
దేశరాజధాని ఢిల్లీలో భారీవర్షాలతో వారాంతం మొదలయ్యింది. గురువారం ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురిశాయి. అయితే శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షం ఢిల్లీ-ఎన్సీఆర్లోని జనానికి ఊరటనిచ్చింది.
వర్షం కారణంగా పలు చోట్ల రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో జనం అవస్థలు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాజోరీ గార్డెన్, ఠాగూర్ గార్డెన్, తిలక్ నగర్, సుభాష్ నగర్, వికాస్పురి, ఠాగూర్ గార్డెన్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి రోడ్డపై నీరు నిలిచింది. వాక్వే స్టాండ్ లెవల్ వరకు నీరు నిండిపోవడంతో వాహనాలు నిదానంగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు 15 వరకు ఢిల్లీలో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీలో మరికొన్ని రోజుల పాటు చినుకులు పడే అవకాశం ఉంది. 10, 11 తేదీలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్లలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఔటర్ ఢిల్లీలోని ప్రేమ్ నగర్లో శుక్రవారం సాయంత్రం చెరువులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రేమ్ నగర్ పరిధిలోని రాణి ఖేడా గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు చెరువు వద్దకు వెళ్లారు. వారిలో ఇద్దరు చిన్నారులు నీటి లోతుల్లోకి వెళ్లిన కారణంగా మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment