
తమిళనాడులో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల విషయం మరోసారి కోర్టుకు చేరింది. కర్నాకటకు చెందిన ఓ వ్యక్తి తాను జయలలితకు సోదరుడిని అని చెబుతూ కోర్టును ఆశ్రయించాడు. ఆమె ఆస్తిలో సగం వాటా తనకు ఇవ్వాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
వివరాల ప్రకారం.. మైసూరులోని వ్యాసపురానికి చెందిన వాసుదేవన్ (83) తాను దివంగత తమిళనాడు సీఎం జయలతితకు సోదరుడినని చెప్పాడు. ఈ సందర్బంగా వాసుదేవన్ మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత తండ్రి జయరామ్ మొదటి భార్య జయమ్మ కుమారుడిని తానేని పేర్కొన్నాడు. తర్వాత, జయరామ్.. వేదమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారని అన్నారు. వారికి పుట్టిన వారే జయలలిత, జయకుమార్ అని తెలిపాడు.
తన తల్లి జయమ్మ.. 1950లో మైసూరు కోర్టులో భరణం కోసం కేసు వేశారని గుర్తు చేశాడు. ఆ కేసులో మా నాన్న రెండో భార్య వేదమ్మ, జయకుమార్, జయలలితను ప్రతివాదులుగా చేర్చామని స్పష్టం చేశాడు.
కానీ, జయలలిత కంటే ముందే జయకుమార్ మరణించారని వెల్లడించారు. ఈ క్రమంలో జయలలితకు సోదరుడిగా, వారసుడిగా ఉన్న తనకు కూడా ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేశాడు. మరోవైపు.. 2020లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పులో జయలలిత వారసులుగా దీపక్, దీప మాత్రమే అంటూ తీర్పునిచ్చింది. తాజాగా దీపక్, దీప పేరుతో పాటుగా తన పేరును కూడా చేర్చి తీర్పును సవరించాలని వాసుదేవన్ మరోసారి కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో ప్రస్తుతం తమిళనాడులో చర్చనీయాంశంగా మారింది.