
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ మిశ్రా ఇచ్చిన తీర్పు ఇప్పుడు దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మహిళలను అభ్యంతకరంగా తాకడం లైంగిక దాడి కిందని రాదంటూ ఓ మైనర్ బాలిక కేసులో ఆయన తీర్పు ఇవ్వడం తెలిసిందే. అయితే తీర్పు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని అంటున్నారు కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి అన్నపూర్ణ దేవి.
అలహాబాద్ హైకోర్టు తీర్పు సమ్మతం కాదన్న మంత్రి అన్నపూర్ణ.. దానిని పరిశీలించాలని సుప్రీం కోర్టును కోరారు. అలాంటి తీర్పులతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే..?
2021 నవంబరులో.. ఉత్తరప్రదేశ్లోని కసగంజ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, తన మైనర్ కుమార్తెతో కలిసి బంధువుల ఇంటి నుంచి తిరిగివస్తోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు లిఫ్ట్ పేరిట ఆ బాలికను తమతో బైక్లపై తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఆ యువకులు అమ్మాయిపై అత్యాచారానికి యత్నించారు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు గురిచేశారు. బాలిక అరుపులు విని అటుగా వెళ్తున్నవారు రావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేశారు.
అనంతరం ఈ కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరింది. ఇటీవల దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళ ఛాతీని తాకినంత మాత్రాన.. పైజామా తాడు తెంపినంత మాత్రాన అత్యాచార యత్నం కిందకు రాదంటూ పేర్కొన్నారు. తద్వారా నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని చెబుతూనే.. అదే చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారాయన.
Comments
Please login to add a commentAdd a comment