
తిరువనంతపురం: భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి 40 బిలియన్ డాలర్ల(రూ.3.30 లక్షల కోట్ల)కు చేరుకోనుందని కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఏకేడీ వంటి కొన్ని విదేశీ సంస్థలైతే భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ 2040 నాటికి ఏకంగా 100 బిలియన్ డాలర్లకు కూడా చేరుకోవచ్చని అంచనా వేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కేవలం 8 మిలియన్ డాలర్లు మాత్రమే.
ఇది ఇప్పుడు శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఒక్క విదేశీ ఉపగ్రహాల ప్రయోగం విభాగంలో యూరప్ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా 240 మిలియన్ యూరోలు, అమెరికా ఉపగ్రహాల ప్రయోగం ద్వారా మరో 180 మిలియన్ డాలర్ల వరకు ఆర్జించగలిగామని శనివారం ఆయన పీటీఐకి చెప్పారు. నేషనల్ రీసెర్చి ఫౌండేషన్, అనుసంధాన్ను నెలకొల్పాక అంతరిక్ష పరిశ్రమల ఏర్పాటు వేగంపుంజుకుందని తెలిపారు.