
రూ.2 కోట్ల లోపు పర్సనల్, హోమ్ లోన్లు వంటివి తీసుకుని, ఈఎంఐలు సమయానికి చెల్లించిన రుణగ్రహీతల వడ్డీపై వడ్డీ మాఫీ చేసే దిశగా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం.
న్యూఢిల్లీ : మారటోరియంలో వెసులుబాటు కల్పించిన కాలంలోనూ నెలవారీ వాయిదాలు (ఈఎంఐ)లు కట్టిన వారికి కేంద్రం శుభవార్త చెప్పనుంది. వారు తీసుకున్న రుణాలకు సంబంధించి వడ్డీపై వడ్డీని మాఫీ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీపావళి వరకల్లా దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కరోనా లౌక్డౌన్ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్లన్నటిపైనా మారటోరియం విధించిన సంగతి తెలిసిందే. (రుణాలపై చక్రవడ్డీ మాఫీకి ఓకే)
మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు ఇది అమల్లో ఉండగా చాలామంది తమ ఈఎంఐలను సమయానికి చెల్లించలేదు. మరికొందరు ఎప్పటిలాగానే చెల్లింపులు చేశారు. ఈ క్రమంలో రూ.2 కోట్ల లోపు పర్సనల్, హోమ్ లోన్లు వంటివి తీసుకుని, ఈఎంఐలు సమయానికి చెల్లించిన రుణగ్రహీతల వడ్డీపై వడ్డీ మాఫీ చేసే దిశగా కేంద్రం సమాలోచనలు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మహర్షి ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ సూచనల మేరకు కేంద్రం దీనిని ఆరు నెలల కాలానికి అమలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.