● డీఎం, డీఎస్వో, డీటీల సస్పెన్షన్ ● రైస్మిల్లు తనిఖీల్లో జాప్యంతోనే.. ● సస్పెన్షన్ పైనా అనుమానాలు
నిర్మల్: జిల్లా పౌరసరఫరాలశాఖలో ముగ్గురు అధి కారులపై వేటుపడ్డట్లు తెలిసింది. డీఎం, డీఎస్వో, డీటీలకు శాఖ కమిషనర్ దేవేంద్రచౌహాన్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. జిల్లాలో ఇటీవల సీఎంఆర్లో చోటుచేసుకుంటున్న మాయాజాలం, కొంతమంది మిల్లరు ధాన్యం అమ్ముకుని రూ.కోట్లు కొల్లగొట్టిన తీరు బయటపడుతున్న సందర్భంలో ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలి యడం చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ లేనంతగా అధికారులు జిల్లాలో రైసుమిల్లులపై కేసులు పెడుతున్న క్రమంలో వారు సస్పెండ్ కావడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆ కేసులోనేనా..!
జిల్లాలోని చాలా రైసుమిల్లుల్లో రూ.కోట్ల విలువ చే సే ధాన్యం మాయమైంది. ఈక్రమంలోనే నర్సాపూ ర్ మండలం అర్లి ఎక్స్రోడ్డు సమీపంలోగల ద్వారకామయి ఆగ్రో ఇండస్ట్రిస్ రైస్మిల్లుపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో 2022–23 రబీ, 2023–24 ఖరీఫ్, 2023–24రబీ సీజన్లకు సంబంధించి ఏకంగా రూ.48కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం మాయం కావడం గమనార్హం. 2022–23 రబీ, 2023–24 ఖరీఫ్, 2023–24రబీ సీజన్లకు సంబంధించి సదరు మిల్లుకు 16,427మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. ఆ మిల్లు నుంచి 11,006.090 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) రావాల్సి ఉండగా, ఈఏడాది ఫిబ్రవరి వరకు 1031.218 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది. మిగతా 9,974.972 మెట్రిక్ టన్నులు ఇవ్వలేదు. అధికారులు తనిఖీ చేసినప్పుడు సంబంధిత ధాన్యం మిల్లులో లేదు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసు కారణంగానే తాజాగా డీఎం గోపాల్, డీఎస్వో కిరణ్కుమార్, డీటీ రమాదేవికి సస్పెన్షన్ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిసింది.
కేసులు పెడుతున్నా..
గతంతో పోలిస్తే.. ఇటీవల సివిల్ సప్లయ్ అధికారులు సీరియస్గానే స్పందిస్తున్నారు. ఐదునెలల పరిధిలోనే జిల్లాలో 21కేసులు పెట్టడం గమనార్హం. ఇందులో 12 క్రిమినల్ కేసులున్నాయి. ఏడు మిల్లులపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ పెట్టారు. మిగతా మిల్లులపైనా అమలు చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఇంతలోనే సదరు జిల్లా అధికారులపై వేటువేయడం అనుమానాలకు తావిస్తోంది. ద్వారకామయి మిల్లు తనిఖీల విషయంలో ఆలస్యం చేశారన్న కారణం చూపుతూ ముగ్గురు అధికారులపై వేటు వేసినట్లు సమాచారం. మరోవైపు వీరిపై కొంతమంది మిల్లర్ల ఒత్తిడి, రాజకీయ కోణంలో సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారా..!? అన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.