
ముంబై: సినిమాటోగ్రఫీ చట్ట సవరణలకు సంబంధించి ఒక వినతిపత్రాన్ని ఆరు ట్రేడ్ ఫిల్మ్ అసోసియేషన్స్ శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించాయి. సినిమాటోగ్రఫీ చట్ట సవరణల బిల్లు–2021 ముసాయిదాపై ప్రజలు స్పందించాలని కోరుతూ ప్రభుత్వం జూన్ 18న ప్రకటన జారీ చేసింది. సినిమా పైరసీని నేరంగా పరిగణిస్తూ జైలుశిక్షతో పాటు జరిమానా విధించడం, సర్టిఫికేషన్కు కాల వ్యవధి, సర్టిఫికెట్ పొందిన సినిమాపై ఫిర్యాదులొస్తే మళ్లీ సర్టిఫికేషన్(రీసర్టిఫికేషన్) జరిపేందుకు కేంద్రానికి అధికారం.. తదితర ప్రతిపాదనలను ఆ ముసాయిదాలో పొందుపర్చారు. రీసర్టిఫికేషన్ ప్రతిపాదనను సినీ వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది భావప్రకటనా స్వేచ్ఛపై దాడి అంటూ పలువురు సినీ ప్రముఖులు సమాచార, ప్రసార శాఖకు లేఖ రాశారు.