
శ్రీనగర్: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీని మంగళవారం జమ్మూకశ్మీర్ అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. తన కదలికలపై ఆంక్షలు విధించడం ‘కశ్మీర్లో శాంతి నెలకొందంటూ అధికారులు చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలిందని మెహబూబా పేర్కొన్నారు. ‘ఈ రోజు నన్ను అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. అందుకు వారు చెబుతున్న కారణం..కశ్మీర్లో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవన్నది. ఇక్కడ శాంతి నెలకొన్నదంటూ అధికారులు చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని తేలిపోయింది’ అని మెహబూబా మంగళవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.
అఫ్గానిస్తాన్లో పౌరుల హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, కశ్మీరీలకు మాత్రం అలాంటి హక్కులు లేకుండా చేస్తోందని ఆరోపిస్తూ గుప్కార్లోని తన నివాసం ప్రధాన గేటు వద్ద భద్రతా బలగాల వాహనం ఉన్న ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న కుల్గాం జిల్లాలోని బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లాలని తెలపగా.. పాక్ అనుకూల వేర్పాటువాద నేత గిలానీ మరణానంతరం అక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని మెహబూబాకు సర్ది చెప్పి, ఆపామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment