Madras High Court
-
మనోభావాల మందుపాతర?
ఒక కార్టూన్ ప్రకటించడం రాజ్యాంగబద్ధమైన భావప్రకటనా స్వేచ్ఛలో భాగం అవునా కాదా నిర్ధారించుకోవడానికి ఒక పత్రిక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన దుఃస్థితికి చేరింది మన సమాజం. ఇవాళ దేశంలో కార్టూన్ అనే అతి సాధారణ సృజ నాత్మక ప్రక్రియ మనోభావాల మందు పాతరగా మారిపోయింది. ఒక కార్టూన్ వల్ల భారత సార్వభౌమత్వానికీ, సమగ్రతకూ, పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలకూ ముప్పు వాటిల్లుతున్నదనీ మద్రాసు హైకోర్టు ముందర కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నది. ఇంతకూ ఏమిటా కార్టూన్? అమెరికా ప్రభుత్వం తన దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారని, లేదా చట్టవిరుద్ధంగా ఉంటు న్నారని 300కు పైగా భారతీయ పౌరులను పట్టుకుని, ఫిబ్రవరిలో మూడు విడతలుగా వెనక్కి పంపించింది. ఆ దేశపు చట్టాల ప్రకారం అది సాధారణమే కావచ్చు. వారు తమ దేశంలో ప్రవేశించిన నేరం చేసినందుకు దేశం నుంచి వెళ్లగొట్టడం అనే శిక్ష వేశారు, సరిపోయింది. ఒకే నేరానికి రెండు, మూడు శిక్షలు వేయడం సహజ న్యాయానికి వ్యతిరేకం. కానీ వారికి రెండో శిక్షగా చేతులకూ కాళ్లకూ సంకెళ్లు వేశారు. మూడో శిక్షగా వారిని జంతువుల్లా, సరుకుల్లా చూసి యుద్ధవిమానాల్లో రవాణా చేశారు. ఇది తప్పనిసరిగా భారత ప్రజ లకు జరిగిన అవమానం, నేరాన్ని మించి శిక్ష విధించడం. భారత ప్రభుత్వంలో అత్యున్నతాధికారం నెరపుతున్న వ్యక్తిగా ప్రధాన మంత్రి తన సాటి పౌరులకు జరిగిన ఈ అవమానం గురించి, విపరీత శిక్షల గురించి ఆ శిక్షలు విధించిన దేశాధ్యక్షుడితో సమావేశంలో కనీసం మాట మాత్రం ప్రస్తావించకపోవడం, నిరసన తెలపకపోవడం ఎవరినైనా ఆలోచింపజేస్తుంది. అలా అవతలివైపు వ్యంగ్య ఆలోచనకు చిత్రరూపమైన కార్టూన్ను సుప్రసిద్ధ తమిళ పత్రిక ‘ఆనంద వికటన్’కు చెందిన వికటన్ ప్లస్ వెబ్సైట్ ఫిబ్రవరి 10 సంచిక ముఖచిత్రంగా ప్రచురించింది. అందులో అమెరికా అధ్య క్షుడి ముందు భారత ప్రధాని చేతులకూ కాళ్లకూ సంకెళ్లతో కూచుని ఉన్నట్టు చిత్రించారు. దాని మీద తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుల ఫిర్యాదు మేరకు, వెంటనే కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆనంద వికటన్ వెబ్సైట్ను మూసివేసింది. తర్వాత ‘ఆనంద వికటన్’ పిటిషన్పై విచారణ జరుపుతున్న మద్రాసు హైకోర్టు ఇప్పటికైతే, మధ్యంతర ఉత్తర్వులలో వెబ్సైట్ను మూసివేయగూడదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుదితీర్పు వచ్చే దాక కార్టూన్ను ఉపసంహరించాలని ఆనంద వికటన్కు సూచించింది. ఇట్టే పడే దృష్టి! ఏదైనా పత్రిక చూస్తున్నప్పుడు పాఠకుల దృష్టి సహజంగా కార్టూన్ మీదికి పోతుంది. మిగిలిన వార్తలన్నీ నిండా అలుక్కుపోయి ఉండగా, కార్టూన్ స్థలం సింగిల్ కాలం అయినా, రెండు కాలాలో మూడు కాలాలో అయినా, ఆ రేఖలూ, రేఖల మధ్య ఖాళీలూ,బాగా తెలిసిన ముఖాలే కాస్త వక్రంగా మారి ఉండటమూ, ఒకటో రెండో హాస్య, వ్యంగ్య, వెటకార పూరితమైన వాక్యాల వ్యాఖ్యలూ తప్పనిసరిగా పాఠకుల దృష్టిని ఆకర్షిస్తాయి. కార్టూన్ ప్రక్రియ ఎంతో ఆదరణ చూరగొన్నదీ, గౌరవనీయమైనదీ మాత్రమే కాక కనీసం రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్నది. పందొమ్మిదో శతాబ్దపు మధ్య భాగంలో ‘పంచ్’ పత్రికలో రాజకీయ కార్టూన్లు ప్రారంభమయ్యాయంటారు. రాజకీయ నాయకులే నిర్ణేతలుగా, ప్రముఖులుగా, అందరికీ తెలిసినవారుగా ఉన్న సమాజంలో వారే కార్టూన్కు ప్రధాన వస్తువు కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలాగే రాజకీయ ఘటనల ప్రభావం సమాజంలో ప్రతి ఒక్కరి మీద ఉంటుంది గనుక, ఆ ఘటనల అవతలి కోణం మీద ప్రజలకు ఆసక్తి ఉంటుంది గనుక సహజంగానే వాటి మీద వ్యంగ్యపు, వెటకారపు వ్యాఖ్యానం బహుళ జనాదరణ పొందుతుంది. ఒక ప్రక్రియగా కార్టూన్ ఎంత విశాలమైనదీ, లోతైనదీ, ఆకర్షణీ యమైనదీ, ఆమోదయోగ్యమైనదీ అంటే ఆ కార్టూన్లో వెటకారానికి గురైన రాజకీయ నాయకులకు కూడా అది నవ్వు పుట్టిస్తుంది. అది తమను నొప్పించిందనో, వెటకరించిందనో, తమ మీద వ్యంగ్య వ్యాఖ్య చేసిందనో నొచ్చుకునే సందర్భంలో అయినా ఆ బాధిత వ్యక్తులు కూడా నవ్వుకునే గొప్ప కళ కార్టూన్. అసలు తనమీద వచ్చిన పరిహాసాన్ని ఆమోదించడం, తన పనిమీద వ్యంగ్య వ్యాఖ్యకు అవకాశం ఇవ్వడం ఆ వ్యక్తి విశాల హృదయానికి, సౌమనస్యానికి సంకేతాలు. వ్యంగ్యాన్ని స్వీకరించలేక...అందువల్లనే కార్టూన్ల, హాస్య, వ్యంగ్య రచనల వారపత్రికగా వెలువడుతుండిన ‘శంకర్స్ వీక్లీ’ని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆదరించాడు. అసలు శంకర్స్ వీక్లీ పుట్టుక కథే చిత్రమైనది. అప్పటికి ‘హిందుస్థాన్ టైమ్స్’లో కార్టూనిస్టుగా ఉండిన శంకర్ పిళ్లై అప్పటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి మీద విపరీతంగా కార్టూన్లు వేస్తుండగా అవి ఆపమని సంపాదకుడు దేవదాస్ గాంధీ ఆదేశించాడు. దానితో విభేదించి బైటికి వచ్చిన శంకర్ తన సొంత పత్రికగా 1948లో ‘శంకర్స్ వీక్లీ’ పెట్టాడు. ‘‘మౌలికంగా వ్యవస్థా (ప్రభుత్వ) వ్యతిరేక పత్రిక’’ అని శంకర్ చెప్పుకున్నప్పటికీ, పత్రికను ప్రధానమంత్రి నెహ్రూనే ఆవిష్కరించాడు. ఆ పత్రికలో తన మీద, తన మంత్రివర్గం మీద, తన ప్రభుత్వపు చర్యల మీద శంకర్, ఇతర కార్టూనిస్టులు వేసిన కార్టూన్ల లోని హాస్యాన్నీ వ్యంగ్యాన్నీ నెహ్రూ అభినందించాడు. ఇరవై ఏడు సంవత్సరాలు నిరాటంకంగా నడిచిన ‘శంకర్స్ వీక్లీ’ ఎమర్జెన్సీ విధించాక ఆరు వారాలకు ఆగిపోయింది. ఎమర్జెన్సీకీ పత్రిక ఆగిపోవడానికీ సంబంధం లేదని శంకర్ అన్నాడు. ఆ పత్రిక చూడటం తనకు చాలా అలవాటనీ, అది చూడకపోతే కొరతగా ఉంటుందనీ ఇందిరా గాంధీ కూడా అంది. కానీ మొత్తానికి పత్రిక ఆగిపోయింది. తర్వాతి కాలంలో శంకర్స్ వీక్లీలా పూర్తిగా కార్టూన్లకూ,హాస్య, వ్యంగ్య రచనలకూ అంకితమైన పత్రికే లేకుండా పోయింది. బహుశా మన సమాజంలో హాస్య చతురత, హాస్యాన్నీ, వ్యంగ్యాన్నీ ఆమోదించే విశాల హృదయాలు కుంచించుకుపోవడం మొదలయిందేమో!‘శంకర్స్ వీక్లీ’లోనే ప్రారంభమైన ఆర్.కె. లక్ష్మణ్, ఒ.వి. విజయన్, ఇ.పి.ఉన్ని, రాజిందర్ పూరీ, కుట్టి, బాల్ థాకరే, యేసుదాసన్ వంటి ఎందరో రాజకీయ కార్టూనిస్టులు నాలుగు దశాబ్దాలు భారత రాజకీయ కార్టూన్ రంగాన్ని వెలిగించారు. తెలుగులో కూడా ఎందరో రాజకీయ కార్టూనిస్టులు ఎందరెందరో నాయకుల మాటలనూ, హావభావాలనూ, పనులనూ తరతరాలు నవ్వుకునేంత హాస్య, వ్యంగ్య దృష్టితో చిత్రించారు. ఆ మహోజ్వల చరిత్ర గల కార్టూన్ కళకు ఇప్పుడు కాని కాలం దాపురించినట్టే ఉంది. పూర్తిగా కార్టూన్లకు, హాస్య, వ్యంగ్య రచనలకు అంకితమైన పత్రికలు లేవు. పత్రికల్లో ప్రతిరోజూ కార్టూన్ కనబడటం లేదు. సింగిల్ కాలం పాకెట్ కార్టూన్ మొక్కుబడి వ్యవహార మైపోయింది. కార్టూన్ స్ట్రిప్లు ఖాళీ నింపే ఆరో వేలు అయి పోయాయి. అన్నిటికన్నా ముఖ్యం రాజకీయ కార్టూన్ ఏ రాజకీయ నాయకుడి మనసు నొప్పిస్తుందో, ఏ నాయకుడి భక్తుల మనోభావాలను, ఏ మత, కుల, ప్రాంత, భాషా సమూహపు మనోభావాలను గాయపరుస్తుందో, ఆచితూచి అడుగువేయవలసిన మందుపాతరల క్షేత్రంగా మారిపోయింది. ఎన్. వేణుగోపాల్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Madras High Court : మాతృభాషలో చదవడం, రాయడం వస్తేనే ప్రభుత్వ ఉద్యోగం..
చెన్నై: జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు- కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న వేళ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక వ్యాఖ్యాలు చేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి తప్పని సరిగా తమిళంలో చదవడం, రాయడం వచ్చి ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB)లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాలంటే తప్పని సరిగా తమిళ భాష పరీక్ష (Tamil Language Test)లో తప్పని సరిగా ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే ఉద్యోగానికి అనర్హులు. టీఎన్ఈబీ నిర్వహించిన తమిళ లాంగ్వేజ్ టెస్టులో ఫెయిలైన అభ్యర్థి ఇదే అంశాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ సమయంలో హైకోర్టు కోర్టు ధర్మాసనం తమిళ మాతృభాష గురించి ప్రస్తావించింది.తమిళనాడు రాష్ట్రం తేని జిల్లాకు చెందిన జే.జైకుమార్ రాష్ట్ర విద్యుత్ శాఖ ఉద్యోగి. అయితే జైకుమార్ రెండేళ్లలో తమిళ లాంగ్వేజ్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సింది. కానీ పాసవ్వలేదు. దీంతో విద్యుత్ శాఖ అతన్ని విధుల నుంచి తొలగించింది. తమిళ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఫెయిల్ కావడంతో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ తమిళనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి నావల్ సర్వీస్లో పని చేయడం వల్ల తాను సీబీఎస్ఈ స్కూల్లో చదివానని, అందువల్ల తాను తమిళం నేర్చుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పిటిషన్పై జి జయచంద్రన్, ఆర్ పూర్ణిమా ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా పిటిషనర్కు మాతృభాష తమిళం రాకపోవడంపై పిటిషనర్కు పలు ప్రశ్నలు సంధించింది. ప్రభుత్వ ఉద్యోగులు తమిళం రాకుండా ఎలా పని చేయగలరు? రోజువారి పనులను ఎలా చేస్తారు? ఏ రాష్ట్రంలోనైనా, ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర భాష తెలియాలి. అలా లేనిపక్షంలో ఉద్యోగాలు ఎలా చేస్తారు?’అని బెంచ్ వ్యాఖ్యానించింది.అభ్యర్థులు ప్రభుత్వ భాష పరీక్షను నిర్ణీత సమయంలో పాసవాలని, తమిళ భాష నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అనంతరం, ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేసును ఆరువారాల పాటు వాయిదా వేసింది. -
దిగ్గజ హీరో ఇల్లు జప్తు.. హైకోర్ట్ సంచలన ఆదేశం
ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలంలో తమిళంలో హీరోగా అద్భుతమైన సినిమాలు తీసి నడిగర్ తిలగం అనే బిరుదు సంపాదించుకున్నారు శివాజీ గణేశన్(Sivaji Ganesan). ఈయన వారసులు ఇప్పుడు నటులుగా చేస్తున్నారు. సరే ఇదంతా పక్కనబెడితే ఈయన మనవడు చేసిన అప్పు వల్ల శివాజీ గణేశన్ కి ఎంతో ఇష్టమైన ఇంటిని జప్తు చేయామని మద్రాస్ హైకోర్ట్(Madras Highcourt) ఆదేశించింది.(ఇదీ చదవండి: దుబాయ్లోనే నిర్మాత 'కేదార్' అంత్యక్రియలు)ఏం జరిగింది?శివాజీ గణేశన్ వారసుడు రామ్ కుమార్ ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నాడు. ఈయన కొడుకు దుష్యంత్ మాత్రం భార్యతో కలిసి ఈశాన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఇప్పటికే నష్టాల్లో ఉండగా.. ఒక్క మూవీ తీసి అప్పులన్నీ తీర్చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలోనే ధనభాగ్యం ఎంటర్ ప్రైజెస్ అనే సంస్థ నుంచి రూ.3.74 కోట్లు రూపాయల్ని ఏడాదికి 30 శాతం వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. 'జగజాల కిలాడి' అనే సినిమా మొదలుపెట్టాడు.ఇదంతా జరిగి చాన్నాళ్లయిపోయింది. ఈ క్రమంలోనే తమ దగ్గర తీసుకున్న అప్పుని దుష్యంత్ చెల్లించలేదని.. సదరు ధనభాగ్య సంస్థ మద్రాసు హైకోర్టుని ఆశ్రయించింది. మధ్యవర్తి ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని కోర్టు చెప్పింది.(ఇదీ చదవండి: ఆస్కార్ మెచ్చిన వేశ్య కథ.. ఏంటి 'అనోరా' స్పెషల్?)ఈ క్రమంలోనే తీసిన సినిమాను ధనభాగ్య సంస్థకు ఇచ్చేయాలని దుష్యంత్ తో మధ్యవర్తి చెప్పాడు. అప్పుడు అసలు నిజం బయటపడింది. తాను ఇంతవరకు సినిమా పూర్తి చేయలేదని, అప్పుగా తీసుకున్న డబ్బుతో తన పాత బాకీలు తీర్చుకున్నానని దుష్యంత్ చెప్పాడు. ఈ విషయంలో తమని తప్పుదారి పట్టించాడని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో దుష్యంత్ కి ఉమ్మడి ఆస్తిగా దక్కిన తాత శివాజీ గణేశన్ ఇంటిని జప్తు చేయాలని, ఇంటికి తాళాలు వేయాలని అధికారుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఇది తెలిసిన దిగ్గజ హీరో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
‘అత్యాచారం కేసును రాజకీయం చేస్తున్నారు’
చెన్నై: తమిళనాడును కుదిపేసిన అన్నా యూనివర్సిటీ(Anna University) ఘటనపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్ను తాజాగా మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.ఘటనను నిరసిస్తూ చెన్నై వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) భావించింది. అయితే.. పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో పీఎంకే హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం.. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది.మరోవైపు..ఈ కేసులో ప్రజాగ్రహం పెల్లుబిక్కడంతో సిట్తో దర్యాప్తు చేయించాలని మద్రాస్ హైకోర్టు ఇదివరకే ఆదేశించింది కూడా.డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్లో విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో..ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా బిర్యానీ వ్యాపారి అయిన జ్ఞానేశ్వర్.. అధికార డీఎంకే యువ విభాగానికి గతంలో పని చేశాడు. దీంతో రాజకీయంగానూ దుమారం రేగింది. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను ప్రతిపక్షాలు వ్యక్తంచేశాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్తో పాటు పలువురు డీఎంకే నేతలతో జ్ఞానేశ్వర్ దిగిన ఫొటోలను వైరల్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకు వేసి ఘటనకు నిరసనగా కొరడాతో బాదుకున్నారు. ప్రభుత్వం కదిలేవరకు చెప్పులు వేసుకోనంటూ ప్రతిన బూనారు. మరోవైపు టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ కూడా కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా మద్రాస్ హైకోర్టు రాజకీీయం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ధనుశ్ - నయనతార వివాదం.. కోర్టు కీలక ఆదేశాలు!
నయనతార- కోలీవుడ్ హీరో ధనుశ్ మధ్య వివాదం కీలక మలుపు తిరిగింది. ధనుశ్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తన సినిమాలోని ఓ క్లిప్ను అనుమతి లేకుండా వినియోగించారంటూ రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం హీరోయిన్ నయనతారకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ నయన్కు నోటీసులిచ్చింది. ఈ వ్యవహరంలో మీ వైఖరి చెప్పాలంటూ నయన్ దంపతులతోపాటు నెట్ఫ్లిక్స్ బృందాన్ని కోర్టు ఆదేశించింది. అసలేంటి వివాదం?ఇటీవల నయనతార తన ప్రేమ పెళ్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని విడుదల చేసింది. నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో రిలీజైన డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ చిత్రంలోని మూడు సెకన్ల క్లిప్ను ఉపయోగించారు. దీంతో తన పర్మిషన్ లేకుండా తన సినిమాలోని క్లిప్ను వినియోగించారంటూ ధనుశ్ టీమ్ రూ.10 కోట్లకు దావా వేసింది. ఆ తర్వాత నయనతార ఈ వివాదంపై బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. -
తమిళ నిర్మాతలకు షాకిచ్చిన హైకోర్ట్
తమిళ ఇండస్ట్రీలో రివ్యూలపై వివాదం నడుస్తోంది. సినిమా రిలీజ్ రోజే థియేటర్ల దగ్గర రివ్యూలు తీసుకుని, ఆ వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని నిర్మాతల మండలి చాలారోజులుగా అభ్యంతరం చెబుతూనే ఉంది. కొన్నిరోజులు క్రితమే దీనిపై ఏకపక్షంగా నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు దీనిపై మద్రాసు హైకోర్టు.. సదరు నిర్మాతల మండలికి షాకిచ్చింది.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)రీసెంట్గా తమిళంలో రిలీజైన పెద్ద సినిమా 'కంగువ'. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి తొలి ఆట నుంచే ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దీనికి రివ్యూలే కారణమని భావించిన నిర్మాతలు.. తొలిరోజు థియేటర్ల దగ్గర రివ్యూలు చెప్పనివ్వకుండా యూట్యూబర్లని నిషేధించాలని తీర్మానించించది. ఇందులో భాగంగా థియేటర్ యజమానులు.. ఈ విషయంలో తమకు సహకరించాలని కోరింది. దీనికి వాళ్లు కూడా ఒప్పుకొన్నారు.ఈ నిర్ణయంపై కొందరు వ్యక్తులు.. మద్రాసు హైకోర్టుని ఆశ్రయించారు. ఆ పిటిషన్పై మంగళవారం విచారణ జరగ్గా.. నిర్మాతల మండలి అభ్యర్థులని మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ఉద్దేశపూర్వకంగా రివ్యూలు ఇచ్చి, నష్టం వాటిల్లినట్టు ఆధారాలుంటే చట్టపరంగా ముందుకు వెళ్లాలి తప్పితే.. రివ్యూ ఇవ్వొద్దని స్టే ఇవ్వలేమని మద్రాస్ హైకోర్టు తెలిపింది. రివ్యూల మార్గదర్శకాలపై వివరణ ఇవ్వాలని యూట్యూబ్ ఛానల్స్కి మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్) -
నయనతార డాక్యుమెంటరీ.. మరింత ముదిరిన వివాదం..!
కోలీవుడ్లో వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ తర్వాత మొదలైన వివాదం సరికొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే రూ.10 కోట్ల పరిహారం కోరుతూ నోటీసులు పంపించిన హీరో ధనుశ్.. తాజాగా కోర్టులో దావా వేశారు. నయనతారతో పాటు ఆమె భర్త విఘ్నేశ్ శివన్పై తాజాగా దావా వేశారు. గతంలో నయన్, ధనుశ్ జంటగా నటించిన నానుమ్ రౌడీ దాన్ మూవీలోని మూడు సెకన్ల క్లిప్ను అనుమతి లేకుండా వినియోగించారంటూ ధనుశ్ టీమ్ ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. అయితే తాజాగా ఆ మూవీ నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. అయితే ఇటీవల ఓ పెళ్లి వేడుకలో కలిసిన వీరిద్దరు ఒకరిని ఒకరు అస్సలు పట్టించుకోలేదు. అసలేం జరిగిందంటే..ఇటీవల విడుదలైన నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ బియాండ్ ది ఫెయిరీ టేల్ ఈ వివాదానికి కారణమైంది. ఆ డాక్యుమెంటరీ నానుమ్ రౌడీ ధాన్ మూవీలోని మూడు సెకన్ల వీడియోను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. అయితే తన అనుమతి లేకుండా ఇలా చేయడం సరికాదని ధనుష్ రూ. 10 కోట్ల నష్ట పరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. ఈ వివాదం కాస్తా కోలీవుడ్లో మరింత చర్చకు దారితీసింది. కాగా.. నయనతార డాక్యుమెంటరీలో నాగార్జున, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, ఉపేంద్ర, విజయ్ సేతుపతి, అట్లీ, పార్వతి తిరువోతు లాంటి స్టార్స్ కూడా కనిపించారు. -
కల్లకురిచ్చి కల్తీసారా కేసు.. మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం
చెన్నై: తమిళనాడులో కల్లకురిచ్చి హుచ్ కల్తీసారా విషయంలో మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కల్లకురిచ్చి కల్తీసారా కేసు సీబీఐకి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. కల్తీ మద్యం వెనుక మాఫియా ఉందంటూ అన్నాడీఎంకే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం సేవించి దాదాపు 65 మంది చనిపోయారు. ఈ ఘటన తమిళనాడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ దారుణ ఘటన విషయంలో స్టాలిన్ సర్కార్ను ప్రతిపక్షాలు ప్రశ్నించడంతో ప్రభుత్వం సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) చేత విచారణకు ఆదేశించింది. అయినప్పటికీ అసలు వాస్తవాలు బయటకు రాకపోవడంతో ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.పిటిషన్పై నేడు విచారణ జరిగింది. ఈ క్రమంలో వాదనలు విన్న ధర్మాసనం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ డీ. కృష్ణకుమార్, జస్టిస్ పీబీ బాలాజీల ధర్మాసనం ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలను ధర్మాసనం ఏకీభవించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. #BREAKING he Madras High Court has ordered the transfer of the investigation into the case concerning the poisoning incident in Karunapuram, Kallakkurichi district, which resulted in 66 fatalities, to the Central Bureau of Investigation (CBI). The ruling was delivered by… pic.twitter.com/e4CroLK1jH— Mahalingam Ponnusamy (@mahajournalist) November 20, 2024 -
తెలుగువారిపై వివాదాస్పద కామెంట్స్.. కస్తూరికి షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు!
ప్రముఖ నటి కస్తూరి తెలుగు వారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో కస్తూరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.ముందస్తు బెయిల్ నిరాకరణ..ఈ కేసులో నటి కస్తూరి ఇప్పటికే మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ బెంచ్ ధర్మాసనం ఆమె పిటిషన్ను కొట్టివేసింది.క్షమాపణలు చెప్పిన కస్తూరిఅయితే తన వ్యాఖ్యల పట్ల నటి కస్తూరి క్షమాపణలు చెప్పింది. తనకు తెలుగు గడ్డ మెట్టినిల్లు అని, తెలుగు ప్రజలను తాను కించపరిచే విధంగా మాట్లాడలేదని చెప్పింది. తాను చేసిన వ్యాఖ్యలను డిఎంకే పార్టీ నేతలే తప్పుగా ప్రచారం చేశారని వారిపై ఆమె ఫైర్ అయింది. దీంతో ఆ పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆరోపించింది. అయినప్పటికీ కస్తూరి వ్యాఖ్యలపై చెన్నై,మదురై వంటి ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.ఇంటికెళ్లిన పోలీసులు..ఆమె కేసులు నమోదు చేసిన పోలీసులు సమన్లు జారీ చేసేందుకు కస్తూరి ఇంటికి వెళ్లారు. అయితే, తన ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉందని సమాచారం. కేసుల భయంతో ఆమె పరారీలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఈ కేసుల విషయంలో ఆమె ఒక లాయర్ను సంప్రదించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.అసలేం జరిగిందంటే..హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి తెలుగువారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది. సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసింది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించింది. ఇదే వేదికపై ఆమె డిఎంకే పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు చేయడం వల్ల ఆ పార్టీ నేతలు తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఆమె ఆరోపించింది. -
కోర్టులో రిలయన్స్ పిటిషన్.. కంగువ విడుదలకు అడ్డంకులు
సౌత్ ఇండియాలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన చిత్రం 'కంగువ'. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్ కీలకపాత్రలు చేశారు. యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ.జ్ఞానవేల్ రాజా ఈ సినిమా కోసం భారీగానే ఖర్చుపెట్టారు. అయితే, ఈ సినిమా విడుదల విషయంలో పలు అడ్డంకులు వచ్చేలా కనిపిస్తున్నాయి. రిలయన్స్ నిర్మాణ సంస్థ ఫిర్యాదుతో కంగువ సినిమా రిలీజ్ విషయంలో మద్రాస్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.3డీ ఫార్మెట్లో 10 భాషల్లో నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమా నిర్మాత కేఈ.జ్ఞానవేల్ రాజా, రిలయన్స్ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీల చిక్కులు ఉన్నాయి. స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థ తరపున టెడ్డీ-2, ఎక్స్ మీట్స్ ఓయ్, తంగలాన్ చిత్రాల నిర్మాణం కోసం రిలయన్స్ నుంచి రూ.99 కోట్లు పైగానే జ్ఞానవేల్ రాజా రుణం పొందారు. అయితే, ఇప్పటికే రూ.45 కోట్లు తిరిగి చెల్లించిన జ్ఞానవేల్ రాజా మిగిలిన రూ.55 కోట్లు చెల్లించకుండా కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని రిలయన్స్ తరపున మద్రాస్ హైకోర్టులో కేసు దాఖలైంది.తమకు చెల్లించాల్సిన డబ్బు అందేవరకు సూర్య నటించిన గంగువ సినిమా విడుదలను ఆపేయాలని రిలయన్స్ నిర్మాణ సంస్థ కోర్టుకెళ్లింది. మరోవైపు తంగళాన్ సినిమాను కూడా ఓటీటీలో విడుదల చేయకూడదని ఆ పిటిషన్లో పేర్కొంది. జస్టిస్ కుమారేష్ బాబు ముందు కేసు విచారణకు వచ్చినప్పుడు, స్టూడియో గ్రీన్ ఇలా తెలిపింది. 'నవంబర్ 7 వరకు సమయం కావాలని కోరింది. అప్పటి వరకు 'కంగువ'ను విడుదల చేయబోమని తెలిపింది. ఈ క్రమంలో తంగలాన్ చిత్రాన్ని కూడా నవంబర్ 7వరకు విడుదల చేయబోమని హామీ ఇచ్చింది. దీనిని నమోదు చేసుకున్న న్యాయమూర్తి కేసు విచారణను నవంబర్ 7వ తేదీకి వాయిదా వేశారు. అయితే, కంగువ చిత్రం నవంబర్ 14న విడుదల కానుంది. ఆ సమయంలోపు ఈ కేసు క్లియర్ కాకపోతే సినిమా విడుదలకు చిక్కులు తప్పవని ఇండస్ట్రీ వర్గాలే పేర్కొంటున్నాయి. -
ఈషా ఫౌండేషన్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట
న్యూఢిల్లీ: తమిళనాడులో కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఇషా ఫౌండేషన్పై మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈషా ఫౌండేషన్లో తమ కూతుళ్లకు బ్రెయిన్ వాష్చేసి సన్యాసం వైపు మళ్లించారని ఆరోపిస్తూ ప్రొఫెసర్ వేసిన కేసు విచారణను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.ఈ కేసులో మద్రాస్ హైకోర్టు పూర్తి అనుచితంగా వ్యవహరించిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇద్దరు మహిళలు గీత(42), లత(39) మేజర్లు కావడం, వారి ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో నివసిస్తున్నందున ఈ పిటిషన్ చట్టవిరుద్దమని, దీనిని తిరస్కరిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.కాగా పిటిషనర్ కూతుళ్లలో ఒకరు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను, నా సోదరి స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగానే ఈషా ఫౌండేషన్లో నివసిస్తున్నాం. ఇందులో ఎవరి బలవంతం, ఒత్తిడి లేదు. మా తండ్రి ఎనిమిదేళ్లుగా మమ్మల్ని వేధిస్తున్నారు’ అని కోర్టుకు తెలిపారు.కేసు పుర్వాపరాలు..ఈషా ఫౌండేషన్పై తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ హెబియస్ కార్పస్ రిట్ దాఖలు చేయడంతో మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈషా యోగా కేంద్రంలో యోగా నేర్చుకునేందుకు వెళ్లి అక్కడే ఉండి పోయారని, ఈశా కేంద్రంలో వారికి బ్రెయిన్ వాష్ చేసి సన్యాసంవైపు మళ్లించారని ఆయన ఆరోపించారు. ఇద్దరు కుమార్తెలను తమకు అప్పగించాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈషా యోగా కేంద్రంపై ఇప్పటి వరకు ఎన్ని క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటి వివరాలు దాఖలు చేయాలని పోలీసులకు ఉత్తర్వులిచ్చింది. ఆశ్రమంలో ఉన్న అందరినీ విచారించాలని ఆదేశించింది. ప్రొఫెసర్ ఆరోపణలను ఈషా యోగా కేంద్రం తోసిపుచ్చింది. తాము ఎవర్నీ పెళ్లి చేసుకోమనిగానీ.. సన్యాసం తీసుకోవాలని గానీ సలహాలు ఇవ్వమని, ఎవరికి వారు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటారని ఓ ప్రకటన విడుదల చేసింది.దీనిపై ఈషా యోగా కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఫౌండేషన్పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు పోలీసులకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే విధించింది. అలాగే స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసును స్పష్టం చేసింది. తాజాగా ఇద్దరు మహిళలు ఆ శ్రమంలో స్వచ్ఛందంగానే ఉంటున్నారని అత్యున్నత న్యాయస్థానానికి పోలీసులు వివరాలు సమర్పించారు. దీంతో కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. -
సుప్రీం కోర్టులో ఈశా ఫౌండేషన్కు ఊరట
ఢిల్లీ: ఈశా ఫౌండేషన్పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని ఇటీవల పోలీసులను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం మద్రాసు హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ.. ఈశా ఫౌండేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్టే ఇచ్చింది. ఆశ్రమంలో పోలీసుల సోదాలు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు మహిళలతో ఆన్లైన్లో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నామని ఇద్దరు యువతులు తెలిపారు. ఈశా యోగా ఆశ్రమంలో తమిళనాడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పేర్కొంది. ఇక.. ఈ కేసులో పూర్తి స్టేటస్ రిపోర్టును తమకు సమర్పించాలని తమిళనాడు పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 18కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.ఇక.. మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు కోయంబత్తూర్లోని ఈశా ఫౌండేషన్ యోగా కేంద్రాన్ని మంగళవారం దాదాపు 150 మంది పోలీసు సిబ్బంది ప్రభుత్వ అధికారులతో కూడిన బృందం తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.చదవండి: కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. -
కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్లో పోలీసుల సోదాలు
చెన్నై: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్కు చెందిన ఈశా ఫౌండేషన్పై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తన సొంత కూతురికి పెళ్లి చేసి సంప్రదాయబద్ధంగా స్థిరపడేలా ఏర్పాటు చేసిన వాసుదేవ్.. యువతులను ప్రాపంచిక వృత్తిని త్యజించమని, తల దువ్వుకుని, తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించింది.సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్పై హైకోర్టు ఎస్ఎం సుబ్రమణ్యం, వి.శివజ్ఞానం ఎదుట విచారణ విచారణకు వచ్చింది. విచారణ జరిగే సమయంలో కీలక కామెంట్స్ చేసింది. ఈశా పౌండేషన్కు సంబంధించి సమగ్ర నివేదికను సెప్టెంబర్ 4 (శుక్రవారం) లోపు కోర్టుకు అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే..తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరు జిల్లాలోని తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్.కామరాజ్ (69)హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో తన ఇద్దరు కుమార్తెల్లో శక్తి సామర్ధ్యాలను తగ్గేలా మందులు ఇచ్చారని, జుత్తు కత్తిరించుకుని తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించమని ప్రోత్సహించినట్లు ఆరోపించారు. ఈశా ఫౌండేషన్లో చేరితన పెద్ద కుమార్తె ..ప్రతిష్టాత్మక యూకే యూనివర్శిటీ నుంచి మెకాట్రానిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. 2008లో విడాకులకు ముందు అత్యధిక వేతనంతో ఉద్యోగం కూడా చేసింది. వైవాహిక జీవితంలో సమస్యలు రావడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయారని, ఆ తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టినట్లు కామరాజ్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆమె ఈశా ఫౌండేషన్లో యోగా తరగతులకు హాజరుకావడం ప్రారంభించింది. కొంత కాలానికి ఐటీ ఉద్యోగం చేసిన నా చిన్న కుమార్తె సైతం ఈశా ఫౌండేషన్లో చేరింది. చివరికి శాశ్వతంగా ఆశ్రమంలోనే నివసించాలని నిర్ణయించుకున్నారు.న్యాయం చేయండిఇప్పుడు ఇంటికి రావడం లేదని, తన కుమార్తెల జీవితాన్ని జగ్గీ వాసుదేవ్ నాశనం చేశారని పిటిషనర్ కామరాజ్ తెలిపారు. కుమార్తెల జీవితం నాశనం అవ్వడంతో తన భార్య అనారోగ్యానికి గురయ్యారని, తనకు న్యాయం చేయాలని కోరారు. తన కుమార్తెలతో పాటు ఎందరో తల్లిదండ్రులకు దూరంగా ఈశా ఫౌండేషన్లో చేరి వారి జీవితాల్ని నాశనం చేసుకున్నట్లు చెప్పారు.క్రిమినల్ కేసులు నమోదుఇప్పటికే ఈశా ఫౌండేషన్లో పనిచేస్తున్న వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదైన విషయాన్ని పిటిషనర్ పిటిషన్లో ప్రస్తావించారు. ఇటీవల అదే సంస్థలో పనిచేస్తున్న ఓ వైద్యుడు ఆదివాసీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 12 మంది బాలికలను వేధించాడని,ఆయనపై పోక్సో కింద క్రిమినల్ కేసు నమోదయ్యాయని, అందుకు గల ఆధారాల్ని కోర్టుకు అందించారు. హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణరిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై ప్రతిస్పందనగా విచారణ మొదలైంది. తన ఇద్దరు కుమార్తెలను కేంద్రంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఉంచారని కామరాజ్ పేర్కొన్నారు. ఇషా ఫౌండేషన్ వ్యక్తుల బ్రెయిన్వాష్ చేసి, వారిని సన్యాసులుగా మారుస్తోందని, వారి కుటుంబాలతో సంబంధాలు కొనసాగించకుండా అడ్డుకుంటున్నదని కామరాజ్ ఆరోపించారు.ప్రతి స్పందనగా ఇషా ఫౌండేషన్ తరపు న్యాయవాది కె.రాజేంద్ర కుమార్, ఫౌండేషన్ను సమర్థించారు. ఆధ్యాత్మిక మార్గాన్ని స్వీకరించడంతోపాటు వారి జీవితాల గురించి వారి సొంత ఎంపికలు చేసుకునే హక్కు పెద్దలకు ఉందని నొక్కి చెప్పారు. ఈశా ఫౌండేషన్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు కామరాజ్ ప్రయత్నించారని, తమ సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాదించారు. ఇరు పక్షాల వాదనలు హైకోర్టు ఎస్ఎం సుబ్రమణ్యం,వి.శివజ్ఞానం న్యాయమూర్తులు ఈశా ఫౌండేషన్లోని పద్ధతులపై ప్రశ్నలను లేవనెత్తారు. జగ్గీ వాసుదేవ్ తన కుమార్తెకు వివాహం చేసి స్థిరపడేలా చేశారని, కానీ యువతులను సన్యాసులుగా జీవించమని ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలు.. ఈశా ఫౌండేషన్లో సోదాలుఅనంతరం, జగ్గీ వాసుదేవ్కు చెందిన ఈశా ఫౌండేషన్పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో కోయంబత్తూర్ రూరల్ డిస్ట్రిక్ అసిస్టెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కే. కార్తికేయన్ నేతృత్వంలో ముగ్గురు డిప్యూటీ సూపరింటెండెంట్లు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు 150 మంది పోలీసు అధికారుల బృందం కోయంబత్తూరులోని తొండముత్తూర్లోని మంగళవారం వెల్లియంగిరి పాదాల వద్ద ఉన్న ఈశా ఫౌండేషన్ ఆశ్రమంలో విచారణ చేపట్టారు.ఈ సోదాలపై ఈశా యోగా సెంటర్ ప్రతినిధులు అధికారికంగా స్పందించారు. ‘కోర్టు ఆదేశాల మేరకు..ఎస్పీలు ఇషా యోగా సెంటర్లో సాదారణంగా తనిఖీలు నిర్వహించారు. యోగా సెంటర్లో ఉండే వారిని, వాలంటీర్లను వారి జీవన విధానం ఎలా ఉంటుంది? ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడ ఎలా ఉంటున్నారు?’ అని ప్రశ్నలు వేసినట్లు చెప్పారు. -
బాలలకు సుప్రీమ్ రక్షణ!
భారత సర్వోన్నత న్యాయస్థానం సోమవారం చరిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. మద్రాస్ హైకోర్ట్ గతంలో చేసిన తప్పును సరిదిద్దింది. బాలలపై లైంగిక అకృత్య, అశ్లీల దృశ్యాల వీడియోలను డౌన్ లోడ్ చేసినా, కలిగివున్నా, చివరకు చూసినా, సదరు అంశాలపై నిర్ణీత అధికారులకు ఫిర్యాదు చేయకున్నా కూడా పోక్సో, ఐటీ చట్టాల కింద నేరమేనని కుండబద్దలు కొట్టింది. దాదాపు 200 పేజీల తాజా తీర్పుతో బాలలపై లైంగిక అత్యాచారాలను నిరోధించేలా ‘లైంగిక అకృత్యాల నుంచి బాలలకు రక్షణ’ (పోక్సో) చట్టానికి పదును పెట్టింది. పసిపాపల నుంచి ఎదిగిన మైనర్ల వరకు బాలలందరి పైనా దేశంలో అంతకంతకూ అఘాయిత్యాలు పెరుగుతున్న వేళ రానున్న రోజుల్లో ఈ తీర్పు బలమైన ప్రభావం చూపనుంది. ఇంటా బయటా ప్రతిచోటా కామాంధుల బెడద పెచ్చరిల్లిన సమయంలో ఈ సుప్రీమ్ తీర్పు భారతదేశంలోని బాలబాలికలకు భారీ ఊరట, బలమైన అండ. తాజా సుప్రీమ్ కోర్ట్ ఆదేశంతో చైల్డ్ పోర్నోగ్రఫీ సమాచారాన్ని ‘కలిగి ఉండడం’ అనే పదం తాలూకు నిర్వచన పరిధి పెరిగింది. అలాంటి దృశ్యాలను డౌన్లోడ్ చేయకున్నా, పరికరంలో పదిలపరుచుకోకపోయినా... కేవలం చూసినా సరే ఇప్పుడది పోక్సోలోని సెక్షన్ 15 కింద నేరమే అవుతుంది. ఇది కేవలం సాంకేతికపరమైన అంశం కానే కాదు... తీవ్రమైన నేరం. నిజానికి, చైల్డ్ పోర్న్ దృశ్యాల తయారీ, పంపిణీయే నేరమనీ, ఎలక్ట్రానిక్ పరికరాల్లో డౌన్లోడ్ చేసి ప్రైవేటుగా చూసినంత మాత్రాన అది నేరం కిందకు రాదనీ ఆ మధ్య మద్రాస్ హైకోర్ట్ తీర్పునిచ్చింది. మొబైల్లో డౌన్లోడ్ చేసి చూసిన ఓ చెన్నై కుర్రాడిపై నేర విచారణను జనవరి 11న రద్దు చేసింది. దీని వల్ల బాలల సంక్షేమంపై దుష్ప్రభావం పడుతుందని తప్పుబడుతూ వివిధ స్వచ్ఛంద సంస్థల సమాహారమైన ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’ సుప్రీమ్ గడప తొక్కింది. సింగిల్ జడ్జి ఇచ్చిన సదరు తీర్పు ‘ఘోరమైనది’ అంటూ మార్చిలోనే సుప్రీమ్ తప్పుబట్టింది. మద్రాస్ హైకోర్ట్ తీర్పు ‘అసాధారణ∙తప్పు’ అని సుప్రీమ్ తన తాజా ఆదేశంలో వ్యాఖ్యానించడం గమనార్హం.సుప్రీమ్ తన తాజా ఆదేశంతో ఆ పాత మద్రాస్ హైకోర్ట్ తీర్పును తోసిపుచ్చినట్టయింది. అదే సమయంలో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ అనే పదం నేరాన్ని తేలిక చేస్తున్నట్టు ఉందని భావించింది. ఆ పదాన్ని పరిహరించి, దాని బదులు ‘బాలలపై లైంగిక అకృత్యాలు, దాడుల సమాచారం’ (సీఎస్ఈ ఏఎమ్) అనే పదాన్ని సంబంధిత చట్టాలన్నిటిలో వాడేలా పార్లమెంట్ ఆర్డినెన్స్ తీసుకురావాలని అభ్యర్థించడం విశేషం. ఇకపై న్యాయస్థానాలన్నీ తమ ఆదేశాలు, తీర్పుల్లో ఈ పదాన్నే వాడాలని కూడా సుప్రీమ్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, మరో న్యాయమూర్తి జస్టిస్ పార్దీవాలాలతో కూడిన సుప్రీమ్ ధర్మాసనం ఇచ్చిన ఆదేశం, చేసిన అభ్యర్థన ఆలోచించదగినది, స్వాగతించవలసినది. గమనిస్తే, సమస్యంతా చట్టాలలోని అంశాలకు కొన్ని కోర్టులు సంకుచిత అంతరార్థాలు తీయడంతో వస్తోంది. మద్రాస్ హైకోర్ట్లోనూ జరిగింది అదే. తద్వారా బాలలపై సైబర్ నేరాలకు పాల్పడినవారిని శిక్షించడానికి ఉద్దేశించిన చట్టాల ప్రయోజనమే దెబ్బతింటోంది. అందుకే, ఈ విషయంలో కోర్టులు జాగరూకతతో ఉండాలని సుప్రీమ్ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది. గణాంకాలు గమనిస్తే, దేశంలో బాలలపై అకృత్యాలు అంతకంతకూ అధికమవుతున్నాయి. ఒక్క 2022లోనే వాటి సంఖ్య 8.7 శాతం పెరిగింది. అలాంటి ఘటనలు 1.68 లక్షలకు చేరినట్టు జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) మాట. పసివారిపై అఘాయిత్యాలు జరిగినప్పటికీ భయం, సమాజంలో పడే కళంకం, అవగాహన లేమితో ఇంకా అనేక కేసులు వెలుగులోకి రావట్లేదు. పైగా, ఇంట్లో అయినవాళ్ళు, బడిలో ఉద్యోగులు సైతం సాగిస్తున్న ఈ అమానుషాలు పిల్లల మనసులపై జీవితాంతం ప్రభావం చూపుతున్నాయి. పెరిగి పెద్దయినా సరే వారిని ఆ చేదు అనుభవాల నుంచి మానసికంగా బయట పడనీయకుండా చేస్తున్నాయి. వీటన్నిటినీ అరికట్టడానికే 2012లోనే పోక్సో లాంటి కఠినచట్టాలు వచ్చాయి. అయినా, బాలలపై అత్యాచారాలు ఆగక పోవడం విషాదం. సదరు కేసులు పెరుగుతున్నందున ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలంటూ అయిదేళ్ళ క్రితమే సుప్రీమ్ ఆదేశించింది. అయితే, రెగ్యులర్ కోర్ట్లకే జడ్జీలు కరవైన పరిస్థితుల్లో ఇక ఈ ఫాస్ట్ట్రాక్ల కథేమిటో ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. దానికి తోడు చట్టంలోని కఠిన అంశాలకు ఒక్కో హైకోర్ట్ ఒక్కో రకం అర్థం చెబుతూ, వ్యాఖ్యానం చెప్పడం పెను సమస్యయి కూర్చుంది. తాజా తీర్పుతో ఆ పరిస్థితులు కొంతవరకు మారతాయని ఆశించాలి. చట్టాన్ని అతిక్రమిస్తున్న వారికి మేలుకొలుపు. అదే సమయంలో అది అందరికీ స్పష్టమైన సందేశం ఇస్తోంది. అదేమిటంటే – బాలల భద్రత అతి ముఖ్యమైనది! వారి భద్రత కోసమే కోర్టు చట్టానికి మరింత కఠినమైన, కట్టుదిట్టమైన వ్యాఖ్యానం అందించింది. ఇక యూ ట్యూబ్ – గూగుల్ లాంటి వేదికలు, చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు, నిత్యం ఇంటర్నెట్ వాడేవారు అప్రమత్తంగా ఉండక తప్పదు. అలాంటి కంటెంట్ను తక్షణం తొలగించడం, పోలీసులకు ఫిర్యాదు చేయడమే మార్గం. అదే సమయంలో విద్యాలయాల్లో లైంగిక విజ్ఞానాన్ని సమగ్రంగా బోధించి, పిల్లల్లో అవగాహన కల్పించాలంటూ ప్రభుత్వానికి సుప్రీమ్ చేసిన సూచన విలువైనది. బిడియపడకుండా తల్లితండ్రులు, గురువులు పిల్ల లకు విషయాలను వివరించడం మేలు. శారీరకంగా, సామా జికంగా, చట్టపరంగా అవగాహన పెరి గితే అకృత్యాల్ని అడ్డుకోవడం సులభమవుతుంది. ఇలాంటి కేసులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్న సంకేతం సుప్రీమ్ తాజా తీర్పు అందించడం అన్ని విధాలా ఆహ్వానించదగ్గ పరిణామం. -
బద్లాపూర్ నిందితుడి ఎన్కౌంటర్.. పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు
ముంబై: బాద్లాపూర్ లైంగిక వేధింపుల నిందితుడి కస్టడీ మరణంపై బాంబే హైకోర్టు ముంబై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి ఎన్కౌంటర్ అనుమానాలకు తావిస్తోందని.. ఈ సంఘటనను ఎన్కౌంటర్గా పేర్కొనలేమని పేర్కొంది. నిందితుడు అక్షయ్ షిండేను జైలు నుంచి బయటకు తీసుకొచ్చినప్పటి నుంచి శివాజీ ఆస్పత్రిలో మరణించినట్లు ప్రకటించే వరకు సీసీటీవీ ఫుటేజీని తమకు సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో నిందితుడు అక్షయ్ శిండేపై.. అతడి మొదటి భార్య వేధింపుల కేసు పెట్టింది.అయితే ఈ కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు నిందితుడిని కారులో తీసుకొని తాలోజా జైలు నుంచి బద్లాపూర్ బయల్దేరారు. ఈ క్రమంలో పోలీస్ అధికారి చేతిలో నుంచి తుపాకీ లాక్కొని ఎస్కార్టింగ్ పోలీసు బృందంపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. అతడు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.తీవ్రంగా గాయపడిన షిండేను ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనలో ఏఎస్ఐ నీలేష్ మోరే, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండేలు గాయపడ్డారని చెప్పారు. అయితే ఇదంతా అబద్దమని, తన కొడుకునే పథకం ప్రకారమే హతమార్చారని ఆరోపిస్తూ నిందితుడు తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. నిందితుడు కాల్చిన ఆ రెండు బుల్లెట్లు ఎక్కడ..? అంటూ ప్రశ్నించింది. ‘ఇది నమ్మడం కష్టం. ప్రాథమికంగా ఫౌల్ ప్లే కనిపిస్తుంది. ఒక సామాన్యుడు రివాల్వర్ లాగా పిస్టల్ను కాల్చలేడు. ఏ టామ్, డిక్, హ్యారీ చేయగలడు, బలహీనమైన వ్యక్తి పిస్టల్ను లోడ్ చేయలేడు.’ పోలీసుల కథనాన్ని నమ్మడం కష్టంగా ఉంది. నిందితుడు పోలీసులపైకి మూడు బుల్లెట్లు కాల్చారని మీరు చెప్పారు. ఒక్కటే పోలీసులను తాకింది. మిగతా రెండు బుల్లెట్ల ఏమయ్యాయి. పోలీసు అధికారి సంజయ్ షిండే నిందితుడి తలపై కాకుండా కాళ్లు లేదా చేతులపై గురిపెట్టి ఉండాల్సింది. వాహనంలో ఉన్న నలుగురు అధికారులు ఒక్క వ్యక్తిని అధిగమించలేకపోయారంటే ఎలా నమ్మాలి? అతడేం భారీ మనిషికాదు. మీరు సులభంగానే అతడిని అడ్డుకొని ఉండొచ్చు. దీనిని ఎన్కౌంటర్ అని అనలేం. అలాగే ఇంతవరకు కేసు పత్రాలు సీఐడీకి ఎందుకు అప్పగించలేదు. ఏ దర్యాప్తులో అయినా సమయం కీలకం. ఆలస్యం అవుతుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయి’ అని కోర్టు ప్రశ్నించింది. పోలీసుల చర్యను అనుమానించడం లేదు కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
తమిళనాడు ప్రజలకు కేంద్ర మంత్రి క్షమాపణలు
చెన్నై: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనను తమిళనాడు ప్రజలతో ముడిపెడుతూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదం అయ్యాయి. ఈ ఏడాది మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.అయితే.. రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే అన్నారు. దీంతో కేంద్ర మంత్రిపై మధురైలో కేసు నమోదు అయింది. తాజగా ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక.. గతంలోనూ సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జస్టిస్ జీ. జయచంద్రన్ సెప్టెంబర్ 5 తేదీకి వాయిదా వేశారు. -
స్టార్ కమెడియన్ రూ.5 కోట్ల పరువు నష్టం దావా
ప్రముఖ కమెడియన్, పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో మనకు తెలిసిన వడివేలు.. తోటి నటుడు సింగముత్తపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ఈ మేరకు చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 1991 నుంచి సినిమాల్లో నటిస్తూ ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగానని, సింగముత్తుతో కలిసి 2000 నుంచి కొన్ని సినిమాల్లో కలిసి నటించానని.. కానీ తాను అతడి కంటే ఉన్నత స్థాయికి ఎదగడంతో సింగముత్తు తట్టుకోలేకపోతున్నాడని వడివేలు తన పిటిషన్లో పేర్కొన్నారు.(ఇదీ చదవండి: రూ.9 కోట్ల ఇంటిని అమ్మేసిన 'ఫ్యామిలీ మ్యాన్' హీరో)ఆ మధ్య తాంబరంలో వివాదాస్పద స్థలాన్ని సింగముత్తు తనతో కొనిపించాడని, ఆ కేసు స్థానిక ఎగ్మోర్ కోర్ట్లో ఉందని వడివేలు చెప్పుకొచ్చారు. గత జనవరి నుంచి మార్చి మధ్యలో పలు యూట్యూబ్ ఛానెళ్లలో కనిపించిన సింగముత్తు.. తనని కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని, తన పరువుకు భంగం కలిగించేలా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని.. దీనికోసం ఆయన రూ.5 కోట్ల పరువు నష్టం దావా చెల్లించేలా చేయాలని కోర్టుకి విన్నవించాడు.ఇక వడివేలు పిటిషన్ని విచారణకు స్వీకరించిన జడ్జి.. రెండు వారాల్లో బదులివ్వాలని నటుడు సింగముత్తుకు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కాస్త తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కేసులో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: 'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ) -
వ్యభిచార గృహానికి రక్షణ కల్పించండి!!
చెన్నై: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో తాను నడుపుతున్న వ్యభిచార గృహానికి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ న్యాయవాది పిటిషన్ వేయడంతో మద్రాస్ హైకోర్టు అవాక్కైంది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో సెక్స్ సర్వీసులను, కౌన్సెలింగ్ను, ఆయిల్ బాత్లను తమ సంస్థ అందిస్తుందని న్యాయవాది రాజా మురుగన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. పోలీసు తనపై పెట్టిన కేసును కొట్టి వేయాలని, తన వ్యాపార కార్యకలాపాల జోలికి రాకుండా పోలీసులను కట్టడి చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో జరిగే సెక్స్ నేరం కాదని తన చట్టవిరుద్ధ కార్యకలాపాలను పిటిషనర్ సమర్థించుకోవడాన్ని జస్టిస్ బి.పుగలేంధి తీవ్రంగా ఆక్షేపించారు. పేరున్న లా కాలేజీల నుంచి పట్టభద్రులైన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకోవాలని బార్ కౌన్సిల్కు సూచించారు. మురుగన్కు రూ. 10 వేల జరిమానాను విధించడమే కాకుండా.. లా డిగ్రీ సరి్టఫికెట్ను, బార్ అసోసియేషన్లో నమోదైన పత్రాన్ని సమర్పించాలని ఆదేశించింది. -
‘వ్యభిచార గృహం నడిపేందుకు రక్షణ కావాలి’.. మద్రాస్ హైకోర్టు షాక్
చెన్నై: ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ను చూసి మద్రాస్ హైకర్టు షాక్ గురైంది. సదరు పిటిషనర్పై దర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషన్ను రద్దు చేయడమే కాకుండా అతడికి జరిమానా కూడా విధించింది. ఇంతకీ ఆ పిటిషన్ ఏంటంటే..తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో వ్యభిచార గృహాన్ని నడిపేందుకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రాక్టీస్ చేస్తున్న రాజా మురుగన్ అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ చేశారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది.ఈ సందర్భంగా మేజర్లు ఏకాభిప్రాయంతో సెక్స్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ పిటిషనర్ వాదించాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరారు. తన వ్యాపార కార్యకలాపాల్లో పోలీసుల జోక్యాన్ని అడ్డుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు తెలిపారు. అయితే వ్యభిచార గృహాన్ని నడుపుతూ తప్పు చేయడమే కాకుండా తన చర్యలను నిసిగ్గుగా సమర్థించినందుకు జస్టిస్ బి పుగలేంధీ ధర్మాసనం పిటిషనర్పై మండిపడడింది. తన పిటిషన్ను కొట్టివేస్తూ.. న్యాయవాదిపై 10 వేల జరిమానా కూడా విధించింది.అదే విధంగా ప్రఖ్యాత లా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకునేలా చూడాలని బార్ కౌన్సిల్ను కోర్టు కోరింది. ఇతర రాష్ట్రాల్లోని సందేహాస్పద సంస్థల నుంచి గ్రాడ్యుయేట్ల నమోదును బార్ కౌన్సిల్ తప్పనిసరిగా పరిమితం చేయాలని సూచించింది.‘సమాజంలో న్యాయవాదుల ప్రతిష్ట తగ్గుతోందని బార్ కౌన్సిల్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. కనీసం ఇక నుంచైనా బార్ కౌన్సిల్ సభ్యులు పేరున్న కళాశాలల నుంచి మాత్రమే నమోదు చేసేలా చూసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి పేరు లేని అనామక సంస్థల నుంచి నమోదును పరిమితం చేయాలి’ అని తెలిపింది. -
మణిపూర్ నుంచి తొలిసారి సుప్రీంకోర్టుకు.. ఎవరీ ఎన్ కోటీశ్వర్?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు చేరారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం వెల్లడించారు.కాగా ఈ ఇద్దరు న్యాయమూర్తుల పదోన్నతిపై సుప్రీంకోర్టు కోలిజియం గతంలో సిఫార్సు చేసింది. ఈ మేరకు వీరి నియామకంపై రాష్ట్రపతి తాజాగా ఆమోద ముద్ర వేశారు. కాగా కోటీశ్వర్ సింగ్ ప్రస్తుతం జమ్మూకశ్మీర్, లడఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా.. ఆర్ మహదేవన్ మద్రాస్ హైకోర్టు చీఫ్ జడ్జీగా ఉన్నారు. ఇక కొత్తగా ఇద్దరు జడ్జీల చేరికతో సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో కలిసి న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది.జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఇటీవల హింసాత్మకంగా మారిన ఈ ఈశాన్య రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు ఎన్నికైన తొలి జడ్జిగా ఆయన రికార్డుల్లోకి ఎక్కడారు.జస్టిస్ కోటీశ్వర్ మణిపూర్ తొలి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఆయన ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజ్ అండ క్యాంపస్ లా సెంటర్లో పూర్వ న్యాయ విద్యను పూర్తి చేశారు. అనంతరం 1986లో న్యాయవాదిగా తన కెరీర్ను ప్రారంభించాడు. ఆయన జడ్జి కాకముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు. గతంలో అస్సాంలోని గువాహటి హైకోర్టు, మణిపూర్ హైకోర్టులోనూ విధులు నిర్వర్తించారు.ఇక చెన్నైలో జన్మించిన జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. న్యాయవాదిగా ఆయన 9,000 కేసులను వాదించారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు గవర్నమెంట్ ప్లీడర్గా(పన్నులు), అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ న్యాయవాది, మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. -
‘తాగుబోతులేమైనా స్వాతంత్ర్య సమరయోధులా?’
చెన్నై: అరవై మందికిపైగా పొట్టనబెట్టుకుని కళ్లకురిచ్చి కల్తీ సారా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఒకవైపు తమిళనాట రాజకీయ దుమారం కొనసాగుతుండగా.. మరోవైపు ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం నమోదైంది.కళ్లకురిచ్చి కల్తీసారా ఘటనలో మృతి చెందిన వాళ్ల కుటుంబాలకు నష్టపరిహారంగా రూ.10 లక్షలు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మహమ్మద్ గౌస్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. ‘‘కల్తీసారా తాగి చనిపోయినవాళ్లు స్వాతంత్ర్య సమరయోధులేం కాదు. సామాజిక ఉద్యమకారులు అంతకన్నా కాదు. పోనీ సమాజం కోసం.. ప్రజల కోసం ప్రాణాలు వదిలారా? అంటే అదీ కాదు. కల్తీసారా తయారీ చట్టవిరుద్ధమైన చర్య అని, అలాంటప్పుడు అది తాగి చనిపోయిన వాళ్ల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరమే లేదు’’ అని వ్యాజ్యంలో ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: కల్తీసారా ఘటన.. ఆ భార్యాభర్తల మృతి తర్వాతే..!తమ సరదా కోసమే కల్తీసారా తాగిన చనిపోయిన వాళ్లను బాధితులుగా ప్రభుత్వం పరిగణించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పైగా అగ్ని, రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో మరణించిన వాళ్లకు పరిహారం తక్కువగా ఇచ్చిన సందర్భాల్ని ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచన చేయాలని, లేకుంటే న్యాయస్థానమే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన.ఈ పిల్ను విచారణకు స్వీకరించిన చీఫ్ జస్టిస్(తాత్కాలిక) ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షాఫిక్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్.. రెండు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
తమిళనాట 50కి చేరిన మద్యం మృతులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం మరో 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 50కి చేరాయి. అలాగే, సారా తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు కూడా మరణించడంతో ఆ సంఖ్య 50ని దాటింది. అయితే, వీరి మరణంపై అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కల్తీ సారా మరణాల ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. దద్దరిల్లిన అసెంబ్లీ కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 50 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. -
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
సాక్షి, చెన్నై : గల్లంతైన వారి పేర్లన్నీ మళ్లీ జాబితాలో చేర్పించి ఓటింగ్కు అవకాశం కల్పించాలని ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓ ఓటరు దాఖలు చేసిన పిటిషన్పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, కౌంటింగ్ నిలుపుదల కోసం స్టే ఇవ్వలేమని పేర్కొంటూ ఓటరు పిటిషన్ విచారణను ముగించారు. వివరాలు.. ఆస్ట్రేలియా నుంచి వచ్చి తన హక్కును వినియోగించుకునేందుకు ప్రయత్నించిన వైద్యుడు స్వతందిర కన్నన్కు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గంలో నిరాశే మిగిలిన విషయం తెలిసిందే. ఓటరు జాబితాలో తన పేరు గల్లంతు కావడాన్ని తీవ్రంగా పరిగణించారు.తన లాంటి వారెందరి పేర్లో జాబితాలో గల్లంతు కావడాన్ని పరిగణించి హైకోర్టులో పిటిషన్ వేశాడు. గల్లంతైన వారి పేర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని, ఓటుహక్కుకలి ్పంచాలని విన్నవించాడు. ఈ పిటిషన్ను మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ గంగాపూర్వాల, న్యాయమూర్తి చంద్రశేఖరన్ బెంచ్ విచారించింది. ఎన్నికల కమిషన్ తరపున సమగ్ర వివరాలను కోర్టు ముందు ఉంచారు. జనవరిలోనే తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరగిందని గుర్తించారు. పిటిషనర్ సంబం«ధిత నియోజకవర్గం లేరని, ఆయన ఆ్రస్టేలియాలో నివాసం ఉన్నారని వివరించారు. 2021లోనే జాబితా నుంచి పిటిషనర్ పేరు తొలగించ బడ్డట్టు, తుది ఓటరు జాబితా ప్రకటించిన సమయంలో ఎందుకు పిటిషనర్ ఆక్షేపన వ్యక్తం చేయలేదన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.తుది ఓటరు జాబితా సమయంలోనే పరిశీలించి ఉండాలని, ఫిర్యాదులు ఉంటే ఎన్నికల కమిషన్ దృష్టికి అప్పుడే తీసుకొచ్చి ఉండాలని వాదించారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు స్పందిస్తూ, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిందని, ఇప్పుడు కొత్తగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. పేర్లు మళ్లీ జాబితాలో చేర్పించి ఓటింగ్కు అవకాశం కల్పించాలన్న పిటిషనర్ వాదనపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్నారు. అలాగే, కోయంబత్తూరు నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ను నిలుపుదల చేయలేమని పేర్కొంటూ, ఈ పిటిషన్ విచారణను ముగిస్తున్నట్టు ప్రకటించారు. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వక పోవడంతో ఓటరుకు మిగిలింది నిరాశే. సర్కారు సినిమాలో తరహా ఏదేని ఉత్తర్వులు వస్తాయన్న ఎదురు చూపులలో ఉన్న వారికి భంగపాటు తప్పలేదు. -
Lok Sabha elections 2024: కోయంబత్తూర్ రోడ్ షోకు హైకోర్టు ఓకే
చెన్నై: ఈ నెల 18వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో నాలుగు కిలోమీటర్ల మేర సాగాల్సిన ప్రధాని మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మతపరంగా సున్నితమైన ప్రాంతం అనే కారణంతో కోయంబత్తూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రోడ్ షోకు అనుమతి నిరాకరించడం సహేతుకంగా లేదని హైకోర్టు పేర్కొంది. ప్రధానమంత్రికి నిరంతరం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుందని గుర్తు చేసింది. ‘ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత హోదా కలిగిన నాయకులను ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి, తమను ఎన్నుకున్న వారిని కలవకుండా నేతలను ఆపడం సరికాదు’అని అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్ షో జరగనున్నందున పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. రోడ్ షోకు అనుమతి నిరాకరిస్తూ పోలీస్ కమిషనర్ పురమ్ రంగే తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ కుమార్ వేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్ శుక్రవారం విచారణ జరిపారు. రోడ్ షోకు షరతులతో కూడిన అనుమతివ్వాలని కమిషనర్ను ఆదేశించారు. -
చైల్డ్ పోర్నోగ్రఫీపై ఆ తీర్పు దుర్మార్గం: సుప్రీం
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు దుర్మార్గంగా అభివర్ణించింది. ఆ తీర్పుపై విచారణ జరిపేందుకు అంగీకరించింది. చెన్నైకి చెందిన ఎస్.హరీశ్(28) పిల్లలతో కూడిన పోర్నోగ్రఫీ కంటెంట్ను తన సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాడంటూ పోలీసులు కేసు పెట్టారు. దీనిపై హరీశ్ మద్రాస్ హైకోర్టుకు వెళ్లాడు. విచారణ చేపట్టిన ఏకసభ్య ధర్మాసనం పోక్సో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ కంటెంట్ను డౌన్లోడ్ చేయడం, చూడటం నేరం కాదని పేర్కొంటూ జనవరి 11వ తేదీన తీర్పు వెలువరించింది. దీనిని సవాల్ చేస్తూ ఫరీబాద్కు చెందిన జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయెన్, ఢిల్లీకి చెందిన బచ్పన్ బచావో ఆందోళన్ అనే ఎన్జీవోలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం పిటిషన్పై విచారణ చేపట్టింది. హైకోర్టు తీర్పు చట్టాలకు వ్యతిరేకం, దుర్మార్గమని పేర్కొంది. ఏకసభ్య ధర్మాసనం ఇలాంటి తీర్పు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించింది. -
ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు ఊరట
చెన్నై: సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజాతోపాటు మరో డీఎంకే నేత చట్టసభ సభ్యులుగా కొనసాగడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. అయితే, డీఎంకే నాయకులు వ్యాఖ్యలను కోర్టు తప్పుపట్టింది. సనాతన ధర్మాన్ని హెచ్ఐవీ, మలేరియా, డెంగ్యూతో పోల్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా మాట్లాడడం రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమేనని తేలి్చచెప్పింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ సమాజంలో విభజన తెచ్చేలా వ్యవహరించడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. -
త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మళ్లీ మొదలుపెట్టిన నటుడు!
తప్పు చేసిందే కాకుండా తప్పించుకోవాలని చూశాడు తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్. హీరోయిన్ త్రిషపై ఈయన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే! 'లియో సినిమాలో హీరోయిన్ త్రిష అని తెలిశాక తనతో బెడ్రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను, కానీ అది జరగలేదు' అని వ్యాఖ్యానించాడు. ఇందులో అశ్లీల ధ్వనికి హీరోయిన్ త్రిష స్పందించింది. తనతో ఇంకే సినిమాలోనూ నటించేదే లేదని తేల్చి చెప్పింది. చిరంజీవి, ఖుష్బూ వంటి పలువురు తారలు ఆమెకు మద్దతుగా నిలబడ్డారు. తన మాటల్లో తప్పు కనిపించలేదుకానీ అందరూ తనను తప్పుపడుతున్నారని ఫీలయ్యాడు మన్సూర్. కోటి అడిగాడు.. రూ.1 లక్ష కట్టమన్న కోర్టు త్రిషతో పాటు ఆమెకు మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై పరువు నష్టం దావా వేశాడు. ఈ వ్యవహారంలో తాను అమాయకుడినని, తనకు ముగ్గురి నుంచి కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలని పిటిషన్ వేశాడు. ఇది చూసి బిత్తరపోయిన కోర్టు మన్సూర్కు గడ్డిపెట్టింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన నీవు వారిపై పరువు నష్టం దావా వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అంతేకాకుండా కోర్టు సమయం వృథా చేసినందుకుగానూ చెన్నైలో అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు రూ.1 లక్ష చెల్లించాలంటూ సింగిల్ జడ్జ్ ఉత్తర్వులు జారీ చేసింది. పది రోజుల్లో కడతానంటూ ట్విస్ట్ ఇది జరిగి నెల రోజుల పైనే అవుతోంది. ఇప్పటివరకు మన్సూర్ ఆ రుసుమును కట్టనేలేదు. వారం రోజుల క్రితం కోర్టు ఇదే విషయాన్ని గుర్తు చేయగా మరో పది రోజుల గడువు కావాలన్నాడు నటుడు. అతడి అవస్థను చూసిన న్యాయస్థానం.. ఎవరి గురించైనా చెప్పేటప్పుడు ఆచితూచి మాట్లాడటం నేర్చుకోమని మొట్టికాయలు వేస్తూనే మరో పది రోజుల గడువు ఇచ్చింది. చివరకు ఆ డబ్బు ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు నటుడు. స్టేకు నిరాకరించిన న్యాయస్థానం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో అప్పీలుకు దరఖాస్తు చేశాడు. మన్సూర్ వైఖరికి విస్తుపోయిన న్యాయస్థానం.. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించింది. డబ్బు కడతానని అంగీకరించాక ఆ తీర్పును ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఎదుటే ఏ విషయమో తేల్చుకుని రావాలని చెప్పింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. గొడవ సద్దుమణిగిందనుకుంటే ఈయన మళ్లీ మొదలుపెట్టాడేంట్రా బాబూ అని తల బాదుకుంటున్నారు సినీప్రేక్షకులు. చదవండి: థియేటర్లో హనుమాన్ చూస్తూ మహిళ వింత చేష్టలు.. వీడియో వైరల్ -
ట్రాన్స్ జెండర్పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కు భారీ ఊరట!
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్కు భారీ ఊరట దక్కింది. రూ. 4,300 కోట్ల పన్ను బకాయిలకు బదులుగా కంపెనీకి చెందిన రూ. 2,956 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను ఆదాయపు పన్ను శాఖ లిక్విడేట్ చేయడంపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. పన్ను బకాయిల కోసం నాలుగు వారాల్లోగా రూ.1,500 కోట్లు చెల్లించాలని, ఆస్తి భద్రతగా పెట్టాలని జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షఫీక్లతో కూడిన డివిజన్ బెంచ్ కాగ్నిజెంట్ను ఆదేశించింది. ఈ షరతులను పాటించడంలో విఫలమైతే కంపెనీకి ఇచ్చిన మధ్యంతర స్టే రద్దవుతుందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు రూ. 1,500 కోట్ల చెల్లించడానికి, ఆస్తిని భద్రతగా పెట్టడం కోసం బ్యాంకు డిపాజిట్లపై పెట్టిన తాత్కాలిక స్తంభనను విడుదల చేయాలని కోర్టు ఐటీ శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారం 2017-18లో కాగ్నిజెంట్ చేపట్టిన రూ.19,000 కోట్ల షేర్ బైబ్యాక్కు సంబంధించినది. ఇది వాటాదారులకు మూలధన లాభాల పన్నును మాత్రమే ఆకర్షిస్తుందని కంపెనీ వాదించగా ఆదాయపు పన్ను శాఖ.. దీనిని సేకరించిన లాభాల పంపిణీగా పరిగణించి డివిడెండ్పై వేసినట్లుగా పన్ను విధించింది. -
అయిదుగురు కలెక్టర్లకు ఈడీ నోటీసులపై హైకోర్టు స్టే
చెన్నై: తమిళనాడులోని అయిదు జిల్లాల కలెక్టర్లకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. తమ అధికార పరిధిలోని ఇసుక అక్రమ తవ్వకాల కేసులో అయిదు జిల్లాల కలెక్టర్లకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన నోటీసులపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మూడు వారాలపాటు అయిదుగురు కలెక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, విచారణకు పిలవవద్దని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సుందర్ మోహన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పు వెల్లడించింది. అయితే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై ఈడీ తన విచారణను కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ద్వారా రూ. 4,500 కోట్లు చేతులు మారినట్లు ఈడీ నిర్ధారించింది. హవాలా లావాదేవీలు, షెల్ కంపెనీలతో సహా పలు రహస్య మార్గాల ద్వారా అక్రమ నిధులు దారి మళ్లించినట్లు పేర్కొంది. ఈ కేసులో భాగంగా తమ అధికార పరిధిలో ఇసుక మైనింగ్ కార్యకలాపాలకు సంబంధించి అరియలూరు, వేలూరు, తంజావూరు, కరూర్, తిరుచిరాపల్లి జిల్లాల కలెక్టర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దర్యాప్తు సంస్థ ఈ సమన్లు జారీ చేసింది. చదవండి: Uttarakhand: రెస్క్యూ బృందాలకు 3 మీటర్ల దూరంలో కార్మికులు ఆయా జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన వివరాలతో వివిధ తేదీల్లో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కలెక్టర్ల తరపున రాష్ట్ర ప్రభుత్వ శాఖ కార్యదర్శి కె. నంతకుమార్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ సమన్లను రద్దు చేయాలని తన పిటిషన్లో కోరారు. దీనిపై తొలుత సోమవారం విచారించిన ధర్మాసనం.. ఈడీ సమన్లపై నేడు మధ్యంతర స్టే విధించింది. తదుపరి విచారణను డిసెంబర్ 21కి బెంచ్ వాయిదా వేసింది. కాగా ఈడీ నేరుగా జిల్లా కలెక్టర్లకు నోటీసులు ఇచ్చే అధికారం లేదని తమిళనాడు ప్రభుత్వం వాదిస్తోంది. ఈ విషయంలో సహయం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రమే ఈడీ అభ్యర్థించగలదని పేర్కొంది. ఈడీకి అపరిమిత అధికారం పార్లమెంట్ ఇవ్వలేదని చెబుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఇలాంటి నేరాలను దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేదని తెలిపింది. ఇదిఫెడరలిజానికి విరుద్దని పేర్కొంది. అయితే ఇసుక అక్రమ రవాణా కేసులో ప్రైవేట్ వ్యక్తులతో ప్రభుత్వ అధికారులను విచారణకు పిలిచినట్లు దర్యాప్తు సంస్థ చేబుతోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) విచారణకు సంబంధించి ఎవరికైనా సమన్లు ఇచ్చే అధికారం తమకు ఉందని పేర్కొంది. -
నేపథ్యం ఆధారంగా జడ్జీలపై ఆ ముద్రలు వేయొద్దు
న్యూఢిల్లీ: అడ్వొకేట్ లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమరి్థంచారు. విక్టోరియా గౌరీ గతంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. ఆమె బీజేపీ అభిమాని అనే పేరుంది. ఆమెను మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమె మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బార్ సభ్యులు కొందరు జస్టిస్ డీవై చంద్రచూడ్కు లేఖ రాశారు. కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరారు. విక్టోరియా గౌరీ గతంలో పలు సందర్భాల్లో క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల హార్వర్డ్ లా కాలేజీ సెంటర్ కార్యక్రమంలో మాట్లాడారు. మద్రాస్ హైకోర్టు బార్ సభ్యుల లేఖపై స్పందించారు. కొలీజియం అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుందని గుర్తుచేశారు. లాయర్లుగా ఉన్నప్పుడు వారి నేపథ్యాన్ని, వెలిబుచి్చన సొంత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జడ్జిలపై ఒక వర్గం వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరైంది కాదని అన్నారు. గొప్ప తీర్పులు వెలువరించిన జస్టిస్ కృష్ణ అయ్యర్కు కూడా రాజకీయ నేపథ్యం ఉండేదని అన్నారు. -
మంత్రులూ... అవేం మాటలు?
చెన్నై: అధికారంలో ఉన్నవారిలో సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచి్చంది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెపె్టంబర్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. ‘సనాతన ధర్మ నిర్మూలన’పేరిట జరిగిన ఆ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు అందులో పాల్గొన్న అధికార డీఎంకేకు చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా మద్దతు పలికారు. ఈ ధోరణిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు దిగే బదులు డ్రగ్స్, అవినీతి, అంటరానితనం తదితర పెడ ధోరణుల నిర్మూలనపై దృష్టి పెడితే మంచిదని వారికి సూచించింది. సదరు మంత్రులపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదంటూ పోలీసులకు తలంటింది. మంత్రుల వ్యాఖ్యలకు పోటీగా ద్రవిడ సిద్ధాంత నిర్మూలన సదస్సుకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను న్యాయమూర్తి స్టవిస్ జి.జయచంద్రన్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మ నిర్మూలన సభను ఉదాహరిస్తూ, అందుకు పోటీగా సభ పెట్టుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రులు తదితరులపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా! పిటిషనర్ విజ్ఞప్తికి అంగీకరించడమంటే సమాజంలో మరింత చీలిక తేవడమే కాదా?’’అని ప్రశ్నించారు. మంత్రుల తీరుపైనా ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతామంటూ చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతినిచ్చి వారికి శాంతిని మరింత కరువు చేయమంటారా?’’అన్నారు. నా వ్యాఖ్యలకు కట్టుబడ్డా: ఉదయనిధి చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ అంశంపై న్యాయ వివాదం తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ‘సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటిది. అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం. దాన్ని నిర్మూలించాలి‘ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త దుమారానికి దారితీయడం తెలిసిందే. అణగారిన, పీడిత వర్గాల తరఫున తనలా మాట్లాడానని ఆయన సోమవారం చెప్పుకొచ్చారు. అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి గొప్ప నేతలు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. -
‘అంబేద్కర్ చెప్పినదానికంటే నేనేం ఎక్కువ మాట్లాడలేదు’
చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానని తమిళనాడు నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంలో తమిళనాడు పోలీసులు వ్యవహరించిన తీరుపై మద్రాస్ హైకోర్టు మండిపడింది. ఉదయనిధితో పాటు పీకే శేఖర్ బాబుపై చర్యలు తీసుకోవడంలో పోలీస్ శాఖ తాత్సారం చేసిందంటూ న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పనిలో పనిగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కోర్టు తప్పుబట్టింది. అయితే.. కోర్టులో ఇవాళ జరిగిన పరిణామాలపై ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. తాను న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నానంటూ ప్రకటించారు. అంతేగానీ సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి మాత్రం తీసుకోబోనని స్పష్టం చేశారు. ‘‘నేనేం తప్పుగా మాట్లాడలేదు. మాట్లాడింది సరైందే కాబట్టి న్యాయపరంగా ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. గతంలో నేను ఇచ్చిన ప్రకటనలో ఏమాత్రం మార్పు లేదు. నేను నమ్మే సిద్ధాంతాన్నే బయటకు చెప్పా. అలాగని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చెప్పినదానికంటే ఎక్కువ మాట్లాడలేదు. పెరియార్, తిరుమవలవన్లు ఏం చెప్పారో.. అంతకంటే కూడా నేను ఎక్కువ మాట్లాడలేదు. నేను ఎమ్మెల్యే అయినా, మంత్రిని అయినా, యువ విభాగపు నేతను అయినా.. రేపు పదవుల్లో లేకపోయినా ఫర్వాలేదు. కానీ, మనిషిగా ఉండడమే నాకు ముఖ్యం. నీట్ అంశం ఆరేళ్లనాటిది. కానీ, సనాతన ధర్మం వందల ఏళ్లనాటి అంశం. కాబట్టి, సనాతన ధర్మాన్ని ఎప్పటికీ మేం వ్యతిరేకిస్తూనే ఉంటాం అని స్టాలిన్ పేర్కొన్నారు. సెప్టెంబర్లో ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోలుస్తూ దానిని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. అది సామాజిక న్యాయం, సమానత్వానికి వ్యతిరేకమని నాటి ప్రసంగంలో పేర్కొన్నారాయన. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. డీఎంకేపై బీజేపీ అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఇవాళ్టి కోర్టులో.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల విషయంలో తమిళనాడు పోలీసులు సరైన రీతిలో స్పందించలేదని.. చర్యలు తీసుకోలేని మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. ఆపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘‘అధికారంలో ఉన్న ఓ వ్యక్తి మతాలు, కులాలు, సిద్ధాంతాల పేరిట అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బదులుగా అవినీతి, అంటరానితనం సామాజిక రుత్మతలనో లేదంటే ఆరోగ్యాన్ని పాడు చేసే మాదకద్రవ్యాలు, మత్తుపానీయాలనో నిర్మూలించాలని ప్రకటన చేయడం సరైందని ఈ న్యాయస్థానం అభిప్రాయపడుతుంది. విభజన ఆలోచనలను ప్రోత్సహించడానికి లేదంటే ఏదైనా భావజాలాన్ని రద్దు చేయడానికి ఏ వ్యక్తికి హక్కు ఉండదు. ఉదయనిధిపై చర్యలు తీసుకోకపోవడంలో పోలీస్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని అని జస్టిస్ జీ జయచంద్రన్ వ్యాఖ్యానించారు. -
లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తాజాగా నటించిన చిత్రం లియో. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా కాస్తా రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పటికే ఈ సినిమా బెనిఫిట్ షోలకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించింది. కేవలం ఉదయం 9 గంటల తర్వాతే షో వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై లియో మేకర్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. (ఇది చదవండి: వివాదంలో ‘లియో’.. మద్దతుగా రజనీకాంత్!) దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది. ఉదయం 9 గంటల తర్వాతే స్క్రీనింగ్ మొదలయ్యేలా అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో విజయ్ అభిమానులు నిరాశకు గురయ్యారు. రిలీజ్ మొదటి రోజు లియో స్క్రీనింగ్ తమిళం కంటే తెలుగులోనే ముందుగా మొదలు కానుంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉదయం ఐదు గంటలు, ఏడు గంటలకు సినిమాను ప్రదర్శించనున్నారు. కాగా.. లియో సినిమాలో సంజయ్దత్, అర్జున్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్రిష హీరోయిన్గా నటిస్తోంది. కాగా.. లియో మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. (ఇది చదవండి: 'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!) -
రిలీజ్కు ముందు హైకోర్టుకు లియో మేకర్స్.. ఎందుకంటే?
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం లియో. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మూడు రోజుల్లో సినిమా రిలీజవుతుండగా.. తాజాగా చిత్రబృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి) తమిళనాడులో సినిమా విడుదలైన మొదటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సినిమాను ప్రదర్శించేందుకు అనుమతించాలని లియో మేకర్స్ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 24 వరకు ఉదయం 7 గంటలకు లియో షోలను అనుమతించాలని నిర్మాతలు కోర్టును అభ్యర్థించారు. కాగా.. చిత్ర నిర్మాతల పిటిషన్పై అక్టోబర్ 17న విచారణ చేపట్టనున్నట్లు మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. అదనపు షోలకు అనుమతి అయితే ఇప్పటికే లియో చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం మొదటి ఆరు రోజుల పాటు ఒక అదనపు షో ప్రదర్శనకు అనుమతి మంజూరు చేసింది. ఈ సినిమా మొదటి షోకు ప్రదర్శనకు ఉదయం 9 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే రిలీజైన లియో ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్తో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయ్ దళపతి మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. 2021లో విడుదలైన మాస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్, విజయ్ల కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం లియో. ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, హెరాల్డ్ దాస్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మాయ ఎస్ కృష్ణన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్ తల్లి) -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
విశాల్కు కోర్టు అక్షింతలు
నటుడు విశాల్కు చైన్నె ప్రత్యేక న్యాయస్థానం అక్షింతలు వేసింది. కోర్టు ధిక్కార కేసు వేయాలంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలు.. సినీ ఫైనాన్షియర్ అన్బుచెలియన్ వద్ద తీసుకున్న అప్పును లైకా ప్రొడక్షన్స్ సంస్థ చెల్లించింది. అందుకుగాను నటుడు విశాల్ నిర్మించే చిత్రాల హక్కులను తమ సంస్థకు చెందిన అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయితే ఆ మొత్తాన్ని విశాల్ లైకా సంస్థకు తిరిగి చెల్లించకపోగా ఆ మధ్య విశాల్ కథానాయకుడిగా నటించి, నిర్మించిన వీరమే వాగై చుడుమ్ చిత్రాన్ని నిబంధనలను మీరి వేరే సంస్థకు విక్రయించారు. దీంతో లైకా ప్రొడక్షన్న్స్ విశాల్పై మద్రాసు హైకోర్టులో దాఖలు చేసింది. ఈ కేసు విచారించిన న్యాయమూర్తి విశాల్ ఆస్తుల వివరాలను బ్యాంక్ ఖాతాల వివరాలను కోర్టులో సమర్పించాలని ఆదేశించారు. దీంతో విశాల్ ఈ కేసుపై రిట్ పిటిషన్ దాఖలు వేశారు. అయితే డివిజన్ బెంచ్ కొట్టేసింది. అంతేకాకుండా విశాల్ కథానాయకుడు నటించిన మార్క్ ఆంటోని చిత్ర విడుదలపై స్టే విధించారు. ఆ తర్వాత లైకా సంస్థ దాఖలు చేసిన పిటిషన్ న్యాయమూర్తి ఆషా సమక్షంలో గతవారం విచారణకు వచ్చింది. అప్పుడు న్యాయమూర్తి విషయాలకు తన ఆస్తులు బ్యాంక్ ఖాతాల వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించి తర్వాత విచారణ ఈనెల 19వ తేదీకి వాయిదా వేశారు. అయితే 19వ విశాల్ తన ఆస్తుల వివరాలు కోర్టుకు సమర్పించకపోవడంతో పాటు ఆయనగానీ ఆయన తరఫు న్యాయవాది గానీ కోర్టుకు హాజరు కాలేదు. కాగా ఈ కేసు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చింది. నటుడు విశాల్ ఆయన తరఫున జూనియర్ న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. దీంతో విశాల్ తన ఆస్తులను కోర్టులో పెట్టకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ కావాలనే కోర్టు ఆదేశాలను నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అక్షింతలు వేశారు.ఇది కోర్టు ధిక్కార కేసు కింద వస్తుందని హెచ్చరించారు. దీంతో విశాల్ తరఫున హాజరైన జూనియర్ న్యాయవాది ఆస్తుల వివరాలను గురువారమే కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. అయితే అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అన్న న్యాయమూర్తి ప్రశ్నకు తమ సీనియర్ న్యాయవాది హాజరై ఆ వివరాలను తెలియజేస్తారని బదులిచ్చారు దీంతో న్యాయమూర్తి విచారణను కొద్దిసేపు వాయిదా వేశారు. -
మాటలు జాగ్రత్త.. విద్వేషాలను రెచ్చగొట్టకూడదు
చెన్నై: ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరుస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరి ప్రాధమిక హక్కే కానీ అది ద్వేషపూరితంగా ఉండకూడదని తెలిపింది. బాధ్యతలను తెలియజేసేది.. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థులు సనాతన ధర్మంపై వ్యతిరేకత గురించి డిబేట్ కార్యక్రమాన్ని నిర్వహించడంపై ఎలాంగోవన్ వేసిన పిటిషన్పై మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ శేషసాయి మాట్లాడుతూ.. సనాతన ధర్మం అనేది మన దేశం, మన పరిపాలకులు, తల్లిదండ్రులు, గురువుల పట్ల మన శాశ్వత బాధ్యతను గుర్తుచేసే ధర్మాల సమూహమని పేదల పట్ల దయ చూపించమని చెబుతుందని అన్నారు. సనాతన ధర్మంపై డిబేట్లా.. ఈ సందర్బంగా ఆయన సనాతన ధర్మంపై డిబేట్లు పెట్టడంపై మరింత తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మం కులవ్యవస్థను ప్రోత్సహించి అంటరానితనాన్ని ప్రేరేపిస్తుందన్న అసత్యాన్ని ప్రజల మనసుల్లో నాటే ప్రయత్నం చేయడాన్ని ఆయన ఖండించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనాన్ని ఎప్పుడో నిర్మూలించడం జరిగిందని గుర్తుచేశారు. మనుషులంతా ఒక్కటే.. ఈ దేశంలో అందరూ ఒక్కటేనని ఇటువంటి దేశంలో అంటరానితనాన్ని సహించేది లేదని అన్నారు. మతం అనేది సహజమైన కల్మషంలేని స్వచమైన విశ్వాసం అనే పునాది మీద నిర్మితమైందని భావ ప్రకటన స్వేచ్ఛ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండకూడదని అన్నారు. ఇది కూడా చదవండి: ICMR: కరోనా కంటే నిఫాతోనే మరణాల రేటు ఎక్కువ -
స్టార్ హీరో కేసులో హైకోర్టు కీలక తీర్పు.. ఆ డబ్బు!
స్టార్ హీరోకు- నిర్మాతకు మధ్య ఓ వివాదం. ఈ విషయం హైకోర్టు వరకు వెళ్లింది. గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన దీనిపై తాజాగా న్యాయాస్థానం తీర్పు ఇచ్చింది. సదరు హీరో.. దాదాపు కోటి రూపాయల మొత్తాన్ని నిర్మాతకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది. ఇంతకీ ఏం జరిగింది? అసలా హీరో ఎవరు? జరిగింది ఇదే తమిళ నటుడు శింబు గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. అప్పట్లో 'వల్లభ, 'మన్మథ' లాంటి డబ్బింగ్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు. కానీ తర్వాత కేవలం తమిళం వరకే పరిమితయ్యాడు. ఇతడు కొన్నేళ్ల ముందు వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థలో ఓ సినిమా కోసం రూ.9.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటానని ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ కింద రూ.4.5 కోట్ల అందుకున్నాడు. కోటి రూపాయలు బ్యాంక్ ద్వారా చెల్లించగా, మిగిలిన మొత్తం డబ్బుగా ఇచ్చారు. (ఇదీ చదవండి: విజయ్ సేతుపతికి ఇంత పెద్ద కూతురు ఉందా?) ఎందుకు గొడవ? అయితే అడ్వాన్స్ తీసుకున్న శింబు.. సినిమా చేసే విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదు. దీంతో వేల్స్ నిర్మాణ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఇరువురి వాదనలు విన్న మద్రాసు హైకోర్టు.. బ్యాంక్ ద్వారా చెల్లించిన కోటి రూపాయల్ని నిర్మాణ సంస్థకు తిరిగిచ్చేయాలని ఆదేశించింది. మిగిలిన మూడున్నర కోట్ల రూపాయలకు సరైన ఆధారాలు లేని కారణంగా అవి తిరిగివ్వాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. క్లారిటీ మిస్ ఈ విషయం తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారినప్పటికీ.. శింబు సన్నిహితులు లేదా పీఆర్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి ఏమైనా వెళ్తారా? రాజీ కుదుర్చుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఈ మధ్యే 'పాతు తలా' మూవీతో వచ్చిన శింబు హిట్ కొట్టాడు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్కి గ్లోబల్ వైడ్ క్రేజ్.. ఎలా సాధ్యమైంది?) -
తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే!
తండ్రికీ కావాలి ప్రసూతి సెలవు తల్లికి ప్రసూతి సెలవు ఇస్తున్నట్టే తండ్రికి కూడా ప్రసూతి సెలవు ఇవ్వడం గురించి ఆలోచించే సమయం వచ్చేసిందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య ప్రసవ సమయంలో బాలింతను, నవజాత శిశువును చూసుకోవడానికి తండ్రికి సెలవు ఇవ్వకతప్పదని, ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు శాసనపరమైన చట్టాలు తేవాలని జస్టిస్ విక్టోరియా గౌరి సూచించారు. నిజమే. తండ్రికి సెలవు భార్యభర్తల మధ్య అనేక చికాకులను దూరం చేయగలదు. ఒక పరిశీలన. బిడ్డకు జన్మనివ్వడమంటే సమాజానికి కొత్త సభ్యుణ్ణి ఇవ్వడమే. పుట్టిన బిడ్డ తల్లిదండ్రులకు సంతానం కావచ్చు కాని సమాజానికి ప్రతినిధే. బిడ్డకు సురక్షితంగా జన్మనివ్వడంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతో, ఆ తల్లిదండ్రులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో సమాజానిదీ అంతే బాధ్యత. కనేందుకు ఆస్పత్రి, పెంచేందుకు తండ్రికి కనీస ఆదాయం లేకపోతే సమాజం తప్పవుతుంది. గతంలో స్త్రీ ఇంటి పట్టునే ఉండేది. ఉమ్మడి సంసారాల్లో కాన్పులకు సులువుగా సాయం దొరికేది. కాని ఇప్పుడు ఇలా తాళి కడితే అలా విడిగా కాపురం పెట్టే పరిస్థితులు వచ్చాయి. దానివల్ల పిల్లల్ని కనడం, పెంచడం చాలా పెద్ద బాధ్యతగా మారింది తల్లిదండ్రులకు. ఉద్యోగం చేసే స్త్రీలకు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ప్రసూతి సెలవులు మంజూరు అవుతున్నా ఆ స్త్రీలకు, పుట్టిన శిశువులకు కాన్పు సమయంలో తోడుగా ఉండాల్సిన పురుషులకు మాత్రం సెలవు గురించి ఇంకా ఆలోచన రావడం లేదు. సమాజం ఇంకా అంత‘నాగరికం’గా ఆలోచించడం లేదు. కాని తాజా ఘటన ఈ అంశాన్ని చర్చకు తెచ్చింది. కోర్టుకెక్కిన తండ్రి తమిళనాడులోని తెన్కాశీలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న బి.శరవణన్ తన భార్యకు కాన్పు సమయంలో తోడు ఉండేందుకు 90 రోజుల సెలవు అడిగాడు. దానికి కారణం అతని భార్య ఐ.వి.ఎఫ్. ద్వారా గర్భం దాల్చడమే. ఐ.వి.ఎఫ్.ద్వారా గర్భం దాల్చితే కాన్పు అయ్యేంత వరకూ జాగ్రత్తగా ఉండాలి. అందుకే సెలవు అడిగాడు. పరిస్థితి విన్న అధికారులు శాంక్షన్ చేశారు. కాని ఆ సెలవు ఉపయోగంలోకి రాక ముందే అతను విధుల్లో లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని సెలవు కేన్సిల్ చేశారు. దాంతో శరవణన్ కోర్టుకు వెళ్లాడు. డెలివరీ డేట్ మే 30 కనుక కోర్టు మే 1 నుంచి సెలవు ఇమ్మంది. అధికారులు 30 రోజులు సెలవు మంజూరు చేశారు. కాని డెలివరీ మే 31న జరిగింది. దాంతో మే 31న శరవణన్ విధులకు హాజరు కాలేకపోయాడు. అంతే కాదు సెలవు పొడగింపును కోరాడు. అధికారులు సెలవును పొడిగించకపోగా చెప్పాపెట్టకుండా విధులకు హాజరుకానందున ఎందుకు చర్య తీసుకోకూడదో జూన్ 22న వచ్చి వ్యక్తిగతంగా సంజాయిషీ ఇమ్మని ఆదేశించారు. ఆ ఆదేశాలను శరవణన్ హైకోర్టులో సవాలు చేశాడు. కోర్టు ఆ ఆదేశాలను కొట్టేస్తూ మగవారికి కూడా ప్రసూతి సెలవలు అవసరమని అభిప్రాయపడింది. ఆందోళన లేకుండా కాన్పు సమయంలో భార్యకు ఎంత ఆందోళన ఉంటుందో భర్తకూ అంతే ఆందోళన ఉంటుంది. రెండు ప్రాణాలు పరీక్ష సమయాన్ని ఎదుర్కొనే వేళ సహజంగానే లేబర్ రూమ్ బయట పురుషుడు ఒత్తిడికి లోనవుతాడు. అదొక్కటే కాదు బిడ్డ పుట్టాక భార్యకు శక్తి వచ్చే వరకు, బిడ్డ కుదుట పడేవరకు ఇంట్లో పనులు ఎన్నో ఉంటాయి. ఆస్పత్రుల చుట్టూ తిరుగుళ్లు ఉంటాయి. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంటి నుంచి ఫోన్ రాగానే కంగారు పడుతూ భర్తలు ఆ సమయంలో వేదన అనుభవిస్తారు. మరోవైపు తోడుండాల్సిన భర్త ఇంటి పట్టున లేకపోతే, డబ్బు సంపాదన ఎంత తప్పనిసరి అయినప్పటికీ, భార్యకు నిస్పృహ రావడం సహజం. రాత్రిళ్లు చంటి పిల్లల ఏడ్పు వల్ల ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లాల్సిన భర్త నిద్ర చెడి చిరాకు పడితే ఆ గొడవ కాస్తా విడాకుల వరకు వెళ్లిన కేసులెన్నో. అందువల్ల భార్యతో పాటు భర్తకు సెలవులు ఇవ్వడం ఎంతో అవసరం. ‘కనేది ఆమె అయితే ఇతనికేం నొప్పి’ అని హేళన చేసే రోజులు పోయాయి. ఈ బిజీ రోజుల్లో మనిషి తోడు కష్టమైన రోజుల్లో భర్తకు భార్య, భార్యకు భర్త ఒకరికొకరై సంతానాన్ని సాకాలంటే ఇలాంటి నాగరికమైన ఆలోచనలు తప్పక చేయాల్సిందే. సమయం వచ్చేసింది మద్రాసు హైకోర్టులో ఈ కేసును విన్న జస్టిస్ ఎల్.విక్టోరియా మేరి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల్లో మగవారికి ప్రసూతి సెలవులు తప్పనిసరి చేస్తూ చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమస్యకు స్పందించాల్సిన సమయం వచ్చేసిందని అన్నారు. ‘పిల్లల్ని కని, పెంచడంలో స్త్రీ, పురుషులిరువురికీ సమాన బాధ్యత ఉంటుంది. ప్రపంచంలోని అనేక దేశాలు ప్రసూతి సమయంలో తల్లితోపాటు తండ్రికీ సెలవులు ఇస్తున్నాయి. అవి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రమాణాలకు సరితూగకపోయినా ఏదో ఒక మేరకు ఇస్తున్నాయి. మన దేశంలో సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ (1972) ప్రకారం భార్య ప్రసూతి సమయంలో పురుషులకు లీవ్ పెట్టే వీలు ఉంది. కాని ఆ రూల్స్ చాలా రాష్ట్రాల్లో అమలు కావడం లేదు’. –జస్టిస్ విక్టోరియా గౌరి, మద్రాసు హైకోర్టు (చదవండి: పొల్యూషన్కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్లు, ఆభరణాలు) -
ఐపీఎల్ బ్యాన్ చేయాలి.. కోర్టులో దాఖలైన పిటిషన్
సాక్షి, చైన్నె: ఐపీఎల్ మ్యాచ్లకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ విషయంపై బీసీసీఐను ఆశ్రయించాలని పిటిషనర్, ఐపీఎస్ అధికారికి హైకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ సూచించింది. వివరాలు.. ఐపీఎల్ మ్యాచ్ల క్రికెట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్న విషయం తెలిసిందే. భారత్లో జరిగే ఈ మ్యాచ్లను చూసేందుకు స్టేడియాలకు తండో పతండాలుగా అభిమానులు తరలిరావడం జరుగుతోంది. అదే సమయంలో ఈ మ్యాచ్లు అన్ని ఫిక్సింగ్, బెట్టింగ్లతో జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ బెట్టింగ్లు, ఫిక్సింగ్లకు వ్యతిరేకంగా ఐపీఎస్ అధికారి సంపత్కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఐపీఎల్ మ్యాచ్లను బెట్టింగ్, ఫిక్సింగ్ పూర్తిగా కట్టడి అయ్యే వరకు నిర్వహించకూడదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్ గురువారం హైకోర్టు సీజే గంగా పుర్వాల, న్యాయమూర్తి ఆదికేశవులు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. వాదనల అనంతం ఈ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. బెట్టింగ్, ఫిక్సింగ్ ఫిర్యాదులను బీసీసీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. చదవండి సీమా, అంజూ.. ఇప్పుడు జూలీ.. సరిహద్దులు దాటిన ప్రేమలో బిగ్ ట్విస్ట్.. -
తమిళనాట మరో ట్విస్ట్.. అన్నాడీఎంకేకు షాక్!
చెన్నై: తమిళనాడులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. అన్నాడీఎంకే ఎంపీ ఓపీ రవీంద్రనాథ్కు షాక్ తగిలింది. తేనీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆయన ఎన్నిక చెల్లదంటూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో ఆయన ఎన్నికను హైకోర్టు రద్దు చేసింది. వివరాల ప్రకారం.. పన్నీరు సెల్వం కుమారుడు రవీంద్రనాథ్కు ఎదురుదెబ్బ తగలింది. పార్లమెంట్ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి ఎంపీగా గెలుపొందిన రవీంద్రనాథ్ ఎన్నికను రద్దు చేస్తూ మద్రాస్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే, ఎన్నికల్లో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి ఈవీకేఎస్ ఎలంగోవన్పై 76,672 ఓట్ల ఆధిక్యతతో రవీంద్రనాథ్ గెలుపొందారు. కాగా, ఆయన ఎన్నికపై మిలానీ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల సందర్భంగా రవీంద్రనాథ్ ఆస్తులకు సంబంధించి తప్పుడు పత్రాలు ఇచ్చారని ఆరోపించారు. అలాగే, గెలుపు కోసం అవినీతికి పాల్పడినట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక, ఈ పిటిషన్పై కోర్టులో విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఆయన ఎన్నికను మద్రాస్ హైకోర్టు రద్దు చేస్తున్నట్టు తీర్పు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే నుంచి రవీంద్రనాథ్ 2022లో పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి నుంచి రవీంద్రనాథ్ మాత్రమే గెలుపొందడం గమనార్హం. డీఎంకే-కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలోని మొత్తం 39 సీట్లలో 38 గెలుచుకుంది. ఇది కూడా చదవండి: ఎన్సీపీ విద్యార్ధి నాయకుల వినూత్న పోస్టర్ -
సుప్రీం కోర్టులో కనిమొళికి భారీ ఊరట
ఢిల్లీ: డీఎంకే నేత కనిమొళి కరుణానిధికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎంపీగా ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను .. సుప్రీం కోర్టు కొట్టేసింది. ఆమె ఎన్నిక సమర్థనీయమేనని తీర్పు ఇచ్చింది. 2019 ఎన్నికల సమయంలో తూతుక్కుడి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కనిమొళి. అయితే ఆమె ఎన్నికను సవాల్ చేస్తూ సనాతన కుమార్ అనే ఓటర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. నామినేషన్ సమయంలో.. ఎలక్షన్ అఫిడవిట్లో కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సరిగా పొందుపర్చలేదని, మరీ ముఖ్యంగా భర్త పాన్ నెంబర్ను జత చేయలేదని అభ్యంతరం వ్యక్తం చేశాడతను. అయితే.. తన భర్త సింగపూర్ పౌరుడని, ఆయనకు పాన్ నెంబర్ ఉండదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను కొట్టేయాలని ఆమె అభ్యర్థించారు. కానీ, మద్రాస్ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఈ తరుణంలో ఆమె సుప్రీంను ఆశ్రయించారు. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం 2020, జనవరిలో స్టే విధించింది. ఇవాళ(గురువారం) ఆ పిటిషన్ విచారణకు రాగా.. ఎలక్షన్కు సంబంధించిన పిటిషన్ను కొట్టేస్తూ.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలను పరిశీలించాలన్న కనిమొళి అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు జస్టిస్ అజయ్ రాస్తోగి, జస్టిస్ బేలా త్రివేది నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. ఇదీ చదవండి: ఇలాంటివి చూసేందుకే అంత కష్టపడ్డామా? -
డైరెక్టర్ లింగుస్వామికి ఊరట.. జైలు శిక్షపై స్టే
ప్రముఖ దర్శకుడు లింగుస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. చెక్బౌన్స్ కేసులో ఆయనపై కిందికోర్టు విధించిన 6నెలల జైలు శిక్షపై స్టే విధించింది. వివరాల్లోకి వెళితే.. లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ కలిసి కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని భావించారు. చదవండి: యాంకర్ అనసూయ 'ప్రేమ విమానం'కు మహేశ్బాబు సపోర్ట్ ఇందుకోసం 2014లో పీవీపీ కేపిటల్స్ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు.చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. కేసును విచారించిన అనంతరం కోర్టు లింగుస్వామికి, ఆయన సోదరుడికి 6 నెలల జైలు శిక్షను విధించింది. కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ లింగుస్వామి హైకోర్టును ఆశ్రయించడంతో జైలు శిక్షపై స్టే విధించింది. చదవండి: 'పుష్ప-2' సెట్స్లో జూ.ఎన్టీఆర్.. వైరల్గా మారిన ఫోటో -
‘రుద్రన్’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
తమిళసినిమా: నటుడు, నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్, ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం రుద్రన్. ఫైవ్స్టార్ కదిరేశన్ నిర్మించిన చిత్రం ఇది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్ర విడుదలను నిషేధించాలని చిత్ర హిందీ డబ్బింగ్ హక్కులను పొందిన రేవంశు గ్లోబల్ వెంచర్స్ సంస్థ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. అందులో రుద్రం చిత్ర నిర్మాత హిందీ అనువాద హక్కుల కోసం మరో రూ.4 కోట్లు అదనంగా డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీజేషన్ విచారించిన న్యాయస్థానం చిత్రాన్ని ఈ నెల 24 వరకు విడుదల చేయాలంటూ తాత్కాలిక స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాత హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం రుద్రన్ చిత్రం విడుదలపై స్టేను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ చిత్రం ముందుగా ప్రకటించిన విధంగా శుక్రవారం తెరపైకి రానుంది. -
వారియర్ డైరెక్టర్కు 6 నెలల జైలు శిక్ష
ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! తాజాగా ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కాగా కొన్నేళ్ల క్రితం కార్తీ, సమంత హీరోహీరోయిన్లుగా ఎన్ని ఇజు నాల్ అనే సినిమా తెరకెక్కించాలని లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్ భావించారు. ఇందుకోసం పీవీపీ క్యాపిటల్ కంపెనీ నుంచి రూ.35 లక్షలు అప్పు తీసుకున్నారు. చివరకు ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో తీసుకున్న డబ్బునంతటినీ చెక్ రూపంలో తిరిగిచ్చారు. కానీ ఆ చెక్ బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టుమెట్లెక్కింది. గతేడాది ఆగస్టులో ఈ కేసును విచారించిన న్యాయస్థానం లింగుస్వామికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ, రిట్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సమయమిచ్చింది. దీంతో డైరెక్టర్ రూ.10 వేలు కోర్టుకు అపరాధ రుసుం చెల్లించి అనంతరం అప్పీల్ దాఖలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా బుధవారం (ఏప్రిల్ 12న) ఈ కేసును మరోసారి విచారించిన మద్రాస్ హైకోర్టు లింగుస్వామికి విధించిన ఆరు నెలల జైలు శిక్షను సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో డైరెక్టర్ జైలు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తీర్పును ట్విటర్లో షేర్ చేసిన లింగుస్వామి మరోసారి అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు. కాగా లింగుస్వామి చివరిగా రామ్ పోతినేనితో వారియర్ సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. pic.twitter.com/aJujcEr01m — Lingusamy (@dirlingusamy) April 13, 2023 -
విశాల్కు హైకోర్టు షాక్.. రూ. 15 కోట్లు చెల్లించాలంటూ ఆదేశం
స్టార్ హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. రూ. 15 కోట్ల రూపాయలు శాశ్వత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ కోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. అలా చేయని పక్షంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫిలిం ఫ్యాక్టరీలో తెరకెక్కే సినిమాలు రిలీజ్ కాకుండ నిషేధం విధించింది. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కేసులో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కాగా గతంలో విశాల్ ఓ తన నిర్మాణ సంస్థ(ఫలిం ఫ్యాక్టరి) కోసం ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బుచెళియన్ వద్ద రూ. 21. 29 కోట్లు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ రుణాన్ని లైకా ప్రొడక్షన్స్ ఫైనాన్షియర్కు తిరిగి చెల్లించింది. అయితే, తమకు రుణం చెల్లించేంత వరకు విశాల్ నటించే చిత్రాల పంపిణీ హక్కులన్నీ తమకే ఇచ్చేలా విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ - లైకా ప్రొడక్షన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘిస్తూ తన చిత్రం ‘వీరమే వాగై సూడుం’ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దీంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జ్ స్పెషల్ కోర్టు దీంతో లైకా సంస్థ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన సింగిల్ జడ్జి స్పెషల్ కోర్టు రిజిస్ట్రార్ పేరుతో రూ.15 కోట్లను మూడు వారాల్లో శాశ్వత డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణ సమయంలో విశాల్ నేరుగా కోర్టుకు హాజరై.. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించడం వల్లే రుణం చెల్లించలేకపోయాయని, పైగా తనకు ఒకే రోజున రూ.18 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్టు కోర్టుకు తెలిపారు. దీంతో విశాల్ ఆస్తుల వివరాలను ప్రమాణ పత్రంలో సమర్పించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ విశాల్ హైకోర్టులో అప్పీల్ చేయగా, దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజా, జస్టిస్ భరత చక్రవర్తిల సారథ్యంలో ధర్మాసనం విచారణ జరిపి.. గతంలో రూ.15 కోట్లను విశాల్ చెల్లించాలంటూ సింగిల్ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. పైగా ప్రత్యేక జడ్జి తుది తీర్పును వెలువరించేంత వరకు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై నిర్మించే చిత్రాలు థియేటర్ లేదా ఓటీటీలో విడుదల చేయడానికి వీలులేదని ధర్మాసనం ఆదేశించింది. -
ఆ వైభవం తిరిగొస్తుందా?
గత అక్టోబర్లో యాభై ఏళ్ళు నిండినప్పుడు అందరూ ఆగిచూసిన దక్షిణాది ప్రాంతీయ పార్టీ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకె)కు మంచి రోజులు రానున్నాయా? అప్పట్లో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకె)తో సరిపడక హీరో ఎమ్జీఆర్ బయటకొచ్చి స్థాపించిన ఈ పార్టీపై పట్టు కోసం కోర్టులో పోరు కొలిక్కి వచ్చినట్టేనా? పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్నీ, తన ప్రత్యర్థి – మాజీ సీఎం ఈడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్నీ సవాలు చేస్తూ మాజీ సమన్వయకర్త ఓ. పన్నీర్సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్ట్ మంగళవారం తోసిపుచ్చింది. కోర్టులో ఓపీఎస్కు ఎదురుదెబ్బ ఇది వరుసగా మూడోసారి. తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉన్నా, ఆయన రాజకీయ పునరాగమనానికి దారులు మూసుకుపోతున్నట్టే అనిపిస్తోంది. కేడర్పై విస్తరించిన పట్టు, కీలక స్థానాల్లో నమ్మినబంట్ల నియామకం, సమర్థ పరిపాల కుడిగా సాధించిన పేరు, తాజా కోర్టు తీర్పుతో... పార్టీ పగ్గాలు ఈపీఎస్ చేతికి దాదాపు వచ్చినట్టే. ఇది పార్టీ పునర్వైభవానికి దోహదమవుతుందా అన్నదే ఇక మిగిలిన ప్రశ్న. అధినేత్రి జయలలిత మరణానంతరం క్రమంగా కష్టాల్లో పడ్డ అన్నాడీఎంకె గత రెండేళ్ళలో తేవర్లు, గౌండర్లు, వగైరా కులాల కుంపట్లతో ఒకటికి నాలుగు (ఈపీఎస్, ఓపీఎస్, పదవీచ్యుత ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె మేనల్లుడు – ఏఎంఎంకె అధినేత టీటీవీ దినకరన్) వర్గాలైంది. సాంప్రదాయికంగా అన్నాడీఎంకెకు పట్టున్న రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో నిరుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకె పాగా వేసింది. మహిళలు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ క్రమంగా చెదిరిపోతోంది. ఈపీఎస్, ఓపీఎస్ శిబిరాల మధ్య పోరుతో పార్టీ దశ, దిశ కోల్పోయి బలహీనపడ్డ సమయంలో కోర్ట్ తీర్పు అయాచిత వరమే. పేరుకు ప్రధాన ప్రతిపక్షమైనా వర్గ విభేదాలు, పార్టీకి సారథి ఎవరో తెలియని అయోమయం, ఎన్నికల చిహ్నం రెండాకులపై పోరాటం సాగుతున్న వేళ ఈ తీర్పు పార్టీ ప్రస్థానానికి దిశానిర్దేశమే. కోర్టు ఆదేశాలు ఈపీఎస్ వర్గానికి నైతికంగా పెద్ద అండ. నిజానికి, దివంగత జయలలితనే పార్టీ శాశ్వత అధినేత్రిగా ప్రకటించాలన్నది ఓపీఎస్ వర్గం దీర్ఘకాలిక డిమాండ్. ఇప్పుడీ తీర్పుతో వారి డిమాండ్కు గండిపడింది. ఈపీఎస్ మద్దతుదారులు తమ నేతను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని, పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ ఫిబ్రవరిలో సుప్రీం కోర్ట్ సానుకూలంగా ఇచ్చిన తీర్పూ వారికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పార్టీ జనరల్ కౌన్సిల్లో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యుల మద్దతు ఈపీఎస్కే ఉంది గనక ఈపీఎస్ యథేచ్ఛగా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవచ్చు. సదరు సమావేశాల్లో పార్టీలో ఓపీఎస్ లాంటి ప్రత్యర్థుల్ని ఇంటికి సాగనంపుతూ తీర్మానాలు చేసే వీలు చిక్కుతుంది. అవసరాన్ని బట్టి పార్టీ రాజ్యాంగాన్నీ సవరించుకోవచ్చు. ఇవన్నీ ఈపీఎస్కు కలిసొచ్చే అంశాలు. ఇల్లలకగానే పండగ కాదనట్టు ఈపీఎస్కు అనేక సవాళ్ళు ముందున్నాయి. దాదాపు 1.5 కోట్ల మంది కార్యకర్తలున్న పార్టీని ఒంటరి దళపతిగా ఆయన ముందుకు నడపాలి. పార్టీకి మునుపు సారథ్యం వహించిన ఎమ్జీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలకున్న ఇమేజ్, ప్రాచుర్యం ఈపీఎస్కు లేవు. వారిలా జనాకర్షణ, మాటే శాసనంగా పార్టీని నడిపే పట్టు ఆయన నుంచి ఆశించలేం. సొంత గూటి సంగతి పక్కన పెడితే, ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకెతో ఢీ అంటే ఢీ అనాలంటే ముందుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జనంలో పార్టీపై నమ్మకం పెంపొందించాలి. మరోపక్క 2019 లోక్సభ ఎన్నికల్లో, 2021 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో విజయాలతో డీఎంకెను ముందుకు నడిపిన ఘనత స్టాలిన్ది. బలమైన ఈ ప్రత్యర్థితో తలపడడం ఈపీఎస్కు ఈజీ కాదు. తమిళ రాజకీయాలెప్పుడూ డీఎంకె, అన్నాడీఎంకెల మధ్య... కరుణానిధి, జయలలితల మధ్య ఊగడం రివాజు. ఆ రాజకీయ దృశ్యం ఇప్పుడు గణనీయంగా మారింది. చిరకాలంగా తమిళ రాజకీయాలకు దిక్సూచైన ద్రావిడ సిద్ధాంతం క్రమంగా కుంచించుకుపోతోంది. ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను (గవర్నర్ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై) 2021లో బరిలోకి దింపి, డీఎంకె వ్యతిరేక, హిందూత్వ జాతీయవాద వైఖరితో బీజేపీ కాలు దువ్వుతోంది. అలాగే, జయ మరణానంతరం అన్నాడీఎంకెకు పెద్దన్నగా వ్యవహరించిన బీజేపీ... ఆ పార్టీ బలహీనతల్ని వాటంగా చేసుకొని, జయ వదిలివెళ్ళిన స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా తాను కూర్చోవాలని శతధా ప్రయత్నిస్తోంది. పక్కనే పొంచివున్న ఈ ముప్పు పట్ల ఈపీఎస్ జాగరూకత వహించి, సమర్థంగా ఎదుర్కోవాలి. ఒక్కమాటలో– 39 పార్లమెంటరీ స్థానాలున్న తమిళనాట రానున్న 2024 లోక్సభ ఎన్నికలు ఈపీఎస్కు తొలి పెద్ద పరీక్ష. దానిలో పార్టీని బలంగా నిలబెట్టి, తర్వాత మరో రెండేళ్ళకు వచ్చే 234 స్థానాల శాసనసభా సమరంలో అధికారం చేజిక్కించుకునేలా పోరాడాలి. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె కూటమి 159 స్థానాలు సాధిస్తే, 75 సీట్లకే పరిమితమైన అన్నాడీఎంకె కూటమి ఆ లెక్కను తిరగరాయాలి. అదే జరిగితే అధినేతగా ఈపీఎస్కు తిరుగుండదు. లేదంటే, అన్నాడీఎంకెలో మరోసారి అసమ్మతి స్వరాలు పైకొస్తాయి. రిటైరయ్యానని ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళను మళ్ళీ తెర పైకి తేవాలనే మాటలు వినిపిస్తాయి. అందుకే, రాగల మూడేళ్ళ కాలం ఈపీఎస్కు పరీక్షా సమయం. మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఆయనకైనా, అన్నాడీఎంకెకైనా భవిష్యత్తు! -
పన్నీర్ సెల్వంకు భారీ షాక్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేలో వర్గ పోరులో.. కోర్టు తీర్పు ద్వారా పళనిస్వామి మళ్లీ పైచేయి సాధించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో పాటు ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇవాళ(మంగళవారం) ఆ పిటిషన్ను తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడినవెంటనే.. అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా ఈపీఎస్(ఎడపాడి కే పళనిస్వామి)ని పార్టీ ప్రదాన కార్యదర్శిగా ప్రకటించింది పార్టీ సీఈసీ. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబురాలు జరుగుతున్నాయి. ఇక తాజా తీర్పుతో ఓపీఎస్(ఓ పన్నీర్ సెల్వం).. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ను ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక.. అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి (తాత్కాలిక) పదవికి పళనిస్వామి నియామకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కిందటి ఏడాది జులైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ద్వారా ఈ నియామకం జరగ్గా.. దానిని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం వర్గం న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్ను చట్టబద్ధమైనదిగానే సమర్థించింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం మాత్రం మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది. ఇదిలా ఉంటే.. గత శనివారం పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఎన్నికకు ఈపీఎస్ నామినేషన్ దాఖలు చేయగా.. ఇదంతా దొంగచాటు వ్యవహారమంటూ పన్నీర్సెల్వం మండిపడ్డారు. అంతలోనే మద్రాస్ హైకోర్టు ఈపీఎస్కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం గమనార్హం. -
తమిళనాడులో ట్విస్ట్.. పొల్లాచ్చి కేసులో పళనిస్వామికి షాక్!
సాక్షి, చెన్నై: పొల్లాచ్చిలో యువతులు, మహిళలపై జరిగిన లైంగికదాడి వ్యవహారం మళ్లీ కోర్టుకు చేరింది. ఈ కేసులో బాధితుల పేర్లను వెల్లడించిన పోలీసు అధికారి పాండియరాజన్, ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం పళని స్వామి, మాజీ సీఎస్ను విచారించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది. ఇది సోమవారం విచారణకు రానుంది. వివరాల ప్రకారం.. 2019లో కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి కేంద్రంగా కొందరు యువకులు ఫామ్ హౌస్లోకి యువతలు, మహిళలను తీసుకెళ్లి లైంగిక దాడి చేసి వీడియో చిత్రీకరించి వేధించిన వ్యవహారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో 9 మందిని మాత్రమే అరెస్టు చేశారు. అయితే బడాబాబులు, రాజకీయ ప్రముఖుల పిల్లలను ఈ కేసు నుంచి తప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చే విధంగా హైకోర్టులో చెన్నైకు చెందిన బాలచంద్రన్ శనివారం పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో నిందితులను వెనకేసుకు యత్నించిన పోలీసు అధికారి పాండియరాజన్ను సస్పెండ్ చేయాలని ఆ పిటిషన్లో కోరారు. అలాగే ఆయనకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి సీఎం, సీఎస్లను కూడా ఈ కేసులో విచారించాలని, ఇందుకు సంబంధించిన ఉత్వరులు ఇవ్వాలని కోర్టుకు పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. -
సుప్రీంలో ఊరట.. జడ్జిగా గౌరీ ప్రమాణం
సాక్షి, ఢిల్లీ: మద్రాస్ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా లాయర్ లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరి ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొలీజియంలో చర్చ జరిగాకే ఆమె పేరు ప్రతిపాదించినట్టు పేర్కొంది. సంబంధిత హైకోర్టు జడ్జిల అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్ల ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. ప్రమాణాన్ని ఉల్లంఘించినట్లు తేలినా లేదా ప్రమాణానికి లోబడి విధులను నిర్వర్తించకున్నా రెండేళ్ల తర్వాత ఆమె పనితీరు సంతృప్తికరమని భావిస్తేనే శాశ్వత జడ్జిగా ప్రతిపాదించే అవకాశం కొలీజియంకు ఉందని గుర్తు చేసింది. గతంలో అడిషనల్ జడ్జిలుగా పనిచేసిన వారు శాశ్వత జడ్జీలు కాలేకపోయిన ఘటనలు అనేకం ఉన్నాయంది. ఒక వ్యక్తి రాజకీయ, వ్యక్తిగత అభిప్రాయాలు ఆ వ్యక్తి పేరును జడ్జిగా సిఫారసు చేయకపోవడానికి కారణం కాదని కొలీజియం భావించిందని పేర్కొంది. గౌరి మైనారిటీలకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేశారంటూ కొందరు లాయర్లు కేసు వేయడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు కంటే ముందే... మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పుకు ముందే మద్రాస్ హైకోర్టు అదనపు జడ్జిగా గౌరి ప్రమాణం చేశారు! తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాజా మంగళవారం ఉదయం 10.45 గంటల సమయంలో ఆమెతో ప్రమాణం చేయించారు. తనకు గొప్ప అవకాశమిచి్చన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా ఇతర న్యాయమూర్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 1973లో జని్మంచిన గౌరి, 1995లో లాయర్గా పేరు నమోదు చేయించుకున్నారు. మదురై బెంచ్ అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్గా 2022 నుంచి పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం జనవరి 17వ తేదీన గౌరితో కలిపి మొత్తం ఐదు పేర్లను హైకోర్టు జడ్జీలుగా నియమించేందుకు కేంద్రానికి సిఫారసు చేసింది. -
3 హైకోర్టులకు 13 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం
అలహాబాద్, కర్నాటక, మద్రాస్ హైకోర్టుల్లో 13 మంది అదనపు జడ్జీలు నియమితులయ్యారు. వీరిలో 11 మంది లాయర్లు కాగా ఇద్దరు న్యాయాధికారులు. వీరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం జనవరిలో సిఫార్సు చేసింది. వీరిలో మద్రాస్ హైకోర్టు న్యాయవాది లెక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీకి బీజేపీతో సంబంధాలున్నాయనే ఆరోపణ వివాదం రేపింది. ఈమె పేరును సిఫార్సు చేయడాన్ని మద్రాస్ హైకోర్టు బార్ అసోసియేషన్ వ్యతిరేకించింది. బార్కు చెందిన 21 మంది లాయర్లు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ‘‘తాను బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శినంటూ గౌరీ అంగీకరించారు. మైనారిటీలపై విద్వేష వ్యాఖ్యలు చేశారు. మత ఛాందస భావాలున్న ఆమె న్యాయమూర్తిగా అనర్హురాలు’’ అని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ఫిబ్రవరి 10న విచారణ జరగాల్సి ఉంది. దానిపై మంగళవారమే విచారణ చేపడతామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. పార్టీలతో సంబంధాలున్న వారూ జడ్జీలు కావచ్చని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు అనడం తెలిసిందే. -
మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియామకంపై వివాదం..
న్యూఢిల్లీ: మద్రాస్ హైకోర్టు జడ్జిగా విక్టోరియా గౌరి నియమిస్తూ కేంద్రం నోటిఫై చేయడంపై వివాదం చెలరేగింది. ఆమెను జడ్జిగా సిఫారసు చేసిన కొలీజియం నిర్ణయంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విక్టోరియా గౌరి గతంలో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ముస్లింలు, క్రైస్తువులపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో గౌరి నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. మొదట వచ్చేవారం విచారణ చేపడతామన్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్.. ఆ తర్వాత ఈ పిటిషన్పై ఈనెల 10న(శుక్రవారం) విచారణ జరుపుతామని చెప్పారు. విక్టోరియా గౌరికి హైకోర్టు జడ్జిగా పదోన్నతి కల్పించడాన్ని కొంతమంది మద్రాస్ హైకోర్టు లాయర్లు ఇప్పటికే వ్యతిరేకించారు. ఆమెను జడ్జిగా నియమించవద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు కొలీజియాన్ని కోరారు. ఈమె జడ్జి అయితే ముస్లింలు, క్రైస్తవులకు తమకు న్యాయం దక్కుతుంది అనే నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించారు. న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు కొలీజియానికి కేంద్రానికి మధ్య మాటల యుద్ధం జరిగిన సమయంలో విక్టోరియా గౌరి పదోన్నతి సాఫీగా జరిగిపోయిందని పలువురు విమర్శలు గుప్పించారు. చదవండి: ప్రమాణ స్వీకారం చేసిన ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు -
స్టాలిన్ సర్కార్ Vs గవర్నర్.. ట్విస్ట్ ఇచ్చిన మద్రాస్ హైకోర్టు
సాక్షి, చెన్నై: రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. వివరాల ప్రకారం.. ద్రవిడ కళగం నేత కన్నదాసన్ మద్రాసు హైకోర్టులో గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా గత నెలలో పిటిషన్ దాఖలు చేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆధారాలతో సహా అందులో వివరించారు. బహిరంగ సభలు, వేదికలపై గవర్నర్ బాధ్యతలను విస్మరించి, సనాతన ధర్మానికి అనుకూలంగా, ద్రావిడ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే తమిళనాడు సర్కారు పంపించే నివేదికలు, తీర్మానాలపై సంతకాలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర గవర్నర్గా పదవిలో ఉన్న వ్యక్తి ఇతర సంస్థలు, సంఘాలలో పనిచేయడానికి వీలు లేదని ఆ పిటిషన్ ద్వారా కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే గవర్నర్గా ఉన్న ఆర్ఎన్ రవి పుదుచ్చేరిలోని ఆరోవిల్ ఫౌండేషన్కు అధ్యక్షుడిగా కూడా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొన్నారు. ఈ పదవి ద్వారా ఆయనకు వేతనం, పదవీ విరమణ పెన్షన్ వంటి సౌకర్యాలు అందుతున్నాయని వివరించారు. ఈ దృష్ట్యా గవర్నర్ను రీకాల్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ గురువారం ఇన్చార్జ్ సీజే రాజ, న్యాయమూర్తి భరత చక్రవర్తి బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. విచారించలేం.. న్యాయమూర్తులు స్పందిస్తూ, గవర్నర్కు వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఉన్నత కోర్టుల తీర్పులు, రాజకీయ శాసనాల ఆధారంగా నియమితులైన వారిపై ఎలాంటి చర్యలకు గానీ, వారికి వ్యతిరేకంగా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ ఈ పిటిషన్ విచారణను తోసిపుచ్చారు. టీఆర్ బాలు ఫైర్.. గవర్నర్ తీరుపై మండిపడుతూ డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు ఓ ప్రకటన చేశారు. ఆయన రాష్ట్రానికి గవర్నర్ తరహాలో కాకుండా, బీజేపీకి మరో అధ్యక్షుడి వ్యవహరిస్తున్నట్లుందని మండిపడ్డారు. తన బాధ్యతలను విస్మరించి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. -
ఆలయాల్లోకి సెల్ఫోన్లు నిషేధం!.. మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై: మద్రాస్ హైకోర్టు చర్చనీయాంశమైన ఆదేశాలు ఇచ్చింది. ఆలయాల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆలయాల యొక్క స్వచ్ఛత..పవిత్రతను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తెలిపింది. అయితే.. హిందూ మత & ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్ అండ్ సిఇ) డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే ఆలయాల్లోకి భక్తులెవరూ తమ ఫోన్లను తీసుకెళ్లకుండా చూసుకోవాలని ఆదేశించింది. ప్రజలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఫోన్లను గుడి దగ్గర్లో పెట్టుకునేలా స్టాండులు, డిపాజిట్ లాకర్లు, టోకెన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలను అన్ని ఆలయాల్లో అమలు అయ్యేలా చూడాలని.. భక్తులెవరూ ఫోన్లు లోపలికి తీసుకెళ్లకుండా భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని తెలిపింది. సుబ్రమణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. మొబైల్ ఫోన్లు ప్రజల దృష్టి మరల్చడంతోపాటు దేవతా చిత్రాలను క్లిక్ చేయడం ఆగమా నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. అంతేకాదు.. ఫొటోగ్రఫీ వల్ల దేవాలయాల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మరోవైపు.. తమ అనుమతి లేకుండా తమ చిత్రాలను క్లిక్ చేయడంపై మహిళల్లో భయాందోళనలు నెలకొంటాయని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఆలయాల్లోకి అభ్యంతరకర దుస్తుల్లో రాకూడదని, ఇందుకోసం మంచి డ్రెస్ కోడ్ను ఏర్పాటు చేయించాలని పిటిషన్ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. తాజాగా సెల్ఫోన్లను ఆలయాల్లోకి అనుమతించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాలను సందర్శించే భక్తులు దేశ వారసత్వం, సంస్కృతిని కాపాడే వస్త్రాలను ధరించాలని కూడా భక్తులను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు పేర్కొంది. -
ఫుట్బాల్ ప్లేయర్ ప్రియ మృతిపై విచారణ పూర్తి.. నివేదికలో ఏముందంటే!
సాక్షి, చెన్నై: ఫుట్బాల్ క్రీడాకారిణి ప్రియ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు విచారణలో తేలింది. ఇందుకు సంబంధించిన నివేదిక ఆరోగ్య శాఖకు చేరింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైద్యులు ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు. చెన్నై వ్యాసార్పాడికి చెందిన ప్రియ మృతి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. ప్రత్యేక బృందం జరిపిన విచారణలో పెరియార్ నగర్ ఆస్పత్రి వైద్యులతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు వెలుగు చూసింది. ఆమెకు సరైన పద్ధతిలో చికిత్స అందించలేదని తేలింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోయిందని విచారణలో స్పష్టమైంది. ఇందుకు సంబంధించిన నివేదికను ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్కు ప్రత్యేక బృందం సమర్పించింది. బెయిల్ నిరాకరణ ప్రియ మరణానికి కారకులైన వైద్యులు సోమ సుందరం, బలరాం శంకర్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. తాము గతంలో అనేక విజయవంతమైన శస్త్ర చికిత్సలు నిర్వహించామని, అందరూ క్షేమంగానే ఉన్నట్లు అందులో వివరించారు. ప్రియ శస్త్ర చికిత్స, మరణం దురదృష్టకరమని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. విచారణకు సహకారం అందిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. తాము వైద్య కమిటీ విచారణకు హాజరు కావాల్సి ఉందని, అంతలోపు తమను అరెస్టు చేస్తే వెళ్లలేని పరిస్థితి ఉంటుందని వివరించారు. అయితే, వీరికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. దీంతో ఈ ఇద్దరు వైద్యులను అరెస్టు చేయడానికి పోలీసులు సిద్ధమయ్యారు. -
కరగాట్టంలో అశ్లీలత ఉండకూడదు: హైకోర్టు ఆంక్షలు
సాక్షి, చెన్నై: కరగాట్టంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. తమిళ సంప్రదాయ నృత్యాల్లో ప్రముఖమైనది కరగాట్టం. మదురై జిల్లా మేలపట్టి గ్రామానికి చెందిన మారిచ్చామి మద్రాసు హైకోర్టు మదురై బెంచ్లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. అందులో తమ గ్రామంలో మారియమ్మన్ ఆలయంలో ఈనెల 8న ఉత్సవాలు నిర్వహించడానికి నిశ్చయించామన్నారు. ఈ సందర్భంగా కరగాట్టం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకోసం భద్రత కల్పించాల్సిందిగా పోలీసులను కోరామన్నారు. పోలీసులు భద్రత ఇవ్వడానికి ముందుకు రావడం లేదని, సంప్రదాయ కళల్లో ప్రధాన మైన కరగాట్టం అంతరించి పోకుండా ఉండేందుకే ఈ వేడుకలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి సుకుమార కురూప్ సమక్షంలో విచారణకు వచ్చింది. ఆలయ ఉత్సవాలలో కరగాట్టం నిర్వహించడంపై కొన్ని నిబంధనలను న్యాయమూర్తి తెలియజేశారు. ఈ రకం నృత్యాలు చేసే సమయంలో అసభ్యకరమైన దుస్తులు, ద్వంద్వ అర్థాల మాటలు, అనాగరిక ప్రవర్తన ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమాన్ని సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: గంగ మీద ప్రమాణం చేద్దామని చెరువుకెళ్లి.. నీటిలో మునిగి.. -
ఆ ఆదేశాలు సరికాదు: ఆరెస్సెస్
చెన్నై: తమిళనాడులో ఆరెస్సెస్ నిర్వహించ తలపెట్టిన కవాతుపై సందిగ్ధం నెలకొంది. నవంబర్ 6వ తేదీన(ఆదివారం) తలపెట్టిన కవాతును రద్దు చేయాలని ఆరెస్సెస్ నిర్ణయించుకుంది. మద్రాస్ హైకోర్టు కవాతు నిర్వహణకు అనుమతి ఇచ్చినప్పటికీ.. ప్రత్యేక షరతులు విధించడంపై హిందూ సంఘాల విభాగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు ప్రభుత్వ ఆదేశాలను పక్కనపెడుతూ మొత్తం 50 ప్రాంతాలకుగానూ.. 44 ప్రాంతాల్లో కవాతు నిర్వహణకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతులు ఇచ్చింది. మతపరమైన సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తింపు పొందిన ఆరు చోట్ల మాత్రం ఇప్పుడు మార్చ్ నిర్వహించొద్దని.. కావాలనుకుంటే మరో రెండు నెలల తర్వాత కవాతు నిర్వహించుకోవచ్చని తెలిపింది. అయితే.. ఆ 44 ప్రాంతాల్లో కూడా రోడ్లపై, ఇతర ప్రాంగణాల్లో కాకుండా.. మైదానాలు, స్టేడియం లేదంటే ఆడిటోరియాల్లో మాత్రమే నిర్వహించాలని షరతు విధించింది. కవాతులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని.. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మద్రాస్ హైకోర్టు, ఆరెస్సెస్కు స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపై ఆరెస్సెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కశ్మీర్, వెస్ట్బెంగాల్, కేరళ, ఇతర ప్రాంతాల్లో రూట్ మార్చ్లను నిర్వహించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమిళనాడులో మాత్రం ఇలా సమ్మేళన ప్రాంగణంలో నిర్వహించుకోవడం సబబు కాదని భావిస్తోంది. అందుకే కవాతును వాయిదా వేసుకోవడంతోపాటు మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు సిద్ధమైంది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం కేవలం మూడు చోట్ల మాత్రమే కవాతులను నిర్వహణకు అనుమతి ఇవ్వగా.. మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఆరెస్సెస్కు ఊరట లభించింది. ఓ ముస్లిం రాజకీయ సంఘంపై కేంద్రం నిషేధం విధించడం, కొయంబత్తూరు పేలుళ్ల నేపథ్యంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లవచ్చని తమిళనాడు పోలీస్ శాఖ.. ఆరెస్సెస్ కవాతుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. ఇదీ చదవండి: స్టాలిన్ సర్కార్కు ఎదురుదెబ్బ -
ఐపీఎస్ ఆఫీసర్పై పిటిషన్ దాఖలు చేసిన ధోని
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని.. ఐపీఎస్ ఆఫీసర్ జి. సంపత్ కుమార్పై మద్రాస్ హైకోర్టులో క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తి కలిగించింది. క్రికెట్ బెట్టింగ్ సహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక అఫిడవిట్లో ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ధోనీ ఆరోపించాడు. ధోని పిటిషన్ ప్రకారం.. 2014లో హైకోర్టులో సంపత్ కుమార్ దావా వేశారని.. గతంలో ఆయన చేసిన ఆరోపణలు తనకు పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నట్లు తెలిసింది. అందుకే ఐపీఎస్ సంపత్ కుమార్ సహా పలువురు అధికారులపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసినట్లు ధోని తెలిపాడు. చదవండి: కోహ్లి కెరీర్లో ముచ్చటగా ఐదు అత్యుత్తమ ఇన్నింగ్స్లు.. 'కింగ్' కోహ్లి.. కరగని శిఖరం -
RSS March: ఆరెస్సెస్కు భారీ ఊరట
చెన్నై: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు మద్రాస్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తమిళనాడు వ్యాప్తంగా నవంబర్ 6వ తేదీన తలపెట్టిన కవాతులకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంతకు ముందు తమిళనాడు ప్రభుత్వం ఈ ఊరేగింపులకు అనుమతి ఇవ్వలేదు. తొలుత మొత్తం 50 ప్రదేశాల్లో కవాతులను నిర్వహించాలని ఆరెస్సెస్ భావించింది. అయితే స్టాలిన్ సర్కార్ మాత్రం కేవలం మూడు ప్రదేశాల్లో మాత్రమే ఊరేగింపులకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆరెస్సెస్, హైకోర్టును ఆశ్రయించగా.. షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది హైకోర్టు. సున్నిత ప్రాంతాలుగా పేరున్న కొయంబత్తూర్, పొల్లాచ్చి, నాగర్కోయిల్తో పాటు మరో మూడు ప్రాంతాల్లో కవాతులకు అనుమతి ఇవ్వలేదు. ఊరేగింపులు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని లేనితరుణంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరెస్సెస్కు ముందస్తుగా తెలిపింది మద్రాస్ హైకోర్టు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నివేదికలలో మార్చ్ నిర్వహణలకు ప్రతికూలంగా ఏమీ లేదని తేల్చిచెప్పిన కోర్టు.. రెండు నెలల తర్వాత ఆ ఆరు ప్రదేశాల్లోనూ మార్చ్ నిర్వహించుకోవచ్చని ఆర్ఎస్ఎస్కు తెలిపింది. వాస్తవానికి.. అక్టోబరు 2న ఊరేగింపులకు కోర్టు అనుమతించినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఆ తర్వాత ఆర్ఎస్ఎస్ ధిక్కార పిటిషన్ను దాఖలు చేసింది. మరోవైపు కొయంబత్తూర్లో ఇటీవలె కారు పేలుడు ఘటన.. ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఓ ఇస్లామిక్ రాజకీయ సంస్థపై కేంద్ర ప్రభుత్వం నిషేధం కూడా విధించింది. వీటికి కారణాలుగా చూపుతూ.. శాంతి భద్రతలకు విఘాతం కలగవచ్చనే ఆందోళన హైకోర్టులో వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. ఇదీ చదవండి: పట్టపగలే శివసేన నేత దారుణ హత్య -
యూట్యూబ్, గూగుల్కి కోర్టు నోటీసులు.. ఆ గేమ్లు ఎలా వస్తున్నాయ్!
నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్ తదితర గేమ్లు మళ్లీ ఆన్లైన్లోకి ఎలా వస్తున్నాయ్.. అని మద్రాసు హైకోర్టు.. మదురై ధర్మాసనం ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని యూ ట్యూ బ్, గూగుల్, కేంద్ర ప్రభుత్వానికి గురువారం నోటీసులు జారీ చేసింది. వివరాలు.. ఆన్లైన్ గేమింగ్పై దాఖలైన పిటిషన్ గురువారం మదురై ధర్మాసనంలో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్లు మళ్లీ అందుబాటులోకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గేమ్ల కారణంగా యువత, పిల్లల చదువులు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. యువత మానసిక పరిస్థితి మరీ దారుణంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పదేపదే నిషేధం విధించినా అనేక వెబ్ సైట్లు మళ్లీ పుట్టుకొస్తుండడంతో పెద్దలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వాటికి శాశ్వతంగా ముగింపు పలికే వరకు విశ్రమించేది లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని యూట్యూబ్, గూగుల్తో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. ఉత్తర్వులిచ్చారు. -
తమిళ పాలిటిక్స్లో ట్విస్ట్.. పళణిస్వామికి బిగ్ షాక్!
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి బుధవారం మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. రహదారుల టెండర్లలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణపై స్టే విధించేందుకు న్యాయ మూర్తులు నిరాకరించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో సీఎంగా పనిచేసిన పళనిస్వామి పర్యవేక్షణలో రహదారుల శాఖ వ్యవహారాలు సాగిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో రహదారుల శాఖలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు అరప్పోర్ ఇయక్కం ఆరోపించింది. రూ. 4,800 కోట్లు రహదారుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేశాయి. అదే సమయంలో ఈ టెండర్ల వ్యవహారం పళనిస్వామి మెడకు చుట్టుకునే విధంగా కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఏసీబీ స్పందించింది. అలాగే, మరోవైపు ఐటీ వర్గాలు సైతం దూకుడు పెంచాయి. పళణి స్వామి సన్నిహితులైన కాంట్రాక్టర్లను టార్గెట్ చేసి సోదాలు నిర్వహించాయి. అదే సమయంలో ఈ అక్రమాలపై దృష్టి పెట్టిన డీఎంకే ప్రభుత్వం తిరుచ్చి డివిజన్ రహదారుల శాఖ పర్యవేక్షణాధికారి, చీఫ్ ఇంజినీర్గా ఉన్న పళణిని సస్పెండ్ చేసింది. కోర్టులో విచారణ ఈ అక్రమాల వ్యవహారం విచారణ సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చింది. మద్రాసు హైకోర్టు ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ ముగించే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఏసీబీ చర్యలకు సిద్ధం అవుతుండటంతో, ఈ విచారణకు స్టే విధించాలని కోరుతూ పళణి స్వామి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ అక్రమాలపై ఏసీబీ ప్రాథమిక విచారణ ముగించినట్లు కోర్టుకు ఆ విభాగం తరపు న్యాయవాదులు వివరించారు. విజిలెన్స్ కమిషన్కు నివేదిక పంపించినట్లు, అనుమతి రాగానే, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం ఏసీబీ తదుపరి చర్యలకు స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారనను ఈనెల 26వ తేదీకి న్యాయమూర్తులు వాయిదా వేశారు. -
‘దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటలకు బ్రేక్’
సాక్షి, చెన్నై: దసరా ఉత్సవాల్లో భాగంగా అశ్లీల నృత్యాలు, సినిమా పాటలతో హంగామా చేయడంపై మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం నిషేధం విధించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకు పెద్దపీట వేయాలని న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్ బెంచ్ బుధవారం ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో దసర ఉత్సవాలు వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకల్లో రోజూ నృత్య ప్రదర్శనలు, సినిమా డాన్సులు, పాటలు హోరెత్తుతాయి. వీటిలో అశ్లీలం శృతి మించడం పరిపాటిగా మారింది. పైగా కొన్నిచోట్ల సినీ తారలను సైతం ఆహా్వనించి వేడుకలను కోలాహలంగా నిర్వహిస్తుంటారు. కులశేఖర పట్నంలో.. తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్నం దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు. ఇక్కడి ముత్తాలమ్మన్ ఆలయంలో తొమ్మిది రోజులు వేడుకలు మిన్నంటుతాయి. ఇక్కడ కూడా సీనీ గీతాలు, డాన్సులకు కొదవ ఉండదు. ఈ పరిస్థితుల్లో రాంకుమార్ ఆదిత్యన్ అనే సామాజిక కార్యకర్త దసరా ఉత్సవాల పేరిట సాగుతున్న అశ్లీల నృత్యాలను నిషేధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. బుధవారం న్యాయమూర్తులు మహాదేవన్, సత్యనారాయణ ప్రసాద్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఎంతో భక్తితో వ్రతాలు, నోములు తదితర పూజాది కార్యక్రమాలను భక్తులు ఈ దసరా సందర్భంగా అనుసరిస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇలాంటి సందర్భంలో అశ్లీల కార్యక్రమాల వల్ల భక్తులకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. వాదనల అనంతరం న్యాయమూర్తులు దసరా ఉత్సవాల్లోనే కాకుండా, ఏ ఆలయ వేడుకల్లోనూ ఇకపై అశ్లీల నృత్యాలు, సినిమా పాటలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. కులశేఖర పట్నంలో నిర్వహించే వేడుకలను తూత్తుకుడి జిల్లా ఎస్పీ, కలెక్టర్ పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. -
కొరియోగ్రాఫర్ కణల్ కన్నన్ బెయల్పై నిబంధనలు రద్దు
తమిళసినిమా: సినీ ఫైట్ మాస్టర్ కణల్ కన్నన్ బెయిల్పై మద్రాసు హైకోర్టు సడలింపు ఆదేశాలు జారీ చేసింది. ఆ మధ్య స్థానిక మదురవాయిల్లో హిందూ మున్నని పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఈయన అరెస్టయిన విషయం తెలిసిందే. అనంతరం షరతులతో కూడిన బెయిల్పై విడుదలయ్యారు. నాలుగు వారాల పాటు ఉదయం, సాయంత్రం రోజుకు రెండుసార్లు విచారణ అధికారుల ముందు హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి పరిస్థితుల్లో కణల్ కన్నన్ షూటింగ్ నిమిత్తం ఇతర రాష్ట్రానికి వెళ్లాల్సి ఉండడంతో తన బెయిల్పై నిబంధనలను రద్దు చేయాలని దాఖలు చేశారు. విచారించిన న్యాయమూర్తి జగదీష్ చంద్ర ఒక వారం పాటు కణల్ కన్నన్ బెయిల్పై నిబంధనలు రద్దు చేస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. -
'ఆస్తుల వివరాలు సమర్పించండి'.. హీరో విశాల్కు కోర్టు ఆదేశాలు
తమిళసినిమా: లైకా ప్రొడక్షన్స్కు అప్పు చెల్లింపుల కేసులో నటుడు విశాల్కు మద్రాస్ హైకోర్టు మరింత గడువు ఇస్తూ సరైన పత్రాలు సమర్పించాలని ఆదేశించింది. వివరాలు.. విశాల్ తమకు రూ.21.29 కోట్లు అప్పు చెల్లించాల్సి ఉందంటూ లైకా ప్రొడక్షన్స్ చెన్నై హైకోర్టులో దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా విశాల్కు సమన్లు జారీ చేసింది. దీంతో ఇటీవల కోర్టుకు హాజరైన విశాల్ తన చిత్ర నిర్మాణ సంస్థ ఒకే రోజు రూ.18 కోట్లు నష్టపోవడంతో లైకా సంస్థకు అప్పు చెల్లించలేకపోయానని తెలిపారు. అయితే తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలన్న ఉద్దేశ్యం లేదా? అని ప్రశ్నించిన న్యాయమూర్తి, సెప్టెంబర్ 9 లోపు ఆస్తుల వివరాలను వెల్లడించాలని విశాల్ను ఆదేశించారు. ఈ కేసు విచారణ శుక్రవారం మరోసారి న్యాయమూర్తి ఎం.సుందర్ సమక్షంలో విచారణకు వచ్చింది. విశాల్ కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరఫు న్యాయవాది హాజరై ప్రమాణ పత్రం కోర్టులో సమర్పించడానికి మరింత గడువు కావాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి మరో రెండు వారాలు గడువు ఇస్తూ తదుపరి విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేశారు. -
జయలలిత మరణం.. కొడనాడులో ఎన్నో రహస్యాలు..!
సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ కేసులో అనేక రహస్యాలు పాతి పెట్టబడ్డాయని, పునర్విచారణతో వెలుగులోకి వస్తున్నాయని పోలీసుల తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జయలలిత మరణం తదుపరి పరిణామాలతో ఆమెకు చెందిన కొడనాడు ఎస్టేట్లో వాచ్ మెన్ హత్య, దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారు అనుమానాస్పదంగా మరణించడంతో అనేక ఆరోపణలు, అనుమానాలు వచ్చాయి. అయితే, ఈ కేసును గత పాలకులు మమా అనిపించారు. ఈ పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన డీఎంకే పాలకులు ఈ ఘటనపై పునర్విచారణ చేపట్టారు. ఐపీఎస్ అధికారి సుధాకర్ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె బంధువు వివేక్తోపాటుగా 230 మందిని విచారణ వలయంలోకి తెచ్చారు. ఈ పరిస్థితుల్లో ఈ కేసులో నిందితుడిగా ఉన్న మనోజ్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి సతీష్కుమార్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. పునర్విచారణను త్వరితగతిన ముగించే విధంగా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు. ఈ సందర్భంగా పోలీసుల తరఫున న్యాయవాది హసన్ మహ్మద్ జిన్నా హాజరై కోర్టు దృష్టికి పలు విషయాలు తీసుకొచ్చారు. ఈ కేసులో అనేక రహస్యాలు, సమాచారాలు పాతి పెట్టబడ్డాయని, ఇవన్నీ ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నట్టు వివరించారు. విచారణ సరైన కోణంలో వెళ్తోందని, ఈ సమయంలో ఎలాంటి గడువు విధించవద్దని కోరారు. దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను కోర్టులో సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: పన్నీరుకు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు -
పన్నీరుకు షాక్.. పళనిస్వామికే అన్నాడీఎంకే పగ్గాలు
అన్నాడీఎంకే బాధ్యతలు పళనిస్వామి గుప్పెట్లోకి చేరాయి. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపికకు పరోక్షంగా శుక్రవారం మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ పచ్చ జెండా ఊపింది. జూలై 11న జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని ఆమోదించింది. సింగిల్ బెంచ్ విధించిన స్టేను రద్దు చేసింది. దీంతో పళని మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. కాగా ద్విసభ్య బెంచ్ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీకోర్టులో అప్పీలుకు వెళ్లనున్నామని పన్నీరు సెల్వం ప్రకటించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పన్నీరు సెల్వం, పళనిస్వామి మధ్య రాజకీయ చదరంగం కొనసాగుతోంది. జూలై 11వ తేదీ జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ద్వారా పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. దీనిని వ్యతిరేకిస్తూ పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్ను గత నెల న్యాయమూర్తి జయచంద్రన్ బెంచ్ విచారించింది. సర్వసభ్య సమావేశానికి సింగిల్ బెంచ్ స్టే విధించింది. జూన్ 23వ తేదీకి ముందు అన్నాడీఎంకేలో ఉన్న పరిస్థితులు కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పళని స్వామి శిబిరానికి చెక్ పెట్టే విధంగా పన్నీరుసెల్వం దూకుడు పెంచారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె ప్రతినిధి దినకరన్ను కలుపుకుని ముందుకు సాగేందుకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. అడియాసే.. పన్నీరు ఆశలన్నీ ప్రస్తుతం ఆవిరయ్యాయి. సింగిల్ బెంచ్ విధించిన స్టేకు వ్యతిరేకంగా పళనిస్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తులు దురైస్వామి, సుందర మోహన్ బెంచ్ ఈ పిటిషన్పై శుక్రవారం తీర్పు వెలువరించింది. పళనిస్వామి తరఫు న్యాయవాది ఇన్బదురై బలమైన వాదనలను కోర్టు ముందు ఉంచారు. అన్నాడీఎంకే నిబంధనలకు అనుగుణంగానే జూలైన 11న సర్వసభ్య సమావేశం జరిగిందని వివరించారు. జూన్ 23వ తేదీ జరిగిన సమావేశంలో జూలై 11న జరిగే సమావేశం గురించి ప్రిసీడియం చైర్మన్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ సమయంలో పన్నీరుసెల్వం అదే వేదికపై ఉన్నారని, అలాంటప్పుడు ఈ సమావేశం గురించి సమాచారం లేదని చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. వీటిని ద్విసభ్య బెంచ్ పరిగణనలోకి తీసుకుంది. 128 పేజీలతో కూడిన తీర్పును న్యాయమూర్తులు వెలువరించారు. చదవండి: పొలిటికల్ గేమ్లో ప్లాన్ ఛేంజ్.. టీఆర్ఎస్కు షాకిచ్చిన బీజేపీ! తీర్పుతో పళని శిబిరంలో సంబరాలు సింగిల్ బెంచ్ విధించిన స్టేను ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. జూలై 11న జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఆమోదం తెలిపింది. దీంతో పళని శిబిరంలో సంబరాలు మిన్నంటాయి. చెన్నైలో ఎంజీఆర్ యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నేతృత్వంలో స్వీట్లు పంచుకుని బాణాసంచాతో హోరెత్తించారు. పళని, దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. పళని మద్దతుదారులు జయకుమార్, ఆర్బీ ఉదయకుమార్, వైగై సెల్వం, ప్రిసీడియం చైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్ తదితరులు మీడియా ముందుకు వచ్చారు. ఇది చారిత్రక తీర్పుగా పేర్కొన్నారు. పన్నీరు సెల్వంను అన్నాడీఎంకే నుంచి ఇప్పటికే తొలగించామని, ఆయనకు పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. మూడు నెలల్లో మరోమారు పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి పళనిస్వామిని పూర్తి స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటామని ప్రకటించారు. కోర్టు తీర్పు ఏకనాయకత్వానికి ఆమోదముద్ర వేసిందని హర్షం వ్యక్తం చేశారు. తాత్కాలికం ద్విసభ్య బెంచ్ తీర్పుతో పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది పన్నీరు సెల్వం శిబిరానికి షాక్ గా మారింది. దీంతో సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేయడానికి పన్నీరు సెల్వం నిర్ణయించారు. ఇదిలా ఉండగా, ద్విసభ్య బెంచ్ తీర్పు తాత్కాలికంగా మారేనా అన్న చర్చ నెలకొంది. ఇందుకు కారణం న్యాయమూర్తి జయచంద్రన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్లో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ వ్యవహారం ప్రధాన కేసుగా విచారణలో ఉండటమే. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ రద్దు చేశారా.? కాలం చెల్లిందా..? అన్న వ్యవహారాలపై ఈ బెంచ్లో వాదనలు జరగాల్సి ఉంది. కేవలం సింగిల్ బెంచ్ విధించిన స్టేను మాత్రమే ద్విసభ్య బెంచ్ రద్దు చేసింది. అయితే, సింగిల్ బెంచ్లో మున్ముందు ప్రధాన కేసు విచారణ ఎలాంటి మలుపులకు దారి తీస్తాయో, తుది వాదనలు ఎలా ఉంటాయో అన్నది వేచి చూడాల్సిందే. దీనిపై పన్నీరు శిబిరం నేత వైద్యలింగం స్పందిస్తూ ఈ తీర్పు తాత్కాలికమేనని.. సుప్రీంకోర్టులో తమ న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తిరువళ్లూరులో.. పట్టణంలో పళనిస్వామి మద్దతుదారులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం ఎంజీఆర్, అన్నాదురై విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి రమణ, పార్టీ నేతలు వెంకటేషన్, బాబు, ఎయిళరసన్, సుధాకర్, మాధవన్ పాల్గొన్నారు. తిరుత్తణి: హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకే శ్రేణులు తిరుత్తణిలో సంబరాలు చేసుకున్నారు. పట్టణ కార్యదర్శి సౌందర్రాజన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండు వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. పళ్లిపట్టు మండల కార్యదర్శి టీడీ.శ్రీనివాసన్, నాయకులు కుప్పుస్వామి, త్యాగరాజన్, జయశేఖర్బాబు పాల్గొన్నారు. -
మద్రాస్ హైకోర్టులో పన్నీరు సెల్వానికి షాక్
-
మద్రాస్ హైకోర్టులో ఈపీఎస్కు ఊరట
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఈకే పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అన్నాడీఎంకే నాయకత్వ వివాదంపై న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పార్టీకి పళనిస్వామే సుప్రీం నాయకుడని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక చెల్లుతుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్సెల్వం కోర్టును ఆశ్రయించారు. అప్పటి సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. అయితే ఈ వ్యవహారంపై పళనిస్వామి మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కోర్టు తీర్పు అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఎర్పాటు చేశారు. గతంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆపీస్లో విధ్వంసం సృష్టించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. చదవండి: కేసీఆర్కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ -
పైరసీలో సినిమాలు చూస్తున్నారా? ఇకపై ఆ సైట్లు పనిచేయవు!
తమిళ సినిమా: చట్ట విరోధంగా పైరసీకి పాల్పడుతున్న వెబ్సైట్లపై చెన్నై హైకోర్టు కొరడా ఝుళిపించింది. వివరాలకు వెళ్తే నటుడు విక్రమ్ కథానాయకుడుగా నటించిన కోబ్రా చిత్రం వినాయక చవితి సందర్భంగా సందర్భంగా బుధవారం విడుదల కానుంది. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి నాయకిగా నటించిన ఈచిత్రంలో ఇండియన్ క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ ప్రతినాయకుడిగా నటించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో సెవెన్ స్క్రీన్స్ పతాకంపై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. కాగా పైరసీ అరాచకం రాజ్యమేలుతున్న పరిస్థితిలో కోబ్రా చిత్ర నిర్మాత తన చిత్రం పైరసీని వ్యతిరేకిస్తూ 1788 వెబ్ సైట్లపై నిషేధం విధించాలని కోరుతూ ప్రభుత్వం, సామాజిక మాధ్యమం సేవా సంస్థల తరఫున చెన్నై హైకోర్టులో దాఖలు చేశారు. ఈ కేసు న్యాయమూర్తి చంద్రకుమార్ రామ్మూర్తి సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. దీంతో పిటిషనర్ తరుఫున న్యాయవాది విజయన్ సుబ్రహ్మణియన్ హాజరై వాదించారు. పలు నెలలు శ్రమించి, కోట్లలో ఖర్చు చేసి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని నిర్మాతలు చిత్రాలను విడుదల చేస్తుంటే కొన్ని వెబ్సైట్లు అక్రమంగా పైరసీకి పాల్పడుతున్నాయని, ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సినీ కార్మికుల జీవితాలు నాశనం అవుతున్నాయని అన్నారు. కోబ్రా చిత్రం పైరసీకి గురి కాకుండా వెబ్ సైట్లపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి కోబ్రా చిత్రాన్ని చట్ట విరుద్ధంగా వెబ్సైట్లలో విడుదల చేయడంపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. మితిమీరి ప్రచారం చేసే వెబ్సైట్లపై తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. -
Vishal: నటుడు విశాల్కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్
నటుడు విశాల్ను తన ఆస్తుల వివరాలను సమర్పించాలని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ నటుడిగా, నిర్మాతగా కొనసాగుతున్న విశాల్ ఫైనాన్షియర్ అన్బుచెలియన్కు చెందిన గోపురం ఫిలిమ్స్ సంస్థ నుంచి రూ.21.29 కోట్లు రుణం తీసుకున్నాడు. తర్వాత ఆ మొత్తాన్ని లైకా ప్రొడక్షన్స్ చెల్లించే విధంగా విశాల్ ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో లైకా సంస్థ తిరిగి చెల్లించే వరకు విశాల్కు చెందిన అన్ని చిత్రాల హక్కులను తమ సంస్థకు రాసిచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది. అయితే విశాల్ ఆ సంస్థకు అప్పు చెల్లించకపోవడంతో లైకా ప్రొడక్షన్స్ హైకోర్టులో ఆయనకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసింది. అందులో విశాల్ తమ అప్పు రూ. 21.29 కోట్లు చెల్లించకుండా ఒప్పందాన్ని అతిక్రమించి చిత్రాన్ని ఇతర సంస్థకు విక్రయించారని ఆరోపించారు. ఈనేపథ్యంలో ఆ చిత్ర తమిళ శాటిలైట్, ఇతర భాషల శాటిలైట్, ఓటీటీ హక్కుల విక్రయంపై నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు విశాల్కు రూ.15 కోట్లను ఏదైనా జాతీయ బ్యాంకు ప్రధాన నిర్వాహకుడి వద్ద డిపాజిట్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఈ కేసుపై శుక్రవారం మరోసారి విచారణ జరిగింది. నటుడు విశాల్ ప్రత్యక్షంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించినట్లుగా డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయకపోవడానికి కారణం ఏమిటని విశాల్ను న్యాయమూర్తి ప్రశ్నించారు. అందుకు విశాల్ బదులిస్తూ తాను ఒకే రోజున రూ.18 కోట్లు నష్టపోయానని దీంతో దానికి వడ్డీ చెల్లిస్తూ వస్తున్నానని తెలిపారు. దీంతో కేసు ముగుస్తుందని భావిస్తున్నారా..? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అనంతరం విశాల్ ఆస్తుల వివరాలను న్యాయస్థానంలో సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సెపె్టంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఆరోజు విశాల్ కోర్టుకు హాజరుకావాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. చదవండి: (Dhanush: తమ్ముడికి అన్నయ్యే విలన్ అయ్యాడు) -
మద్రాసు హైకోర్టులో విజయ్కు ఊరట
చెన్నై: ఆదాయ పన్ను శాఖ కేసు నుంచి తమిళ నటుడు విజయ్కు ఊరట లభించింది. జరిమానా చెల్లింపు నిమిత్తం ఐటీ అధికారులు దాఖలు చేసిన ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టు మంగళవారం స్టే విధించింది. నటుడు విజయ్ 2016–17లో తన ఆదాయం రూ. 35.42 కోట్లుగా ఐటీ లెక్కలను చూపించినట్లు సమాచారం. ఆ తదుపరి పరిణామాలతో విజయ్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఈ లెక్కల్లో విజయ్ తాను నటించిన ‘పులి’ చిత్రం రెమ్యునరేషన్ రూ. 15 కోట్లను చూపించనట్లు ఐటీ అధికారులు గుర్తించారు. దీంతో రూ. 1.50 కోట్లు జరిమానా విధించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 2017లో ఐటీ సోదాలు జరిగితే 2019లో జరిమానా విధించడాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాను తప్పు చేసి ఉంటే, ముందుగానే నోటీసులు ఇచ్చి ఉండాలన్నారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి అనితా సుమంత్ బెంచ్ మంగళవారం విచారించింది. వాదనల అనంతరం ఆలస్యంగా జరిమానాకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఐటీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. చదవండి: First Day First Show Movie: పవన్ కల్యాణ్ని వాడుకున్నాం.. సర్ప్రైజింగ్ ఉంటుంది -
మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట
-
బిగ్ రిలీఫ్: మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట
చెన్నై: అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్ కో విధించింది మద్రాస్ హైకోర్టు. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొత్తగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్గా కొనసాగాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జూన్ 23న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్ సెక్రెటరీగా ఈపీఎస్ నియామకం సరైంది కాదు. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలి.’ అని పేర్కొన్నారు ఓపీఎస్ తరఫు న్యాయవాది తమిల్మారన్. గతంలో ఓపీఎస్ను పార్టీ టాప్ పోస్ట్కు రెండుసార్లు ఎంపిక చేశారు అన్నాడీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణించేకన్నా ముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగానూ చేశారు. కానీ, జయలలిత నెచ్చెలి శశికల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈపీఎస్ను ముఖ్యమంత్రిగా నియమించారు. మరోవైపు.. శశికల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ప్రయత్నాలు చేయగా ఓపీఎస్ తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్లారు. ఇరువురు నేతలు కలిసి పార్టీని నడిపించారు. ఓపీఎస్తో చేతులు కలిపిన ఈపీఎస్ పార్టీ నేత శశికలను బహిష్కరించారు. ఓపీఎస్ను ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు ఈపీఎస్. ఓపీఎస్ కోఆర్డినేటర్గా, ఈపీఎస్ డిప్యూటీ జాయింట్ కోఆర్డినేటర్గా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలవటంతో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. పార్టీని హస్తగతం చేసుకునేందుకు ద్వంద నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు ఈపీఎస్. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలని సూచించారు. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. అయితే, తాజాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఓపీఎస్కు ఊరట లభించినట్లయింది. ఇదీ చదవండి: Tamil Nadu: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్ ఉత్కంఠ -
హీరో ధనుష్కు హైకోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: నటుడు ధనుష్ కథానాయకుడుగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టాదారి(వీఐపీ). ఆ చిత్రానికి ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ నిర్మాతలుగా వ్యవహరించారు. కాగా, ఈ సినిమాలో పొగతాగే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిపై టుబాకో నియంత్రణ కమిటీ 2014లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. పొగతాగే సన్నివేశాలను ప్రచారం చేయటం చట్ట ప్రకారం నేరమని, ఈ మూవీలో అలాంటి సన్నివేశాలను పొందుపరిచారని ఆరోపించింది. ప్రభుత్వ హెచ్చరికలు పొందుపరిచలేదని ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆరోగ్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్థానిక సైదాపేట కోర్టులో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్లపై పిటిషన్ దాఖలు చేశారు. సైదాపేట కోర్టు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్లకు ప్రత్యక్షంగా, హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై ఐశ్వర్య రజనీకాంత్ హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. అదేవిధంగా ధనుష్ కూడా హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం న్యాయమూర్తి సతీష్ కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. ధనుష్ తరపు న్యాయవాది విజయన్ సుబ్రమణియన్ హాజరై ధనుష్ సైదాపేట కోర్టుకు హాజరవడంపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి ధనుష్ను సైదాపెట కోర్టులో హాజరవడంపై స్టే విధిస్తూ తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు. చదవండి: భూవివాదం కేసు.. కోర్టుకు హాజరైన రానా -
హైకోర్టు సంచలన తీర్పు.. తమిళనాట పాలి‘ట్రిక్స్’లో ట్విస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో నంబర్–1 అనే స్థాయికి పళనిస్వామి చేరుకుంటున్నారు. ఆధిపత్యపోరులో ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూ వస్తున్న ఆయనకు తాజాగా మరో విజయం దక్కింది. పార్టీ ప్రధాన కార్యాలయం సీలును తొలగించాలని, కార్యాలయం తాళాన్ని ఎడపాడికి అప్పగించాలని మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశించింది. ఎడపాడి పళనిస్వామి, పన్నీర్సెల్వం మధ్య గత కొంతకాలంగా నువ్వా..నేనా అంటూ సాగుతున్న పోరు అనేక మలుపులు తిరుగుతోంది. ఈనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికై పన్నీర్ దూకుడుకు పగ్గాలు వేశారు. ఇక ఆ తరువాత పన్నీర్, ఆయన ఇద్దరు కుమారులు, అనుచవర్గంలోని కొందరిపై బహిష్కరణ వేటు కూడా పడింది. ఎడపాడిని కట్టడిచేసేందుకు అదేరోజున పన్నీర్, ఆయన అనుచరవర్గం చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి దిగింది. ఈ సమాచారం అందుకున్న ఎడపాడి మద్దతుదారులు పన్నీర్ వర్గంతో తలపడ్డారు. పలువురు గాయపడటం, పోలీసుల లాఠీచార్జీతో పార్టీ కార్యాలయ పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. శాంతి భద్రతల సమస్యలు వస్తాయనే అనుమానంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని అన్నాడీఎంకే కార్యాలయానికి సీలు వేసింది. సీలు తొలగించాలని ఈపీఎస్, ఓపీఎస్ వేర్వేరుగా మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది. ఎడపాడికి అప్పగింత–ఆనందోత్సాహాలు ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం..అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని బుధవారం తీర్పు చెప్పింది. అయితే పార్టీ కార్యకర్తలు నెలరోజులపాటూ కార్యాలయానికి రాకూడదని షరతు విధించింది. కోర్టు తీర్పుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎడపాడి వర్గీయులకు ఆనందం మిన్నంటింది. అన్నాడీఎంకే ఎంజీఆర్ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ నాయకత్వంలో వందలాది కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు చెన్నై అడయార్ గ్రీన్వేస్ రోడ్డులో విజయోత్సాహంతో చిందులు వేశారు. ఎంజీఆర్, జయలలిత, ఎడపాడి చిత్రపటాలను చేతబూని ర్యాలీ నిర్వహించారు. క్యాంప్ ఆఫీస్కు చేరుకుని ఎడపాడిని అభినందనలతో ముంచెత్తారు. ఇక కోర్టు తీర్పుతో పన్నీర్ మద్దతుదారులు డీలా పడిపోయారు. ఇది కూడా చదవండి: యూపీ సర్కార్కు బిగ్ షాక్.. ఏకంగా మంత్రి రాజీనామా -
తమిళనాడులో ట్విస్ట్.. జయలలిత సోదరుడినంటూ కోర్టులో పిటిషన్
తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి కోర్టుకు చేరింది. కర్నాకటకు చెందిన ఓ వ్యక్తి తాను జయలలితకు సోదరుడిని అని చెబుతూ కోర్టును ఆశ్రయించాడు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వివరాల ప్రకారం.. మైసూరులోని వ్యాసపురానికి చెందిన వాసుదేవన్ (83) తాను దివంగత తమిళనాడు సీఎం జయలతితకు సోదరుడినని చెప్పాడు. ఈ సందర్బంగా వాసుదేవన్ మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత తండ్రి జయరామ్ మొదటి భార్య జయమ్మ కుమారుడిని తానేని పేర్కొన్నాడు. తర్వాత, జయరామ్.. వేదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారని అన్నారు. వారికి పుట్టిన వారే జయలలిత, జయకుమార్ అని తెలిపాడు. తన తల్లి జయమ్మ.. 1950లో మైసూరు కోర్టులో భరణం కోసం కేసు వేశారని గుర్తు చేశాడు. ఆ కేసులో మా నాన్న రెండో భార్య వేదమ్మ, జయకుమార్, జయలలితను ప్రతివాదులుగా చేర్చామని స్పష్టం చేశాడు. కానీ, జయలలిత కంటే ముందే జయకుమార్ మరణించారని వెల్లడించారు. ఈ క్రమంలో జయలలితకు సోదరుడిగా, వారసుడిగా ఉన్న తనకు కూడా ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేశాడు. మరోవైపు.. 2020లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో జయలలిత వారసులుగా దీపక్, దీప మాత్రమే అంటూ తీర్పునిచ్చింది. తాజాగా దీపక్, దీప పేరుతో పాటుగా తన పేరును కూడా చేర్చి తీర్పును సవరించాలని వాసుదేవన్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది. -
అర్ధరాత్రి హైడ్రామా.. పన్నీర్ సెల్వంకు భారీ ఊరట
చెన్నై: అన్నాడీఎంకే పార్టీలో వర్గ పోరు పంచాయితీ మరోసారి న్యాయస్థానాన్ని చేరింది. అయితేసారి జరిగిన అర్ధరాత్రి హైడ్రామాలో పళనిస్వామికి ఝలక్ తగిలింది. అధికారం ఒక్కరి చేతుల్లోనే ఉండాలన్న తీర్మానంపై చర్చ మాత్రమే జరగొచ్చని అయితే.. ఆ తీర్మానంపై ఆమోదించడం లాంటి నిర్ణయం తీసుకోకూడదని డివిజన్ బెంచ్ ఆదేశించింది. దీంతో పన్నీర్సెల్వం వర్గానికి భారీ ఊరట లభించినట్లు అయ్యింది. జూన్ 23న(ఇవాళ) అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీ వెంకటాచలపతి ప్యాలెస్లో నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో.. సమావేశంలోనే అధికారం ఒక్కరి చేతిలోనే ఉండాలని మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS) తీర్మానం చేయాలనుకున్నాడు. అయితే.. మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం ఆ నిర్ణయాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ జరపకుండా నిలువరించాలని పోలీసులకు ఫిర్యాదుతో పాటు కోర్టుకు చేరింది ఈ వర్గపోరు పంచాయితీ. అయితే.. మద్రాస్ హైకోర్టు భేటీని, తీర్మానాలు చేయకుండా ఆపేలా పార్టీని ఆదేశించలేమని, అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే దీనిపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పన్నీర్ సెల్వం వర్గం. జనరల్ కౌన్సిల్ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో అర్ధరాత్రిపూట మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తి ఎం దురై స్వామి ఇంట్లో వాదనలు నడిచాయి. ఈ విచారణకు జస్టిస్ సుందర్ మోహన్ సైతం హాజరయ్యారు. వాదనల అనంతరం మద్రాస్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ.. ముందుగా ప్రకటించిన 23 తీర్మానాలపై మాత్రం అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే ఇతర వ్యవహారాలపై చర్చ మాత్రమే జరగాలని పేర్కొంది. దీంతో ఇవాళ భేటీ జరుగుతుండగా.. ఒక్కరి చేతిలోనే అన్నాడీఎంకే పగ్గాలు ఉండాలన్న పళనిస్వామి తీర్మానానికి ఆమోదం లభించడం కుదరదనే చెప్పాలి. Chennai, Tamil Nadu | AIADMK workers, leaders gather at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram for party's General Council meeting to be held today. pic.twitter.com/9lnaL8OJvD — ANI (@ANI) June 23, 2022 చదవండి: ‘డమ్మీ రాష్ట్రపతి’గా ద్రౌపది ముర్ము.. తీవ్ర ఆరోపణలు -
అన్నాడీఎంకేలో తారాస్థాయికి ముసలం.. జయ సమాధి వద్ద ఉద్రిక్తత
చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీకి ముందు పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS), మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం వర్గీయులు వాళ్ల వాళ్ల డిమాండ్లతో రచ్చకెక్కుతున్నారు. జూన్ 23న(గురువారం) జరగబోయే మీటింగ్లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నాడు. అదే సమయంలో.. తన సంతకం లేకుండా జనరల్ బాడీ ఆ తీర్మానం ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్ సెల్వం వాదిస్తున్నాడు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్ను కలిసి తన పాయింట్ను వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులను ఆశ్రయించాడు ఆయన. అయితే.. ఈ భేటీ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో మాజీ మంత్రి బెంజిమన్ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం ఆ పిటిషన్ను తోసిపుచ్చింది హైకోర్టు. నిర్వహణ ఉండాలా? వద్దా? అనేది పార్టీ జనరల్ కౌన్సిల్కు సంబంధించిన నిర్ణయమని, దానిని ఆపాలని ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు.. భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ తరుణంలో అన్నాడీఎంకే వర్గపోరు వేడి.. అక్కడి రాజకీయాలను హీటెక్కిస్తోంది. -
మదురై దంపతులకు షాక్ ఇచ్చిన ధనుష్.. ‘క్షమాపణ చెప్పాలి.. లేదంటే’
చెన్నై: మదురై మేలూరుకి వృద్ధ దంపతులు కదిరేశన్, మీనాక్షిపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానంటూ నటుడు ధనుష్, ఆయన తండ్రి కస్తూరి రాజా నోటీసులు జారీ చేశారు. ఆ దంపతులు నటుడు ధనుష్ తమ రక్తం పంచుకొని పుట్టిన కొడుకంటూ పదే పదే చెబుతూ వస్తున్నారు. తమ జీవనాధారం కోసం నెలకు రూ.60 వేలు చొప్పున ఇవ్వాలంటూ ధనుష్కు నోటీసులు పంపారు. దీంతో ఈ వ్యవహారంలో తమకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేస్తామంటూ కదిరేశన్ దంపతులకు నటుడు ధనుష్ తన లాయర్ ద్వారా నోటీసులు పంపారు. -
ధనుష్కు మద్రాస్ హైకోర్టు షాక్.. సమన్లు జారీ
తమిళ స్టార్ ధనుష్కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. ధనుష్ తమ కొడుకేనంటూ ఓ వృద్ధ దంపతులు దాఖలు చేసిన పిటిషన్పై ధనుష్కు కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా ధనుష్ తమ కొడుకేనంటూ కతిసేరన్, మీనాక్షి అనే దంపతులు 2016లో మదురై జిల్లాలోని మేలూర్లోని మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొన్ని ఏళ్లుగా కోర్టులో కేసు పెండింగ్లోనే ఉంది. ధనుష్ సమర్పించిన జనన ధ్రువీకరణ పత్రాలు ఫేక్ అని ఆరోపిస్తూ కేసు వేశారు. ధనుష్ తమ మూడో కొడుకని, సినిమాల్లో నటించేందుకు చిన్నతనంలోనే ఇంటినుంచి పారిపోయి చెన్నై వచ్చాడని పిటిషన్లో పేర్కొన్నారు. ధనుష్ అసలైన తల్లిదండ్రులమని, అతని నుంచి రూ. 65 వేలు పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు. ఇందుకు సదరు దంపతులు ధనుష్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి మెమో, ఫిజికల్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ను కూడా సమర్పించారు. దీంతో కేసును పరిష్కరించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయాలని కోర్టు సూచించగా.. ధనుష్, అతని తరపు న్యాయవాది ఈ అభ్యర్థనను తిరస్కరించారు. అయితే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ సరిపోతాయో లేదో చెక్ చేసేందుకు ధనుష్కు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ వైద్య పరీక్షల ఫలితాలు ధనుష్కు అనుకూలంగా రావడంతో దంపతుల ఆరోపణలు రుజువు చేసేందుకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని 2020లో కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు కాగా జ్యూడీషియల్ మెజిస్ట్రేట్లో దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ కతిసేరన్ దంపతులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు ధనుష్ అందించిన ఆధారాలపై పోలీసులతో విచారణ జరిపించాలని కోరారు. ఈ క్రమంలోనే వివరణ ఇవ్వాలంటూ ధనుష్కు హైకోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ ధనుష్ కొట్టిపారేశాడు. తాను తమిళ నిర్మాత కస్తూరి రాజా, విజయలక్ష్మిల కుమారుడినంటూ పేర్కొన్నారు. తన నుంచి డబ్బులు రాబట్టే ఉద్ధ్యేశంతో తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నాడు. చదవండి: Pooja Bhatt: నాన్నను బాత్రూమ్లో ఉంచి గడియ పెట్టడంతో ఫుల్ ఏడ్చేశా: నటి -
సీఎం స్టాలిన్ కుమారుడికి భారీ ఊరట
సాక్షి, చెన్నై: డీఎంకే యువజన విభాగం నేత, ఎమ్మెల్యే ఉదయ నిధి స్టాలిన్కు హైకోర్టులో మరోమారు ఊరట లభించింది. ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్ తోసి పుచ్చింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేపాక్కం – ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఉదయ నిధి స్టాలిన్ గెలిచారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ వారసుడిగా, ఆ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శిగా ఉదయ నిధి చక్రం తిప్పుతున్నారు. అయితే, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ తొలుత దేశీయ మక్కల్ కట్చి నేత ఎంఎల్ రవి కోర్టు తలుపులు తట్టారు. అయితే ఆరోపణలకు సంబంధించి.. ఎలాంటి ఆధారాలు సమర్పించక పోవడంతో ఆదిలోనే పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆ నియోజకవర్గానికి చెందిన ఓటరు ప్రేమలత పిటిషన్ వేశారు. తన మీదున్న కేసుల వివరాల్ని నామినేషన్లో ఉదయ నిధి చూపించలేదని, నామినేషన్ పత్రాలలోనూ అనేక అనుమానాలు ఉన్నట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన గెలుపు రద్దుచేయాలని కోరారు. కాగా, ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించవద్దు అని ఉదయ నిధి కోర్టులో మరో పిటిషన్ వేశారు. గురువారం న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్లో ఈ పిటిషన్లు విచారణకు వచ్చింది. ఉదయ నిధి తరపున సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఇళంగో వాదనల్ని వినిపించారు. అయితే, పిటిషనర్ ప్రేమలత తన ఆరోపణలకు తగిన ఆధారాల్ని కోర్టులో సమర్పించలేదు. దీంతో ఉదయ నిధికి ఊరట కల్గిస్తూ, ఆయన గెలుపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణార్హం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: భారత్లో కరోనా వైరస్.. ఇది కచ్చితంగా ఊరట ఇచ్చే విషయమే! -
తీర్పుల్లో మానవీయ కోణం
చెన్నై/సాక్షి ప్రతినిధి, చెన్నై: న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు నిబంధనలు, పద్ధతులను గుడ్డిగా అనుసరించరాదని, మానవీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తీర్పులిచ్చే ముందు సామాజిక–ఆర్థికాంశాలను, సమాజంపై వాటి ప్రభావాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ‘‘నేటి ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో జనం కూడా ఇన్స్టంట్ జస్టిస్ (తక్షణ న్యాయం) కోరుకుంటున్నారు. దానివల్ల అసలైన న్యాయానికి అన్యాయం జరుగుతుందనే నిజాన్ని అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. చెన్నైలో మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో పరిపాలనా భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కోర్టులతో న్యాయం జరుగుతుందని సామాన్య జనం గట్టిగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అయితే, ‘‘కోర్టుల పద్ధతులు, భాషతో వారు మమేకం కాలేకపోతున్నారు. న్యాయ వ్యవస్థలో సామాన్యులను సైతం భాగస్వాములుగా మార్చాలి. పెళ్లి మంత్రాల్లా కాకుండా కోర్టు వ్యవహారాలను, కేసుల పురోగతిని కక్షిదారులు అర్థం చేసుకోగలగాలి’’ అన్నారు. న్యాయ వ్యవస్థ, సంస్థల బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని వివరించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందన్నారు. తీర్పు ఇవ్వడం అనేది కేవలం రాజ్యాంగ ధర్మం కాదు, అదొక సామాజిక బాధ్యత అని వెల్లడించారు. న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమీప భవిష్యతులో ఈ సమస్య పరిష్కారమవుతున్న నమ్మకం తనకు ఉందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ)తో ఇది సాధ్యం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గుర్తింపును, భాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో తమిళ ప్రజలు ముందంజలో ఉంటారని ప్రశంసించారు. కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల కోసం సుప్రీంకోర్టు బెంచ్ను చెన్నైలో ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా సీజేఐని కోరారు. మాతృభాషను మరవొద్దు మాతృభాష పరిరక్షణ విషయంలో తెలుగువారు తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై) 29వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగు వారిని ఒకప్పుడు మదరాసీలు అనేవారు. తెలుగు భాష, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్ను ఈ సమయంలో స్మరించుకోవాలి. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు కోరా. చెన్నైలో ఒకప్పుడు తెలుగు వారు కూడా భాగస్వాములే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయాక కర్నూలు, తర్వాత హైదరాబాద్, ప్రస్తుతం అమరావతిని రాజధానులుగా చేసుకున్నాం. మాతృభాషలో మాట్లాడేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను డిగ్రీ దాకా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా’’ అని చెప్పారు. తెలుగు ప్రజలు తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని, మాతృభాషలో మాట్లాడడం వల్ల ప్రావీణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. -
హీరో శివకార్తికేయన్కు నిర్మాత షాక్.. అపరాధం విధించాలని పిటిషన్
Gnanavel Raja Petition Of Sivakarthikeyan For Mister Local Movie Loss: తమిళ హీరో శివకార్తికేయన్కు ప్రముఖ నిర్మాత, గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజా షాక్ ఇచ్చారు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తానని రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని మద్రాస్ హైకోర్టులో శివకార్తికేయన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మిగిలిన రూ. 4 కోట్లు చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని శివకార్తికేయన్ కోరాడు. ఈ కేసుపై గురువారం (మార్చి 31) మద్రాస్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో శివ కార్తికేయన్ వల్ల తాను రూ. 20 కోట్లు నష్టపోయినట్లు తెలుపుతూ పిటిషన్ దాఖళు చేశాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. చదవండి: నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు తనకు మిస్టర్ లోకల్ కథ అసలు నచ్చలేదని, చెప్పిన వినకుండా తనతో బలవంతగా ఈ సినిమా చేసేలా ఒత్తిడి తీసుకొచ్చాడని జ్ఞానవేల్ రాజా తెలిపాడు. అందుకే ఈ సినిమాను నిర్మించినానని పటిషన్లో పేర్కొన్నాడు. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతుండగా, ఇప్పుడే తనపై కేసు ఎందుకు పెట్టాడని ప్రశ్నించాడు. తాను నష్టపోయినందుకు శివకార్తికేయన్కు అపరాధం విధించి, తనపై ఉన్న కేసును కొట్టివేయాల్సిందిగా జ్ఞానవేల్ రాజా కోరాడు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. చదవండి: సినిమాకు ఎల్లలు లేవు – శివ కార్తికేయన్ -
Sakshi Cartoon: అబ్బే అదేం లేద్సార్! డమ్మీఫోన్! సడన్గా అలవాటు..
అబ్బే అదేం లేద్సార్! డమ్మీఫోన్! సడన్గా అలవాటు మార్చుకోలేకపోతున్నారు! -
సెల్ఫోన్లు వాడొద్దు.. ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు షాక్
చెన్నై: సెల్ఫోన్ ఇప్పుడు నిత్యావసరం అయిపోయింది. అది లేనిదే పిల్లలకు ముద్ద దిగడం లేదు. పెద్దలకు పనులు జరగడం లేదు. ఈ తరుణంలో.. పని టైంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కొందరు అదే పనిగా ఫోన్లో మునిగిపోవడాన్ని తమిళనాడు రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయ వేళల్లో వ్యక్తిగత అవసరాల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియన్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెంటనే రూపొందించాలని, రూల్స్ ఫాలో కానీ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ సుబ్రమణియన్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. Madras HC says government servants should not be allowed to use mobile phones for personal use during office hours. Madras HC Justice SM Subramaniam directed Tamil Nadu Government to frame regulations in this regard and take action against those who do not follow the rules. pic.twitter.com/b2CtEvWx9J — ANI (@ANI) March 15, 2022 -
హైకోర్టులో హీరో విశాల్కు చుక్కెదురు, రూ. 15 కోట్ల డిపాజిట్కు ఆదేశం
Madras High Court Shocks Hero Vishal: హీరో విశాల్కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. లైకా ప్రొడక్షన్ సంస్థ కేసు విషయంలో విశాల్కు కోర్టులో చుక్కెదురైంది. ఈ రుణం కేసులో విశాల్ రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం విశాల్కు కోర్టు మూడు వారాల గుడువును ఇచ్చింది. హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున ఆ సొమ్మును ఈ గడువులో లోపల డిపాజిట్ చేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. చదవండి: సమంత హాట్ ఫొటోపై దగ్గుబాటి వారసురాలు కామెంట్ కాగా తమ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాన్ని విశాల్ దిక్కరించారంటూ లైకా ప్రొడక్షన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం ప్రకారం అప్పుగా తీసుకున్న రూ. 15 కోట్లు చెల్లించకుండా అతడు కొత్త సినిమా రిలీజ్ చేయకుడదు. కానీ విశాల్ తమ డబ్బు తిరిగి చెల్లించకుండానే కొత్త మూవీ వీరమే వాగౌ సుడుం విడుదల చేసేందుకు సిద్దమయ్యాడని, అంతేకాదు తమకు విశాల్ నుంచి వడ్డీతో సహా రూ.21.69 కోట్ల రుణాన్ని రికవరీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ లైకా ప్రొడక్షన్ హౌస్ పిటిషన్ దాఖలు చేసింది. చదవండి: ఓటీటీలోకి అజిత్ ‘వలిమై’, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఈ పిటిషన్పై విచారణ చెప్పట్టిన జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తి ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రూ.15 కోట్లు హైకోర్టు ప్రధాన రిజిస్ట్రార్ పేరున బ్యాంకులో మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని విశాల్ను ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే లైకా ప్రొడక్షన్స్కు ప్రతివాది రూ. 21.29 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని అగ్రిమెంట్లో ప్రాథమికంగా వెల్లడించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే విశాల్ మొదట రూ. 12 కోట్లు తీసుకున్నారని, తర్వాత రూ. 3 కోట్లు తీసుకున్నారని, కాబట్టి రూ. 21.29 కోట్ల వడ్డి సరైనది కాదని విశాల్ తరపు న్యాయవాది వాదించారు. -
లావణ్య సూసైడ్ కేసు.. స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!
తమిళనాడును కుదిపేసిన విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సీబీఐకు అప్పగించాలన్న మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. దీంతో రాష్ట్ర పోలీసులతోనే దర్యాప్తు చేయించాలన్న డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. సాక్షి, న్యూఢిల్లీ: తంజావూర్ విద్యార్థిని లావణ్య(17) బలవన్మరణ ఉదంతం తమిళనాడును, సోషల్ మీడియా ద్వారా దేశం మొత్తం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీ సీఐడీ లేదంటే సమానమైన దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించాలంటూ లావణ్య తండ్రి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్తో ఏకీభవించిన జస్టిస్ జీఎస్ స్వామినాథన్.. జనవరి 1న కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు వెలువరించారు. అయితే ఈ పరిణామం అనంతరం డీజీపీ ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టులో ఒక పిటిషన్(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయించింది. దీనిపై నేడు(సోమవారం) విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మధురై బెంచ్ తీర్పును సమర్థిస్తూ తమిళనాడు డీజీపీకి, ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అంతేకాదు ఇదేం ప్రెస్టీజ్ ఇష్యూ( సీబీఐకు అప్పగించడం ద్వారా రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించే విషయమేం కాదంటూ..) కాదంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది బెంచ్. అంతేకాదు దర్యాప్తు కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, బెల ఎం త్రివేది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మధురై బెంచ్ ఏం చెప్పిందంటే.. తంజావూర్ మైకేల్పట్టీలో నివాసం ఉండేది లావణ్య కుటుంబం. ఆత్మహత్యకు పాల్పడ్డ లావణ్య.. పదిరోజుల తర్వాత కన్నుమూసింది. స్కూల్లో మతమార్పిడి ఒత్తిళ్లతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ చిన్నారి మరణవాంగ్మూలం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. అయితే మరో వీడియోలో చిన్నారి వార్డెన్ వేధింపుల్ని భరించలేకపోయినట్లు, పినతల్లి వేధింపులు కూడా కారణమేనని చెప్పడం సైతం వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో బీజేపీ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య రాజకీయ వాగ్వాదం సైతం చోటు చేసుకుంది. ఈ పరిణామాల నడుమే.. స్కూల్లో వేధింపుల కోణంలో కాకుండా.. మతమార్పిడి వేధింపుల కోణంలోనే దర్యాప్తు చేయించాలంటూ లావణ్య తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో.. రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయించడం సమంజసం కాదనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది మద్రాస్ మధురై బెంచ్. అదే టైంలో ఆ వీడియోలను రికార్డు చేసిన వ్యక్తుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తూనే.. ఈ మేరకు సమర్థుడైన అధికారికి అప్పగించాలంటూ సీబీఐని ఆదేశించింది. -
స్పా, మసాజ్ సెంటర్లలో అశ్లీల కార్యక్రమాలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని మసాజ్ సెంటర్లు, స్పా, ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిందేనని డీజీపీ శైలేంద్ర బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఈ కెమెరాలను కంట్రోల్ రూమ్లకు అనుసంధానించనున్నారు. రాష్ట్రంలోని పలు మసాజ్ సెంటర్లు, స్పాలు, బ్యూటీ క్లబ్లు, సెంటర్లు, ఆయుర్వేద చికిత్సా కేంద్రాల్లో అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసులు సైతం దాడులు చేస్తున్నారు. విల్లుపురంలోని ఓ ఆయుర్వేద చికిత్స కేంద్రంలో పోలీసులు తరచూ నిర్వహిస్తున్న సోదాలను వ్యతిరేకిస్తూ నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు తీవ్రంగానే స్పందించారు. మసాజ్ సెంటర్లు, స్పాల ముసుగులో సాగుతున్న కార్యక్రమాలను గుర్తుచేస్తూ, పోలీసులకు సమాచారం వస్తే ఎక్కడైనా తనిఖీలు చేసే అధికారం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్పాలు, మసాజ్ సెంటర్లు, ఆయుర్వేద చికిత్స కేంద్రాల్లో సీసీ కెమెరాలను తప్పనిసరి చేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి: Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై హైకోర్టు ఏమన్నదంటే.. -
నటుడు విజయ్కి హైకోర్టులో ఊరట
Vijay Moves HC Against Entry Tax on BMW Car: నటుడు విజయ్కి మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. విజయ్ విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలుచేశారు. దీనికి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంట్రీట్యాక్స్ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ నటులు ఇలా పన్ను ఎగవేతకు పాల్పడడం సమంజసం కాదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్ ఎంట్రీట్యాక్స్ చెల్లించారు. అయితే ప్రత్యేకన్యాయమూర్తి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దు చేయాలంటూ విజయ్ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ శుక్రవారం జరిగింది. ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా న్యాయస్తానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. చదవండి: (మరో బాంబు పేల్చిన చైనా.. ఆ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి) -
తమిళ గీతాన్ని అవమానపరిచారంటూ ఆర్బీఐ సిబ్బందిపై కేసు నమోదు
చెన్నై: మన దేశంలోనే తమిళనాడు రాష్ట్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజల కంటే.. తమిళులు చాలా భిన్నమైన వాళ్లు. సమస్య వస్తే.. అందరూ ఒకే తాటిపైకి వచ్చి సమస్యలపై పోరాటం చేస్తారు. ముఖ్యంగా తమిళనాడు పద్ధతులు, సంస్కృతుల పట్ల రాష్ట్ర ప్రజలు చాలా సీరియస్గా ఉంటారు. అయితే తాజాగా మరోసారి తమిళ వాసులకు కోపం వచ్చింది. బుధవారం దేశ వ్యాప్తంగా 73వ రిపబ్లిక్ వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా రాష్ట్రీయ గీతం తమిళ్తాయ్ వాళ్తు ఆలపిస్తారు. అచ్చం మనం జాతీయ గీతం పాడేటప్పుడు ఎలాగ నిలబడతామో... వారు కూడా అలాగే నిలబడి తమిళ గీతాన్ని ఆలపిస్తారు. కానీ నిన్న తమిళ గీతం పాడేటప్పుడు మాత్రం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు లేచి నిలబడలేదు. ఈ సంఘటన తమిళ నాడు ఆర్బీఐ కార్యాలయంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్రంలో వివాదస్పదంగా మారింది. అంతేకాదు.. రాష్ట్రీయ గీతం పాడేటప్పుడు నిలబడని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల పై హైకోర్టు న్యాయవాది జి రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మద్రాసు కోర్టు పిటీషన్ కూడా దాఖలు చేశారు. చదవండి: కరోనా: మరోసారి 3 లక్షలకు దిగువన కేసులు.. కొత్తగా ఎన్నంటే ఇక ఈ కేసుపై విచారణ చేసిన కోర్టు.. తమిళ గీతం పాడేటప్పుడు ఆ అధికారులు నిలబడటం ఏ మాత్రం తప్పు కాదని పేర్కొంది. వారికి ఈ రూల్స్ తేలియదని మేం అనుకుంటున్నామని, దీనిపై ఇంత రాద్ధాంతం అవసరం లేదు అంటూ తీర్పు ఇచ్చింది. అయితే అటు కోర్టు తీర్పును రాష్ట్ర ఆర్థిక మంత్రి పీటీఆర్ త్యాగరాజన్, ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్లు ఖండించారు. అంతేకాదు ఆర్బీఐ కార్యాలయ ముట్టడికి తమిళ సంఘాలు పిలుపు నిచ్చాయి. దీంతో పోలీసులు ఆర్బీఐ చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. చదవండి: Uttar Pradesh Assembly Election 2022: ఏదో తేడా కొడుతోంది..! -
స్టాలిన్కు మద్రాస్ హైకోర్టులో ఊరట.. 18 కేసులు రద్దు
సాక్షి, చెన్నై: పరువు నష్టం దావా కేసుల నుంచి సీఎం స్టాలిన్కు ఊరట లభించింది. 18 కేసుల్ని రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. అన్నాడీఎంకే హయాంలో ప్రభుత్వాన్ని, సీఎంను, సీనియర్ అధికారులు, మంత్రులపై అప్పటి ప్రతిపక్ష నేత స్టాలిన్ అనేక ఆరోపణలు చేశారు. దీంతో ఆయన మీద అన్నాడీఎంకే పాలకులు 18 పరువు నష్టం దావా కేసులు నమోదు చేశారు. విమర్శలు, ఆరోపణలు చేసే హక్కు ప్రతిపక్ష నేతగా తనకు ఉందని, ఈ కేసులను రద్దు చేయాలని కోరుతూ అప్పట్లో స్టాలిన్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై కొంతకాలంగా విచారణ జరుగుతోంది. అదే సమయంలో డీఎంకే అధికారంలోకి రావడం, సీఎంగా స్టాలిన్ పగ్గాలు చేపట్టడంతో కేసులను ఉపసంహరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో పిటిషన్ విచారణను ముగించిన న్యాయమూర్తి నిర్మల్కుమార్ బెంచ్ శుక్రవారం తీర్పు వెలువరించింది. కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకున్న దృష్ట్యా 18 కేసుల్ని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. చదవండి: (సినీ నటి ఇంట్లో చోరీ.. ధనుష్ అరెస్ట్) -
ఆస్తి హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ఆస్తి హక్కుకు సంబంధించిన వ్యవహారంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీలునామా రాయకుండా ఒక వ్యక్తి మరణిస్తే.. అతని స్వార్జితం, వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్లో.. అతని కుమార్తెలకు వారసత్వ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో మరణించిన వ్యక్తి సోదరుని పిల్లలకు కాకుండా సొంత కుమార్తెకే తొలి హక్కు ఉంటుందని కీలక తీర్పు ఇచ్చింది గురువారం. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. హిందూ మహిళ, భర్త చనిపోయిన వాళ్ల ఆస్తి హక్కుకు సంబంధించి గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి వీలురాయకుండా చనిపోతే అతని ఆస్తిలో కూతుళ్లకు హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఒకవేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై.. తండ్రి వారసులు అందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే.. భర్త వారసులకు హక్కులు లభిస్తాయి అని ధర్మాసనం పేర్కొంది. ప్రతీకాత్మక చిత్రం మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే.. సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా? లేదంటే అతని సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరిస్తూ పై తీర్పును వెలువరించింది. తమిళనాడుకు చెందిన ఈ కేసుకు సంబంధించి మార్చి 1, 1994లో ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వగా.. ఈ తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. ఇక ఆర్డర్ డేట్ 21, 2009న జారీ చేసింది హైకోర్టు. ఇప్పుడు ఆ తీర్పును పక్కనపెడుతూ సుప్రీంకోర్టు తీర్పు కీలక వెలువరించింది. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణ మురారి ఆధ్వర్యంలోని బెంచ్.. ఈ తీర్పు కోసం 51 పేజీల తీర్పు కాపీని సిద్ధం చేయడం విశేషం. చదవండి: ఎన్నికల్లో సమోసా-చాయ్ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆ మూడు గంటలు లిక్కర్ సేల్స్పై బ్యాన్
సాక్షి, చెన్నై(తమిళనాడు): దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో ప్రతిరోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం, డబ్ల్యూహెచ్వో ఒమిక్రాన్పై రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలు కర్ఫ్యూ విధించడంతోపాటు కోవిడ్ ఆంక్షలను కూడా కఠినంగా అమలు చేస్తున్నారు. తాజాగా, మద్రాసు హైకోర్టు ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా నూతన సంవత్సర వేడుకలపై పలు ఆంక్షలను విధించాలంటూ సూచించింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబరు 31 రాత్రి 10 గంటల.. అర్ధరాత్రి 1 గంట దాకా.. మద్యం విక్రయాలు జరగకుండా చూడాలని ఆదేశించింది. ఆ మూడు గంటల పాటు బార్లు, హోటళ్లు ఎక్కడా కూడా మద్యం విక్రయించకుండా చర్యలు చేపట్టాలని బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక రెండు డోసుల టీకా ధృవీకరణ పత్రం లేకుండా డిసెంబరు 31 న రాత్రి 7గం. తర్వాత బహిరంగ ప్రదేశాలలో ఎవరిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. పుదుచ్చేరిలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై.. వేడుకల సమయంలో ప్రజలు ఆంక్షలను కఠినంగా పాటించాలని కోరారు.ప్రజలంతా తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ను వేయించుకోవాలని ఆమె కోరారు. పర్యాటకులు, రద్దీ ప్రదేశాల్లో కోవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరి పాటించాలని సూచించారు. వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్యను కూడా పరిమితంగా ఉండేలా చూడాలన్న ఆదేశాలు ఇదివరకే జారీ అయ్యాయి. -
వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్స్పై మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు..!
వాట్సాప్ గ్రూప్స్లో చేసే మెసేజ్స్పై పూర్తి బాధ్యత గ్రూప్స్ అడ్మిన్దేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్స్ విషయంలో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. బాంబే హైకోర్డుతో ఏకీభవిస్తూ..! గతంలో బాంబే హైకోర్టు వాట్సాప్ గ్రూప్ మెసేజ్స్ విషయంలో గ్రూప్ అడ్మిన్ను బాద్యుడిని చేయలేమని ఇచ్చిన తీర్పును మరోకసారి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ ఆ తీర్పును పునరుద్ఘాటిస్తూ సంచలన తీర్పునిచ్చింది. వాట్సాప్ గ్రూప్ సభ్యులు పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్కు గ్రూప్ అడ్మినిస్ట్రేటర్ బాధ్యులు కాదని వెల్లడించింది. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ బాంబే హైకోర్టు కిషోర్ వర్సెస్ స్టేట్ మహారాష్ట్ర తీర్పును మద్రాస్ హైకోర్టు ప్రస్తావించింది గ్రూప్లో మెసేజ్ పెట్టినవారే..! వాట్సాప్ గ్రూప్స్లో అడ్మిన్ కాకుండా గ్రూప్ సభ్యులు చేసిన నేరంలో అతను ఎలాంటి పాత్ర పోషించనట్లయితే నిందితుడి జాబితా నుంచి తప్పక తొలగించాలని పేర్కొంది. ఒకవేళ అడ్మిన్ నేరంలో ప్రమేయం ఉన్నట్లు చూపించే సాక్ష్యాలను సేకరించినట్లయితే అతణ్ణి చట్ట ప్రకారం విచారించవచ్చని కోర్టు వెల్లడించింది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం..! ఆయా వాట్సాప్ గ్రూప్స్లోని వ్యక్తులు గ్రూప్ అడ్మిన్పై కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా అడ్మిన్ను ఆయా సభ్యుల స్వార్థం కోసం ఇరికించే అవకాశం ఉన్నట్లు మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ కేవలం యాడ్, రిమూవ్ చేసే అధికారాన్నే కల్గి ఉంటారని పేర్కొంది. గ్రూప్ సభ్యులు పంపే సందేశాలకు అడ్మిన్ బాధ్యత వహించలేడని పిటిషన్ పేర్కొంది. గతంలో బాంబే కోర్టు కూడా.. వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు చేసే పోస్టులకు అడ్మిన్లను బాధ్యులను చేయలేమని బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ పేర్కొంది. సభ్యులు చేసే తప్పిదాలకు అడ్మిన్లపై క్రిమినల్ నేరం మోపలేమని అభిప్రాయపడింది. కోర్టుకెక్కిన వాట్సాప్, ఫేస్బుక్..! కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త ఐటీ చట్టాలను అమలులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఐటీ చట్టాలను సవాల్ చేస్తూ వాట్సాప్, ఫేస్బుక్ న్యాయస్థానాలకు ఆశ్రయించాయి. ఈ చట్టాలతో తమ ఖాతాదారుల వ్యక్తిగత భద్రతకు సంబంధించిన ప్రైవేటు సమాచారాన్ని ఇవ్వమని ప్రభుత్వం కోరడం రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నాయి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని తాము ఖాతాదారులకు హామీ ఇచ్చామని,. దాన్ని ఉల్లంఘించలేమంటూ అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. చదవండి : WhatsApp: గూగుల్ మ్యాప్స్లోనే కాదు..వాట్సాప్లో కూడా వెతికేయచ్చు..! ఎలాగంటే..? -
లైన్ క్లియర్.. పన్నీరు, పళనిలకు భారీ ఊరట
సాక్షి, చెన్నై (తమిళనాడు): అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఎన్నికలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ మద్రాసు హైకోర్టులో తిరస్కరణకు గురైంది. దీంతో కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో–కన్వీనర్ పళని స్వామిలకు ఊరట లభించింది. అలాగే బీజేపీ ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్ గెలుపుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ సైతం తిరస్కరణకు గురైంది. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కో–కన్వీనర్ ఎంపికకు ఈనెల మొదటి వారంలో నామినేషన్ల ప్రక్రియ సాగింది. ఈ పదువులకు ఆ పార్టీ నేతలు పన్నీరు సెల్వం, పళని స్వామిలు తప్పా, ఇతరులెవ్వరూ నామినేషన్లు వేయడానికి వీలు లేకుండా అన్నాడీఎంకే వర్గాలు ముందుకు సాగాయి. చిరవకు ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరడంతో ఆ ఇద్దరు నేతలు ఏకగ్రీవంగా ఎంపికైనట్టు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో హోసూరుకు చెందిన అన్నాడీఎంకే నాయకుడు జయచంద్రన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సంస్థాగత ప్రక్రియలు జరిగినట్టు, ఈ ఇద్దరి ఎంపికను ధ్రువీకరించకుండా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. వాదనల అనంతరం ఒక పార్టీకి సంబంధించి సంస్థాగత వ్యవహారాలు, ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్కు ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చేందుకు తగ్గ జోక్యం కోర్టుకు లేదని పేర్కొంది. ఈ పిటిషన్ విచారణ యోగ్యం కాదని తిరస్కరించింది. దీంతో పన్నీరు, పళని ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. వానతీ శ్రీనివాసన్ గెలుపు బీజేపీ మహిళా విభాగం జాతీయ అ«ధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ అసెంబ్లీ ఎన్నికల్లో కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. ప్రత్యర్థి మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్పై ఆమె 1,600 ఓట్లతో గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ ఆ నియోజకవర్గంలో పోటీచేసిన స్వ తంత్ర అభ్యర్థి రాహుల్ గాంధీ మద్రాసు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మంగళవారం న్యాయమూర్తి భారతీ దాసన్ నేతృత్వంలోని బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఆధారాలు లేకపోవడం, ఇతర అభ్యర్థులు ఎలాంటి ఆరోపణలు చేయకపోవడం వంటì అంశాలను పరిగణించిన కోర్టు పిటిషన్ విచారణను తిరస్కరించింది. చదవండి: వామ్మో.. లోదుస్తుల్లో బంగారం.. -
జైభీమ్ సినిమాలో కోర్టు సీను డైలాగులు నేనే రాశా
(ఎ. అమరయ్య, సాక్షి ప్రత్యేక ప్రతినిధి, అమరావతి): ‘సత్వర న్యాయం కోసం పోరు కొనసాగాలి. దేశంలో కోర్టుల ద్వారా ప్రతి పౌరునికీ సత్వర న్యాయం అందాలి. జైళ్లలో మగ్గుతున్న వారిలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలే. వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత పౌరహక్కుల సంఘాలు, న్యాయవాదులపై ఉంది’ అని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జై భీమ్ సినిమా స్ఫూర్తిప్రదాత జస్టిస్ కె.చంద్రు అభిప్రాయపడ్డారు. పీడిత వర్గాలకు న్యాయం అందించాలన్న దిశగా వచ్చిందే జైభీమ్ సినిమా అని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా బడుగులకు సత్వర న్యాయం అందుబాటులోకి రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. చట్టాలను ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు చట్టాలను బాగా చదివి, అర్థం చేసుకుని అన్వయ, ఆచరణలకు పూనుకోవాలి. అప్పుడే గాలి, నీరు లభించినంత సహజంగా న్యాయాన్నీ అందుకోగలం. హక్కుల కోసం పోరాడినప్పుడు, అసమానతలను నిలదీసినప్పుడు చట్టం తనని తాను లోతుగా శోధించుకునేలా చేయాలి. ఇది కేసులు వేసిన వారికి మాత్రమే దక్కే విజయం కాదు. ప్రజలు చైతన్యం కావడానికి ఉపయోగపడుతుంది. ప్రజాభిప్రాయం చట్టాలను, కోర్టులను ప్రభావితం చేస్తుంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమం విజయం సాధించిన తీరు ఇదే చెబుతోంది. అణగారిన వర్గాలకు సత్వర న్యాయం కోసం అయినా పోరు కొనసాగాలి. అప్పుడే న్యాయమూర్తుల మైండ్సెట్ కూడా మారుతుంది. న్యాయవాదులు ఎంత తెలివిగా ప్రశ్నిస్తే తీర్పులు అంత ప్రభావవంతంగా వస్తాయి. 1999లో కోర్టు ధిక్కార చట్టానికి సవరణ జరిగింది. దాని ప్రకారం.. చేసిన వ్యాఖ్య నిజమైతే అది కోర్టు ధిక్కారం కిందకు రాదు. నేను జడ్జిగా ఉన్న ఆరేళ్లలో ఒక్క కోర్టు ధిక్కార కేసులో శిక్ష వేయలేదు. కులానికి వ్యతిరేకంగా పోరాటం జరగాలి. కుల వివక్ష, క్రూరత్వాలను అరికట్టడానికి కోర్టులు చట్టాలను విస్తృతంగా వినియోగంలోకి తేవాలి. జైభీమ్ సినిమా చెప్పిందదే ఇదో 28 ఏళ్ల నాటి ఘటన. నేను బాధితుల తరఫు లాయర్ని. తీర్పు ఇచ్చింది జస్టిస్ పీఎస్ మిశ్రా. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో తెగువ చూపిన మనుషుల కథ అది. వాళ్లు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడమే కాదు.. సమాజంలో అందరి జీవితాలు మెరుగుపడటానికి తోడ్పడ్డారు. ఇలాంటి కేసుల్లో వాదోపవాదాలకు లాయర్లకు దొరికే అవకాశం తక్కువ. పాయింట్ సూటిగా, జడ్జిని తాకేలా క్లుప్తంగా ఉండాలి. అటువంటి అవకాశం నాకొచ్చింది. ఆ సినిమాలో హీరో కోర్టులో చెప్పే డైలాగులు తక్కువ. వేరే వాళ్లు రాస్తే పెడర్ధాలు వచ్చే అవకాశం ఉంటుందని నన్నే రాయమన్నారు. మానవ హక్కుల కోసం పోరాడిన మహావ్యక్తి జస్టిస్ కృష్ణయ్యర్ బొమ్మ కోర్టు సీన్లో పెట్టించింది కూడా నేనే. జై భీమ్ ఈవేళ ఓ నినాదమైంది. కార్మికవర్గాన్నీ, మేధావి వర్గాన్నీ ఒకే వేదిక మీదకు తెచ్చింది. ఈ సినిమా చూసిన వారందరి నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి. ఒకటి.. ప్రస్తుత సమాజంలోనూ ఇంత దుర్భరంగా జీవించే జాతులున్నాయా? ఇందుకు సిగ్గుపడాలి. రెండు.. పోలీసులు ఇంత క్రూరంగా ఉంటారా? అని. గిరిజన జీవితాలపై తీసిన సినిమాను ఓటీటీ ప్లాట్పారాల మీద విడుదల చేస్తారా? పేదలు చూసే అవకాశం లేదా? అని అడుగుతున్నారు. అందుకే మార్చిలో థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ సినిమాలో నటించకపోయినా చాలా మంది నన్నే హీరో అన్నట్టుగా ప్రశంసిస్తున్నారు. రెండేళ్ల కిందట విజయవాడలో ఓ సెమినార్కి వస్తే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈవేళ పరిస్థితి భిన్నంగా ఉంది. సెల్ఫీ ప్లీజ్ అంటున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లేందుకు విమానం ఎక్కితే.. జై భీమ్ స్ఫూర్తిప్రదాత జస్టిస్ చంద్రు మన మధ్య ఉన్నారని ఎయిర్హోస్టెస్లు మైకుల్లో చెబుతున్నారు. ప్రస్తుతం నేనో సెలబ్రిటీని అయ్యా (నవ్వు). ఉత్తమ తీర్పులతోనే కోర్టుల ఔన్నత్యం ఉత్తమ తీర్పులతో కోర్టుల ఔన్నత్యం పెరుగుతుంది. కోర్టులేమన్నా శిలాశాసనాలా, రాజ్యంగమేమన్నా అంతిమ గ్రంథమా, అదో కాగితపు పులి, బంగాళాఖాతంలో విసిరి వేయండని 1975 దాకా చాలా మంది వాదించారు. జస్టిస్ చిన్నపరెడ్డి మీసా చట్టంపై ఇచ్చిన తీర్పు ఈ అభిప్రాయాన్ని తల్లకిందులు చేసింది. ఇప్పుడు మళ్లీ 1975 నాటికన్నా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు నిదర్శనం అయోధ్య తీర్పు. రాజ్యాంగం పరిష్కారం కాదన్న వారే ఈవేళ తొలినాటి రాజ్యాంగ రాతప్రతుల్ని (సెక్యులరిజం, సోషలిజం పదాలు లేని ప్రతి. 42వ సవరణ ద్వారా అవి రాజ్యాంగంలో చేరాయి) పంచిపెడుతున్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను అంబేడ్కర్ ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నారని ఆరోపించిన వాళ్లే ఈవేళ ఆయన్ను కీర్తిస్తున్నారు. వాస్తవానికి ఆ పదాలను బుద్ధిజం నుంచి తీసుకున్నట్టు అంబేడ్కర్ 1954లో ఆకాశవాణి ప్రసంగంలో చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుతోంది గిరిజనులే... పర్యావరణాన్ని నిజంగా కాపాడుతోంది గిరిజనులే. అటువంటి వారిపై అటవీ చట్టాల కింద కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిజానికి ఎస్టీలలో సామాజిక మండళ్లు ఉంటాయి. సొంత ప్రవర్తనా నియమావళి ఉంది. దాని ప్రకారం నడుచుకుంటారు. కానీ ఇప్పటికీ డీనోటిఫైడ్ జాతుల పేరిట గిరిజనుల బతుకుల్ని బుగ్గి పాల్జేస్తున్నారు. అపరిష్కృత కేసుల్లో తిరిగి వాళ్లనే అరెస్ట్ చేస్తున్నారు. -
జయలలిత నివాసం.. మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
చెన్నై: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి సంబంధించి మద్రాసు హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని కోర్టు తెలిపింది. దీనిపై అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టేసింది. జయలలిత ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని స్పష్టం చేసిన కోర్టు.. మూడు వారాల్లో పోయెస్ గార్డెన్ని జయలలిత మేన కోడలి దీపకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. (చదవండి: పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే..) జయలలిత 2016లో అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి ఏడాదే ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్ను స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. (చదవండి: CJ Sanjib Banerjee: బరువెక్కిన హృదయంతో లేఖ.. నన్ను క్షమించండి..!) తమని జయలలిత వారసులుగా కోర్టు గుర్తించిందని.. అలాంటిది ఆమె నివాసాన్ని ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందంటూ దీప, దీపక్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ విషయంపై చాలా రోజుల నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. అయితే తాజాగా పోయెస్ గార్డెన్ ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది. చదవండి: ద్విసభ్య కమిషన్.. జయలలిత మరణం మిస్టరీ నిగ్గు తేల్చేనా? -
పూజారిగా ఏడేళ్ల బాలుడు.. కోర్టు ఏం చెప్పిందంటే..
తిరువొత్తియూరు( చెన్నై): నీలగిరిలో ఏడేళ్ల బాలుడిని అమ్మవారి ఆలయంలో పూజారిగా నియమించడంపై దేవదాయశాఖను హైకోర్టు వివరణ కోరింది. నెడుకాడు గ్రామంలో గేల్తై అమ్మన్ ఆలయం ఉంది. అమ్మవారు ఓ సామాజిక వర్గానికి కులదేవత. 1994 మే 25న ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. వంశపార్యంపర్యంలో భాగంగా గోపాలకృష్ణ కుమారుడు రాణేష్ (7)ను పూజారిగా నియమించారు. ఇక్కడ పూజారిగా ఉండే వారు పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. దీనిపై నీలగిరి జిల్లా కొత్తగిరి గ్రామానికి చెందిన టి.శివన్ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ఇన్చార్జ్ ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనాథ్ బండారి, ఆదికేశవులు బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. పూజారిగా నియమించడం వల్ల బాలుడి చదువు ఆగిపోయిందని..అతని భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయమూర్తులు దేవాదాయశాఖను ఆదేశించారు. చదవండి: MS Dhoni- Shahrukh Khan: అరె అచ్చం నాలాగే.. కొట్టేశావు పో..! షారుఖ్ సిక్సర్.. ధోని ఫొటో వైరల్ -
CJ Sanjib Banerjee: బరువెక్కిన హృదయంతో లేఖ.. నన్ను క్షమించండి..!
సాక్షి, చెన్నై : ‘ నన్ను క్షమించండి’ అంటూ వీడ్కోలు కార్యక్రమాన్ని సైతం పక్కన పెట్టి, బరువెక్కిన హృదయంతో సీజే సంజీబ్ బెనర్జీ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బందికి లేఖ రాసి పెట్టి రోడ్డుమార్గంలో కోల్కతాకు బుధవారం బయలుదేరి వెళ్లారు. వివరాలు.. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కోల్ కతాకు చెందిన సంజీబ్ బెనర్జీ ఈ ఏడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, హఠాత్తుగా ఆయన్ని ప్రాధాన్యత లేని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయడం చర్చకు దారితీసింది. ఆయన బదిలీని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు పోరాటాలు చేసినా ఫలితం శూన్యం. ఈ బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో గౌరవంగా బాధ్యతల నుంచి సంజీబ్ బెనర్జీ తప్పుకున్నారు. న్యాయమూర్తి పదవీ విరమణ పొందినా, బదిలీ అయినా, బార్ కౌన్సిల్, న్యాయమూర్తులు, న్యాయవాద సంఘాలు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. అయితే, ఆ కార్యక్రమాన్ని సైతం పక్కన పెట్టి బరువెక్కిన హృదయంతో అందరికీ సారీ అంటూ లేఖ రాసి పెట్టి కోల్ కతాకు సంజీబ్ బెనర్జీ వెళ్లిపోయారు. రోడ్డు మార్గంలో పయనం.. బుధవారం సీజే బెంచ్ పదికి పైగా కేసుల్ని విచారించాల్సి ఉంది. అయితే, ఎవ్వరికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, కేవలం హైకోర్టు సిబ్బంది, సహచర న్యాయమూర్తులకు లేఖ రాసి ఐ యామ్ సారీ, కృతజ్ఞతలు అని పేర్కొంటూ రోడ్డు మార్గంలో కోల్ కతాకు బయలు దేరి వెళ్లారు. తాను ఏ పనిచేసినా హైకోర్టు కోసమే చేశానని గుర్తు చేస్తూ, వీడ్కోలు కార్యక్రమానికి సైతం దూరం వెళ్తున్నానని పేర్కొన్నారు. ఆనందంగానే బయలు దేరుతున్నానని ముగించారు. దీంతో సీనియర్ న్యాయమూర్తి దురైస్వామి కేసుల విచారణపై దృష్టి పెట్టారు. ఇక, అలహాబాద్ హైకోర్టుకు చెందిన సీనియర్ న్యాయమూర్తి మునీశ్వర్నాథ్ బండారిని హైకోర్టు తాత్కాలిక ఇన్చార్జ్ న్యాయమూర్తిగా నియమించారు. ఆయన గురు లేదా శుక్రవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. -
‘సీజే బదిలీ ప్రజా ప్రయోజనాల కోసమేనా?’
సాక్షి, న్యూఢిల్లీ: వాక్ స్వాతంత్య్రం, లౌకికవాదం, స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, ఆరోగ్య హక్కు, రాష్ట్ర జవాబుదారీతనంపై అనేక ఉత్తర్వులు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీని ఎందుకు బదిలీ చేశారంటూ సుప్రీంకోర్టు కొలీజియంను ఆ కోర్టు లాయర్లు ప్రశ్నించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. జస్టిస్ సంజీబ్ బెనర్జీని మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేయాలన్న కొలీజియం సిఫార్సుపై మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. పదవీ బాధ్యతలు చేపట్టిన 10 నెలల్లోపే బదిలీ చేయడం ప్రజా ప్రయోజనం కోసమా? లేక మెరుగైన న్యాయ నిర్వహణ కోసమా? అని తమ లేఖలో ప్రశ్నించారు. 75 మంది న్యాయమూర్తులుండే మద్రాసు హైకోర్టు నుంచి కేవలం ఇద్దరు న్యాయమూర్తులుండే మేఘాలయా హైకోర్టుకు బదిలీ చేయడం విస్తుగొలిపే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోం దని పేర్కొన్నారు. ఈ తరహా బదిలీ నిజాయితీ కలిగిన న్యాయమూర్తి ప్రతిష్టను దెబ్బతీయడంతోపాటు ప్రజల దృష్టిలో న్యాయవ్యవస్థ ప్రతిష్టను సైతం దిగజారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రకృతి చేస్తున్న హెచ్చరిక
‘చెన్నై మహానగరం ఏడాదిలో ఆరునెలలు దాహార్తితో విలవిల్లాడుతుంది. మరో ఆరునెలలు జల దిగ్బంధంలో మృత్యువుకు చేరువవుతుంది’ అంటూ మద్రాస్ హైకోర్టు ఈమధ్య చేసిన వ్యాఖ్య ప్రత్యక్షర సత్యం. ఊహించని విపత్తులు విరుచుకుపడితే, అందువల్ల ఇబ్బందులు తలెత్తితే నెపం ప్రకృతిపై నెట్టినా జనం సహిస్తారు. కానీ వైపరీత్యాలు రివాజైనప్పుడు, వాటివల్ల కలిగే నష్టాన్ని కనిష్ట స్థాయికి తీసుకెళ్లే ముందస్తు నియంత్రణ చర్యలు కొరవడినప్పుడు నిస్సందేహంగా పాలకు లదే పాపం అవుతుంది. ఏటా ఈ సీజన్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, దక్షిణ కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్లోని రాయలసీమ, ఇతర తీర ప్రాంతాలకు ఈశాన్య రుతుపవనాలు 50 శాతం వర్షాలను మోసుకొస్తాయి. ఆ సమయంలో అల్పపీడనం, తుపానులు చోటు చేసుకుంటే ఇదింకా పెరుగు తుంది. చెన్నైను ఈస్థాయిలో వరదలు ముంచెత్తడం ఈమధ్యకాలంలో ఇది రెండోసారి. 2015లో ఆ మహానగరం రోజుల తరబడి వరదనీటిలో తేలియాడింది. జనజీవనం స్తంభించిపోయింది. గడప దాటి రోడ్డెక్కిన ప్రతి ఒక్కరూ ఎక్కడివారక్కడ చిక్కడిపోయారు. వందల ఇళ్లు కూలిపోగా వేలాది ఇళ్లు, భవంతులు దెబ్బతిన్నాయి. అంతక్రితం పదేళ్లకొక మారు వరదలు ముంచెత్తడం సాధారణం కాగా, ఆ తర్వాత ఇంచుమించు ఏటా ఏదో మేరకు ఆ బాధలు తప్పడం లేదు. చెన్నైలో కొన్ని ప్రాంతాలైనా ప్రతియేటా వరద నీటితో కష్టాలు పడుతున్నాయి. 2015 నాటి వరదల అనుభవం తర్వాత నిపుణుల్ని సంప్రదించి, తగిన చర్యలు తీసుకోవాలని ఎందరో ప్రముఖులు పాలకుల్ని వేడుకున్నారు. కానీ స్తబ్దుగా ఉండిపోయిన అధికార యంత్రాంగం పుణ్యమా అని మళ్లీ అయిదేళ్ల నాటి దృశ్యాలు పునరావృత మయ్యాయి. చెన్నై నగర పాలక సంస్థ పాలకవర్గం గడువు ముగిసి నాలుగేళ్లయింది. ఓటమి భయంతో గత అన్నాడీఎంకే ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. దాంతో ఇంతవరకూ చెన్నైకి మేయర్, కార్పొరేటర్లు లేరు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేసినా స్థానిక పాలన లేనప్పుడు విపత్తు నివారణ చర్యలు అరకొరగానే ఉంటాయి. అయిదారు రోజులుగా ఎడతెరిపి లేకుండా పడిన భారీ వర్షాల పర్యవసానంగా 14 మంది చనిపోగా, ఎందరో గాయపడ్డారు. వేలాది ఇళ్లు వరదల్లో చిక్కుకు న్నాయి. నిత్యావసరాలు లభించక, కనీసం తాగడానికి నీరు సైతం కరువై జనం నరకాన్ని చవిచూశారు. నగరంలోని తిరువొట్రియూర్, పెరంబూర్, పట్టాళం వంటి ప్రాంతాల్లో ఆరడుగుల మేర నీరు నిలిచింది. మొన్న ఆరు, ఏడు తేదీల్లో 24 గంటల వ్యవధిలో చెన్నైలోని చాలా ప్రాంతాల్లో 200 మిల్లీ మీటర్ల వర్షపాతం పడిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరదనీరు ముంచెత్తడంతో నగరంలో ఏడు సబ్వేలు, 23 రోడ్లు మూసేయాల్సి వచ్చింది. ఆ నగరం శుక్రవారం కొద్దిగా తెరిపిన పడింది. ఇది ఒక్క చెన్నై నగరానికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. వర్షాకాలంలో దేశంలోని అనేక నగరాలు ఇంచుమించు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నాయి. పట్టణీకరణకు అనుసరిం చాల్సిన శాస్త్రీయ విధానాలను బేఖాతరు చేయడం, జనసాంద్రత ఎక్కువైనప్పుడు తలెత్తగల ఇబ్బం దులపై ప్రభుత్వాలకు అంచనాలు లేకపోవడం ప్రకృతి వైపరీత్యాల సమయంలో జనం పాలిట శాపాలవుతున్నాయి. అభివృద్ధిని ఒకేచోట కేంద్రీకరించడం, మరెక్కడా జీవనోపాధికి అవకాశాలు లేకుండా చేయడం వల్ల గ్రామాలనుంచీ, పట్టణాలనుంచీ నగరాలకు వలసలు పెరుగుతున్నాయి. అంతమందికి అవసరమైన మౌలిక సదుపాయాలు ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. ఈ క్రమంలో చెరువులు, సరస్సులుగా ఉన్న ప్రాంతాలు బస్తీలుగా మారుతున్నా చూసీచూడనట్టు వదిలే స్తున్నారు. కనీసం నిర్దేశించుకున్న నిబంధనలను పాటిద్దామన్న స్పృహ కూడా లేకుండా ఎడాపెడా నిర్మాణాలకు అనుమతులిస్తున్నారు. డబ్బూ, పలుకుబడి ఉంటే చాలు ఏవైనా సునాయాసంగా లభి స్తాయి. ప్రైవేటు వ్యక్తుల సంగతలావుంచి ప్రభుత్వాలే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం అన్నిచోట్లా కనబడుతుంది. చెన్నైలో ఇప్పుడున్న విమానాశ్రయమైనా, బస్సు టెర్మినల్ అయినా, ఇత రత్రా నిర్మాణాలైనా చిత్తడి నేలల్లో నిర్మించినవేనన్నది నిపుణుల ఆరోపణ. కురిసిన నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెరగడానికి తోడ్పడే పథకాలు అమల్లోకి తీసుకురావడం, ఎంత వరదనీరు ముంచెత్తినా క్షణాల్లో అది బయటకుపోయేందుకు అనువైన మార్గాల నిర్మాణం భవిష్యత్తులో ఇలాంటి దుస్థితి తలెత్తకుండా చూస్తుంది. ఈ దిశగా అసలే చర్యలు తీసుకోలేదని చెప్పలేం. కానీ నిధుల కైంకర్యం తప్ప మరో యావలేని రాజకీయ నాయకుల తీరుతెన్నులవల్ల ఆ చర్యలన్నీ నిరర్థక మవుతున్నాయి. చెన్నై నగరానికి స్మార్ట్ సిటీ ప్రతిపత్తి వచ్చింది. ఆ పథకం కింద నిధులూ అందాయి. అందువల్లే వరద బెడద కాస్త తగ్గిందని మాజీ సీఎం పళనిస్వామి చెబుతున్నారు. కానీ ఖర్చయిన మొత్తంతో పోలిస్తే జరిగిన మేలెంత అన్నది ప్రశ్న. ఇప్పుటికైనా తగిన చర్యలు మొదలె డితే పదేళ్లకల్లా చెన్నై మెరుగుపడుతుందంటున్న పర్యావరణవేత్తల హితవచనం చెవికెక్కాలి. ఇటీవలే విరుచుకుపడిన ఉత్తరాఖండ్ వరద బీభత్సాన్ని, ఇప్పుడు చెన్నై దుస్థితిని చూశాకైనా ప్రభుత్వాలు మేల్కొనాలి. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలూ సమానంగా ఎదగడంతో పాటు మహానగరాలపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రకృతిని సంరక్షించుకుంటే ఆపత్సమయాల్లో అది మనను అమ్మలా కాపాడుతుంది. విచ్చలవిడిగా వ్యవహరించి ధ్వంస రచనకు పూనుకుంటే నిర్దాక్షిణ్యంగా కాటేస్తుంది. -
TN: గుణపాఠం నేర్వరా? : హైకోర్టు
సాక్షి, చెన్నై: చెన్నై జలదిగ్బంధంపై మద్రాసు హైకోర్టు కన్నెర్ర చేసింది. ఐదేళ్లు ఏం చేశారంటూ కార్పొరేషన్ అధికారులపై ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా గుణపాఠం నేర్వరా..? అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ, న్యాయమూర్తి ఆది కేశవులు బెంచ్ ముందు మంగళవారం చెన్నై నగరంలో రోడ్ల విస్తరణ, ఫుట్పాత్లలో ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్రంగా∙స్పందించారు. 2015లో చెన్నై నీట మునిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఐదేళ్లుగా ఏం చేశారు? అని కార్పొరేషన్ వర్గాల్ని ప్రశ్నించారు. ఒకసారి చెన్నై నీట మునిగినానంతరం, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ ఐదేళ్ల కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదా..?, తీసుకుని ఉంటే, రెండు రోజుల వానకే జలదిగ్బంధంలో ఈ నగరం చిక్కేదా..? అని ప్రశ్నించారు. చెన్నైను వరద విలయం నుంచి గట్టెక్కించే పథకాలు చేపట్టలేరా..? అని ప్రశ్నిస్తూ, గుణపాఠం నేర్వాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో చెన్నైలో సమస్యలను పరిష్కరిస్తారని భావిస్తున్నామని, లేనిపక్షంలో కోర్టు ధిక్కారం కేసును ఎదుర్కోక తప్పదని కార్పొరేషన్ అధికారుల్ని సీజే బెంచ్ హెచ్చరించింది. -
TN: కేసుల నుంచి ఆ ముగ్గురికీ ఉపశమనం
సాక్షి, చెన్నై: గత ప్రభుత్వం వేసిన పరువు నష్టం దావా కేసుల్లో డీఎంకే ఎంపీలు కనిమొళి, దయానిధి మారన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్కు విముక్తి లభించింది. సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు చేసినట్టు గత ప్రభుత్వ హయాంలో వీరిపై దావా దాఖలైంది. ఈ పిటిషన్ విచారణలో ఉండగా, రాష్ట్రంలో అధికారం మారింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన డీఎంకే సర్కారు ఆ కేసుల్ని కొనసాగించలేమని, రద్దు చేయాలని కోర్టుకు సూచించింది. దీంతో ఆ ముగ్గురి మీద వేర్వేరుగా దాఖలైన పిటిషన్లు తిరస్కరిస్తూ, కేసు నుంచి విముక్తి కల్పిస్తూ సోమవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చిక్కుల్లో ఎస్పీ వేలుమణి.. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటిషన్పై పది వారాల్లో చార్జ్షీట్ దాఖలుకు ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. ఎస్పీ వేలుమణిపై టెండ్లర్లలో అక్రమాలు అనేక ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ దాడులు సైతం జరిగాయి. ఈ పరిస్థితుల్లో ఎస్పీ వేలుమణికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీ ఆర్ ఎస్భారతి దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. చార్జ్షీట్ దాఖలు చేయాలని, విచారణను త్వరితగతిన ముగించాలని ఏసీబీని కోర్టు ఆదేశించింది. -
చర్చికి వెళ్లినంత మాత్రాన.. ఎస్సీ ధ్రువపత్రం రద్దు చేయరాదు
సాక్షి, న్యూఢిల్లీ: గోడలకు శిలువ తగిలించుకోవడం, చర్చికి వెళ్లినంత మాత్రాన... వాటిని కారణాలుగా చూపుతూ ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం రద్దు చేయరాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హిందు పల్లన్ సామాజికవర్గానికి (ఎస్సీ) చెందిన పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలంటూ తీసుకొన్న కింది కోర్టు నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ ఎం.దురైస్వామిల ధర్మాసనం పక్కనబెట్టింది. ‘‘పిటిషనర్ అయిన మహిళ హిందు పల్లన్ తల్లిదండ్రులకు జన్మించారనడంలో ఎలాంటి సందేహం లేదు. పిటిషనర్ను ఓ క్రైస్తవుడు వివాహం చేసుకోవడం.. వారి పిల్లలు భర్త మతానికి చెందిన వారుగా గుర్తించడంతో పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేసినట్లు గుర్తించాం. పిటిషనర్ డాక్టర్ కావడంతో ఆమె క్లినిక్ను సందర్శించామని గోడలకు క్రాస్ వేలాడుతూ కనిపించిందని అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగా మతాన్ని స్వీకరించారని నిర్ధారణకు రాలేం. పిటిషనర్ తన భర్త, పిల్లలతో చర్చికి వెళ్లినంత మాత్రాన అసలు విశ్వాసాన్ని పూర్తిగా వదిలేశారని భావించలేం’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఊహాజనితంగా నిర్ణయం తీసుకొని కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. -
కార్పొరేట్ సంస్థల కోసం ప్రజలపై కాల్పులా..?
సాక్షి, చెన్నై: కార్పొరేట్ సంస్థల కోసం ప్రజలపై కాల్పులు జరపడం భావ్యం కాదని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తూత్తుకుడిలో స్టెరిలైట్పరిశ్రమకు వ్యతిరేకంగా 2018లో జరిగిన ఉద్యమ ర్యాలీ తుపాకీ కాల్పులకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ వ్యవహారం సీబీఐ విచారణలో ఉంది. మానవ హక్కుల కమిషన్తో పాటుగా గత ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిషన్ సైతం ఈ ఘటనపై దర్యాప్తు చేశాయి. అదే సమయంలో బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు, మానవ హక్కుల సంఘాల విచారణకు అడ్డంకులు, నివేదికలు తదితర వ్యవహారాలపై మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యా యి. సోమవారం ఇవి విచారణకు రాగా, ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ బెంచ్ తీవ్రంగానే స్పందించింది. కార్పొరేట్ సంస్థల కోసం ప్రజల మీద కాల్పులా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భావ్యం కాదు అని, ప్రభుత్వాలపై కార్పొరేట్ సంస్థలు ఆధిక్యాన్ని ప్రదర్శించ కూడదని పేర్కొంటూ, ఈ కాల్పుల్ని తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు, గాయపడ్డ వారికి నష్ట పరిహారం పెంపు మీద దృష్టి పెట్టాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు. దివ్యాంగుల కోసం.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ భవనాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వసతులు కలి్పంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వివరిస్తూ దాఖలైన పిటిషన్ను సీజే సంజీబ్ బెనర్జీ బెంచ్ విచారించింది. వాదనల అనంతరం దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, వసతులు తప్పనిసరి అని ప్రభుత్వానికి బెంచ్ స్పష్టం చేసింది. ఇప్పటికే 54శాతం మేరకు ఏర్పాట్లు జరిగాయని, ఏడాదిలోపు అన్ని పనులు పూర్తి చేస్తామని కోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. లుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు; లక్ష్మణరేఖ దాటి ప్రవర్తించబోం..!
సాక్షి, చెన్నై: తమిళనాడులో జల్లికట్టు క్రీడలో ఇకపై నాటు ఎద్దులను మాత్రమే వినియోగించాలని నిర్వాహకుల్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఇందుకు తగ్గ తీర్పును గురువారం వెలువరించింది. తమిళుల సాహసక్రీడగా జల్లికట్టు ప్రపంచప్రసిద్ధి గాంచిన విషయం తెలిసిందే. జంతు ప్రేమికుల రూపంలో నిషేధాన్ని కొన్ని సంవత్సరాలు ఎదుర్కొన్నా, చివరకు మహోద్యమం ద్వారా ఈ క్రీడను తమిళులు మళ్లీ దక్కించుకున్నారు. ఏటా సంక్రాంతి పర్వదినం వేళ కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ ఈ క్రీడ నిర్వహిస్తున్నారు. కాగా ఒక్కియం తురై పాక్కంకు చెందిన శేషన్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సమయంలో జల్లికట్టులో కేవలం నాటు ఎద్దులను మాత్రమే ఉపయోగించాలన్న వాదన తెర మీదకు వచ్చింది. వాదనల అనంతరం హైకోర్టు బెంచ్ స్పందిస్తూ, జల్లికట్టు క్రీడలో కేవలం నాటు ఎద్దుల్ని మాత్రమే ఉపయోగించాలని, విదేశీ, స్వదేశంలోని ఇతర జాతుల ఎద్దులను, ఆవుల్ని ఉపయోగించకూడదని తీర్పు ఇచ్చారు. ఈమేరకు పశువైద్యుడి సర్టిఫికెట్ను ఎద్దుల యజమానులు సమర్పించాలని స్పష్టం చేశారు. నకిలీ సర్టిఫికెట్లు సమర్పించిన పక్షంలో కోర్టు ధిక్కార కేసు తప్పదని హెచ్చరించారు. లక్ష్మణ రేఖదాటి స్పందించబోం.. స్పీకర్ అసెంబ్లీలో తీసుకునే నిర్ణయాలు లక్ష్మణ రేఖ లాంటిదని, దానిని దాటే విధంగా తాము జోక్యం చేసుకోలేమని మద్రాసు హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. అసెంబ్లీలో సభ్యులందరికీ.. సమానంగా పరిగణించాలని, ఎవరికీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకూడదంటూ కోయంబత్తూరుకు చెందిన లోకనాథన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం విచారణ సమయంలో న్యాయమూర్తులు స్పందిస్తూ, ఒక సభ్యుడు ఎక్కడ.. ఎలా.. కూర్చోవాలి, ఎంత సేపు మాట్లాడాలి అన్న వ్యవహారాలన్నీ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలకు అనుగుణంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తాము వ్యాఖ్యానించబోమని తేల్చి చెప్పారు. చదవండి: MK Stalin: ఆస్తులు అమ్మితే ఆటకట్టిస్తాం! -
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు, అదనంగా ఎంత ప్రీమియం చెల్లించాలి?
వాహనదారుల సంక్షేమాన్ని కోరుతూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు తప్పనిసరి చేస్తూ మద్రాసు హై కోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పు అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసేప్పుడు ఎంత ఆర్థిక భారం పడుతుంది. అమలు విధానం ఎలా ఉండవచచ్చు, కోర్టు తీర్పుపై ఇటు వాహన తయారీ సంస్థలు, అటు ఇన్సురెన్సు కంపెనీలు ఏమనుకుంటున్నాయి ? బంపర్ టూ బంపర్ లక్షలు ఖర్చు పెట్టి వాహనం కొనుగోలు చేసే సందర్భంలో ఇన్సెరెన్సు ప్రీమియం కట్డడంలో చాలా మంది వెనుకాముందు ఆలోచిస్తారు. ప్రీమియం తగ్గించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తారు. దీనికి తగ్గట్టే ఇన్సెరెన్సు సంస్థలు, వాటి ఏజెంట్లు అతి తక్కువ ప్రీమియం ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సు ప్లాన్లనే చెబుతుంటారు. ఇప్పటి వరకు ఈ తరహా పద్దతే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరి చేసింది మద్రాసు హై కోర్టు. అంటే వాహనానికి ఏదైనా ప్రమాదం వాటిలినప్పుడు ఆ వాహనంతో పాటు దాని యజమాని లేదా డ్రైవరు, అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది. ప్రీమియం ఎంత పెరుగుతుంది? కొత్త వాహనాలకు కొనుగోలు చేసేప్పుడు నూటికి తొంభైశాతం మంది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సునే చేయిస్తున్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించేప్పుడే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాహన నెట్ప్రైస్లో 3 శాతం మొత్తాన్ని ఒక ఏడాది పాటు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సు ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలని కోర్టు సూచించింది. ఆ లెక్కన వాహనం ధరలో 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచితే మార్కెట్వాల్యూ, తరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇన్సురెన్సు ప్రీమియం దాదాపు మూడింతలు పెరిగిపోతుంది. ఆర్థిక భారం ఎంతంటే ? ఐదేళ్ల కాలానికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును లెక్కించందుకు హ్యుందాయ్ కంపెనీకి చెంది వెన్యూ కారును పరిగణలోకి తీసుకుంటే.. ఇప్పుడు ఒక ఏడాది బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్కి రూ. 38,900 ప్రీమియంగా ఉంది. ఇదే ఇన్సురెన్సును ఐదేళ్ల కాలానికి తీసుకుంటే ప్రీమియం మొత్తం ఒకేసారి రూ. 1,26,690కి చేరుతుంది. అంటే వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తుదానికి అదనంగా రూ. 87,790లు చెల్లించాల్సి వస్తుంది. వివిధ మోడళ్లను బట్టి ఈ ప్రీమియం మారుతుంది. వాహన తయారీ సంస్థలు ఏమంటున్నాయి ? కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో మొబైల్ పరిశ్రమ కొలుకుంటోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు ధరల తగ్గింపు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఒకసారి ఐదేళ్లకు బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ని కోర్టు తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనాల ధరలు పెరిగిపోతాయని, ఫలితంగా అమ్మకాలపై ప్రభావం పడుతుందని వాహన తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉదాహరణకి హ్యుందాయ్ వెన్యూ వాహనానికి సంబంధించి ఒక ఏడాది బంపర్ టూ బంపర్ రెండేళ్లు థర్డ్ పార్టీ ఇన్సురెన్సుతో కలిసి నెట్ప్రైస్ రూ. 9,96,310 ఉంది. ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం ఐదేళ్ల ఇన్సునెన్సు ప్రీమియం చెల్లించాలంటే రూ.10,84,295 చెల్లించాల్సి వస్తుంది. అదే మారుతి బ్రెజా విషయానికి వస్తే ఈ మొత్తం రూ.9,86,199 నుంచి రూ. 10,76,180కి చేరుకుంటుంది. ఇన్సురెన్సు కంపెనీ స్పందన ఏంటీ ? ఏ తరహా పాలసీ తీసుకోవాలి, ప్రీమియం ఎంత చెల్లించాలనే అంశంపై వాహన కొనుగోలుదారులను తాము ఒత్తిడి చేసేది ఏమీ ఉండదని ఇన్సురెన్సు కంపెనీలు చెబుతున్నాయి. మోటారు వాహన చట్టాలను లోబడి వాహన కొనుగోలుదారుడి ఇష్టాఇష్టాలకు అనుగుణంగానే పాలసీలు చేయిస్తామని చెబుతున్నాయి. వాహనం కొనుగోలు చేసేప్పుడు చాలా మంది మొదటి ఏడాదికి బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ చేయిస్తారని, ఆ తర్వాత వాహనం వాడే విధానం, రిస్క్ ఆధారంగా థర్డ్పార్టీ లేదా బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సులు తీసుకుంటారని ఇన్సురెన్సు కంపెనీ ఏజెంట్లు వెల్లడిస్తున్నారు. చదవండి : బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి..మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు -
బంపర్ టూ బంపర్ ఇన్సురెన్స్ తప్పనిసరి...మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు. .
Madras High Court: వాహనాలకు సంబంధించిన ఇన్సురెన్సులు చేసేప్పుడు ఇటు కొనుగోలుదారులు, అటు ఇన్సురెన్సు కంపెనీలు బాధ్యతగా వ్యవహరించాలంటూ మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. వాహనం నడిపే వారి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సును తప్పనిసరిగా చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పు ఏంటీ మద్రాసు హైకోర్టు తీర్పు ప్రకారం 2021 సెప్టెంబరు 1 నుంచి కొనుగోలు చేసే కొత్త వాహనాలకు బంపర్ టు బంపర్ ప్రాతిపదికన వాహన యజమాని, డ్రైవరు, ప్రయాణికులందరికీ వర్తించేలా బీమా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బీమా కాలపరిమితి ఐదేళ్లుగా ఉండాలని నిర్దేశించింది. లక్షల రూపాయలు పెట్టి వాహనం కొనేప్పుడు మైలేజీ, పవర్, డిజైన్లపై ఉన్న శ్రద్ధ తమపై కూడా పెట్టాలని వాహన కొనుగోలుదారులకు సూచించింది. కొద్దిపాటీ ప్రీమియం కట్టేందుకు నిర్లక్క్ష్యం చేస్తే, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటూ కోర్టు అభిప్రాయపడింది. తీర్పుకు కారణం ఇది తమిళనాడులోని హొగినేకల్లో 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సడయప్పన్ అనే వ్యక్తి మృతి చెందాడు. దీనిపై నష్టపరిహారం కోరుతూ కుటుంబ సభ్యులు ఈరోడ్ మోటారు వాహన ప్రమాద పరిహార ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. విచారణ అనంతరం సడయప్పన్ కుటుంబానికి రూ.14,.65 లక్షలు పరిహారం చెల్లించాలని ఇన్సురెన్సు కంపెనీని ట్రిబ్యునల్ ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. వాహన డ్రైవరు, యజమాని అనే ప్రాతిపదికన మాత్రమే వాహనానికి థర్డ్ ఫార్టీ బీమా చేశారని.. డ్రైవరు కాని వ్యక్తి మృతి చెందితే లక్ష రూపాయలు మాత్రమే పరిహారం చెల్లిస్తామని బీమా సంస్థ తెలిపింది. సడయప్పన్ ప్రమాద సమయంలో వాహనం నడపలేదని రుజువులు చూపింది. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి వైద్యనాథన్ ఈరోడ్ ట్రైబ్యునల్ ఆదేశాలను రద్దు చేశారు. అంతేకాకుండా ప్రీమియం, కవరేజీలు తక్కువగా ఉండే థర్డ్ పార్టీ ఇన్సురెన్సులను నిరసించారు. వాహన యజమాని, డ్రైవరుతో పాటు అందులో ప్రయాణించే అందరి సంక్షేమాన్ని కాంక్షిస్తూ బంపర్ టూ బంపర్ ఇన్సురెన్సుని తప్పనిసరి గా చేస్తూ తీర్పు ఇచ్చారు. చదవండి: ఆటో విడిభాగాల పరిశ్రమ జోరు, పీవీ - ట్రాక్టర్లకు డిమాండ్ -
‘చెన్నై’కు మైసూర్ శిలాఫలకాలు
సాక్షి, చెన్నై: మైసూరులో ఉన్న తమిళ శిలాఫలకాల్ని, పురాతన శాసనాలను, వస్తువులను చెన్నైకు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కర్ణాటక రాష్ట్రం మైసూర్లోని పురవాస్తు విభాగం కేంద్రంలో తమిళనాడుకు సంబంధించిన 65 వేల మేరకు శిలాఫలాలకు, శాసనాలకు సంబంధించిన ఫలకాలు, పురాతన వస్తువులు ఉన్నట్టుగా మధురై ధర్మాసనంలో మదురై గోమతిపురానికి చెందిన న్యాయవాది మణి మారన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ గత వారం ముగిసింది. గురువారం న్యాయమూర్తులు కృపాకరన్, దురై స్వామి బెంచ్ తీర్పు వెలువరించింది. రెండు రాష్ట్రాల మధ్య కావేరి వివాదం సాగుతున్న నేపథ్యంలో మైసూరులోని తమిళ శిలాఫలకాలు, వస్తువులకు ఏవిధంగా రక్షణ ఉంటుందని కోర్టు ప్రశ్నించింది. అందుకే మైసూరులో ఉన్న శిలాఫలకాల్ని చెన్నైలోని పురావస్తు విభాగానికి తీసుకు రావాల్సిందేనని ఆదేశించారు. అలాగే, చెన్నైలోని శిలాఫలకాల విభాగాన్ని తమిళనాడు విభాగంగా మార్చాలని, నిపుణుల్ని సిబ్బందిని నియమించాలన్నారు. ఆరు నెలల్లో ఈ ప్రక్రియను ముగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు. కాగా, మదురై ఎంపీ వెంకటేషన్ దాఖలు చేసిన మరో పిటిషన్ విచారణ సమయంలో న్యాయమూర్తులు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అడిగిన ప్రశ్నలకు కేంద్రం నుంచి హిందీలో సమాధానం ఇచ్చినట్టుగా వెంకటేషన్ ఆరోపించారు. కోర్టు స్పందిస్తూ, రాష్ట్రం ఏ భాషలో అయితే, విజ్ఞప్తిని లేదా లేఖను పంపించిందో.. ఆ భాషలోనే సమాధానం ఇవ్వా లని కేంద్రాన్ని ధర్మాసనం ఆదేశించింది. ముకుతాడుకు ప్రత్యామ్నాయం ఆలోచించండి ఆవులు, ఎద్దులకు ముకుతాడు వేయడం వల్ల జీవాలు హింసకు గురవుతున్నాయని కోర్టులో గురువారం ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ బెంచ్ విచారణకు స్వీకరించింది. కాగా ముకుతాడు జీవాలను బాధించే విధంగా ఉందని, దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని కేంద్ర, రాష్ట్రాలకు సూచించారు. ఇక సీనియర్ న్యాయమూర్తి కృపాకరణ్ పదవీ విరమణ పొందారు. వీడ్కోలు సభలో కృపాకరణ్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు శాఖ లు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని, అప్పుడే సమ న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. -
సిబిఐ కి స్వయం ప్రతిపత్తి కల్పించాలి
-
హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్... పిటిషన్ తిరస్కరణ
హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. దాదాపు రూ.3 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. వివారాల్లోకి వెళితే.. సూర్య తన ఆదాయానికి తగ్గట్టు పన్నులు చెల్లించం లేదనే కారణంతో 2010లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో ఆయనకు సంబంధించిన ఇళ్లు, వ్యాపార స్థలాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో లెక్కల్లో లేని పలు ఆదాయాలకు సంబంధించి మొత్తం రూ. 3.11 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఆదాయపు పన్ను అధికారులు జారీ చేసిన నోటీసులో వడ్డీ మినహాయించాలని కోరుతూ సూర్య మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మాత్రం సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని చెబుతూ..ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. -
సీబీఐపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
చెన్నై: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐ పంజరంలో బధించపడిన చిలక అని.. కేంద్రం ఎన్నికల కమిషన్, కాగ్ మాదిరి దానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని సూచించింది. ఈ క్రమంలో సీబీఐకి అధిక అధికారాలు, అధికారంతో కూడిన చట్టబద్ధమైన హోదాను అందించే ప్రత్యేక చట్టాన్ని పరిగణలోకి తీసుకుని, అమలు చేయాలని మద్రాస్ హైకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘పార్లమెంటుకు మాత్రమే జవాబుదారీగా ఉండే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐకి స్వయంప్రతిపత్తి ఉండాలి. అప్పుడే ప్రజలకు సీబీఐ మీద విశ్వాసం పెరుగుతుంది’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత వ్యవస్థను సరిదిద్దడానికి తాము చేసిన 12 పాయింట్ల సూచనలలో ‘పంజరంలోని చిలుకలా ఉన్న సీబీఐని’ విడుదల చేసే ప్రయత్నం అని కోర్టు పేర్కొంది. చట్టబద్ధమైన హోదా ఇచ్చినప్పుడు మాత్రమే సంస్థ స్వయంప్రతిపత్తిని నిర్ధారించగలమని గమనించిన న్యాయస్థానం.. ‘చట్టబద్ధమైన హోదాను పరిగణనలోకి తీసుకుని భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి మరింత అధికారం కల్పించాలి.. దీని వల్ల సీబీఐపై ప్రభుత్వ పరిపాలనా నియంత్రణ లేకుండా క్రియాత్మక స్వయంప్రతిపత్తి కలుగుతుంది’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. తమిళనాడులోని పోంజి కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. జస్టిస్ ఎన్ కిరుబకరన్, జస్టిస్ బీ పుగళేందిల ధర్మాసనం ఈ పిటిషన్పై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. ‘ఎలక్షన్ కమిషన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మాదిరిగా సీబీఐ మరింత స్వయంప్రతిపత్తిగా ఉండాలి.. సీబీఐ డైరెక్టర్కు ప్రభుత్వ కార్యదర్శిగా అధికారాలు ఇవ్వబడతాయి.. డీఓపీటీ ద్వారా కాకుండా నేరుగా మంత్రి/ ప్రధాన మంత్రికి నివేదించాలి’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, సంస్థలో మానవవనరుల కొరతతో ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించలేమని కేంద్రం పేర్కొంది. దీంతో ఈ అంశంపై నెల రోజుల్లోగా సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. 1941లో ఏర్పడిన సీబీఐ.. ప్రధాన మంత్రి కార్యాలయం అధీనంలో ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్ (డీఓపీటీ)కు బాధ్యత వహిస్తోంది. దీని డైరెక్టర్ను ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేతతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం ఎంపిక చేస్తుంది. -
మూడో యుద్ధానికి సిద్ధం!
సాక్షి ప్రతినిధి, చెన్నై: కరోనా థర్డ్వేవ్ను ఎదురొడ్డి నిలిచేందుకు సర్వసన్నాహాలు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. థర్డ్వేవ్ను ఢీకొట్టేందుకు యంత్రాగం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చింది. రాష్ట్రంలో నాలుగు రోజులుగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. 33 జిల్లాల్లో రోజుకు వందలోపు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే, కరోనా సెకండ్వేవ్ ఛాయలు పూర్తిగా కనుమరుగు కాకముందే థర్డ్వేవ్ గురించి ప్రజలు భయపడడం, ప్రభుత్వం అప్రమత్తం కావడం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు, సమృద్ధిగా మందులు, ఆక్సిజన్ నిల్వలున్నాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ప్రయివేటు వైద్యకళాశాలలు, ఆస్పత్రులు, తాత్కాలిక ఆస్పత్రులు కూడా థర్డ్వేవ్ సేవలకు సిద్ధంగా ఉన్నాయని చెబుతోంది. మూడు నెలల్లో 45 ఏళ్లలోపు జనాభాలో 85 లక్షల మందికి, 39 లక్షల వృద్ధులకు వ్యాక్సిన్ వేసినట్లు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. ఈనెల 75 లక్షల వ్యాక్సిన్లు కేటాయించినట్లు చెప్పారు. కరోనా రోగికి, వారికి సమీపంలో ఉన్నవారికి అత్యవసర వైద్యసేవలు అందించేందుకు చెన్నై అదనపు పోలీస్ కమిషనర్ నేతృత్వంలో ‘వార్రూం’ను సిద్ధం చేశారు. చెన్నై పోలీస్ కమిషనరేట్లో మూడురోజుల కరోనా పరీక్షల శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. కోయంబత్తూరులో మంగళవారం నుంచి ఆదనపు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. డెంగీని అడ్డుకోవాలి: మద్రాసు హైకోర్టు వర్షాలతో డెంగీ జ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు, పుదుచ్చేరీ ప్రభుత్వాలను మద్రాసు హైకోర్టు ఆదేశించింది. డెంగి వ్యాప్తిని అడ్డుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ సూర్యప్రకాశం అనే న్యాయవాది మద్రాసు హైకోర్టులో 2019లో పిటిషన్ వేశారు. ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ, న్యాయమూర్తి ఆదికేశవులతో కూడిన బెంచ్కు సోమవారం విచారణకు వచ్చింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలపై తమిళనాడు ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డాక్టర్ రాధాకృష్ణన్ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ ఏడాది జనవరిలో 402 మంది డెంగీ బారినపడగా జూన్ నాటికి కేసులు 54 తగ్గాయని పేర్కొన్నారు. అలాగే చెన్నై కార్పొరేషన్ తన నివేదికలో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో మొత్తం 52 డెంగీ కేసులు మాత్రమే నమోదయ్యాని పేర్కొంది. చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలో డెంగీ కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కోర్టు కేసు విచారణను ముగించింది. -
కారు ట్యాక్స్ కేసులో విజయ్కు హైకోర్టులో ఊరట
Vijay Rolls Royce Car Case: నటుడు విజయ్కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. తాజాగా విజయ్ లండన్ నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్రాయ్ కారుకు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించలేదంటూ వాణిజ్య పన్నుల శాఖ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారించిన న్యాయస్థానం విజయ్కు రూ.లక్ష అపరాధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ విజయ్ మద్రాసు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో తను ఎంట్రీ ట్యాక్స్ చెల్లించడానికి సిద్ధమని, అయితే అపరాధం విధించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయ్ పిటిషన్పై మంగళవారం కోర్టులో విచారణ జరిగింది. విజయ్కు జరిమానా విధించిన ఉత్తర్వులపై కోర్టు తాత్కాలిక స్టే విధించి అతని పిటిషన్పై రాష్ట్ర ప్రభుత్వం బదులివ్వాలని కోర్టు ఆదేశించింది. -
Tamil Nadu: ‘ఆ ముగ్గురి గెలుపులో గోల్మాల్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి దురైమురుగన్, మాజీ మంత్రి సి.విజయభాస్కర్, జయకుమార్ గోల్మాల్కు పాల్పడి గెలుపొందారని.. వారిని అనర్హులుగా ప్రకటించేలా ఈసీని ఆదేశించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని ఎన్నికల కమిషన్ను హైకోర్టు ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత నీటిపారుదలశాఖ మంత్రి దురైమురుగన్ గెలుపును అన్నాడీఎంకే అభ్యర్థి వి. రాము సవాల్ చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన అర్హమైన ఓట్లను చెల్లని ఓట్లుగా ప్రకటించారని, ఎన్నికల నిబంధనలను సక్రమంగా పాటించలేదని ఆరోపించారు. తపాలా, ఈవీఎం ఓట్లను మళ్లీ లెక్కించాలని కోర్టును కోరారు. పుదుక్కోటై జిల్లా వీరాలిమలై నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి సి. విజయభాస్కర్ గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీచేసిన ఎం. పళనియప్పన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. బహుమతులు, నగదు పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను మభ్యపెట్టారని, ఎన్నికల నియయావళి కంటే ఎక్కువ ఖర్చుపెట్టడంతోపాటు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. విజయభాస్కర్ గెలుపు చెల్లదని ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అలాగే ఈరోడ్ జిల్లా పెరుందురై నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే జయకుమార్ గెలుపు చెల్లదని పేర్కొంటూ డీఎంకే చిహ్నం ఉదయసూర్యుని గుర్తుపై పోటీచేసిన కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి అభ్యర్థి కేకేసీ బాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈవీఎంల పనితీరు సక్రమంగా లేదని పోలింగ్ సమయంలోనే ఫిర్యాదు చేశామని, అయితే వాటిని సరిచేయకుండా పోలింగ్ను కొనసాగించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ 81 ఈవీఎంలలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ పిటిషన్లు న్యాయమూర్తి వి. భారతిదాసన్ ముందు సోమవారం విచారణకు వచ్చింది. మంత్రి దురైమురుగన్, మాజీ మంత్రి సి విజయభాస్కర్, జయకుమార్ గెలుపును సవాలు చేస్తూ పిటిషనర్లు వెలిబుచ్చిన ఆరోపణలపై చీఫ్ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయా నియోజకవర్గాల అధికారులు 4 వారాల్లోగా బదులివ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేశారు. -
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్ ప్రవేశపరీక్ష తీరుతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈతిబాధలపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం నియమించిన విచారణ బృందాన్ని రద్దు చేయాలన్న బీజేపీ నేత పిటిషన్కు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణ జరపడంలో తప్పులేదని పేర్కొంటూ పిటిషన్ను కోర్టు మంగళవారం కొట్టివేసింది. వివరాలు... వైద్య విద్యలో ప్రవేశానికి కేంద్రప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన నీట్ పరీక్షలో గట్టెక్కెడం తమిళనాడులోని పేద, గ్రామీణ విద్యార్థులకు తీవ్రకష్టతరంగా మారింది. నీట్ ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ నీట్ ప్రవేశపరీక్షను వ్యతిరేకించాయి. ఆందోళనలు చేపట్టి నీట్ రద్దు చేయాలని నినదించాయి. ఈ క్రమంలో కొన్ని విద్యార్థి సంఘాలు కోర్టుల్లో పిటిషన్లు వేశాయి. మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వ్యతిరేకత రాజకీయ ముడిసరుకుగా మారింది. డీఎంకే అధికారంలోకి వస్తే నీట్ ప్రవేశపరీక్ష రాష్ట్రంలో అమలుకాకుండా అడ్డుకుంటామని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు నీట్ వల్ల విద్యార్థిలోకం, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను విచారించించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఏకే రాజన్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన బృందాన్ని సీఎం స్టాలిన్ నియమిస్తూ గతనెల 10వ తేదీన ఉత్తర్వులు జారీచేశారు. ఈ జీఓను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు నాగరాజన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో... ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు నీట్ వ్యవహారంలో బృందం ఏర్పాటుపై సుప్రీంకోర్టు అనుమతి పొందారా అని ప్రశ్నను లేవనెత్తింది. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు వీలులేదని వ్యాఖ్యానించింది. అంతేగాక ఈ కేసుకు సంబంధించి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ దాఖలు చేసిన పిటిషన్లోని వివరాలు ఇలా ఉన్నాయి. నీట్ ప్రవేశపరీక్షకు సంబంధించిన చట్టాల అమలుపై కేంద్రం పర్యవేక్షణ ఉన్నందున తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఏకే రాజన్ విచారణ బృందం సుప్రీంకోర్టు తీర్పుకు భంగకరం. రాష్ట్ర పరిధిలోని అంశాలపై మాత్రమే విచారణ బృందం నియమించుకునే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి ఉంది. నీట్ ప్రవేశపరీక్ష తీరుపై విచారణ జరపడం రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిదాటి ప్రవర్తించడమే అవుతుందని పేర్కొంది. ఈ క్రమంలో... మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్కు ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. నీట్ ప్రవేశపరీక్ష వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు తీర్పుకు ఎంతమాత్రం విరుద్ధం కాదు. వివరాలు సేకరించి నివేదికను సమర్పించాలని కోరిందేకానీ అంతకు మించి మరేమీ లేదు. విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే అంశాలు నివేదికలో బయటపడితే వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మార్పులకు సూచించవచ్చు. అంతేకాదు... విచారణ బృందం ఏర్పాటు వృథా ఖర్చని భావించడానికి వీలులేదు. ప్రభుత్వం నిర్వహించే ప్రజాభిప్రాయసేకరణలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు. రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలోని విచారణ బృందంపై నిషేధం విధించడానికి వీలులేదని తీర్పు చెప్పింది. గురు నాగరాజన్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం స్టాలిన్ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న బీజేపీ, అన్నాడీఎంకేకు ఈ తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. నేడే నివేదిక సమర్పణ: కోర్టు తీర్పు రాష్ట్రప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో రిటైర్డ్ న్యాయమూర్తి ఏకే రాజన్ బృందం బుధవారం తమ నివేదికను సీఎం స్టాలిన్కు సమర్పించనుంది. నీట్కు వ్యతిరేకంగా, అనుకూలంగా 89,342 మంది విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఈ బృందం అభిప్రాయాలను సేకరించింది. ఈ అభిప్రాయాలపై పలు దఫా విశ్లేషణ సమావేశాలు పూర్తి చేసి సిద్ధం చేసిన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. సెప్టెంబర్12వ తేదీన నీట్ ప్రవేశపరీక్ష జరగనుండగా ఆన్లైన్ ద్వారా విద్యార్థులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకోవడం ప్రారంభించారు. -
దళపతికి షాకిచ్చిన హైకోర్టు, వాళ్లే రియల్ హీరోలు అంటూ చీవాట్లు
దళపతి విజయ్కు మద్రాస్ హైకోర్టు షాకిచ్చింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారుకు పన్ను కట్టాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు అతడు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ను కోర్టు తాజాగా కొట్టివేసింది. ఈ సందర్భంగా పన్ను ఎగ్గొట్టాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. పౌరులు చట్టబద్ధంగా నడుచుకునేలా ఆదర్శంగా ఉండాల్సిన సినీతారలే ఇలా పన్ను కట్టేందుకు వెనకాడటమేంటని ప్రశ్నించింది. 'హీరోలను సినిమాల్లో సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నట్లు, అవినీతి మీద యుద్ధం ప్రకటించినట్లు చూపిస్తారు. కానీ నిజజీవితంలో నిబంధనలకు వ్యతిరేకంగా పన్ను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. నిజాయితీగా, సరైన సమయానికి పన్ను కట్టేవాడే అసలైన హీరో' అని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. పన్ను చెల్లించడానికి విజయ్కు రెండు వారాల గడువిచ్చింది. దీంతోపాటు పన్ను కట్టకుండా ఉన్నందుకు హీరోకు లక్ష రూపాయల ఫైన్ విధించింది. ఈ రుసుమును తమిళనాడు సీఎం కోవిడ్ రిలీఫ్ ఫండ్కు వినియోగించాలని ప్రభుత్వానికి సూచించింది. This is Vijay's RollsRoyce Ghost that is making headlines today. Purchased in 2013 for over 8 cr, attracting entry tax of approx 1.6 cr, which the actor had challenged. He was chastised strongly by Madras HC for attempted tax evasion & asked to pay 1 lakh to TN CM covid fund. pic.twitter.com/hl3s0zUw9I — Kasturi Shankar (@KasthuriShankar) July 13, 2021 -
నామినేషన్లో తేలని లెక్క... ఈసీకి కోర్టు నోటీసులు
సాక్షి, చెన్నై: ఎన్నికల నామినేషన్లో ఆస్తుల వివరాలను మాజీ మంత్రి కేసీ వీరమణి దాచిపెట్టడంపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. వివరణ కోరుతూ ఈసీకి మద్రాసు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి కేసీ వీరమణి ఇటీవల జరిగిన ఎన్నికల్లో జోలార్పేట నుంచి పోటీ చేశారు. డీఎంకే అభ్యర్థి దేవరాజ్ చేతిలో ఓటమి పాలయ్యారు. కాగా ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన నామినేషన్లో ఆస్తుల వివరాలను దాచి పెట్టినట్టు తాజాగా వెలుగు చూసింది. రామమూర్తి అనే సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రమాణ పత్రంలో చూపించిన ఆస్తుల వివరాలు, ఆదాయ పన్ను శాఖకు సమర్పించిన ఆస్తుల వివరాల మధ్య తేడా ఉందని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం వివరణ కోరుతూ ఎన్నికల కమిషన్కు నోటీసులు జారీ చేసింది. -
రూ.26 కోట్ల మోసం! సంగీత దర్శకుడిపై కేసు కొట్టివేత
సాక్షి ప్రతినిధి, చెన్నై: సీనియర్ నటి, దర్శక, నిర్మాత జయచిత్ర కుమారుడు, సంగీత దర్శకుడు అమ్రీష్పై నమోదైన కేసును మద్రాసు హైకోర్టు కొట్టివేసినట్లు ఆయన తరఫు న్యాయవాది ఎల్ ఇన్ఫెంట్ దినేష్ తెలిపారు. చెన్నైలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో చెన్నై వలసరవాక్కంకు చెందిన నెడుమారన్ అనే వ్యాపారవేత్త, ఇరీడియం పేరుతో అమ్రీష్ రూ. 26 కోట్లు మోసం చేశారంటూ ఇటీవల ఫిర్యాదు చేశాడని తెలిపారు. ఈ కేసులో అమ్రీష్ను పోలీసులు అరెస్ట్ చేయగా బెయిల్పై బయటకు వచ్చినట్లు చెప్పారు. తనపై అక్రమంగా బనాయించిన కేసును కొట్టి వేయాలంటూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ అమ్రీష్ వేశారని, వారి మధ్య ఒక చిత్రానికి సంబంధించిన లావాదేవీలు మాత్రమే జరిగాయని, ఆయన నిర్మించనున్న ఒక చిత్రానికి సంగీత దర్శకత్వం వహించేందుకు అడ్వాన్సుగా తీసుకున్న మొత్తంలో కొంత తిరిగి చెల్లించానని, పూర్తిగా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని అమ్రీష్ కోర్టుకు విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు సమ్మతించిన సదరు పారిశ్రామికవేత్త అమ్రీష్పై ఇచ్చిన ఫిర్యాదును వాపస్ తీసుకున్నట్లు వెల్లడించారు. వాదనలను విన్న అనంతరం సదరు కేసుతో అమ్రీష్కు సంబంధం లేనందున కేసును కొట్టి వేస్తున్నట్లు న్యాయమూర్తి నిర్మల్ కుమార్ మంగళవారం తీర్పు చెప్పారని న్యాయవాది ఇన్ఫెంట్ దినేష్ తెలియజేశారు. చదవండి: 'ఆమెతో డేటింగ్ చేశాను!' అందులో నిజమెంతో ఎవరికి తెలుసు? -
దురదృష్టం భర్తల కోసం గృహహింస చట్టం లేదు: హైకోర్టు
చెన్నై: మహిళల కోసం గృహ హింస చట్టం తీసుకొచ్చినప్పటికి ఆడవారిపై వేధింపులు ఆగడం లేదు. అయితే ఇక్కడ విచారకర అంశం ఏంటంటే బాధితుల కోసం తీసుకువచ్చిన ఈ చట్టాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ విడాకులు రావడానికి 4 రోజుల ముందు భర్త తనపై గృహహింసకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఫలితంగా అధికారులు అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. తనకు న్యాయం చేయాల్సిందిగా బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటీషన్ విచారణ సమయంలో మద్రాస్ హైకోర్టు దురదృష్టం కొద్ది భర్తలను వేధించే భార్యలపై చర్యలు తీసుకోవడానికి ఎలాంటి గృహహింస చట్టం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాక సస్పెండైన అధికారిని తిరిగి డ్యూటీలో నియమించాల్సిందిగా ఆదేశించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. పి.శశికుమార్ అనే డాక్టర్ చెన్నైలో పశు సంవర్థక శాఖలో డైరెక్టర్గా పనిచేసేవారు. ఈక్రమంలో శశికుమార్ భార్య అతడిపై గృహ హింస చట్టం కింద కేసు పెట్టి.. ఫ్యామిలీ కోర్టులో విడాకులకు అప్లై చేసింది. ఆ తరువాత కూడా డాక్టర్ భార్య అతన్ని పలు రకాలుగా మాటలతో హింసించింది. భార్య చేతిలో నరకం చూసిన డాక్టర్ ఇక భరించలేనంటూ ఆమెను వదలి దూరంగా పారిపోయాడు. 2015లో విడాకులకు అప్లై చేస్తే.. 2020 ఈ కేసు విచారణ పూర్తి అయ్యింది. మరో నాలుగు రోజుల్లో విడాకులు మంజూరు అయ్యేవి. డాక్టర్ భార్య క్రూరత్వం... శశికుమార్ను ఇంకా ఇబ్బందులకు గురి చేయాలని భావించిన అతడి భార్య విడాకుల పిటిషన్ తీర్పుకు నాలుగు రోజుల ముందు, కోర్టులో కొనసాగుతున్న గృహ హింస ఫిర్యాదుకు సంబంధించి పశుసంవర్ధక, పశువైద్య సేవల డైరెక్టర్కు ఫిర్యాదు చేసింది. దాంతో ఉన్నతాధికారులు, 2020 ఫిబ్రవరి 18 న శశికుమార్ను ఉద్యోగం నుంచి నుంచి సస్పెండ్ చేశారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే ఆ మరుసటి రోజే అనగా 2020 ఫిబ్రవరి 19 న కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. భార్య కావాలనే తనను ఇబ్బంది పెట్టడానికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిందని తెలుసుకున్న శశికుమార్ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఏమన్నదంటే... ఈ సందర్భంగా కేసు విచారిస్తున్న క్రమంలో హైకోర్టు జస్టిస్ వైద్యనాథన్.. ‘‘ఈ కేసు ఎలా కనిపిస్తోందంటే.. విడాకులు వచ్చాక భర్తను హింసించడం కుదరదని.. ఆలోపే అతడిని మరింతగా ఇబ్బంది పెట్టాలని ఆమె గృహ హింస కేసు పెట్టినట్లు కనిపిస్తోందని’’ అన్నారు. వివాహ బందం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పెళ్లి బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ప్రతీ భార్యా భర్తలకు ఉంది. అహం,అసహనం అనేవి… మనం ధరించే చెప్పుల లాంటివి. వాటిని ఇంటి బయటే వదిలేయాలి తప్ప లోపలికి తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే… భార్యాభర్తలతోపాటు వారి పిల్లల భవిష్యత్తు కూడా నాశనమయ్యే అవకాశముంది కాబట్టి సమన్వయం అనేది ఇద్దరికీ అవసరమని’’ సూచించారు. కాగా.. 2015లో సాలెం ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం అప్లై చేసుకోగా ఫిబ్రవరి 2020లో విడాకులకు అనుమతిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని లెక్కలోకి తీసుకున్న హైకోర్టు ఆయన్ని శాఖ నుంచి సస్పెండ్ చెయ్యాల్సిన పనిలేదనీ… మరో 15 రోజుల్లో తిరిగి ఉద్యోగంలో చేర్చాలని తీర్పు ఇచ్చింది. ఈ కేసు ఆధారంగా పోలీసులు డాక్టర్ శశికుమార్ పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో అయన శాఖాపరంగా సస్పెండ్ అయ్యారని జస్టిస్ వైద్యనాథన్ ఈ సందర్భంగా తెలిపారు. చదవండి: వాడిని చంపేయండి.. వదలొద్దు! -
డిసెంబర్కల్లా 216 కోట్ల టీకా డోసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో డిసెంబర్ నాటికి 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో కోవిడ్ నిర్వహణపై మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసు, పలు కేసులను సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ను ధర్మాసనం అనుమతించింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లో డిసెంబర్ నాటికి దేశంలో 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసిన అంశంపై ధర్మాసనం స్పందించింది. దేశంలో వారందరికి ఈ డోసులు సరిపోతాయా అని ప్రశ్నించింది. సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్లతోపాటు క్యాడిలా వంటి సంస్థలు ఉత్పత్తి పెంచనున్నాయని, ఈ మేరకు డిసెంబరు నాటికి 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అఫిడవిట్లో పొందుపరిచిన విషయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఆర్ శంకర నారాయణన్ తెలిపారు. దీంతో దేశంలో అందరికీ వ్యాక్సిన్ అందుతుందని ఆయన తెలిపారు. అనంతరం ధర్మాసనం ఆదేశాలు వెలువరిస్తూ.. ప్రజలకు వ్యాక్సినేషన్ పట్ల అవగాహన కల్పించాలని పేర్కొంది. సమాజంలో వివిధ నమ్మకాలతో టీకా తీసుకోని వారున్నట్లు అభిప్రాయపడింది. వారందరూ టీకాలు తీసుకొనేలా కేంద్రం, రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. బ్లాక్ ఫంగస్ నియంత్రణకు తగిన ఔషధాలు రాష్ట్రానికి ఉత్పత్తి సంస్థలు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. రాష్ట్ర జనాభా, పాజిటివిటీ రేటును అనుసరించి వ్యాక్సిన్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం అఫిడవిట్లో పేర్కొందని, అయితే సంస్థలు ఉత్పత్తి పెంచనున్న నేపథ్యంలో రాష్ట్రానికి తగినట్లుగా వ్యాక్సిన్లు అందుతాయని కనిపిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదాకు వేసింది. -
మీడియా ప్రసారాలను నియంత్రించలేం: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కరోనా వైరస్ వ్యాప్తికి ఈసీనే కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి... ఈసీ వేసిన పిటిషన్ను విచారిస్తూ సుప్రీంకోర్టు గురువారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈసీపై హత్య కేసు పెట్టాలని ఇటీవల మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తికి ఎన్నికల కమిషన్యే కారణమని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అయితే మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. కోర్టులో వాదనలను ప్రచురించకుండా మీడియాను నియంత్రించలేమని స్పష్టం చేసింది. అదే విధంగా కీలక కేసుల విచారణలో జాగ్రత్తగా వ్యవహరించాలని మద్రాస్ హైకోర్టుకు సూచించింది. చదవండి: రిజర్వేషన్లు: 50% పరిమితి ఎలా వచ్చింది? -
Government Land: పొరపాటున పట్టాలిచ్చారనడం సరికాదు
టీ.నగర్: చెంగల్పట్టు సమీపాన 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పట్టా చేసి అందజేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాసు హైకోర్టులో ప్రవీణ్కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అందులో చెంగల్పట్టు సమీపాన కరుంగుళిపల్లం అనే గ్రామంలోని 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని 53 మందికి పట్టా చేసి అందజేశారని, ఈ స్థలం అపహరణ గురించి రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేయగా, ఈ కేసును స్థల అపహరణ కేసులను విచారించే ప్రత్యేక విభాగానికి పంపకుండా తిరుపోరూరు పోలీసు స్టేషన్కు పంపినట్లు తెలిపారు. వందల కోట్ల రూపాయిలు విలువచేసే ఈ స్థలం వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే శివానందం, న్యాయవాదులు ఉన్నారని, అందుచేత తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని, తనకు భద్రత కల్పించేందుకు పోలీసులకు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఈ కేసు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్కుమార్, రామ్మూర్తి సమక్షంలో మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది 105 ఎకరాల స్థలానికి పొరపాటున ప్రభుత్వ అధికారులు పట్టాలు అందజేశారని, ఈ పట్టాలను రద్దు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ వాదనను న్యాయమూర్తులు నిరాకరించారు. 105 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పొరపాటున అధికారులు పట్టా చేసి ఇచ్చారనడం సమంజసం కాదని, సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులిచ్చారు. ఈ వ్యవహారంలో అధికారులు ప్రాథమిక విచారణ జరిపి నివేదిక దాఖలు చేయాలంటూ విచారణను జూన్ పదో తేదీకి వాయిదా వేశారు. చదవండి: ఆక్సిజన్ అందక 13 మంది మృతి -
ఈసీకి సుప్రీం షాక్.. మీడియాకు అడ్డు చెప్పలేం
న్యూఢిల్లీ: కేసుల విచారణ సమయంలో ప్రజాప్రయోజనం లక్ష్యంగా వ్యాఖ్యలు చేసే హక్కు మీడియాకు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే, హైకోర్టుల నైతికస్థైర్యం దెబ్బతీయాలన్న ఆలోచన కూడా తమకు లేదని స్పష్టంచేసింది. హైకోర్టులు ప్రజాస్వామ్యంలో కీలకమైన వ్యవస్థలని వ్యాఖ్యానించింది. మద్రాసు హైకోర్టు తమపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్నికల సంఘం వెల్లడించిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య సమన్వయం, సమతౌల్యం కోసం ప్రయత్నిస్తామని పేర్కొంది. విచారణ సందర్భంగా కోర్టులు చేసే వ్యాఖ్యలను రిపోర్ట్ చేయకుండా మీడియాను నియంత్రించాలన్న ఈసీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దేశంలో కరోనా కేసులు పెరగడానికి ఎన్నికల సంఘమే కారణమని, ఎన్నికల సంఘం అధికారులపై హత్య అభియోగాలు నమోదు చేయాలని ఇటీవల మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం సోమవారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈసీని కించపర్చే ఉద్దేశంతో హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్లుగా తాము భావించడం లేదని, విచారణలో భాగంగా చేసిన భావవ్యక్తీకరణగా ఆ వ్యాఖ్యలను తాము భావిస్తున్నామని పేర్కొంది. అందువల్లనే ఆ వ్యాఖ్యలు హైకోర్టు ఉత్తర్వుల్లో లేవని తెలిపింది. కోర్టుల్లో విచారణ సందర్భంగా జరిగే సంభాషణలు, కామెంట్లను రిపోర్ట్ చేయవద్దని మీడియాను కోరలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎవరినైనా కోర్టు ప్రశ్నిస్తుందంటే, వారికి కోర్టు వ్యతిరేకమని అర్థం కాదని వ్యాఖ్యానించింది. విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కోర్టులు వ్యాఖ్యలు చేస్తుంటాయని, వ్యవస్థలను ప్రశ్నించకూడదని ఆదేశించి హైకోర్టుల నైతిక స్థైర్యాన్ని తాము దెబ్బతీయలేమని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా లాయర్లు, జడ్జీల మధ్య ఎలాంటి అవరోధాలు లేని చర్చ జరగడం అవసరమని పేర్కొంది. రాజ్యాంగబద్ధ వ్యవస్థలు బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని వ్యాఖ్యానించింది. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది ద్వివేదీ వాదిస్తూ.. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై హత్యాభియోగాలు నమోదు చేయాలంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. -
మీడియా పూర్తిగా రిపోర్ట్ చేయొచ్చు: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: కోర్టు విచారణ సందర్భంగా న్యాయస్థానంలో ఏం జరుగుతుంతో.. న్యాయవాదులు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో ప్రజలకు తెలియజయడం కోసం మీడియాను తప్పనిసరిగా అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదలకు ఎన్నికల సంఘానిదే బాధ్యత అని, వారిపై హత్యానేరం కింద విచారణ చేపట్టవచ్చని మద్రాస్ హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఈసీ వేసిన పిటిషన్ను విచారిస్తూ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఈ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టుల్లో జరిగే విచారణను నివేదించకుడా మీడియాను నిలువరించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మీడియా చాలా శక్తిమంతమైందని.. న్యాయస్థానంలో ఏం జరుగుతుందో దాన్ని బయటకు తెలియజేస్తుందని వ్యాఖ్యానించింది. కోర్టు తీర్పులే కాకుండా విచారణలో భాగంగా లేవనెత్తే ప్రశ్నలు, సమాధానాలు, వాదనలపై కూడా జనాలకు పట్టింపు ఉంటుందని సుప్రీం కోర్టు ఈ సందర్బంగా వ్యాఖ్యానించింది. కోర్టు పరిశీలనల్ని మీడియా ప్రచురించకపోవడం అనేది ఆచరణకు చాలా దూరమైన అంశమన్నది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వాదనలు వినిపిస్తూ.. కోవిడ్ విజృంభణకు సంబంధించి ఈసీకి కనీసం ఒక అవకాశం ఇవ్వకుండానే నిందిస్తున్నారని తెలిపింది. మద్రాస్ కోర్టు వ్యాఖ్యల అనంతరం ఎలాక్ట్రానిక్ మీడియాలో తన పని తీరును విమర్శిస్తూ.. వాదనలు నడుస్తున్నాయని ఈసీ కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు స్పందిస్తూ ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని పేర్కొంది. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా కోర్టులు కొన్నిసార్లు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటాయని తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మాట్లాడుతూ.. హైకోర్టులను తక్కువ చేయడం తమకు ఇష్టం లేదని తెలిపారు. న్యాయవ్యవస్థకు అవి మూలస్తంభాలని వ్యాఖ్యానించారు. విచారణలో భాగంగా కొన్నిసార్లు న్యాయమూర్తులు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారని.. కోర్టును ఎలా నిర్వహించాలో మీరు చెప్పాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. చదవండి: ధర్మాగ్రహం -
‘కరోనా కేసులు పెరగడానికి మేం కారణం కాదు’
చెన్నై : దేశంలో కరోనా కేసులు పెరగడానికి తాము కారణం కాదని కేంద్ర ఎన్నికల సంఘం మద్రాస్ హైకోర్టుకు వివరణ ఇచ్చింది. గత సోమవారం ఎఐఎడీఎంకే అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి ఎంఆర్ విజయ భాస్కర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టు స్పందించింది. ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్ నిబంధనల్ని అమలు చేయడంలో విఫలమయ్యారని, దేశంలో కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘమే కారణమని విమర్శించారు. అందుకు కేంద్ర ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని అన్నారు. ఈ క్రమంలో, ఆ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం కోర్డుకు వివరణ ఇచ్చింది. దేశంలో కరోనా కేసుల పెరగడానికి ఈసీని తప్పు బట్టడం సరికాదని పేర్కొంది. ఎన్నికల కమిషన్పై హత్యానేరం కేసు పెట్టాలన్న కామెంట్స్ను.. పలు మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి కథనాలు ప్రసారం చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. -
ధర్మాగ్రహం
దేశంలో కరోనా మహమ్మారి ఇంతగా విజృంభించడానికి ఏకైక కారణం మీరేనంటూ ఎన్నికల సంఘం(ఈసీ)పై మద్రాస్ హైకోర్టు సోమవారం చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించని వారుండరు. ఈ విషయంలో మీ అధికారులపై హత్య కేసు పెట్టాలని కూడా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, న్యాయమూర్తి జస్టిస్ రామమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహించింది. తగిన ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తారన్న నమ్మకం లేకపోతే వచ్చేనెల 2న జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా నిలిపేయాల్సివస్తుందని హెచ్చరించింది. న్యాయవ్యవస్థలో మద్రాస్ హైకోర్టుకు పేరుప్రతిష్టలున్నాయి. అది ఇచ్చే తీర్పులను ప్రామాణికమైనవిగా పరిగణిస్తారు. ధర్మాసనం ఆగ్రహించిన తీరు ఈసీ పనితీరుకు అద్దం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ రెండో దశ ఎలా స్వైరవిహారం చేస్తున్నదో సామాన్యులకు కూడా తెలిసినప్పుడు ఈసీకి తెలియదనుకోలేం. కానీ ప్రచార సమ యంలో అనుసరించాల్సిన నియమాలను రూపొందించాలన్న స్పృహ దానికి లేకపోయింది. వివిధ సందర్భాల్లో దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు విలువైన ఆదేశాలిచ్చింది. కానీ ఈసీ పట్టనట్టు వుండిపోయింది. అయితే పోలింగ్ రోజున ఓటర్లు, పార్టీల ఏజెంట్లు, ఎన్నికల అధికారులు భౌతిక దూరం పాటించాలని, అందరూ మాస్క్లు ధరించాలని నిబంధనలు పెట్టింది. ఆ జాగ్రత్తలు సభలు, సమావేశాలు, ర్యాలీల విషయంలో ఏమైందో? కనుకనే పార్టీలు హడావుడి చేసినప్పుడు మీరు ఏ గ్రహం మీద వున్నారని ఈసీని ధర్మాసనం ప్రశ్నించింది. నిజానికి ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి నెలాఖరున ప్రకటించినప్పటికే కేసులు మొదలయ్యాయి. మార్చిలో అవి జోరందుకున్నాయి. ఈనెల ప్రారంభంనుంచి కరోనా ఉగ్రరూపం దాల్చింది. మన దేశంలో ఎన్నికల ప్రచారం తంతు ఎవరికీ తెలియంది కాదు. మామూలు జాతరలకూ, వాటికీ తేడా వుండదు. ప్రజాభీష్టం వ్యక్తం కావాల్సిన ఎన్నికలు ప్రచార హోరుగా పరిణమించాయి. పోటీలుపడి జనాన్ని సమీకరిస్తూ భారీ ర్యాలీలు, సభలూ పెట్టడానికి నేతలు అలవాటుపడిపోయారు. పరస్పర నిందారోపణలు రివాజయ్యాయి. ఈ సంరంభంలో అసలు సమస్యలు మరుగునపడుతున్నాయి. పైగా ఈసారి ఎన్నికల షెడ్యూల్ చాంతాడంత వుంది. మార్చి మొదట్లో ప్రచారం ప్రారంభంకాగా అస్సాంలో తొలి దశ పోలింగ్ ఆ నెల 27న జరిగింది. ఇతరచోట్ల ఎన్నికలు ముగిసి చాలారోజులైనా బెంగాల్ సోమవారంనాటికి ఏడో దశ పూర్తిచేసుకుంది. ఈనెల 29న ఎనిమిదో దశ పోలింగ్తో ఎన్నికలు ముగుస్తాయి. మే 2న వెలువడే ఎన్నికల ఫలితాల తర్వాత విజయోత్సవాలు సరేసరి. ఒకపక్క పాశ్చాత్య దేశాల్లో కరోనా రెండో దశ స్వైర విహారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూళ్లు ప్రకటించేనాటికే వాటిపై కథనాలు వెలువడుతున్నాయి. అలాంటి సమయంలో ఇంత సుదీర్ఘమైన షెడ్యూల్ విడుదల చేయడం, ఆ తర్వాత ప్రచారం తంతు చూశాకైనా ఆంక్షల గురించి ఆలోచించక పోవడం ఈసీ తప్పిదం. కనీసం కేంద్రమైనా ఈసీ దృష్టికి ఈ విషయం తీసుకురావాల్సింది. ప్రచారపర్వంలో ఎక్కడా భౌతిక దూరం పాటించడం కనబడలేదు. మాస్క్లు పెట్టుకున్నవారు స్వల్పం. జనం సంగతలావుంచి నాయకులే వాటి జోలికిపోలేదు. కరచాలనాలు, ఆలింగనాలు కూడా మామూలే. ఒకరినుంచి ఒకరికి తుంపరల ద్వారా కరోనా వ్యాపిస్తుందని తెలిసినా విచ్చలవిడిగా నినాదాలిస్తూ మద్దతుదారులు ఆవేశంతో ఊగిపోతుంటే వారించినవారు లేరు. దీన్నంతటినీ చోద్యం చూస్తూ వుండిపోయిన ఈసీ కేవలం బెంగాల్ ప్రచారం విషయంలో మేల్కొంది. అక్కడెవరూ కరోనా నిబంధనలు పాటించడం లేదంటూ ఈనెల 22న తదుపరి ర్యాలీలు రద్దుచేసింది. అప్పటికే కరోనా కేసులు పెరిగాయి. ముగ్గురు అభ్యర్థులు ఆ వ్యాధికి బలయ్యారు. తమిళనాడు, కేరళ, అస్సాంలలో కూడా కేసుల సంఖ్య ఆందోళనకరంగానే వుంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే భారీగా కరోనా కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక తదితరచోట్ల ఎన్నికలు జరగలేదంటూ కొందరు చేస్తున్న తర్కం సరికాదు. అక్కడ ఇతర కారణాలు అందుకు దోహదపడివుండొచ్చు. అసెంబ్లీల గడువు ముగిసిపోతున్నందున ఎన్నికలు పెట్టాలనుకోవడం సరైందేకావొచ్చు. కానీ అసా ధారణ పరిస్థితుల్లో వాటి గడువు పొడిగించిన సందర్భాలు లేకపోలేదు. వాయిదా సంగతలావుంచి కనీసం ఈసారి డిజిటల్ మీడియా ద్వారా, చానెళ్ల ద్వారా మాత్రమే ప్రచారం చేయాలని ఆంక్షలు పెడితే అదొక కొత్త ఒరవడికి నాంది పలికేది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు అందరికీ వ్యాక్సినేషన్ పూర్తయ్యేవరకూ నిలిపేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టులను ఆశ్రయించింది. కానీ సాంకేతిక కారణాలతో కోర్టులు దాన్ని తోసిపుచ్చాయి. తిరుపతి ఉప ఎన్నిక విషయంలోనూ జగన్ ఇదే మాదిరి ముందుచూపు ప్రదర్శించారు. కరోనా కేసులు పెరుగుతున్న తీరు గమనించి తన బహిరంగ సభను రద్దు చేసుకున్నారు. దేశంలో ఇతర నేతలు దాన్ని అనుసరించారు. ఇప్పుడు మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు తీర్పులో భాగం కాకపోవచ్చు. కానీ ఈ ధర్మాగ్రహం నూరుశాతం సబబైనది. ఇప్పుడున్న స్థితిలో ఈ మహమ్మారి పంజా నుంచి తప్పించుకోవడమెలా అన్న భయాందోళనలు అందరిలోనూ వ్యాపించిన తరుణంలో న్యాయమూర్తుల ఆగ్రహం అన్ని వ్యవస్థల కళ్లు తెరిపించాలి. బాధ్యతగా మెలగడం, జవాబుదారీతనంతో వుండటం నేర్చుకోవాలి. -
ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
చెన్నై: భారత ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారి రెండో దశ భారత్లో ప్రమాదకర స్థితిలో ఉందని వ్యాఖ్యానించింది. నిత్యం మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్యం చేసింది. అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు, కుంభ మేళా, ప్రజల నిర్లక్ష్యం కారణంగా కేసులు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయని తెలిపింది. కరోనా విపత్తు ముంచుకొస్తున్న సమయంలో రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించింది. ఎన్నికల ర్యాలీలు జరుగుతున్నప్పుడు మీరు వేరే గ్రహంలో ఉన్నారా’? అని ఈసీఐ కౌన్సిల్ను ఉద్దేశించి చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ఇక తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్కు ఎలక్షన్ కమిషన్యే ఏకైక కారణమని మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలని పేర్కొంది. కరోనా కట్టడికి సరైన ప్రణాళిక లేకుంటే మే 2న విడుదలయ్యే ఫలితాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఏప్రిల్ 30న కోర్టు మరోసారి కౌంటింగ్ డేకు సంబంధించిన యాక్షన్ ప్లాన్పై సమీక్ష జరుపుతుందని తెలిపింది. కాగా తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 15,659 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,81,988కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 4206 ఒక్క చెన్నై నగరంలోనే వెలుగు చూశాయి. కరోనా మరణాలు కూడా తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. ఆదివారం రోజు కరోనా సోకి 82 మంది మరణించారు. చదవండి: మా ఆక్సిజన్ను ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయొద్దు -
ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
రైల్లో లైంగికదాడి; సీఎం పళనికి మద్రాస్ హైకోర్టు నోటీసులు
సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామికి మద్రాసు హైకోర్టు నోటీసు జారీ చేసింది. సీఎంపై డీఎంకే నేత సూళూరు ఎ. రాజేంద్రన్ పరువు నష్టం దావా వేయడంతో కోర్టు స్పందించింది. ప్రతిపక్షాల నేతలు సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే చాలు ప్రభుత్వ తరఫు న్యాయవాదులు చటుక్కున కోర్టుల్లో పరువునష్టం దావాలు వేయడం జరుగుతూ వచ్చింది. అయితే, ఈ సారి పరిస్థితి భిన్నం అన్నట్టుగా సీఎం పళనిస్వామిపై డీఎంకే నేత రాజేంద్రన్ దావా వేయడం చర్చకు దారితీసింది. ఎన్నికల ప్రచారంలో కోయంబత్తూరు వేదికగా సీఎం పళనిస్వామి రాజేంద్రన్ను టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైలులో ఓ యువతిపై లైంగిక దాడి యత్నం చేశాడని ఆరోపించారు. దీనిని రాజేంద్రన్ తీవ్రంగా పరిగణించారు. తాను చేయని నేరాన్ని, తనపై వేస్తూ, పరువుకు భంగం కల్గించే రీతిలో సీఎం వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దావా వేశారు. నోటీసులు.. ఇటీవల తాను రైలులో పయనిస్తున్న సమయంలో అత్యవసరంగా మూత్ర విసర్జన నిమిత్తం పై బెర్త్ నుంచి కింది బెర్త్కు దిగాల్సి వచ్చిందని, ఆ సమయంలో కింద ఉన్న యువతిపై జారిపడ్డానని ఆ దావాలో వివరించారు. తనకు మధుమేహం ఉందని, అందుకే మూత్ర విసర్జన కోసం అత్యవసరంగా పరుగులు తీశానని, అయితే, తానేదో అసభ్యకరంగా ప్రవర్తించినట్టుగా భావించిన ఆ యువతి పోలీసులకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత తన పరిస్థితిని ఆ యువతికి వివరించినానంతరం ఆమె శాంతించారని గుర్తు చేశారు. అయితే హఠాత్తుగా తనపై పదిహేను రోజుల అనంతరం పోలీసులు కేసు పెట్టారని, ఈ వ్యవహారంలో కోర్టు సైతం తనకు క్లీన్చిట్ ఇచ్చినట్టు వివరించారు. అయితే, ఎన్నికల సమయంలో తానేదో రైలులో లైంగిక దాడి యత్నం చేసినట్టుగా సీఎం ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన పరువుకు భంగం కల్గించే రీతిలో ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. కోటి నష్టపరిహారం కోరుతూ సీఎం పళనిస్వామికి దావా ద్వారా నోటీసులు ఇచ్చారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి పార్థిబన్ నేతృత్వంలోని బెంచ్ ముందు గురువారం విచారణకు వచ్చింది. వాదనల అనంతరం సీఎం పళనిస్వామికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే వ్యవహారంలో మంత్రి ఎస్పీ వేలుమణిపై కూడా రాజేంద్రన్ దావా వేశారు. చదవండి: ‘కొడుకు పెళ్లైనప్పటి నుంచీ విడిగానే.. మాకు సంబంధం లేదు’ -
వివాదం.. డైరెక్టర్ శంకర్ స్పందన కోసం చూస్తున్నాం
దర్శకుడు శంకర్ను చుట్టుముట్టిన వివాదాలు ఇప్పుడు తమిళ పరిశ్రమలో హాట్ టాపిక్. ‘ఇండియన్ 2’ నిర్మాణం, ‘అన్నియన్’ రీమేక్ చిత్రాల విషయంలో ఆయన వివాదాలు ఎదుర్కొంటున్నారు. ‘ఇండియన్ 2’ సినిమాను పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్ మరో సినిమాను డైరెక్ట్ చేయకూడదని మద్రాస్ హైకోర్టులో చిత్రనిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ కేసు వేసిన సంగతి తెలిసిందే. రామ్చరణ్ హీరోగా తన దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్లు శంకర్ ప్రకటించిన తర్వాత కోర్టుని ఆశ్రయించింది లైకా. ఈ నేపథ్యంలో ‘ఇండియన్ 2’ సినిమా విషయంలో కోర్టు జోక్యంతో సానుకూలత ఏర్పడదని, రెండు పక్షాలవారు ఆలోచించుకుని ఓ సానుకూల నిర్ణయానికి రావాలని కేసుని విచారించిన కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. ప్రముఖ తమిళ నటుడు వివేక్ హఠాన్మరణం కూడా ‘ఇండియన్ 2’ని ఇరుకుల్లో పడేసింది. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఇంకా పూర్తి కాలేదు. సినిమా పూర్తి చేయాలంటే వివేక్ ఉన్న సీన్స్ను మళ్లీ మరో నటుడితో చిత్రీకరించాలని శంకర్ పేర్కొన్నారు. కాగా.. కమల్హాసన్తో ఓ సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకోవాలన్నది వివేక్ కల. ఆ కల పూర్తి స్థాయిలో నిజం కాకుండానే వివేక్ మరణించడం బాధాకరమని ఆయన ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. మరి.. ‘ఇండియన్ 2’, ‘అన్నియన్’ చిత్రాల వివాదాలకు ఎలా తెరపడనుందో చూడాలి. శంకర్ స్పందన కోసం చూస్తున్నాం! – సౌత్ ఇండియన్ ఫిలిమ్ ఛాంబర్ ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’) సినిమా రీమేక్ రైట్స్ గురించి ఈ చిత్రదర్శకుడు శంకర్, చిత్రనిర్మాత రవిచంద్రన్ల మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో రీమేక్ చేయనున్నట్లు ఇటీవల శంకర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాతగా ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ తనవే అని ఆస్కార్ రవిచంద్రన్, దర్శకుడిగా రీమేక్ హక్కులు తనవేనని శంకర్ ఎవరికివారు బహిరంగ లేఖలను విడుదల చేశారు. తాజాగా శంకర్పై సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్లో ఫిర్యాదు చేశారు నిర్మాత రవిచంద్రన్. ‘‘రవిచంద్రన్ మా సంస్థ సభ్యుడు. ‘అన్నియన్’ రీమేక్ రైట్స్ విషయంలో ఆయన శంకర్పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మేం శంకర్ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. మామూలుగా అయితే రీమేక్ రైట్స్ నిర్మాతలకే ఉంటాయి. ఒక నిర్మాత నిర్మించిన సినిమాను వేరే నిర్మాతతో రీమేక్ చేయాలన్నప్పుడు ఆ దర్శకుడు సదరు నిర్మాతకు కూడా కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇటువంటి కేసులు గతంలో కొన్ని ఉన్నాయి. కానీ ‘అన్నియన్’ సినిమా విడుదలై చాలా రోజులయింది కాబట్టి ఈ విషయంపై ప్రస్తుతం నేనేం కామెంట్ చేయలేను’’ అని సౌత్ ఇండియన్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్కి చెందిన రవి కొట్టాక్కర పేర్కొన్నారు. -
‘ఇండియన్ -2’ వివాదం: మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘ఇండియన్ -2’ వివాదంలో ఇరుపక్షాలు కూర్చొని మాట్లాడుకోవాలని దర్శకుడు శంకర్, నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్కు మద్రాసు హైకోర్టు సూచించింది. కోర్డు జోక్యంతో వివాదంలో సానుకూలత ఏర్పడదని వ్యాఖ్యానించింది. లైకా ప్రొడక్షన్లో రూపొందితున్న ఇండియన్ 2 ప్రాజెక్టును మధ్యలోనే ఆపేసి మరో సినిమాను స్టార్ట్ చేస్తుండడంతో శంకర్పై నిర్మాణ సంస్థ కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై మద్రాసు హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా లైకా ప్రోడక్షన్స్ తమ వాదనలు వినిపిస్తూ.. గత ఏడాది మార్చికే ‘ఇండియన్-2’ షూటింగ్ పూర్తి చేస్తామని శంకర్ హామీ ఇచ్చారని, ఆసల్యం చేయడంతో భారీగా నష్టపోయామని కోర్టుకు విన్నవించింది. ఇతర చిత్రాలు చేపట్టకుండా శంకర్పై ఆంక్షలు విధించాలని హైకోర్టును కోరింది. నటుడు వివేక్ మృతి చెందడంతో ఈ సీన్లన్నీ మళ్లీ తీయాలని శంకర్ తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తమ జోక్యంలో సమస్యకు పరిష్కారం కాదని, ఇరు పక్షాలు కూర్చొని ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అనంతరం విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. 1996లో కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ ’కు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరగడం, కమల్ హాసన్ మొన్నటివరకు రాజకీయంగా బిజీగా ఉండటంతో ఇప్పటికే 60 శాతం దాకా పూర్తయిన ‘ఇండియన్ 2’కు బ్రేక్ పడింది. -
‘కొడుకు పెళ్లైనప్పటి నుంచీ విడిగానే.. మాకు సంబంధం లేదు’
సాక్షి, చెన్నై : తాము విడిగా జీవిస్తున్నట్లు చెప్పి వరకట్నం కేసుల నుంచి భర్త, తల్లిదండ్రులు తప్పించుకుంటున్నట్లు హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. వరకట్నం చిత్రహింసలతో మహిళ ఆత్మహత్య చేసుకున్న కేసును విచారించిన కడలూరు మహిళా కోర్టు భర్త, అతని తల్లిదండ్రులకు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ శిక్షకు గురైన తల్లిదండ్రులు మద్రాసు హైకోర్టులో అప్పీలు చేశారు. అందులో కుమారుడికి వివాహమైనప్పటి నుంచి తాము విడిగా జీవిస్తున్నట్లు, కోడలి ఆత్మహత్యకు తమకు సంబంధం లేదని పిటిషన్లో తెలిపారు. తమకు కింది కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి పి.వేల్మురుగన్ విచారణ జరిపారు. ఆ సమయంలో కుమారుడితో కలిసి పిటిషనర్లు కోడలిని హింసించేందుకు ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. దీంతో న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో వరకట్నం చిత్రహింసలతో మహిళల ఆత్మహత్యలు నానాటికీ పెరుగుతున్నాయని, మరోవైపు తాము ఒకటిగా జీవించడం లేదని, విడిగా జీవిస్తున్నట్లు భర్త తల్లిదండ్రులు వరకట్నం కేసుల నుంచి తప్పించుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వారు విడిగా జీవించినా మామగారి ఇంట్లో కారు, బైక్, నగలు, నగదు వరకట్నంగా తీసుకోవాల్సిందిగా కుమారుని రెచ్చగొడుతున్నట్లు తెలిపారు. ఇటువంటి కేసులో తాము విడిగా ఉంటున్నట్లు తెలిపి పలువురు శిక్షల నుంచి తప్పించుకునేందుకు పిటిషన్లు దాఖలు చేస్తున్నారని, కుమారులను సమాజంలో ప్రయోజకులుగా పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదని తెలిపారు. ఈ కేసులో తల్లిదండ్రులకు కింది కోర్టు విధించిన శిక్షను నిలిపివేయలేమని, ఈ కేసును తుది విచారణకు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులిచ్చారు. చదవండి: తమిళ సినిమాకు షాక్! ఆ సన్నివేశాలు తొలగించాల్సిందేనా? -
తమిళ సినిమాకు షాక్! ఆ సన్నివేశాలు తొలగించాల్సిందేనా?
మండేలా చిత్ర వ్యవహారంపై సెన్సార్ బోర్డుతోపాటు చిత్ర దర్శక నిర్మాతలకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హాస్య నటుడు యోగిబాబు టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మండేలా. ఇది ఈ నెల 4న ఓటీటీలో విడుదలైంది. మండేలా చిత్రాన్ని రీ సెన్సార్ చేయాలని తమిళనాడు క్షురవకుల సంఘం తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో నటుడు యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన మండేలా చిత్రంలో క్షురవకుల జాతి మనోభావాలను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించేలా చిత్ర నిర్మాతలకు ఆదేశించాలని కోరారు. న్యాయమూర్తి మహదేవన్ విచారణ చేపట్టి వివరణ ఇవ్వాలని సెన్సార్ బోర్డు, మండేలా చిత్ర దర్శక నిర్మాతలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 28కి వాయిదా వేశారు. చదవండి: సైనికుడిగా దుల్కర్ సల్మాన్.. కొత్త సినిమా గ్లిమ్స్ విడుదల -
ఆ విద్యార్థులకు షాక్.. తప్పక పరీక్ష రాయాల్సిందే!
సాక్షి, చెన్నై: పలు సబ్జెక్టుల్లో ఫెయిలైన ‘అరియర్స్’ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సైతం షాక్ ఇచ్చింది. ఆల్పాస్ ఉత్తర్వుల నుంచి యూటర్న్ తీసుకుంది. అరియర్స్ విద్యార్థులందరూ పరీక్షలు రాయాల్సిందేనని ప్రకటించింది. ఇందుకు తగ్గ నివేదిక గురువారం మద్రాసు హైకోర్టుకు చేరింది. కరోనా విలయతాండవంతో గత విద్యా సంవత్సరం జరగాల్సిన ప్లస్టూ మినహా, తక్కిన అన్ని పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. పది విద్యార్థులకు ఆల్పాస్ ప్రకటించారు. అదే తరహాలో ఇంజినీరింగ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్న చివరి సంవత్సరం విద్యార్థులు మినహా, తక్కిన సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు రద్దు చేసి తర్వాత సంవత్సరానికి ప్రమోట్ చేశారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా, అనేక సబ్జెక్టుల్లో ఫెయిలై ఏళ్ల తరబడి అరియర్స్ను భుజాన వేసుకుని ఉన్న విద్యార్థులకు ఊరట కల్గించే రీతిలో రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఆల్పాస్ ప్రకటన చేయడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారం మద్రాసు హైకోర్టు చేరింది. విచారణ సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ఏఐసీటీఈ తీవ్రంగా ఖండించింది. ఇది తమ నిబంధనలకు విరుద్ధమని యూజీసీ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అని అరియర్స్ విద్యార్థులు ఎదురుచూశారు. ఆల్ పాస్ ప్రకటన సమయంలో పాలక వర్గాన్ని ఆకాశానికి ఎత్తేసిన ఈ విద్యార్థులకు తాజాగా షాక్ తప్పలేదు. పరీక్ష రాయాల్సిన పరిస్థితి. అయితే, ఇది నామమాత్రంగా ఉంటుందా వేచి చూడాల్సిందే.? ఆన్లైన్లో పరీక్ష.. తమ నిర్ణయాన్ని సమర్థించుకునే రీతిలో కోర్టులో వాదన వినిపిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా యూటర్న్ తీసుకుంది. ఓ వైపు ఏఐసీటీఈ, మరో వైపు యూజీసీ, ఇంకో వైపు కోర్టు రూపంలో వ్యతిరేకత , అక్షింతలు ఎదురుకావడంతో రాష్ట్ర ప్రభుత్వం తగ్గాల్సిన పరిస్థితి. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ ముందు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ విజయనారాయన్ హాజరై నివేదికను సమర్పించారు. అందులో అరియర్స్ విద్యార్థుల ఆల్ పాస్ ఉత్తర్వులను వెనుక్కి తీసుకుంటూ, పరీక్ష నిర్వహించన్నుట్టు ప్రకటించారు. అరియర్స్ విద్యార్థులందరికి ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించనున్నామని వివరించారు. ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులే ఉత్తీర్ణతకు అర్హులు అవుతారని ప్రకటించారు. పరీక్షల నిర్వహణ తేదీలను ఆయా విశ్వవిద్యాలయాలు ప్రకటిస్తాయని పేర్కొంటూ, యూజీసీ వర్గాలతో మరో మారు సంప్రదింపులు జరిపి సజావుగా అన్ని వ్యవహరాలు సాగే రీతిలో చర్యలు తీసుకుంటామని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో న్యాయమూర్తి స్పందిస్తూ, ఆన్లైన్లో పరీక్షల నిర్వహణకు ఎనిమిది వారాలు సమయం ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతలోపు అన్ని ప్రక్రియలు ముగించి కోర్టుకు నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలైకు వాయిదా వేశారు. చదవండి: ఈ వైద్యురాలు తన శ్వాసతో పసి ప్రాణాన్ని కాపాడింది -
ఇండియన్ 2: దర్శకుడు శంకర్కు ఊరట
చెన్నై: ప్రముఖ సినీ దర్శకుడు శంకర్కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించడంపై స్టే విధించడం కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు. నటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఇండియన్ 2 చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం షూటింగ్ ఆరంభం నుంచి పలు అవరోధాలను ఎదుర్కొంటోంది. కరోనాకు ముందే ఇండియన్ 2 చిత్రం నిలిచిపోయింది. దీంతో శంకర్ ఇతర చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో లైకా సంస్థ శంకర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అందులో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ కథానాయకుడిగా తమ సంస్థ ఇండియన్ 2 చిత్రం నిర్మిస్తోందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి రూ.150 కోట్ల బడ్జెట్తో నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని అయితే ఇప్పటికే రూ.236 కోట్లు అయ్యిందని తెలిపారు. ఇప్పటికీ 80 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయిందని పేర్కొన్నారు. శంకర్కు రూ. 40 కోట్లు పారితోషకం చెల్లించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అందులో రూ. 14 కోట్లు అడ్వాన్గా చెల్లించామన్నారు. అయితే తమ చిత్రాన్ని పూర్తి చేసే వరకు శంకర్ ఇతర చిత్రాలకు పని చేయకుండా ఆయనపై నిషేధించాలని కోరారు. ఈ కేసు గురువారం న్యాయమూర్తి పీటీ.ఆషా సమక్షంలో విచారణకు వచ్చింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించరాదంటూ శంకర్పై నిషేధం వధించలేమని పేర్కొన్నారు. శంకర్ను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈనెల 15వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: డైరెక్టర్ శంకర్పై నిర్మాతల కేసు! -
డైరెక్టర్ శంకర్పై నిర్మాతల కేసు!
‘ఇండియన్ 2’ షూటింగ్ను దర్శకుడు శంకర్ ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈ సినిమా శంకర్ కెరీర్ను ఇబ్బందిపెడుతూనే ఉంది. గత ఏడాది ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగి, నలుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్కు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత సినిమా మళ్ళీ సెట్స్పైకి వెళ్లలేదు. ఈలోపు ‘ఇండియన్ 2’లో హీరోగా నటిస్తున్న కమల్హాసన్ రాజకీయంగా బిజీ అయిపోయారు. ఇటు శంకర్ కూడా రామ్చరణ్తో ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేసేందుకు కథ రెడీ చేసుకున్నారు. ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో ‘ఇండియన్ 2’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దర్శకుడు శంకర్కు షాక్ ఇచ్చింది. ‘ఇండియన్ 2’ను పూర్తి చేయకుండా శంకర్ మరో ప్రాజెక్ట్కు డైరెక్టర్గా వ్యవహరించకూడదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ,మద్రాస్ హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. ‘‘ఇండియన్ 2’ బడ్జెట్ రూ. 236 కోట్లనుకున్నాం. ఇప్పటి వరకు చేసిన షూటింగ్కు రూ. 180 కోట్లు ఖర్చు అయ్యాయి. లాగే శంకర్కు మేం ఇస్తామన్న 40 కోట్ల పారితోషికంలో ఆల్రెడీ 14 కోట్లు చెల్లించాం. మిగిలిన 26 కోట్ల రూపాయలను కూడా కోర్టు సమక్షంలో చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని లైకా ప్రొడక్షన్స్ తమ పిటిషన్ లో పేర్కొందని కోలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. అయితే దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ మధ్య తలెత్తిన ఈ వివాదం ఎలాంటి పరిష్కారంతో ముగుస్తుందనే చర్చ ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. 1996లో కమల్హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇండియన్ ’కు సీక్వెల్గా ‘ఇండియన్ 2’ తెరకెక్కుతోంది. -
ఔను ఆ అమ్మాయిలిద్దరూ ఇష్టపడ్డారు.. కానీ!
సాక్షి, చెన్నై: ఇద్దరమ్మాయిల పరిచయం ప్రేమకు దారి తీసి కలిసి జీవనం సాగించే పరిస్థితికి చేరింది. తమను విడదీయడానికి తల్లిదండ్రులు ప్రయత్నించడంతో ‘ఆ’ ఇద్దరమ్మాయిలు కోర్టుకెక్కారు. ఈ వ్యవహారాన్ని సున్నితంగా పరిగణించిన కోర్టు, ఇది వరకు కోర్టులు ఇచ్చిన తీర్పుల సమగ్ర పరిశీలన మేరకు అడుగులు వేయడానికి నిర్ణయించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. మదురైకు చెందిన ఇద్దరు యువతులు తమ స్నేహ పరిచయాన్ని ప్రేమగా మార్చేసుకున్నారు. ఒకర్ని వదలి మరొకరు లేనంతగా ప్రేమ బంధంతో కలిసి జీవనం సాగించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరి సహజీవనం తల్లిదండ్రుల దృష్టికి చేరింది. దీంతో ఆ ఇద్దర్నీ విడదీయడానికి ఆ తల్లిదండ్రులు తీవ్రంగానే ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకున్న ఈ జంట చెన్నైలోని ఓ స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. వీరి ద్వారా మద్రాసు హైకోర్టుకెక్కారు. తామిద్దరం కలిసి జీవించేందుకు నిర్ణయించామని, తమ భవిష్యత్తు గురించి ఇతరులకు ఎందుకో అని ప్రశ్నిస్తూ, తమకు భద్రత కల్పించాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ బుధవారం హైకోర్టు బెంచ్ ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు వాదనల్ని విన్న న్యాయస్థానం, ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇది వరకు కోర్టులు ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తున్నామని సూచించారు. ఇద్దరు యువతుల వాంగ్మూలం, తల్లిదండ్రుల వాంగ్మూలాన్ని వేర్వేరుగా కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. అలాగే, ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాలని, సమగ్ర విచారణతో ఏప్రిల్ 26వ తేదీ కోర్టుకు నివేదికను సమర్పించాలని సామాజిక కార్యకర్త విద్య దినకరన్నును ఈమేరకు ఆదేశించారు. -
కొత్త ఈవీఎంలే ఉపయోగిస్తాం: హైకోర్టుకు స్పష్టం చేసిన ఈసీ
సార్వత్రిక ఎన్నికల్లో కొత్త ఈవీఎంలనే ఉపయోగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈమేరకు మంగళవారం మద్రాసు హైకోర్టుకు వివరణ ఇచ్చింది. 2017 తర్వాత తయారైన ఈవీఎంలనే వినియోగించనున్నట్లు వెల్లడించింది. అలాగే శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను రాజకీయ పార్టీలకు ఇవ్వలేమని తెలిపింది. సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించనున్న ఈవీఎంలపై పలువురు అనుమానం వ్యక్తం చేశారు. సుమారు 15ఏళ్ల నాటి ఈవీఎంలనే ప్రస్తుతం వాడబోతున్నారని ఆరోపించారు. దీనిపై డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మద్రాసు హైకోర్టులో పిటీషన్ వేశారు. పాత ఈవీఎంలను వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలోని సమస్యాత్మక కేంద్రాల జాబితాను ప్రకటించాలని పేర్కొన్నారు. ఈ పిటీషన్ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి సంజీబ్ బెనర్జీ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ తరఫున న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 11వేలసమస్మాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు. ఈ విషయమై ఈ నెల 26వ తేదీన అన్ని పార్టీలతో చర్చించినట్లు తెలిపారు. అదే విధంగా, శాంతిభద్రతల దృష్ట్యా జాబితాను ప్రకటించలేమని స్పష్టం చేశారు. పారదర్శకంగా పోలింగ్ నిర్వహించేందుకు 44వేల కేంద్రాల్లో వెబ్ కెమెరాలను అమర్చనున్నట్లు వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో 2017 తర్వాత తయారై ఈవీఎంలనే వినియోగిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ నిబంధనలను సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కోర్టుకు విన్నవించారు. ఈసీ వాదనతో కోర్టు ఏకీభవించింది. విచారణను ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిపించాలని సూచించింది. శరవేగంగా ఏర్పాట్లు ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పోలింగ్కు సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల కమిషనర్ సాహు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఈసీ సాహు మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీ నాటికి పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లా కేంద్రాల నుంచి పీపీఈ కిట్లు, మాస్క్లు, శానిటైజర్లను తెప్పించుకోవాలని సూచించారు. ముమ్మరంగా తనిఖీలు.. కేసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. పొల్లాచ్చిలో డీఎంకే, అన్నాడీఎంకే వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. దీంతో మంగళవారం ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే ఈరోడ్ సత్యమంగళంలో డీఎంకే కార్యకర్తలు ఓ హోటల్ను ధ్వంసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పుదుకోట్టైలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు రూ.2వేల నోట్లతో సిద్ధం చేసిన కవర్లను ఫ్లైయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. చెన్నై అన్నానగర్లో అధికారులు నిర్వహించిన తనిఖీలో రూ.48 లక్షలు పట్టుబడింది. మధురై తిరుమంగళంలో ఓటుకు నోటు పంచుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు కెమెరాకు చిక్కడంతో ఎన్నికల అధికారులు విచారణ చేపట్టారు. రాయపురంలో 250 గ్యాస్ స్టౌలు, తిరునల్వేలిలో రూ.13 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, కాంచీపురంలో 3.5 కేజీల నగలు పట్టుబడ్డాయి. ఈ క్రమంలోనే తిరువణ్ణామలైలో డీఎంకే అభ్యర్థి ఏవీ వేలు ఇంట్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ. 25 కోట్ల మేర లెక్కల్లో లేని ఆదాయమున్నట్లు తేల్చారు. తపాలా ఓటు హల్చల్! సామాజిక మాధ్యమాల్లో తపాలా ఓటు ప్రత్యక్షం కావడంపై ఎన్నికల కమిషన్ విచారించి ముగ్గురిపై కేసు నమోదు చేసింది. తెన్కాశిలోని కృష్ణవేణి అనే ఉపాధ్యాయిని తన తపాలా ఓటును ఫొటో తీసి భర్త గణేశ్ పాండ్యన్కు పంపించారు. ఆయన తన సమీప బంధువు సెంథిల్ పాండ్యన్కు ఫార్వర్డ్ చేశారు. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది. విచారించిన పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. చదవండి: కమల్ హాసన్పై గౌతమి ఫైర్ సీఎం ‘అక్రమ సంతానం’ వ్యాఖ్యలపై రాజా క్షమాపణ -
నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు!
సాక్షి, చెన్నై: తమిళ నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని శ్రీలంకకు చెందిన మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జెమినిలో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన ఓ యువతి ఆర్య తనను వివాహం చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ పీఎం, సీఎం, హోం మినిస్టర్ కార్యాలయాలకు లేఖ రాశారు. దీంతో ఆర్య అనుచరుడు మహమ్మద్ అర్మన్ ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్ ఇవ్వకూడదని కోరుతూ యువతి మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ శుక్రవారం న్యాయమూర్తి సెల్వ కుమార్ సమక్షంలో విచారణకు వచ్చింది. విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేశారు. చదవండి: షారుఖ్తో సినిమా.. ముంబైలో ఆఫీస్ వెతుకుతున్న డైరెక్టర్ -
కర్ణన్కు బెయిల్
సాక్షి, చెన్నై: రిటైర్డ్ న్యాయమూర్తి కర్ణన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు, న్యాయ లోకానికి వ్యతిరేకంగా రిటైర్డ్ న్యాయమూర్తి కర్ణన్ వీడియో విడుదల చేయడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ కేసు విచారణ సమయంలో హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. కర్ణన్ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. డీజీపీ, చెన్నై పోలీసు కమిషనర్లకు నోటీసులు సైతం జారీ అయ్యాయి. దీంతో కర్ణన్ను ఇటీవల అరెస్టు చేశారు. జైలులో ఉన్న కర్ణన్ బెయిల్ మంజూరు చేయాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తొలుత ఆయన బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్ తిరస్కరించింది. దీంతో మరోసారి బెయిల్ కోసం విజ్ఞప్తి చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం సాగిన విచారణలో వాదనల అనంతరం కర్ణన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. -
ఎన్నికల చిహ్నంపై స్టే కుదరదు: హైకోర్టు
సాక్షి ప్రతినిధి, చెన్నై: గుర్తింపు పొందిన పార్టీల చిహ్నాలను కూటమి పార్టీల అభ్యర్థులకు కేటాయింపుపై నిషేధం విధించేందుకు వీలులేదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్నికలు ముగిసిన తరువాత ఈసీ బదులివ్వాలని బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుంచి 14 మంది మిత్రపక్ష పార్టీల అభ్యర్థులు ఉదయసూర్యుని గుర్తుపై పోటీచేస్తున్నారు. అలాగే అన్నాడీఎంకే కూటమిలోని 12 మంది మిత్రపక్ష అభ్యర్థులు రెండాకుల చిహ్నంపై బరిలోకి దిగుతున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఆయా పార్టీల సభ్యులు మాత్రమే ఆ చిహ్నంపై పోటీచేయాలని, ఇతరులు పోటీ చేసేందుకు వీలులేకున్నా ఎన్నికల అధికారులు వారి నామినేషన్లను అంగీకరించారని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజనవాజ్యం దాఖలైంది. గుర్తింపు పొందిన పార్టీలు మిత్రపక్షపార్టీలకు తమ పార్టీ చిహ్నం కేటాయించకుండా ఎన్నికల కమిషన్కు నిషేధ ఉత్తర్వులు జారీచేయాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ బెనర్జీ, న్యాయమూర్తి సెంథిల్కుమార్ రామమూర్తిలతో కూడిన డివిజన్ బెంచ్కు బుధవారం విచారణకు వచ్చింది. ఎన్నికల చిహ్నం కేటాయింపులు పూర్తయినందున పిటిషనర్ వాదనపై ప్రస్తుత ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని న్యాయమూర్తులు అన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ పిటిషన్పై బదులి పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఈసీని కోర్టు ఆదేశిస్తూ విచారణను జూన్ 3వ వారానికి వాయిదావేసింది. జిల్లా కలెక్టర్, ఎస్పీలపై వేటు అధికార అన్నాడీఎంకేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలపై కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ రాజామణి, పోలీస్ కమిషనర్ సుమిత్ శరణ్లను ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించింది. చెన్నై వేలాచ్చేరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఘర్షణకు దిగిన అన్నాడీఎంకే, కాంగ్రెస్ అభ్యర్థులపై తిరువాన్మియూరు పోలీసులు మూడు సెక్షన్లపై కేసులు పెట్టారు. ఐజేకే కూటమి సారధి, మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్హాసన్ పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణంలో మిత్రపక్ష సమక అధ్యక్షులు శరత్కుమార్ గురువారం ప్రచారం చేయనున్నారు. చెన్నైలో 7,300 మంది వృద్ధుల నుంచి పోస్టల్ ఓట్ల కోసం ఈసీ 70 బృందాలను నియమించింది. ఇంటింటికీ వెళ్లి పోస్టల్ ఓట్ల సేకరణకు శిక్షణ బుధవారం ప్రారంభమైంది. సొంతూళ్లకు వెళ్లి ఓటు వేసేందుకు వీలుగా 14,215 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. ఏప్రిల్ 1 నుంచి 5వ తేదీ వరకు నడిపే ఈ ప్రత్యేక బస్సుల కోసం బుధవారం రిజర్వేషన్ ప్రారంభమైంది. పోలింగ్ నేపథ్యంలో ఈనెల 4,5,6 తేదీల్లో టాస్మాక్ దుకాణాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. -
ప్రత్యేక డీజీపీ సస్పెన్షన్
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక డీజీపీ రాజేష్దాసు సస్పెండ్ అయ్యారు. ఆ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవికి ఇద్దరు డీజీపీ స్థాయి హోదా అధికారుల పేర్లు సిఫారసు చేశారు. మహిళా ఐపీఎస్ అధికారి రాజేష్దాసుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం విదితమే. ఆమె ఫిర్యాదు మేరకు కేసును సీబీసీఐడీకి డీజీపీ త్రిపాఠి అప్పగించారు. దీంతో విచారణపై సీబీసీఐడీ దృష్టి పెట్టింది. ఈ వ్యవహారంపై విల్లుపురంలో విచారణ సాగగా, ప్రస్తుతం చెన్నైకు విచారణ చేరింది. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని మద్రాసు హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారించే పనిలో పడింది. ఇక విచారణలో వెలుగు చూసిన అంశాల మేరకు చెంగల్పట్టు ఎస్పీగా ఉన్న కన్నన్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. సస్పెండ్ కూడా చేశారు. ఆ మహిళా అధికారి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నందుకే కన్నన్ ఈ కేసులో చిక్కుకున్నారు. అయితే, లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక డీజీపీ వద్ద కేవలం విచారణ మాత్రమే సాగినా, సస్పెండ్ చర్యలు తీసుకోలేదు. ఇదే విషయంగా మద్రాసు హైకోర్టు స్పందించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సైతం దృష్టి పెట్టింది. దీంతో వెయిటింగ్ లిస్టులో ఉన్న ఈ ప్రత్యేక డీజీపీని సస్పెండ్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పదవికి డీజీపీ హోదా కల్గిన అభాష్కుమార్, అభయ్ కుమార్సింగ్లలో ఒకర్ని నియమించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఇద్దరి పేర్లను ఎన్నికల కమిషన్కు సిఫారసు చేశారు. చదవండి: ఆరు నెలల్లో ముగించాల్సిందే: హైకోర్టు ఆగ్రహం ఆ డీజీపీపై 3 కేసులు: దృష్టి సారించిన హైకోర్టు -
అత్యాచారం కేసులో యువకుడికి ఉరిశిక్ష రద్దు
టీ.నగర్: పదమూడేళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో యువకుడికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను గురువారం హైకోర్టు రద్దు చేసింది. చెంగల్పట్టు జిల్లాకు చెందిన అశోక్కుమార్ (27) గత 2017లో 13 ఏళ్ల బాలికపై హత్యాచారం చేసి అరెస్టయ్యాడు. కేసు విచారణ జరిపిన చెంగల్పట్టు ప్రత్యేక కోర్టు అశోక్కుమార్కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో అశోక్కుమార్ రిట్ పిటిషన్ దాఖలు చేశాడు. ఉరి శిక్ష రద్దు చేస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. చదవండి: లైంగిక వేధింపులు: రాఖీ కడితే సరిపోతుందా?! -
ఆరు నెలల్లో ముగించాల్సిందే: హైకోర్టు ఆగ్రహం
సాక్షి, చెన్నై: జ్యుడిషియల్ కస్టడీలో తండ్రి, కొడుకుల మరణం కేసులో విచారణ జాప్యంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఆరు నెలల్లోపు దర్యాప్తును ముగించి తీర్పు వెలువరించాలని కింది కోర్టుకు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం గురువారం ఆదేశించింది. తూత్తుకుడి జిల్లా సాత్తాన్కులంకు చెందిన జయరాజ్, ఫినిక్స్ అనే తండ్రి కుమారులు జ్యుడిషియల్ కస్టడీలో మరణించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ కేసు విచారణలో భాగంగా సాత్తాన్కులం పోలీసులు ఈ ఇద్దర్ని చిత్రహింసలు పెట్టినట్టు తేలింది. ఆ స్టేషన్ సీఐ, ఇద్దరు ఎస్ఐలతో పాటు పది మంది పోలీసులు అరెస్టు అయ్యారు. కేసును సీబీఐ విచారిస్తోంది. చార్జ్షీట్ను మదురై జిల్లా కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఈ నేపథ్యంలో కింది కోర్టులో విచారణ జాప్యంపై హైకోర్టు గురువారం స్పందించింది. కేసును త్వరితగతిన విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఆరునెలల్లోపు ఈ ప్రక్రియను ముగించాలని గడువు విధించారు. చదవండి: కస్టడీ డెత్: సీబీఐ విచారణలో విస్తుపోయే విషయాలు డీజీపీతో పాటు ఎస్పీ కన్నన్ మెడకు ఉచ్చు -
డీజీపీతో పాటు ఎస్పీ కన్నన్ మెడకు ఉచ్చు
సాక్షి, చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రత్యేక డీజీపీ రాజేష్ దాసుతో పాటు చెంగల్పట్టు ఎస్పీ కన్నన్పై సీబీసీఐడీ గురిపెట్టింది. మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి సోమవారం విచారణకు శ్రీకారం చుట్టింది. ఇక ఈ కేసును మద్రాసు హైకోర్టు సైతం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. మహిళా ఐపీఎస్ అధికారికి లైంగిక వేదింపులు ఇచ్చినట్టుగా ప్రత్యేక డీజీపీ రాజేష్ దాస్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసును సీబీసీఐడీకి డిజీపీ త్రిపాఠి అప్పగించారు. లైంగిక వేధింపుల వ్యవహారం విల్లుపురం జిల్లా పరిధిలో జరిగినట్లు తెలుస్తోంది. దీంతో కేసు విచారణను విల్లుపురం సీబీసీఐడీ అడిషన్ డీఎస్పీ గోమతి నేతృత్వంలోని బృందానికి అప్పగించారు. అక్కడ విచారణ అనంతరం చెన్నైలోని ప్రధాన కార్యాలయంలో ఉన్న సీబీసీఐడీ ఉన్నతాధికారులు సమగ్ర విచారణపై దృష్టి పెట్టబోతున్నారు. మూడు సెక్షన్ల కింద రాజేష్ దాసుపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో చెంగల్పట్టు ఎస్పీ కన్నన్ కూడా బుక్కయ్యారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనివ్వకుండా ఎస్పీ కన్నన్ అడ్డుకున్నట్టు తేలింది. దీంతో ఆయనపై కూడా కేసు నమోదు కావడం గమనార్హం. సుమోటో కేసు సీబీసీఐడీ విచారణకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో లైంగిక వేధింపులపై మద్రాసు హైకోర్టు సైతం దృష్టి పెట్టింది. ఉదయం విచారణ సమయంలో న్యాయమూర్తి ఆనంద వెంకటేషన్ ఈ వ్యవహరాన్ని ప్రస్తావించారు. పోలీసు మహిళా ఉన్నతాధికారులకే భద్రత కరువై ఉండడం ఆవేదన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులపై ఆరోపణలు వచ్చిన దృష్ట్యా, విచారణ న్యాయబద్ధంగా జరిగే రీతిలో కేసును సుమోటోగా స్వీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. చదవండి: సీబీసీఐడీకి కీచక వ్యవహారం -
కోవిషీల్డ్ సేఫ్ కాదు: కేంద్రానికి హైకోర్టు నోటీసులు
చెన్నై: సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తన సృజనాత్మకత దెబ్బతిన్నదని.. ఈ వ్యాక్సిన్ని సురక్షితం కాదని ప్రకటించండి అంటూ చెన్నైకి చెందిన ఓ వలంటీర్ గతేడాది డిసెంబర్లో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీరం.. సదరు వలంటీర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని ఖండించింది. అతడిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మద్రాస్ హై కోర్టు ఈ పిటిషన్ని విచారించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి నోటీసులు జారీ చేసింది. 2021, మార్చి 26 వరకు దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా హై కోర్టు ఆదేశించింది. కేసు వివరాలు.. చెన్నైకి చెందిన అసిఫ్ రియాజ్(41) అనే వలంటీర్ గతేడాది అక్టోబర్ 1న సీరం ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు. ఓ పది రోజలు తర్వాత అతడికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు వెల్లడించాడు. టీకా వల్ల మెదడు దెబ్బతిన్నదని వైద్య పరీక్షలో స్పష్టమైందన్నాడు. మాట, చూపు, జ్ఞాపక శక్తిలోనూ దుష్ప్రభావాలు తలెత్తాయన్నాడు. దీనితో భవిష్యత్తులోనూ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందన్నాడు. ఇందుకు పరిహారంగా తనకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. టీకా దుష్ప్రభావాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించాడు. పరిహారంతో పాటు తక్షణమే టీకా ప్రయోగాలను నిలిపేయాలని డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. ఇప్పడేమంటున్నాడు.. కోర్టు తీర్పు అనంతరం అసిఫ్ రియాజ్ మాట్లాడుతూ.. "నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నేను తీసుకున్న (కోవిషీల్డ్) వ్యాక్సిన్ వల్లనే నాకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు వైద్యులు వెల్లడించారు. దీని గురించి ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండదని నాకు తెలుసు. ఇక కోర్టును ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. ఈ కేసులోని వాస్తవాల ఆధారంగా కోర్టు దీన్ని విచారిస్తుందని నేను ఆశిస్తున్నాను. టీకా కారణంగా నేను బాధపడ్డానని నన్ను పరీక్షించిన వైద్య నిపుణలు వెల్లడించారు. నాకు న్యాయం జరగుతుందని నేను భావిస్తున్నాను’’ అన్నాడు. చదవండి: వ్యాక్సిన్పై వార్.. 100 కోట్లకు దావా! వ్యాక్సిన్: ‘అలాంటివారిపై ఓ కన్నేసి ఉంచండి’ -
ఆడ, మగ కలిసి ఉండడం నేరం కాదు
తిరువొత్తియూరు: తాళం వేసిన గదిలో స్త్రీ, పురుషుడు ఉండడం తప్పు కాదని, దాని ఆధారంగా ఒకరికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వీలు కాదని మద్రాసు హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. 1998లో దాఖలైన కేసు విచారణను హైకోర్టు ముగించింది. 1997లో సాయుధ దళం విభాగంలో శరవణబాబు కానిస్టేబుల్గా చేరాడు. 1998లో అతని ఇంటి లోపల అదే ప్రాంతంలో నివా సం ఉంటున్న మరో మహిళా కానిస్టేబుల్ ఉండడాన్ని స్థానికులు చూసి గదికి తాళం వేశారు. దీంతో కానిస్టేబుల్ శరవణబాబుకు, మహిళా పోలీసు కానిస్టేబుల్తో వివాహేతర సంబంధం ఉందా అని భావించి పోలీసు అధికారులు చర్యలు తీసుకోవడానికి నిర్ణయించారు. అతన్ని డిస్మిస్ చేస్తూ సాయుధ దళం విభాగం ఐజీ మణి ఆదేశాలు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ శరవణబాబు మద్రాసు హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. తనకు మహిళా కానిస్టేబుల్కు వివాహేతర సంబంధం లేదని పేర్కొన్నారు. ఆమె బయటకు వెళ్లినప్పుడు తాళం పెట్టి వెళుతూ ఉంటారని, దాన్ని తీసుకోవడానికి వెళ్లానని పేర్కొన్నారు. దీనిపై తుది విచారణ అనంతరం శుక్రవారం హైకోర్టు తీర్పు ప్రకటించింది. న్యాయమూర్తి సురేష్కుమార్ ఫిర్యాదుదారుడు శరవణబాబు, ఆ మహిళ ఒకే ఇంటిలో ఉంటున్నట్లు సాక్ష్యాధారాలు లేవని తెలిపారు. ఆరోపణలపై చర్యలు తీసుకోవడం సరైంది కాదని పేర్కొన్నారు. శరవణ బాబును డిస్మిస్ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. పురుషుడు, ఒక స్త్రీ ఒకే గదిలో ఉండడాన్ని వ్యభిచారంగా చూడడం సరికాదన్నారు. సమాజంలో పలువురికి కొన్ని అభిప్రాయాలు ఉండొచ్చని, దాని ఆధారంగా చర్యలు తీసుకోవడానికి వీలు లేదని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు..
చెన్నై: మద్రాస్ హైకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. ఆడ, మగ ఇద్దరు తాళం వేసిన ఇల్లు, గదిలో ఉన్నంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని స్పష్టం చేసింది. ఓ సాయుధ రిజర్వ్ పోలీసు కానిస్టేబుల్ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది. 1998లో చోటు చేసుకున్న ఈ ఘటనలో.. కే శరవణ బాబు అనే సాయుధ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్ తన క్వార్టర్లో మరో మహిళా కానిస్టేబుల్తో కలిసి ఉండటాన్ని అధికారులు తప్పు పట్టారు. వారి మధ్య అక్రమ సంబంధం ఉందని.. అందుకే తలుపులు వేసుకుని ఇద్దరు లోపల ఉన్నారని ఆరోపించారు. ఇక ఇలాంటి చర్యలకు పాల్పడినందకు గాను అతడిని విధుల నుంచి తొలగించారు. దాంతో శరవణ బాబు కోర్టును ఆశ్రయించాడు. ఇక కేసు విచారణ సందర్భంగా జస్టిస్ ఆర్ సురేష్ కుమార్ రద్దు పిటిషన్ని విరమించుకుంటూ.. ‘‘సమాజంలోని ఊహాతీత కథనాలను ఆధారంగా చేసుకుని క్రమశిక్షణా చర్యలు విధించడం.. విధుల నుంచి తొలగించడం సరైనది కాదు. ఇక ఈ కేసులో నిందితుడు శరవణ బాబు తన నివాసంలో ఓ మహిళా కానిస్టేబుల్తో ఉన్నాడు. అంత మాత్రాన వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు భావించలేమని’’ వెల్లడించింది. అంతేకాక నిందితుడి వాదనతో ఏకీభవించిన హై కోర్టు ఇద్దరు కానిస్టేబుల్స్ని అభ్యంతరకర స్థితిలో చూసినట్లు ఒక్క ప్రతక్ష్య సాక్షి గాని.. మరే ఇతర ఆధారాలు గాని లేవని స్పష్టం చేసింది. (చదవండి: మద్రాస్ హైకోర్టు కమిటీ చారిత్రక నిర్ణయం) ఈ సందర్భంగా శరవణ బాబు మాట్లాడుతూ.. ‘‘సదరు మహిళా కానిస్టేబుల్ నివాసం.. నా క్వార్టర్స్ దగ్గర దగ్గరగా ఉంటాయి. ఇక ఆమె ఇంటి తాళం కోసం నా నివాసానికి వచ్చింది. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా.. ఎవరో తలుపు లాక్ చేశారు. ఆ తర్వాత మేం డోర్లు వేసుకుని ఇంట్లో ఏదో అనైతిక చర్యలకు పాల్పడుతున్నట్లు భావించిన ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపు తట్టారు’’ అని తెలిపాడు.