
న్యూఢిల్లీ: ఇటీవల పాకిస్తాన్తో నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో భాగంగా ఆపరేషన్ సిందూర్లో భారత్ సైతం ఫైటర్ జెట్స్ను కోల్పోయిందంటూ సీడీఎస్ అనిల్ చౌహాన్ వ్యాఖ్యల అనంతరం కాంగ్రెస్ తన మాటల యుద్ధాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటివరకూ ఎన్ని ఫైటర్ జెట్స్ కోల్పోయాయో చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ వస్తున్న కాంగ్రెస్.. సీడీఎస్ వ్యాఖ్యల అనంతరం తన స్వరాన్ని మరింత పెంచింది. సీడీఎస్ వ్యాఖ్యలను కోడ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ప్రెసిడెంట్, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ధ్వజమెత్తారు.
ఆపరేషన్ సిందూర్ పూర్తయిన వెంటనే తాము ప్రత్యేక పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేసి ఆ యుద్ధం వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేస్తే, మోదీ మాత్రం అలా చేయకుండా ఆపరేషన్ సిందూర్ సక్సెస్ ను మాత్రమే బహిరంగ సభల్లో చెప్పుకొస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఆపరేషన్ సిందూర్కు సంబంధించి చాలా విషయాలను మాట్లాడిల్సి ఉందని, ఇందులో ట్రంప్ ట్వీట్ పై కూడా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే తాము ప్రత్యేక పార్లమెంట్ సెషన్ కోసం పట్టుబట్టామని, అది కేంద్ర ప్రభుత్వం చేయలేదంటూ మండిపడ్డారు. యుద్ధంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించి దాని ముసుగు తొలగించాలని, ఇప్పటికైనా పార్లమెంట్ సెషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు మల్లిఖార్జున ఖర్గే. 1999లో కార్గిల్ వార్ సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిటీని సమీక్ష కోసం ఏర్పాటు చేశారని, ఇప్పుడు అదే తరహాలో ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: