ఆటో పరిశ్రమలో 10 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడినట్టు వాహన కంపెనీల సంఘం ప్రకటించింది. ► రియల్టీ పరిస్థితీ ఆశాజనకంగా లేదు. అమ్ముడుపోని ఇళ్లు భారీగానే ఉన్నాయి. ► ఎఫ్ఎంసీజీ కంపెనీల అమ్మకాల వృద్ధి సైతం గతంలో పోలిస్తే జూన్ త్రైమాసికంలో తగ్గింది. హిందుస్తాన్ యూనిలీవర్ జూన్ క్వార్టర్లో అమ్మకాల పరంగా కేవలం 5.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వృద్ధి 12 శాతంగా ఉంది. డాబర్ అమ్మకాల వృద్ధి సైతం 21 శాతం నుంచి 6 శాతానికి పరిమితం అయింది. బ్రిటానియా అమ్మకాల వృద్ధి 12% నుంచి 6 శాతానికి క్షీణించింది. ► ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో బ్యాంకుల నుంచి పరిశ్రమలకు రుణాలు అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.9%నుంచి 6.6%కి పెరగడం కాస్త ఆశాజనకం. కానీ, అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి మాత్రం రుణాల పంపిణీ 0.7 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు కేవలం 1.4 శాతమే పెరగ్గా, జీఎస్టీ వసూళ్లు జూలై వరకు 9% పెరిగాయి. 18% వృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. -
బండి కాదు..మొండి ఇది..!
సాక్షి, బిజినెస్ విభాగం: వాహన విక్రయాలు నానాటికి తగ్గిపోతుండటంతో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోతోంది. జూలైలో అమ్మకాలు దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్యలో దేశీ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 13.18% తగ్గిపోయింది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఫోర్డ్, టొయోటా, హోండా వంటి దిగ్గజాలన్నీ భారీగా ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. హ్యుందాయ్, ఫోక్స్వ్యాగన్ ఇండియా మాత్రమే ఉత్పత్తిని కాస్త పెంచుకున్నాయి. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 87,13,476 యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది అదే వ్యవధిలో సుమారు 10% పడిపోయి 78,45,675గా నమోదైంది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 13,97,404 యూనిట్ల నుంచి 13% క్షీణతతో 12,13,281 యూనిట్లకు పడిపోయింది. ఈ పరిణామాలతో ఏప్రిల్ నుంచి చూస్తే ఇప్పటిదాకా ఆటోమొబైల్ రంగంలో (వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీ సంస్థలు, డీలర్లు మొదలైన వర్గాలు) ఇప్పటిదాకా 3.5 లక్షల ఉద్యోగాల్లో కోత పడినట్లు అంచనా. తమ పరిధిలో 15,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, వందలకొద్దీ డీలర్షిప్లు మూతబడటంతో వేలమంది ఉపాధి కోల్పోయారని సియామ్ స్వయంగా వెల్లడించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇకపై తాత్కాలిక ఉద్యోగులు, సేల్స్.. మార్కెటింగ్ విభాగంలో సర్వీసులు అందించే వారు, పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాల్లో ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాలు మరింతగా ఉండనున్నాయని మానవ వనరుల (హెచ్ఆర్) సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇదే ధోరణి.. అంతర్జాతీయంగా కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమన ధోరణులే నెలకొన్నాయని, దీనికి భారత్ మినహాయింపేమీ కాదని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. దీంతో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడానికి తమ పరిధిలో తీసుకోగలిగిన చర్యలన్నీ తీసుకుంటున్నాయన్నారు. ఇందులో భాగంగానే ఉత్పత్తి తగ్గించుకోవడం, తాత్కాలికంగా ప్లాంట్లు మూసివేయడం వంటివి చేస్తున్నాయని మిశ్రా చెప్పారు. మందగమనం ఇలాగే కొనసాగితే రోజువారీ కార్యకలాపాలకు అంతగా ముఖ్యం కాకపోయినా అధిక వేతనాలు అందుకునే వారిని తొలగించడంపై కూడా కంపెనీలు దృష్టి పెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘తయారీ విభాగంపైనే ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం వల్ల ముఖ్యంగా తాత్కాలిక సిబ్బందిపై ప్రభావం పడుతుంది. ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల విభాగంలో మధ్య స్థాయి నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో కూడా కోత పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి‘ అని మిశ్రా చెప్పారు. పర్మనెంటు ఉద్యోగులను తొలగించడం అన్నది ఆఖర్న మాత్రమే జరగొచ్చని.. అయితే మందగమన ప్రభావాలు మరింత తీవ్రమైతే ఆయా ఉద్యోగుల బోనస్లు, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిల్లో కోత పడొచ్చని తెలిపారు. మరోవైపు, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లోని సర్వీస్ సిబ్బందిపై ఎక్కువగా ప్రభావం పడుతుందని టీమ్లీజ్ సర్వీసెస్ సంస్థ బిజినెస్ హెడ్ మునీరా లోలివాలా అభిప్రాయపడ్డారు. ‘వచ్చే కొద్ది నెలల్లో మందగమనానికి అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నాం. అయితే సేల్స్, ఆర్అండ్డీ విభాగాల్లోని ఉద్యోగాల్లో కొంత మేర కోత పడే అవకాశాలు ఉన్నాయి. ఇక డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మొదలైన వారి స్థాయిల్లోనూ ఉద్యోగాల్లో కోత ఉంటుంది. పడిపోతున్న వాహన విక్రయాల కారణంగా పరికరాల తయారీ పరిశ్రమపైనా ప్రభావం తప్పదు‘ అని ఆమె చెప్పారు. మరో 10 లక్షలకు పైగా కొలువులకు గండం.. దేశీ ఆటోమొబైల్ రంగంలో దాదాపు 3.5 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కానీ, గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు తదితర అంశాలపై కేంద్రం పలు నిర్ణయాలు ప్రకటిస్తుండటం వల్ల విధానాల్లో స్పష్టత లోపించడంతో ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక రుణాల లభ్యత కూడా అంతంతమాత్రంగానే ఉండటం, వాహనాలకు డిమాండ్ పడిపోవడం ఆటోమొబైల్ రంగాన్ని మరింతగా కుంగదీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆటోమొబైల్ రంగంలో ఏకంగా 10 లక్షల దాకా ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉందంటూ ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) గత నెలలోనే హెచ్చరించింది. ప్రభుత్వ మద్దతు కావాలి.. ఆటోరంగంలో పెను మా ర్పుల కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని మైఖేల్ పేజ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ మోహిత్ భారతి వ్యాఖ్యానించారు. ‘ఇదే ధోరణి మరికొంత కాలం సాగిందంటే ఆటో పరికరాల సంస్థలు, అనుబంధ సంస్థల్లోనూ ఉద్యోగాల్లో కోత తప్పకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గానీ తక్షణం జోక్యం చేసుకోకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగానికి పరిస్థితులు ఆశావహంగానైతే కనిపించడం లేదు‘ అని మోహిత్ పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించాలని, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కొంత కాలం వాయిదా వేయడం ద్వారా పరిశ్రమ కోలుకునేందుకు కాస్త వెసులుబాటు కల్పించాంటూ ఆటో రంగ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కారు.. బైక్ రివర్స్ గేర్..! -
రూ.లక్ష కోట్ల ఉద్దీపనలు కావాలి
న్యూఢిల్లీ: పెట్టుబడుల క్రమాన్ని వేగవంతం చేసేందుకు, క్షీణిస్తున్న ఆర్థిక రంగ వృద్ధి పునరుత్తేజానికి రూ.లక్ష కోట్లకు పైగా ఉద్దీపనలు అవసరమని దేశీయ పరిశ్రమల సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి సూచించాయి. త్వరలోనే ఆర్థిక వృద్ధికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీనిచ్చినట్టు పారిశ్రామిక వేత్తలు సమావేశం అనంతరం మీడియాకు తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి పలువురు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుత మందగమన వాతావరణంలో వెంటనే పరిష్కారాలు అవసరమని అసోచామ్ ప్రెసిడెంట్ బీకే గోయంకా పేర్కొన్నారు. ‘‘ఉద్దీపనల ప్యాకేజీ ద్వారా ఆర్థిక రంగానికి సత్వర పరిష్కారం కావాలి. రూ.లక్ష కోట్లకు పైగా ప్యాకేజీని మేము సూచించాం’’ అని గోయంకా తెలిపారు. కుంగిన ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజాన్ని తీసుకొచ్చేందుకు, ఇబ్బందికర అంశాలపై మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక శాఖ అధికారులు పరిశ్రమల నేతలతో చర్చించారు. పరిశ్రమల పునరుత్తేజానికి అతి త్వరలోనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు, ఆర్థిక శాఖ నుంచి సానుకూల అభిప్రాయాలు వచ్చినట్టు జేఎస్డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. స్టీల్, ఎన్బీఎఫ్సీ, వాహన రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పిన ఆయన వీలైనంత త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు చెప్పారు. లిక్విడిటీ సమస్య లేదు... పరిశ్రమలకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు పునరాలోచిస్తున్న విషయం సహా పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు పిరమల్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ అజయ్ పిరమల్ తెలిపారు. ‘‘బ్యాంకుల్లో లిక్విడిటీ లేకపోవడం కాదు, కానీ రుణ వితరణే జరగడం లేదు. ఆర్థిక రంగంలో ఎన్బీఎఫ్సీ పరంగా సమస్య నెలకొని ఉంది’’ అని సమావేశం అనంతరం మీడియాతో అజయ్ పిరమల్ వెల్లడించారు. ఎన్బీఎఫ్సీ రంగ సమస్యలు ఆటోమొబైల్, హోమ్లోన్, ఎంఎస్ఎంఈలపైనా ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పారు. త్వరలోనే చర్యలు ఉంటాయని ప్రభుత్వం తెలిపిందని, వాటి కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. సీఎస్ఆర్ విషయంలో ఎటువంటి శిక్షాత్మక చర్యలు ఉండకూడదని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు అజయ్ పిరమల్ వెల్లడించారు. దేశ ఆర్థిక రంగ వృద్ధి పునరుద్ధరణకు అవసరమైన తదుపరి ఉద్దీపనల విషయంలో ప్రభుత్వం తమ అభిప్రాయాలను కోరినట్టు సీఐఐ వైస్ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ తెలిపారు. సమావేశంలో ఎన్నో అంశాలు చర్చించినట్టు పేర్కొన్నారు. ఆటోమొబైల్ రంగంలో మాంద్యం స్టీల్ రంగంపైనా ప్రభావం చూపుతోందన్నారు. సెంట్రల్ బ్యాంకు రేట్ల కోతను బ్యాంకులు వినియోగదారులకు బదలాయించడం అతిపెద్ద అంశమని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని అభిప్రాయపడ్డారు. ‘‘రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని బ్యాంకులు తప్పనిసరిగా వినియోగదారులు, రుణ గ్రహీతలకు బదలాయించాలి. తదుపరి రేట్ల కోతపైనా ఆశావహంగా ఉన్నాం. ఆర్బీఐ ఇప్పటి వరకు 110 బేసిస్ పాయింట్లు తగ్గించడం ఉత్సాహాన్నిచ్చేదే’’ అని సోమాని తెలిపారు. -
అమ్మకాలతో స్టాక్ మార్కెట్ డీలా
ముంబై : ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడితో స్టాక్ మార్కెట్లు ప్రారంభ లాభాలను కోల్పోయాయి. నూతన వాహనాలపై రిజిస్ర్టేషన్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో ఆటో మొబైల్ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 109 పాయింట్ల నష్టంతో 37,770 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 50 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 11,233 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అన్ని రంగాల ఇండెక్స్లు పతనమయ్యాయి. ఇక బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, వేదాంత, మారుతి సుజుకి, టాటా మోటార్స్ తదితర షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీ షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. -
పాత కారు.. యమా జోరు!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త కార్ల కంటే పాత వాటికే డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2018–19లో 33.7 లక్షల కొత్త కార్లు రోడ్డెక్కగా... అదే సమయంలో ఏకంగా 40 లక్షల పాత కార్లు చేతులు మారాయి. అంతకు ముందటేడాదితో పోలిస్తే 2018–19లో కొత్త కార్ల అమ్మకాల వృద్ధి రేటు 2.7 శాతం మాత్రమే. నాలుగేళ్లలో ఇదే తక్కువ వృద్ధి రేటు కూడా!!. అదే పాత కార్ల విషయానికొస్తే... ఈ వృద్ధి 6–7 శాతం మధ్య ఉండటం గమనార్హం. వాల్యూ ఫర్ మనీ.. పాత కారుకు కస్టమర్లు ఆకర్షితులు కావటానికి ప్రధాన కారణం వారు తాము చెల్లించే డబ్బుకు తగ్గ విలువ ఉండాలని ఆశిస్తున్నారని మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ చెబుతోంది. ‘‘కొత్త కారు కొనాలనుకుంటే... ఆ ధరకే లేదా అంత కంటే తక్కువ ఖరీదుకే ఇంకా పెద్ద కారు వస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నలుగురు వ్యక్తుల్లో ఒకరు మాత్రమే కొత్త కారు కొంటున్నారు. మిగిలిన ముగ్గురు ప్రీ ఓన్డ్ కారుకు సై అంటున్నారు’’ అని ట్రూబిల్ కో–ఫౌండర్ శుభ్ బన్సాల్ చెప్పారు. ఇప్పుడు భారత్లో ప్రీ ఓన్డ్ విభాగంలోనే అధిక విక్రయాల ట్రెండ్ కొనసాగుతోందని చెప్పారు. పాత కార్ల విషయంలో వాల్యూ చూసేవారు 15 శాతం మంది ఉంటున్నారు. తక్కువ కాలానికి వాడి తిరిగి విక్రయించాలని భావించేవారు 23 శాతం కాగా, తక్కువ ధరకు వస్తుంది కాబట్టి కొనుగోలుకు మొగ్గు చూపేవారు 62 శాతం మంది ఉంటున్నారట. తరచూ మారుస్తున్నారు.. దశాబ్దం క్రితం ఒక్కో కస్టమర్ తమ కారును పదేళ్లపాటు అట్టి పెట్టుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. యువ కస్టమర్ల సంఖ్య ఎక్కువ కావటంతో 3– 5 ఏళ్లకే కారును మారుస్తున్నారు. మరీ పాత వాహనమైతే సేల్ వాల్యూ రాదు. చాలా సందర్భాల్లో మూడేళ్ల పాతది కొత్త కారు మాదిరిగా ఉంటోందట. దీంతో చాలా మంది కస్టమర్లు పాత కారుకు ఓకే చెబుతున్నారు. మూడేళ్లలోపు తిరిగిన కారును కోరేవారు 27 శాతం, 4–5 ఏళ్లు వాడిన కారును కోరుకునేవారు 45 శాతం మంది ఉన్నారన్నది విక్రయదారుల మాట. 46 శాతం మంది యజమానులు మాత్రం తమ కారును 6–8 ఏళ్లు వాడిన తర్వాతే అమ్ముతున్నారు. 