
24 గంటలు గడిచే వరకూ ఏమీ చెప్పలేం: ఎయిమ్స్ వైద్యులు
సాక్షి, న్యూఢిల్లీ: న్యూమోనియాతో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు పార్టీ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. న్యూమోనియా కారణంగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో ఏచూరి బాధపడుతున్నారు. 72 ఏళ్ల ఏచూరిని కుటుంబీకులు ఆగస్టు 19న ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు.
ఆరోజు నుంచి ఆయనకు వెంటిలేటర్పైనే చికిత్స అందిస్తున్నారు. అయితే శరీరంలో ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవడం, ఇక్కడి మందులకు ఆ ఇన్ఫెక్షన్ తగ్గకపోవడంతో.. విదేశాల నుంచి మెడిసిన్ తెప్పించినట్లు తెలిసింది. మంగళవారం ఆయనకు విదేశాల నుంచి తెప్పించిన మెడిసిన్ ఇచ్చారు. 24 గంటలు గడిచిన తర్వాతనే ఆరోగ్య పరిస్థితిని వెల్లడించగలమని వైద్యులు కుటుంబీకులకు తెలిపారు. పలు విభాగాలకు చెందిన స్పెషలిస్టు డాక్టర్ల బృందం సీతారాం ఏచూరీకి చికిత్స అందిస్తోంది. ఏచూరి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు పరామర్శించేందుకు హస్తినకు వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment