
లక్నో: ఇండియా కూటమిపై ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పుట్టగానే దానికి ఎన్నో వ్యాధులు సంక్రమించాయని, ఆ తర్వాత అది వెంటిలేటర్పైకి వెళ్లిందని ప్రమోద్ అన్నారు. వెంటిలేటర్పై ఉన్న ఇండియా కూటమికి ఇటీవలే జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ పాట్నాలో అంత్యక్రియలు పూర్తి చేశారని చెప్పారు.
ఇప్పుడిక ఇండియా కూటమి అనేది ఉనికిలో ఉందని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. కాగా, ప్రమోద్ ఇటీవలే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపైనా పదునైన విమర్శలు గుప్పించారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధపడుతుంటే ఒక్క కాంగ్రెస్ మాత్రం 2029 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోందని వ్యంగ్యాస్రం సంధించారు.
గత వారమే ఒక విషయమై ప్రమోద్ ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై ఆయన చేసిన వ్యాఖ్యలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఆయన త్వరలో కాంగ్రెస్ను వీడీ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రమోద్ గత ఎంపీ ఎన్నికల్లో లక్నో నుంచి కాంగ్రెస్ టికెట్పై పోటీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment