
మధ్యప్రదేశ్ వ్యాపార రాజధాని ఇండోర్ పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కింది. కేవలం 24 గంటల్లో 11 లక్షల మొక్కలు నాటడం ద్వారా ఈ నగరం సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇండోర్ నగరం, పరిసర ప్రాంతాల్లో భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. చిన్నారులు, వృద్ధులు, యువకులు, మహిళలు, పురుషులు, సామాన్యులు.. అంతా కలసి ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, పట్టణ పరిపాలనా మంత్రి కైలాష్ విజయవర్గీయ, మేయర్ పుష్యమిత్ర భార్గవ తదితరులు ఒక్కరోజులో 11 లక్షలకు పైగా మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేసి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 50 వేల మంది శ్రమించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని బహిరంగ ప్రదేశాలు, పార్కులు, ఉద్యానవనాలు, అడవుల్లో మొక్కలు నాటారు.
ఇండోర్లోని బీఎస్ఎఫ్ రేవతి రేంజ్లో 11 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో పాల్గొన్న విద్యార్థులు ‘మా తుజే సలామ్’ అంటూ దేశభక్తి గీతాలు ఆలపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాను మొక్కలు నాటుతూ ఇతరులను ఉత్సాహపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment