
ఢిల్లీ: డీఎంకే నేత కనిమొళి కరుణానిధికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎంపీగా ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను .. సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆమె ఎన్నిక సమర్థనీయమేనని తీర్పు ఇచ్చింది.
2019 ఎన్నికల సమయంలో తూతుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కనిమొళి. అయితే ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ సనాతన కుమార్ అనే ఓటర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నామినేషన్ సమయంలో.. ఎలక్షన్ అఫిడవిట్లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సరిగా పొందుపర్చలేదని, మరీ ముఖ్యంగా భర్త పాన్ నెంబర్ను జత చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేశాడతను.
అయితే.. తన భర్త సింగపూర్ పౌరుడని, ఆయనకు పాన్ నెంబర్ ఉండదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టేయాలని ఆమె అభ్యర్థించారు. కానీ, మద్రాస్ హైకోర్టు అందుకు నిరాకరించింది.
ఈ తరుణంలో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 2020, జనవరిలో స్టే విధించింది. ఇవాళ(గురువారం) ఆ పిటిషన్ విచారణకు రాగా.. ఎలక్షన్కు సంబంధించిన పిటిషన్ను కొట్టేస్తూ.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను పరిశీలించాలన్న కనిమొళి అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
ఇదీ చదవండి: ఇలాంటివి చూసేందుకే అంత కష్టపడ్డామా?
Comments
Please login to add a commentAdd a comment