3– 5 ఏళ్లకే కారును విక్రయిస్తున్న వినియోగదార్లు పెద్ద కారు లేదా ఉత్తమ మోడల్కు అప్డేట్ అవుతున్నారు. వ్యవస్థీకృత రంగంవైపు.. ప్రీ ఓన్డ్ కార్ల మార్కెట్లో వ్యవస్థీకృత రంగ విభాగ వాటా తక్కువే ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. 2016–17లో వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం ఉంటే 2018– 19 నాటికి 18 శాతానికి చేరింది. వ్యవస్థీకృత రంగ కంపెనీలు ప్రీ ఓన్డ్ కార్ల సేల్స్ కోసం షోరూంలు తెరుస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ సొంతంగా ప్రీ ఓన్డ్ కేంద్రాలను ఆపరేట్ చేస్తుండడం విశేషం. సొంత బ్రాండ్ కార్లనేగాక ఏ కంపెనీ కార్లనైనా ఇవి కొనటం, అమ్మటం చేస్తున్నాయి. వ్యవస్థీకృత రంగంలోని ప్రీ ఓన్డ్ కేంద్రాల్లో కార్లకు నాణ్యత పరీక్షలు జరిపి, రిపేర్ చేసి మంచి కండీషన్కు తీసుకొచ్చాకే విక్రయిస్తారు. సర్టిఫై చేసి వారంటీతో అమ్ముతారు. కారు కొనేందుకు రుణం సులభంగా వస్తుంది. ఇక కస్టమర్ నుంచి కస్టమర్కు జరుగుతున్న వ్యాపారం 32 శాతంగా ఉంది. అవ్యవస్థీకృత రంగం 17 నుంచి 16 శాతానికి తగ్గింది. సెమి– ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ 36 నుంచి 34 శాతంగా ఉంది. ఫైనాన్స్ 17 శాతమే.. పాత కార్ల విక్రయాలు పెరుగుతున్నప్పటికీ కొత్త కార్లతో పోలిస్తే ఫైనాన్స్ లభ్యత తక్కువగా ఉంటోంది. 75 శాతం కొత్త కార్లకు రుణ సదుపాయం లభిస్తే, పాత కార్ల విషయంలో ఇది 17 శాతమే. ఫైనాన్స్ కాస్ట్ ఎక్కువగా ఉండడంతోపాటు వినియోగదారుకు క్రెడిట్ కార్డు లేదా లోన్ హిస్టరీ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. కొత్త కారుపై ఉండే వడ్డీ రేటు కంటే పాత కారుపై వడ్డీ రేటు కస్టమర్, వాహన విలువను బట్టి 2– 5 శాతం ఎక్కువ ఉంటోంది. ఆర్గనైజ్డ్ సెక్టార్లో విక్రయ కంపెనీలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో చేతులు కలిపి కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. సులువుగా రుణం వచ్చేలా చేస్తున్నాయి. మరో విషయమేమంటే అవ్యవస్థీకృత రంగంలో పాత కారుకు విలువ కట్టడం అంత ఈజీ కాదు. ప్రామాణికత లేకపోవడంతో చాలా సందర్భాల్లో బ్రోకర్లదే తుది నిర్ణయంగా ఉంటోంది. కారు మోడల్, తిరిగిన కిలోమీటర్లు, వయసు, రంగు, నగరం కూడా ధరను నిర్ణయిస్తాయి. (సోర్స్–మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్) -
మహీంద్రాతో ఫోర్డ్ జాయింట్ వెంచర్
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో అవకాశాలు అందిపుచ్చుకోవడం కష్టతరంగా మారుతుండటంతో విదేశీ ఆటోమొబైల్ కంపెనీలు క్రమంగా కార్యకలాపాలు తగ్గించుకుంటున్నాయి. అమెరికన్ సంస్థ జనరల్ మోటార్స్ .. భారత్లో కార్యకలాపాలను తగ్గించుకోవడంతో పాటు దేశీయంగా కార్ల విక్రయాలు నిలిపివేసింది. తాజాగా అదే బాటలో మరో అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ మోటార్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఫోర్డ్ తాజాగా భారత్లో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం)తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకునే దిశగా జరుపుతున్న చర్చలు తుది దశల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, ఫోర్డ్ భారత్లో స్వతంత్రంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలను ఇకపై నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చర్చల సారాంశం ప్రకారం కొత్తగా ఏర్పాటు చేయబోయే జాయింట్ వెంచర్లో ఫోర్డ్కు 49 శాతం, మహీంద్రాకు 51 శాతం వాటాలు ఉంటాయి. ప్రస్తుతం భారత్లో తమ ఆటోమోటివ్ వ్యాపార కార్యకలాపాలు, అసెట్స్, ఉద్యోగులు మొదలైనవన్నీ కూడా ఫోర్డ్ ఈ కొత్త సంస్థకు బదలాయిస్తుంది. ఈ డీల్ విలువ ఎంతన్నది వెల్లడి కానప్పటికీ.. మొత్తం మీద 90 రోజుల్లోగా ఒప్పందం పూర్తి కావొచ్చని అంచనాలు ఉన్నాయి. దీన్ని ఒకరకంగా భారత్ నుంచి ఫోర్డ్ పాక్షిక నిష్క్రమణగానే భావించవచ్చని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుతం ఫోర్డ్ భారత విభాగం మాతృసంస్థకు రాయల్టీలు చెల్లించాల్సి వస్తుండటం వల్ల కార్ల ధరలు కొంత అధికంగా ఉంటున్నాయి. ఒకవేళ డీల్ కానీ సాకారమైన పక్షంలో రాయల్టీల ప్రసక్తి ఉండదు కాబట్టి.. ఫోర్డ్ కార్ల రేట్లు తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అలాగే తక్కువ వ్యయాలతో ఫోర్డ్, మహీంద్రా ఎప్పటికప్పుడు కొంగొత్త మోడల్స్ను వేగవంతంగా ప్రవేశపెట్టేందుకు ఈ జేవీ ఉపయోగపడనుంది. డీల్ కారణంగా భారత విభాగానికి వచ్చే నిధులతో నష్టాలను కొంత మేర భర్తీ చేసుకోవచ్చని ఫోర్డ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ డీల్ ఒకరకంగా రెండు సంస్థలకు ప్రయోజనకరంగానే ఉండగలదని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. 2017లోనే మహీంద్రాతో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం రెండు సంస్థలూ కలిసి కొత్తగా స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్, ఎలక్ట్రిక్ కార్స్ మొదలైన వాహనాలు నిర్మించాలని తలపెట్టాయి. ప్రస్తుతం మరో అడుగు ముందుకేసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. కష్టతరమైన భారత మార్కెట్.. భారత వాహనాల మార్కెట్ వృద్ధి గణనీయంగానే ఉన్నప్పటికీ.. ఇటీవల కొంత మందగించింది. గత ఆర్థిక సంవత్సరం కార్ల అమ్మకాల వృద్ధి కేవలం 3 శాతానికే పరిమితమైంది. 33 లక్షల కార్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో కార్ల విక్రయాల వృద్ధి ఏకంగా 8 శాతం మేర నమోదైంది. ప్రస్తుతానికి విక్రయాల వృద్ధి మందగించినా 2023 నాటికల్లా ఏటా 50 లక్షల పైచిలుకు అమ్మకాలతో భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద కార్ల మార్కెట్గా అవతరించవచ్చని అంచనాలున్నాయి. అయితే, మారుతీ సుజుకీ వంటి దేశీ దిగ్గజం, కొరియాకు చెందిన హ్యుందాయ్ ఆధిపత్యం అధికంగా ఉన్న దేశీ మార్కెట్లో ఇతర దేశాల కార్ల కంపెనీలు పట్టు సాధించడం కష్టతరంగా ఉంటోంది. ఫోర్డ్ గత ఆర్థిక సంవత్సరం కేవలం 93,000 వాహనాలు మాత్రమే విక్రయించగలిగింది. గడిచిన 2 దశాబ్దాల్లో భారత మార్కెట్పై ఫోర్డ్ 2 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు పెట్టింది. ఇన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నా, భారత మార్కెట్లో ఫోర్డ్ వాటా కేవలం 3 శాతానికే పరిమితమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఫోర్డ్ తాజాగా ప్రత్యామ్నాయ అవకాశాలు పరిశీలిస్తోంది. -
కారు కొనేముందు డిజిటల్ టచ్
► ఆటోమొబైల్ రంగంపై ప్రభావం ► కీలకంగా సామాజిక మాధ్యమాలు ► చేంజింగ్ గేర్స్ 2020 నివేదిక హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బడ్జెట్కు తగ్గట్టుగా ఏ కారు కొనాలి.. ఏ మోడల్కు బెస్ట్ రేటింగ్ ఉంది. ఆ కారును వాడుతున్నవారు ఏమనుకుంటున్నారు వంటి విషయాలపై స్మార్ట్ కస్టమర్లు డిజిటల్ మాధ్యమాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ అంశమే ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ రంగం స్వరూపాన్ని మార్చేస్తున్నది. భారత్లో 2020 నాటికి 70% వాహన అమ్మకాలపై డిజిటల్ ప్రభావం ఉంటుందని ‘చేంజింగ్ గేర్స్ 2020’ నివేదిక చెబుతోంది. భారత వాహన రంగంలో డిజిటల్ మాధ్యమాల ప్రభావంపై కన్సల్టింగ్ రంగంలో ఉన్న బెయిన్ అండ్ కంపెనీ, ఫేస్బుక్తో కలసి చేపట్టిన అధ్యయనం ప్రకారం ప్రస్తుతం 20 శాతం వాహన కొనుగోళ్లపై సోషల్ మీడియా ప్రభావితం చేస్తోంది. మూడేళ్లలో ఈ సామాజిక మాధ్యమాల పాత్ర రెట్టింపు అవుతుందని అధ్యయనం చెబుతోంది. 35 ఏళ్లలోపు యువతే డిజిటల్కు మొగ్గుచూపుతుండటం విశేషం. 80 శాతం మంది కస్టమర్లు ఆన్లైన్ రీసెర్చ్ అంతా స్మార్ట్ఫోన్లో చేసేస్తున్నారట. అంతా డిజిటల్మయం.. దేశంలో స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడం, ఇంటర్నెట్ వాడకం విస్తృతంకావడం....వాహన వినియోగదార్లపై అమితంగా ప్రభావం చూపిస్తాయని చేంజింగ్ గేర్స్ 2020 నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రూ.1,17,000 కోట్ల వ్యాపారంపై డిజిటల్ తన సత్తా చూపిస్తోంది. 2020 నాటికి ఇది రూ.2.60 లక్షల కోట్ల వ్యాపారాన్ని ప్రభావితం చేయనుంది. స్మార్ట్ వినియోగదార్ల సంఖ్యపరంగా దేశంలో హైదరాబాద్ టాప్–5లో ఉంటుందని వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్దేవ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పరిశోధన చేయాల్సిందే.. బెయిన్ అండ్ కంపెనీ, ఫేస్బుక్ బృందం 1,551 మంది భారతీయ కస్టమర్లను అధ్యయనం చేసింది. 87 మంది డీలర్లు, ఆటోమొబైల్ కంపెనీల టాప్ మేనేజ్మెంట్ టీమ్తోపాటు యూఎస్, యూకే, జర్మనీ, చైనాకు చెందిన కస్టమర్లను సైతం ఇందులో భాగస్వామ్యం చేశారు. వాహన పరిశ్రమ, కస్టమర్ల తీరులో అనూహ్య మార్పులు వస్తున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. 48 శాతం వినియోగదార్లు వాహనాన్ని కొనే ముందు డిజిటల్ చానళ్లలో పరిశోధన చేస్తున్నారట. ఈ సంఖ్య మూడేళ్లలో 70 శాతానికి చేరనుంది. కస్టమర్లు వాహనం కొన్న తర్వాత వారి అనుభవాన్నీ డిజిటల్ వేదికగా పంచుకుంటున్నారు. ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ ద్వారా కంపెనీలతోపాటు డీలర్లతోనూ టచ్లో ఉంటున్నారు. బ్రాండ్ ఎంపికలో 45 శాతం మందిపై డిజిటల్ ముఖ్య భూమిక పోషిస్తోంది. 2020 కల్లా ఇది 60 శాతానికి చేరనుంది. విక్రయానంతర సేవలపైనా డిజిటల్ ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం సర్వీస్ బుక్ చేసుకునేందుకు 14 శాతం మంది, విడిభాగాల కొనుగోలుకు 8 శాతం మంది ఆన్లైన్పై ఆధారపడ్డారు. ఈ సంఖ్య 2020 నాటికి వరుసగా 40, 30 శాతానికి చేరనుంది. డీలర్ దగ్గరకు రాకముందే.. పరిశోధనలో పాలుపంచుకున్న వినియోగదార్లలో డీలర్ వద్దకు వెళ్లకముందే డిజిటల్ ఆసరాగా 81 శాతం మంది తాము కొనబోయే కారుకు ఇంత వెచ్చించాలి అని నిర్ణయం తీసుకున్నారట. 72 శాతం మంది బ్రాండ్, 49% మంది మోడల్, 40 శాతం మంది వేరియంట్ను ఆన్లైన్లోనే ఎంచుకున్నారు. వర్చువల్ రియాలిటీ ఆధారిత టెస్ట్ డ్రైవ్కు మూడింట రెండొంతుల మంది సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇక వాహన రంగ కంపెనీలు ప్రకటనలకు చేస్తున్న ఖర్చులో డిజిటల్ యాడ్ వ్యయాలు ఇప్పుడు 11 శాతమున్నాయి. ఇది మూడేళ్లలో 30 శాతానికి చేరనుంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా కంపెనీలు తమ డీలర్షిప్ కేంద్రాల రూపురేఖలను మారుస్తున్నాయి. ఖరీదైన లొకేషన్లలో అత్యాధునిక ఔట్లెట్లు కొలువుదీరుతున్నాయి. స్టోర్లలో టచ్ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నాయి. యాప్ ఆధారిత ట్యాక్సీలకు.. కొత్త తరం మొబిలిటీ మోడళ్లకు కస్టమర్ల నుంచి ఆదరణ లభిస్తోంది. కీలక కస్టమర్లలో 40 శాతం మంది వారంలో మూడు నాలుగుసార్లు యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలను వినియోగించుకుంటున్నారు. భవిష్యత్తులో ఈ రంగంలో మంచి వృద్ధి ఉండనుందని అధ్యయనం చెబుతోంది. యాప్ ఆధారిత ట్యాక్సీలు తిరుగుతున్న నగరాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే ఒక్కో వ్యక్తి సగటున 3.3 రైడ్స్ చేస్తున్నారట. చైనాలో ఇది 17.1 రైడ్స్ ఉంది. భారత్లో ప్రస్తుతం 131 నగరాల్లో యాప్ ఆధారిత ట్యాక్సీలు పరుగెడుతున్నాయి. గతేడాది ప్రతి వారం 1.3 కోట్ల రైడ్స్ నమోదయ్యాయంటే ఆశ్చర్యమేయక మానదు. -
ఆటోమొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి
శాసనమండలిలో మంత్రి కేటీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఆటోమొబైల్ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఖమ్మం, కామారెడ్డి, మిర్యాలగూడ, మంచిర్యాల, కరీంనగర్, రామగుండంలలో ఆటోనగర్లను ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అశోక్ లేల్యాండ్ కంపెనీ బస్బాడీ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందన్నారు. హైదరాబాద్–వరంగల్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా భువనగిరి, జనగామ, స్టేషన్ఘన్పూర్, మణికొండ, శాయంపేట– సంగెంలలో క్లస్టర్ల ఏర్పాటుకు నిర్ణయించామని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి సుల్తాన్పూర్లో 50ఎకరాలు కేటాయించామని, వారికి 30 శాతం రాయితీతో భూమిని కేటాయిస్తామని వెల్లడించారు. త్వరలోనే ప్లాస్టిక్ సిటీ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు. సోమ వారం శాసనమండలిలో టీఎస్ ఐపాస్, సులభతర వ్యాపార విధానంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో కేటీఆర్ మాట్లాడారు. రానున్న రోజుల్లో ‘కాస్ట్ఆఫ్ డూయింగ్ బిజినెస్, క్వాలి టీ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లపై దృష్టి పెట్ట నున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబ డులను రాష్ట్రానికి ఆకర్షించే లక్ష్యంతో నవం బర్లో హైదరాబాద్లో ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ను ప్రవేశపెట్టాక ఇప్పటివరకు రూ.49,463 కోట్ల పెట్టుబడితో కూడిన 2,929 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. వాటి ద్వారా ప్రత్యక్షంగా 1,95,290 మందికి, పరోక్షంగా మరో మూడు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రపంచస్థాయి కంపె నీలైన గూగుల్, ఆపిల్, ఫేస్బుక్, అమెజాన్లు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలSయా లను హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయన్నారు. పారిశ్రామిక విధానంలో యువ పారిశ్రామికవేత్తలకు ఎంత కోటా కేటాయించారని, తెలంగాణ పారిశ్రా మిక వేత్తలు ఎంత మంది ఉన్నారని విపక్షనేత షబ్బీర్ అలీ మండలిలోప్రశ్నించారు. -
యంత్ర మర్మం తెలిసింది
మహిళా విజయం: ఆటో మొబైల్రంగం అనగానే... యంత్రాల మోతలు, గుర్తొస్తాయి. వాటితో పని చేసే గరుకు చేతులు కళ్ల ముందు మెదలుతాయి. అందుకు భిన్నంగా... రెండు సున్నితమైన చేతులు ఈ యంత్రాంగాన్ని నడిపిస్తున్నాయి. మన పక్కింటమ్మాయిలా కనిపించే సునీత చేస్తున్న సాహసం ఇది. మా కుటుంబంలో తొలితరం పారిశ్రామికవేత్త మా అమ్మ. ఆమె మా నాన్న స్థాపించిన పౌల్ట్రీ పరిశ్రమను నడిపింది. నేను ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టడం సాహసోపేతమైన నిర్ణయం అనుకోవడం లేదు. మా అమ్మానాన్నలు నాకు ‘ఆడపిల్ల కాబట్టి...’ అంటూ పరిధులు విధించలేదు. మాది విజయవాడ దగ్గర సూరంపల్లి. ‘నున్న’లో మా కోళ్లఫారాలుండేవి. అమ్మానాన్నలు ఇతర పనుల్లో ఉన్నప్పుడు నేను లూనా మీద వెళ్లి కోళ్లఫారం పనులు చూసేదాన్ని. బీకామ్ పూర్తవగానే పెళ్లి చేశారు. అలా హైదరాబాద్కొచ్చాను. మావారు మెకానికల్ ఇంజనీర్. నాలో వ్యాపార లక్షణాలున్నాయంటూ ఎంబీఏ చేయమన్నారు. ‘నేను చేయగలను’ అని నిరూపించుకోవాలనే తపన నాలో చాలా ఉండేది. ఎంబీఏ కాగానే 2008లో ఈ యూనిట్ని స్థాపించాను. మొదట్లో చేతులతోనే... మొదట్లో మిల్లింగ్ మెషీన్తో చిన్న చిన్న కాంపోనెంట్స్ తయారు చేశాం. తర్వాత నానోబోరింగ్ ద్వారా బ్లాక్ సిస్టమ్ చేశాం. హారిజాంటల్ బోరింగ్, మూసపోత వంటివన్నీ చేత్తోనే చేయాల్సి వచ్చేది. 2010 నాటికి నాణ్యమైన దేశీయ, విదేశీ యంత్రాలతో పరిశ్రమ స్థాయి పెంచాను. మాన్యువల్గా చేసినప్పుడు నెలకు పాతిక- ముప్పై వేల రూపాయల పనులు చేసేవాళ్లం. ఇప్పుడది ఏడాదికి అరవై లక్షల టర్నోవర్కి చేరింది. సోలార్ స్ట్రింగింగ్ జిగ్స్ తయారీలో దక్షిణ భారతదేశంలో మొదటిస్థానంలో ఉన్నాం. ప్రోగ్రామింగ్, మార్కెటింగ్ నేను, రోజువారీ పనులు మావారు చూసుకుంటున్నాం. శిక్షణ ఇచ్చే స్థాయికి... ఇంజనీరింగ్లో ప్రాథమిక సూత్రాలను మా వారు నేర్పించారు. ఆ తర్వాత మొత్తం కంప్యూటర్ ద్వారా రూపొందించడానికి 2డి, 3డి ఆపరేషన్స్ నేర్చుకున్నా. ఒక వస్తువు రూపొందాలంటే అనేక విడిభాగాలు తయారు చేసుకుని వాటిని కరెక్టుగా అసెంబుల్ చేయాలి. ప్రతి విడిభాగానికీ ముందు ఒక మూసను తయారుచేయాలి. మేము ఆ మూసలను, విడిభాగాలను తయారు చేస్తాం. 24 కట్టర్స్ ఆధారంగా కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేస్తే యంత్రాన్ని ఆన్ చేయగానే ఎప్పుడు ఏ కట్టర్ పని చేయాలో అది ఆ పని చేసుకుపోతుంది. టూ వీలర్ తయారు కావాలంటే వందలాది విడిభాగాలు కావాలి, కారుకైతే వెయ్యి విడిభాగాలుంటాయి. నేను ఇందులో ప్రత్యేకంగా కోర్సు చేయలేదు కానీ, సబ్జెక్టు క్షుణ్ణంగా అధ్యయనం చేశాను. నేనిప్పుడు మాకు వచ్చిన ఆర్డర్లకు స్వయంగా డిజైన్ చేసుకోవడంతోపాటు ఇంజనీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేట్లకు వారు చదివిన విషయాన్ని పనిలో ఆచరించడానికి తగిన శిక్షణ ఇవ్వగలను. పరిశ్రమకు ముందు... యంత్రాల మధ్య సమన్వయం కుదిర్చి పనిచేయడం అసాధ్యమేమీ కాదు అని నమ్మాకే ఇందులోకి దిగాను. నాకేం కావాలో తెలుసుకున్న తర్వాత నేర్చుకోవడం కష్టం కాలేదు. పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చెందిన సాంకేతికరంగంలో యంత్రాల విడిభాగాల తయారీ చేస్తున్న ఏకైక తెలుగు మహిళను అని గర్వంగా చెప్పగలను. ఆ నిబంధన ఉండాలి మన దగ్గర మెటల్ ఇండస్ట్రీకి ప్రోత్సాహం తక్కువ. గుజరాత్లో బాగుంది. వ్యవస్థను నడిపించే శక్తి మహిళలకు ఉంది. పరిశ్రమ స్థాపనతోపాటు, మార్కెటింగ్లో కూడా మహిళలకు ప్రభుత్వం నుంచి ఆసరా ఉంటే మరింత మంది ఈ రంగంలోకి రాగలుగుతారు. ప్రభుత్వ అధీనంలో నడిచే భారీ పరిశ్రమలకు అవసరమయ్యే విడిభాగాల ఆర్డర్లు మహిళలు నిర్వహించే పరిశ్రమలకు ఇవ్వాలనే నిబంధన పెడితే బావుంటుంది. - జె. సునీత, ఎం.డి, ఎస్.ఎల్.పి. ఇంజినీర్స్ (సీఎన్సీ కాంపోనెంట్స్, సబ్ అసెంబుల్స్) ఫోన్: 9441549202 రిపోర్టింగ్: వాకా మంజులారెడ్డి ఫొటో: రాజేశ్ -
ముగిసిన ‘అంబాసిడర్’ శకం!
న్యూఢిల్లీ: దేశ ఆటోమొబైల్ రంగంలో ఒక వెలుగువెలిగి... రాజకీయ నాయకులకు అధికారిక వాహనంగా పేరొందిన అంబాసిడర్ కారు ఇక గత జ్ఞాపకంగా మిగిలిపోనుందా? తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. ‘భారతీయ రోడ్లపై రారాజు’గా విఖ్యాతి చెందిన ఈ కార్ల ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు వీటిని తయారు చేస్తున్న హిందుస్థాన్ మోటార్స్ కంపెనీ ప్రకటించింది. ముఖ్యంగా అమ్మకాలు ఘోరంగా పడిపోవడం, డిమాండ్ లేకపోవడం, రుణభారం తీవ్రతరం కావడం వంటి కారణాలవల్లే తయారీని ఆపేస్తున్నట్లు కంపెనీ అధికారి ఒకరు పేర్కొన్నారు. బ్రిటన్కు చెందిన మోరిస్ ఆక్స్ఫర్డ్ కారు డిజైన్ ఆధారంగా 1957 నుంచి దేశంలో అంబాసిడర్ కార్లను హిందుస్థాన్ మోటార్స్ తయారుచేస్తూవస్తోంది. గత 60 ఏళ్లలో కారు డిజైన్లో పెద్దగా మార్పులేవీ చేయకపోవడం, విదేశీ కార్ల దిగ్గజాలతో పోటీలో చాలా వెనుకబడటం కూడా కంపెనీకి ప్రతికూలంగా మారాయి. ‘పశ్చిమ బెంగాల్లోని ఉత్తరపారాలో ఉన్న ప్లాంట్ను మూసేశాం. నిరవధికంగా తయారీని నిలిపివేస్తున్నాం. డిమాండ్ పడిపోయిన నేపథ్యంలో అనవసరంగా ఈ కార్ల తయారీకి మరింత సొమ్మును వెచ్చించలేం. దీనివల్ల భవిష్యత్తులో మళ్లీ పునరుద్ధరణ ప్రణాళికలు రూపొందించుకోవడానికి మాకు వీలవుతుంది’ అని కంపెనీ సీనియర్ అధికారి చెప్పారు. కాగా, బీఎస్ఈకి కూడా శనివారమే కంపెనీ తాజా పరిణామాలను తెలియజేసింది. నిధుల లేమి, డిమాండ్ అట్టడుగుకు పడిపోవడం, అప్పులు పేరుకుపోవడం వల్లే ప్లాంట్ను మూసేసినట్లు వెల్లడించింది. అనేక కొత్త మోడళ్ల కార్లు భారత్లో కస్టమర్ల మనసు దోచుకున్నప్పటికీ.. అంబాసిడర్ మాత్రం చాన్నాళ్లు రాజకీయ నాయకులు, అధికారులకు అత్యంత ప్రీతిపాత్రమైన వాహనంగా నిలిచింది. అయితే, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల(ఎస్యూవీ) హవాతో సీనియర్ బ్రూరోక్రాట్లు, రాజకీయ నాయకులు సైతం అంబాసిడర్ను వదలేసి.. వాటివైపు మొగ్గుచూపారు. అయితే, ట్యాక్సీ డ్రైవర్లు, కొందరు రాజకీయవేత్తలతోపాటు భారత్కు వచ్చే విదేశీ టూరిస్టుల నుంచి అంబాసిడర్ కార్లకు ఇంకా ఆదరణ లభిస్తోంది. 1980లలో ఏటా 24,000 వరకూ అంబాసిడర్ కార్లు అమ్ముడుకాగా... 2000 సంవత్సరం తర్వాత ఈ సంఖ్య 6,000 లోపునకు పడిపోయింది. ప్లాంట్ నుంచి తాజాగా రోజుకు ఐదుకార్లు మాత్రమే బయటికి విడుదలయ్యాంటే వీటికి డిమాండ్ ఎంతగా పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు ప్రత్యర్థి కంపెనీల నుంచి పోటీ విపరీతంగా పెరిగిపోవడంతో చేసేదేమీలేక కంపెనీ వీటి తయారీకి ఫుల్స్టాప్ పెట్టేసింది. ‘ఆంబి’ అని ముద్దుపేరుతో ప్రాచుర్యం పొందిన అంబాసిడర్ కార్ హుందాకు ప్రతిరూపంగా నిలిచింది. ఆకట్టుకునే రూపం, శక్తివంతమైన ఇంజిన్, భద్రతపై భరోసా... ఇవన్నీ అంబాసిడర్ను చూస్తే గుర్తుకొచ్చేవి. ఇలాంటి అంబాసిడర్ గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు. హిందూస్తాన్ 10 పేరుతో హిందుస్తాన్ మోటార్స్ తొలి అంబాసిడర్ను ఉత్పత్తి చేసింది. ఈ కారుతో కంపెనీకి ఇబ్బడిముబ్బడిగా లాభాలొచ్చాయి. భారత రోడ్లకు రారాజుగా అంబాసిడర్ను అభివర్ణిస్తారు. ముందువైపు డిస్క్ బ్రేక్లు, వెనక వైపు డ్రమ్ బ్రేక్లు కారణంగా ఈ కారు ప్రయాణం అత్యంత భద్రమైనది. సౌకర్యంగా కూర్చునేలా విశాలమైన సీట్లు ఈ కారు ప్రత్యేకత. సంవత్సరాల తరబడి డిజైన్ అలాగే ఉన్నా.. ఇంటీరియర్ ఇతరత్రా పలు మార్పులను అంబాసిడర్ చూసింది. డాష్బోర్డ్లు, టెయిల్ లైట్లు, పార్కింగ్ లైట్లు ఇందులో కొన్ని. 1957 నుంచి రోడ్లపై ప్రయాణం ప్రారంభించిన అంబాసిడర్ కారులో... మోరిస్ ఆక్స్ఫర్డ్ నుంచి అంబాసిడర్ ఎన్కోర్వరకూ ఎన్నో మోడళ్లు వచ్చాయి. ట్యాక్సీగా అంబాసిడర్ కారు చాలా ప్రాచుర్యం పొందింది. ఒక్క ముంబైలోనే 75 వేల అంబాసిడర్ ట్యాక్సీలు ఉండేవి. 1980 వరకూ భారత్లో అమ్ముడయ్యే ప్రతీ కారు అంబాసిడర్ కారే కావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. 2004లో 90 వేలకు పైగా అంబాసిడర్ కార్లు ఉత్పత్తయ్యాయి. ఇదొక రికార్డ్. అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్లోకి ప్రవేశించడంతో అంబాసిడర్ ప్రాభవం మసకబారడం మొదలైంది. కొద్ది నెలల క్రితమే టాప్గేర్ ప్రోగ్రామ్లో అన్ని ప్రఖ్యాతిగాంచిన కార్లన్నింటినీ తోసిరాజని అంబాసిడర్... టాప్ ట్యాక్సీ కార్గా నిలిచింది.