
విన్యాసాల్లో పాల్గొన్న యుద్ధ నౌకలు
న్యూఢిల్లీ: ఇటీవలికాలంలో ఎన్నడూలేనంతగా భారత నౌకా దళం ఒకేసారి భారీ సంఖ్యలో నౌకలు, జలాంతర్గాములతో యుద్ధవిన్యాసం చేసి ఔరా అనిపించింది. అరేబియా సముద్రం ఇందుకు
వేదికైంది. ట్విన్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్(సీబీజీ) ఆపరేషన్స్ పేరిట నిర్వహించిన ఈ యుధ్ధవిన్యాసం నౌకాదళ పోరాట పటిమను ప్రపంచానికి మరోమారు తెలియజెప్పిందని భారత నౌకాదళ తర్వాత ఒక వీడియోను ట్విట్చేసింది.
యుద్ధవిమాన వాహకనౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్లుసహా పలు రకాల యుద్ధనౌకలు, జలాంతర్గాములు, 35కుపైగా యుద్ధవిమానాలను సమన్వయం చేసుకుంటూ ఏకకాలంలో ఈ ఆపరేషన్స్ను విజయవంతంగా నిర్వహించినట్లు భారత నౌకాదళం ప్రకటించింది. మిగ్–29కే, ఎంహెచ్ 60ఆర్, కమోవ్, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు సైతం ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయని నేవీ అధికారులు శనివారం చెప్పారు. అయితే ఈ ఆపరేషన్స్ను ఎప్పుడు నిర్వహించారో వెల్లడించలేదు.
సముద్ర ఆధారిత గగనతల శక్తిసామర్థ్యాలు, హిందూమహా సముద్ర జలాలు, ఆవల సైతం భద్రతా భాగస్వామిగా భారత కీలకపాత్రను ఈ ఆపరేషన్ చాటిచెప్పిందని నేవీ ప్రతినిధి వివేక్ మథ్వాల్ వ్యాఖ్యానించారు. దేశీయ తయారీ ఐఎన్ఎస్ విక్రాంత్ను సెప్టెంబర్లో విధుల్లోకి తీసుకున్నాక చేపట్టిన తొలి భారీ విన్యాసమిది. యుద్ధవిమాన వాహకనౌకలు, జలాంతర్గాములు, ఫ్రిగేట్, డెస్ట్రాయర్, ఇతర నౌకలు, హెలికాప్టర్లు, విమానాలు ఇలా అన్నింటి కలపుకుంటూ కదనరంగంలోకి దిగితే ఈ బృందాన్ని క్యారియర్ బ్యాటిల్ గ్రూప్(సీబీజీ)/ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు.
Comments
Please login to add a commentAdd a comment