President Droupadi Murmu: అసమానతలను రూపుమాపాలి | President Droupadi Murmu speech to the nation on the eve of the 78th Independence Day | Sakshi
Sakshi News home page

President Droupadi Murmu: అసమానతలను రూపుమాపాలి

Published Thu, Aug 15 2024 4:30 AM | Last Updated on Thu, Aug 15 2024 4:30 AM

President Droupadi Murmu speech to the nation on the eve of the 78th Independence Day

విభజన యత్నాలను తిప్పికొట్టాలి 

ఇక నవ తరం సంస్కరణలు 

పంద్రాగస్టు ప్రసంగంలో రాష్ట్రపతి 

న్యూఢిల్లీ: సామాజిక అసమానతలను పెంచి పోషించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. ‘‘వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన విభజన ధోరణులను సమూలంగా పెకిలించాలి. అన్ని వర్గాలవారినీ కలుపుకుపోయేలా గట్టి కార్యాచరణ రూపొందించి అమలు చేసినప్పుడే అది సాధ్యం’’ అని స్పష్టం చేశారు. 78వ స్వాతంత్య్ర దినం సందర్భంగా మంగళవారం ఆమె జాతినుద్దేశించి ప్రసంగించారు. 

భారత్‌లో రాజకీయ ప్రజాస్వామ్యం స్థిరమైన ప్రగతి సాధిస్తోందన్నారు. విస్తరిస్తున్న సామాజిక ప్రజాస్వామ్యానికి అది నిదర్శనమని చెప్పారు. భిన్నత్వం, బహుళత్వమే ఆభరణాలుగా దేశమంతా ఐక్యంగా ముందుకు సాగుతోందంటూ హర్షం వెలిబుచ్చారు. 

సామాజిక న్యాయానికి మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర అణగారిన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన చర్యలను వివరించారు. మహిళల అభ్యున్నతికీ పెద్దపీట వేసిందన్నారు. దేశ విభజన సందర్భంగా జరిగిన అంతులేని అకృత్యాలు, మానప్రాణ నష్టం ఎన్నటికీ మర్చిపోలేనివంటూ ఆవేదన వెలిబుచ్చారు. 

స్ఫూర్తిదాయక ప్రసంగం: మోదీ 
భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో భాగంగా నవతరం ఆర్థిక సంస్కరణలకు రంగం సిద్ధమైందని రాష్ట్రపతి తెలిపారు. ఆర్థిక రంగంలో భారత్‌ దూసుకుపోతోందంటే దీర్ఘదృష్టితో కూడిన సారథ్యం, రైతులు, ఇతర సంపద సృష్టికర్తల నిరి్వరామ శ్రమే కారణమన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు, ఏఐతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పటిష్టమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఉరకలెత్తుతున్న ఆర్థిక రంగం భారత్‌ను ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా మారుస్తున్నాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉందంటూ మోదీ ప్రశంసించారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement